Wednesday, May 8, 2024

మందులేని జబ్బు

వ్యంగ్య రచన

వాళ్ళ దగ్గర ప్రతి జబ్బుకీ ఒక మందుంది. తల పొటొస్తే ఒకరు తొడపాశం పెట్టి తగ్గించేవారు. తొడ మండుతోందంటే ఇంకొకడు చెవి మెలేసి తగ్గించేవాడు. చెవి పోటంటే చెవెక్కడ కత్తిరస్తారోనని భయపడి, బాధతోటో వాళ్ల దరిద్రం ఒదిలిందన్న సంతోషంతోనో గెంతులేస్తూ వెళ్ళిపోయి, తలపోటూ, తొడపాశం సంగత మర్చిపోయి, ఇంటికెళ్ళి సుబ్రహ్మణ్యస్వామికి దండం పెట్టుకొని పుట్టలో పాలుపోసి చెవిపోటు తగ్గించమని దండం పెట్టుకొనేవాళ్ళు.

Also read: కమ్యూనిస్టు గాడిద

ఒక జబ్బులకే కాదు వాళ్ళ దగ్గర అన్ని సమస్యలకీ ఏదో ఒక పరిష్కారం ఉండేది. ప్రజల మీద దేవుడు కనికరించడం లేదంటే మసీదులని కూల్చి మందిరం కడితే, ఆ దేవుడే దిగివచ్చి మిమ్మల్ని నన్నూ ఆ మాటకొస్తే మొత్తం దేశాన్ని కాపాడతాడు. కరువులూ, కాటకాలూ, మహమ్మారులూ లేకుండా చేస్తాడు. అందుకు మాదీ పూచీ అని ఒకరంటారు.

మసీదులు కూల్చి మందిరాలను కట్టాల్సిన పని లేదు. ఎంత మైనింగ్ క్రింద పోయినా, యింకా మనకి బోలెడు కొండలున్నాయి. కొండలు పగలేస్తాం, గుండెలు కరిగిస్తాం అనే కమ్యూనిస్టుల మాట మీరు వినకండి. వాళ్ళుత్త అసూయపరులు. కమ్యూనిస్టుల్నించి కొండల్ని కాపాడ్డానికి కొండల మీద గుళ్ళో గోపురాలో కట్టిస్తాం. ఆ తరవాత కష్టసుఖాలెరిగిన ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడు.

Also read: నాలుగో సింహం

‘‘మీరుకట్టే పన్నులు ఊరికేపోవు. మేం కట్టించే గుళ్ళతో పుణ్యంపురుషార్థం మీకు దక్కుతాయి. భగవంతుడు గుళ్ళూ, గోపురాల్లోనే కాదు, అలనాడు రుషులు పస్తులుండి తపస్సు చేసినందువల్ల వాళ్ళ హృదయాల్లో కొలువై ఉన్నాడు. అలాగే దరిద్రనారాయణులైన మీరు పస్తులుండి చెల్లించే పన్నులకి ప్రసన్నమై మిమ్మల్ని కనికరించి, మీ ఇళ్ళలో కొలువై  నెలవై టాడు’’ అని మరో రాజకీయ పక్షం సెలవిచ్చింది.

Also read: నీలాకాశాన్ని కొలిచే కొలబద్ద

పరలోక కష్టాలకంటే ఇహలోక బాధలే బెటరనుకొని తమ బాధల్ని మర్చిపోయి, దేవుణ్ణి తల్చుకొని ఆకుల్ని దిగమింగడం అలవాటు చేసుకొన్నారు జనం. ‘‘పెట్రలు ధర పెరిగింది. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువల ధరలు ఆకాశంలో చుక్కల్లో కల్సిపోయాయి. మా జీతాలు పెంచండి. మా పంటల్ని మా కల్లాల్లోనే కొనండి’’ అని జనం గోలపెడితే ‘‘కొనడానికేమైనా ఓట్లా? ఓట్లకి నోట్లు చెలామణీలోకి వచ్చాయి. అందుచేత మీ శ్రమకి విలువలేదు. మీ పంటలలో ఓట్లు రాలవు కాబట్టి అవి మేం కొనలేం. ఓట్లు పండించండి. నోట్లు ముద్రించండి. మీరు లాభపడతారు’’ అని ఒక పక్షం రాజకీయ నాయకులు తేల్చేశారు.

Also read: కుక్కచావు

‘‘నీటి మూటలు చూపించి, నోట్ల మూటలని నమ్మించి మమ్మల్ని దగా చేశారు. ఇప్పుడు మా చెమట చెక్కల్లో, కన్నీటి బొట్టులో జలకాలాడుతున్నారు. ఇది అన్యాయం. అక్రమమం’’ అంటే, ‘‘మీ చివరి రక్తపు బొట్టు పీల్చేవరకూ ఆ జలగ వదలదు’’ అని మరోపక్షం ఓదార్చి, ‘‘మీ పక్షం మేముంటాం. మీ దుఃఖంలో పాలుపంచుకుంటాం. మీ తరఫున మీకు తోడుగా నీడగా అలకల ఘాట్లో అలిగి కూర్చుని నిరసన తెలుపుతాం’’ అని ప్రకటించారు.

Also read: గీతోపదేశం

‘‘మన కష్టాలకీ, కడగళ్ళకీ కారణం మేం కాదు. అవతల పక్షం. పెట్రోల్ రేట్ పెంచింది వీళ్ళు. కళ్ళల్లో గ్జిజరీన్ పెట్టుకొని, మొసలి కన్నీళ్ళు కార్చడానికి కొండంత రేట్లు పెంచి పిసరంత తగ్గించి, మననెంతో ఉద్ధరించినట్టు మొహం పెడుతున్నారు. మీ శ్రమకి విలువ లేకుండా చేసింది వాళ్ళే. మీ పంటల్ని కొనాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ఎలా కొనరో చూస్తాం. మొగుణ్ణి కొట్టి మొర్రోమనడం వాళ్ళకే కాదు మాకూ తెల్సు. అలకలఘాట్ వాళ్ళొక్కరిదే కాదు మనందరిది. