Saturday, April 27, 2024

దేశాన్ని నగ్నంగా నడిపించినవారు మన పాలకులా?

గతంలో లాగ మతం వేరు దేశభక్తి వేరు కాదు. ప్రస్తుతం మన దేశంలో ఆ రెండూ కలిసిపోయి ప్రజల భావోద్రేకాలతో ఆడుకుంటున్నాయి. ప్రపంచంలో భారత దేశానికి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం – అనే గుర్తింపు ఉంది. ప్రపంచంలోని ఓటర్లలో నాలుగోవంతు ఈ దేశంలోనే ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఆరోవంతు ఈ దేశంలోనే ఉన్నారు. అందువల్ల ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ మార్పుల ప్రభావం దక్షిణ ఆసియాలోనూ, ఇతర ప్రజాస్వామిక ప్రపంచ దేశాలమీదా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ‘దేశభక్తి’కి సంబంధించిన సమస్యలు ప్రపంచంలో ఒక్క భారత దేశమే ఎదుర్కోవడం లేదు. ఇతర దేశాలలో కూడా మతపరమైన దేశభక్తి కొంత బలపడుతూ ఉంది. ఉదాహరణకు టర్కీ, లాటిన్ అమెరికా, పశ్చిమ ఐరోపా, సోవియెట్ లోని కొన్ని భాగాలు చెప్పుకోవచ్చు.

Also read: వాస్తవిక సృజనకారుడు మున్షీ ప్రేమ్ చంద్

2018నాటి కోస్టారికాన్ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినపడింది. ‘‘మనల్ని దైవం పంపించిన ఒక మనిషి (MAN OF GOD) పరిపాలించకపోతే ఇక వేరెవరూ పాలించలేరు’’-అన్నది ఒక మంత్రంగా పని చేసింది. ఆ మధ్య విజవంతంగా గెలిచిన రైట్ వింగ్ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి జైర్ బొల్సనారో ప్రజల్లోకి ఒక సందేశాన్నిపంపించగలిగాడు.‘‘పైన దేవుడున్నాడు గనకనే బ్రెజిల్ ముంగిట అన్నీ సమకూరాయి.’’ ఇలా క్రిస్టియన్ మతతత్త్వ దేశభక్తులు, ఇస్లాం మతతత్త్వ దేశభక్తులు ఎక్కువైపోతున్నారు. ఈ దైవభక్త దేశభక్తులు ఎక్కడైనా చేసేది ఒక్కటే – ముందు లేని దేవుణ్ణి చూపిస్తారు. తర్వాత సంస్కృతీసంప్రదాయాలంటారు. గతమెంతొ ఘనకీర్తి-గలవాళ్ళమన్నది గర్తు చేస్తుంటారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి, మనుషుల్ని భావదాస్యంలోకి లాగేస్తారు. ఆ తర్వాత వారి పబ్బం వారు గడుపుకుంటారు. లాభమంతా అధికారం చేజిక్కించుకున్నవాడికే తప్ప, అధికారం అందించేవాడికి ఆకలి, దారిద్ర్యం మినహా మిగిలేది ఏమీ ఉండదు.

మండుతున్న మణిపూర్

భారత దేశంలోనూ జరుగుతున్నది ఇదే. గతంలో జరుగుతూ వచ్చింది కూడా ఇదే. బలవంతులు రాజులైతే వారికి సలహాదారుల స్థానంలో బ్రాహ్మణులుండేవారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత, రాజ్యాంగం రాసుకున్న తర్వాత, మెరుగైన సమాజానికి రూపకల్పన జరిగింది. సమాజంలోని మనుషులందరికీ సమానమైన హక్కులు-బాధ్యతలూ వచ్చాయి. స్త్రీ-పురుషులకు సమాన స్థాయి లభించింది. మత ప్రసక్తి లేని విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం’-అని చెప్పుకున్న కాంగ్రెస్, స్వాతంత్ర్యానంతరం చాలా కాలం దేశాన్ని పాలించింది. అయితే, అప్పుడప్పుడు కొన్ని తప్పిదాలు కూడా చేసింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో గోల్డెన్ టెంపుల్ (స్వర్ణదేవాలయం) ఆపరేషన్లు జరిగాయి. ప్రతిఫలంగా ఆమె తన ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఆమె హత్య తర్వాత సిక్కుల ఊచకోత జరిగింది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ వస్తే, దేశంలో ఎన్నో దుర్ఘటనలు జరకకుండా ఉండేవి. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటూ రావాలే గాని, తప్పుల మీద తప్పులు, ఇంకా పెద్ద తప్పులు చేసుకుంటూ పోతే, దేశంలో ప్రజాస్వామ్యానికి కాలం చెల్లిపోతుంది.

రాజ్యసభలో మణిపూర్ గురించి చర్చిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే

బీజేపీ పూర్త మెజారిటీతో అధికారం చేపట్టినప్పటి నుండి దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య సంస్కృతిని ధ్వంసం చేస్తూ, హిందూత్వ సంస్కృతిని ప్రాచుర్యంలోకి తేవడంతో – దేశంలో మైనార్టీలు భద్రత లేకుండా పోయింది. అంతేకాదు, అధికారంలో ఉన్నవారే అల్లర్లకు ఆజ్యం పోస్తున్నప్పుడు, మెజార్టీగా ఉన్న హిందువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అల్లర్లు మొదలయ్యాయంటే, అవి ఎటు నుండి ఏ మలుపు తీసుకుంటాయో తెలియదు. అల్లర్లలో చిక్కుకున్న వారు ఏ మతస్థులైనా కావొచ్చు కదా?

కొన్ని నెలలుగా మణిపూర్ మండిపోతుంటే ఈ దేశ ప్రధాని ఒక చిన్న మాట మాట్లాడలేదు. ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్టు కరన్ థాపర్ ఏమన్నారో చూడండి-‘‘టర్కీ భూకంపానికి మన ప్రధాని స్పందించి ట్వీట్ చేస్తారు. గుజరాత్ తుఫాన్ గురించి ‘మన్ కీ బాత్’లో ప్రస్తావిస్తారు. కానీ, మణిపూర్ లో కొన్ని నెలలుగా జరుగుతున్న మారణకాండ గురించి ఎక్కడా ఏమీ స్పందించరు. అంటే ఈ దేశం ఏమిఅర్థం చేసుకోవాలి? 1.ఆయనకు ఈ విషయం తెలియకపోవచ్చు. 2. విషయమంతా తెలిసినా, దాన్ని గుర్తించడానికి, వాటిపై స్పందించడానికి బహుశా ఆయనకు ఆసక్తి లేకపోవచ్చు-’’అని! మణిపూర్ లో జరగుతున్న క్రైస్తవ వ్యతిరేక హింసకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ మిజోరామ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్. వన్ రామ్ ఛూఆంగా తన పదవితో పాటు బీజేపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంపాల్ ను సందర్శించారు కానీ, రాష్ట్రంలో చర్చ్ భవనాలను తగులబెట్టడాన్ని ఆయన తప్పుపట్టలేదు. చర్చ్ లనుతగలబెడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖండించకపోవడం – భరించలేని బీజీపీ పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. పార్టీ ముఖ్యం కాదు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం ముఖ్యం!-అని అనుకొని ఉంటారు, వన్ రామ్ ఛూఆంగా.

Also read: దేవనూరు మహదేవ: దేశంలో ఒక  సంచలనం!

ఉత్తర భారత దేశం వదరల్లో కొట్టుకుపోతూ ఉంటే, డిల్లీ ఎర్రకోట చుట్టూ నీళ్ళు నిలిస్తే, గాంధీ సమాధి సైతం నీట మునిగితే-దగ్గరుండి కాపలాదారు చూస్కోవాలి కదా? దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి తర్వాత ఇవ్వొచ్చు అనేది చూస్కోవాలి కదా? ఏదో అర్జంటు పని ఉన్నట్టు భారత ప్రధాని ఫ్రాన్స్ కు వెళ్ళిపోతాడా? సరే. అది అట్లా ఉండనిద్దాం! ఈ హిందూత్వవాదులు ఏం కోరుకుంటున్నారూ? అంటే-బారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలవారు సమానమే కానీ, అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులకు సమాజంలో అగ్రస్థానం దక్కాలి. వారే మొదటి స్థాయి పౌరులు. ఇక మిగతావారంతా నోరెత్తకుండా రెండోస్థాయి పౌరులుగా పడి ఉండాలి. అంతే!ఆ కుట్రలో భాగంగానే, మిగతావారిని హిందువుల నుండి విడగొట్టి-చూపడానికే వారసత్వ చట్టాలు తెచ్చారు. దేశవ్యాప్తంగా వందల సహీన్ బాగ్ లు వెలిసి కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా నిరసించాయి. రైతు వ్యతిరేక చట్టాల్ని రైతులు తిప్పికొట్టిన విషయం కూడా మనం మరవకూడదు. ఎన్ని పరాభవాలు, పరాజయాలు ఎదురైనా మూర్ఖులు తమ పట్టుదలను వదలరు. అందుకు తాజా ఉదాహరణ యూనిఫాం సివిల్ కోడ్. మతము-సంస్కృతి-దేశభక్తి అన్నింటినీ కలిపి దేశాన్ని ‘హిందూరాష్ట్ర’గా మార్చేయాలని ప్రభుత్వానికి వెనక ఉన్న ఆర్.ఎస్.ఎస్. పథకాలు రచిస్తోంది.

అరమై ఏళ్ళుగా గత ప్రభుత్వం ఏం చేసిందీ? అని మోది తరచూ తన ప్రసంగాలల్లో ప్రశ్నిస్తుంటారు. గత ప్రభుత్వాలు అరవైయేళ్ళుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ వస్తున్నాయని చెప్పడానికి మోదీజీయే ఒక పెద్ద ఉదాహరణ! ఒక రుజువు!! చదువుకోకపోయినా, రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకుని బతికినా, భిన్నమైన ఆలోచనాధోరణి గలవాడైనా…ఈ దేశ ప్రజలు అతణ్ణి ప్రధానిని చేశారు కదా? ప్రజాస్వామ్యమంటే అదే-గత పాలకులు నిరంకుశులైతే  మోదీ ప్రధాని అయ్యేవాడేకాదు. ముందు ఆ విషయం గ్రహించుకుంటే బాగుండేది. అయినా, ఆ స్థానానికి ఉన్న విలువలను కాపాడలేక, ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు కావడం ఆయన తప్పిదం, ఆయన పార్టీ తప్పిదం! వెనక ఉండి నడిపిస్తున్న ఆరెస్సెస్ తప్పిదం!! అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా తామేం చేస్తున్నామని ఆత్మావలోకనం చేసుకోవడం మంచిది. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలేదూ? అన్నతి ప్రజలు బేరీజు వేసుకుంటారు. అది వారి పని-నాయకులు వారి బాధ్యతల్ని వారు నిర్వహించుకుంటూ ఉంటే, ఇతరులను ప్రశ్నించొచ్చు. ఢిల్లీ, పార్లమెంట్ సమావేశాలు (జులై2023)ఎగ్గొట్టి కేంద్ర సహాయ మంత్రి వచ్చి హైదరాబాదులో రోడ్ల మీద బైఠాయిస్తాడు. తను వెంటనే బాటసింగారం డబుల్ బెడ్ రూంలు చూడాలంటాడు. పార్లమెంటు సమావేశాలు ఎగ్గొట్టి రావడం గొప్ప బాధ్యతగల పనా? ఎప్పుడు ఎక్కడ ఏపని చేయాలో కనీస పరిజ్ఞానం కేంద్ర మంత్రులకే లేకపోతే ఎలా?

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి సమాధానం ఇస్తున్న ప్రధాని మోదీ

ఇది రాస్తున్న సమయానికి 2023 జులై 20న అన్ని టెలివిజన్ ఛానళ్ళలో ఇద్దరు మణిపూర్ కుకీ జాతి స్త్రీలను నగ్నంగా వీధుల్లో నడిపించిన వీడియో కనిపించింది. కలవరపడ్డ దేశప్రజలు తలదించుకున్నారు. మతోన్మాదం నీడన జరిగిన రాజకీయాన్ని ఈసడించుకున్నారు. జాతీయ పతాకం అవనతమైనట్లయింది. దేశం ప్రాభవం కోల్పోయింది. అంతకు ముందు రెండున్నర నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండకు ఈ పరేడ్ ఒక కొనసాగింపు. నగ్నంగా నడిపించిన ఆ ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ భర్త సైనికుడు. దేశాన్ని రక్షించిన తను, తన భార్యను, తన గ్రామస్థుల్ని రక్షించుకోలేకపోయానని వాపొయ్యాడు. భోరున విలపించాడు. ఆ ఏడుపు అతనొక్కడిదే కాదు, ఈ దేశంలో మనసున్న మనుషులందరిదీ- ఆ విషయాన్నిసుప్రీంకోర్టు వెంటనే సూమోటూగా స్వీకరించింది. మతాల వారిగా కులాల వారిగా ప్రజల్ని విభజించి, స్త్రీ శరీరాలను పావులుగా వాడుకునే దుష్ట రాజకీయాల్ని కేంద్ర ప్రభుత్వం అదుపులో పెట్టుకోలేపోయింది. దేశప్రజల ముందు నిస్సిగ్గుగా బయటపడింది. ‘ఇండియా’గా ఐక్యమైన విపక్షాలన్నీ మణిపూర్ వైఫల్యానికి దేశ ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటు సమావేశాల తొలి రోజునే మణిపూర్ మారణహోమం గురించి చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. (చివరికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాతే మోదీ పార్లమెంటులో నోరు విప్పి మణిపూర్ గురించి 10 ఆగస్టు 2023న మాట్లాడారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పట్ల ద్వేషం వెల్లగక్కడమే కానీ మణిపూర్ లో తన పార్టీ ప్రభుత్వం తప్పు చేసిందని ఒక్క మాట కూడా చెప్పలేదు.)

Also read: మ్యాన్ వర్సెస్ వైల్డ్

కుకీ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష సంఘటన 4 మే 2023న జరిగితే, జులై 20న – 78 రోజుల తర్వాత ఒకరిని అరెస్టు చేశారు. దేశ పరిపాలనా వ్యవస్థ పనితీరును ఇది ప్రతిఫలిస్తుంది. నిజానికి సీన్ లో కనిపించేవారు దోషులేఅయినా, వారిని ఉసికొల్పిన పెద్దదోషులు వేరే ఉన్నారు. నోర్లు విప్పకుండా, నిర్లిప్తంగా. ఘోరాలు జరగడానికి సహకరించిన రాష్ట్ర-కేంద్ర నాయకులే అసలు దోషులు! స్వతంత్ర భారత దేశంలో తొలిసారి జరిగిన ఈ ఘటన కేంద్ర-రాష్ట్ర  నాయకత్వాన్ని – అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ని ప్రశ్నించింది. వారి మెదళ్ళలోని అనాగరికతకు అద్దం పట్టింది. మణిపూర్ జనాభాలో 54శాతం మందికి పైగా ఉన్న మెయితీ కులస్థులకు కుకీ, నాగ గిరిజన తెగలకూ మధ్య బీజేపీ తన రాజకీయ లబ్ధికోసం చిచ్చుపెట్టింది. గిరిజన చట్టాలను అతిక్రమించి మెయితీలను గిరిజనులుగా మార్చడానికి బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. కుకీ, నాగ తెగలు ప్రతిఘటించారు.  ఈ గిరిజన తెగలవారు క్రిస్టియన్లు. అందువల్ల మతోన్మాదులు ప్రభుత్వాల అండతో వారి ఇండ్లు, చర్చ్ లు ధ్వంసం చేశారు. వందల మందిని చంపేశారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. రెండున్నర నెలలుగా అక్కడ మారణహోమం జరుగుతున్నా-ప్రధాని మౌనం వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి కర్తవ్యమూఢులైనారు. అదుపు చేయడానికి ప్రయత్నించలేదు. అంతా అయిపొయ్యాక దేశ ప్రధాని విభ్రాంతిని వ్యక్తం చేశారు. తన, తన ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చి, ఒక రాజకీయ ప్రకటన చేశారు.దాన్ని మించిన అవివేకపు ప్రకటన మరొకటి ఉండదని దేశ ప్రజలు ఉడికిపోయారు. నిజాయితీ గల మనుషులైతే  నాయకులంటా రాజీనామాలిచ్చి, రాష్ట్రపతి పాలన తేవాలి. దానితో పరిస్థితి అదుపులోకి రావొచ్చు. మోదీజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ గాయమైంది. ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ మండిపోయింది. ఎన్ని తప్పులు క్షమించినా, దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ రెండు తప్పుల్ని ఎప్పటికీ క్షమించరు.

మణిపూర్ లో మహిళల శరీరాలు రాజకీయ రణాలకు యుద్ధభూములయ్యాయి. అయినా, అధికార పార్టీలో ఉన్న మహిళలు ఎవరూ గొంతెత్తలేదు. అన్యాయాన్ని కనీసం నిరసించలేదు. మానవీయ విలువల్ని తొక్కిపెట్టే రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా?

చివరగా- మనుషులుగా ఎదగని వారిని నాయకులుగా ఎన్నుకున్న ఈ దేశప్రజల మూర్ఖత్వంపై కూడా మనం జాలి పడక తప్పదు. వీళ్ళెప్పుడు ఎదుగుతారూ? తమలో నుంచి మానవత్వం,నిజాయితీ గల నాయకుల్ని ఎప్పుడు తయారు చేసుకుంటారూ? ఈ చీకటి పాలనను ఎప్పుడు అంతం చేసుకుంటారూ?

Also read: రామాయణంలో బుద్ధుణ్ణి ఎందుకు తిట్టారు?

(రచయిత సుప్రసిద్ద సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)  

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles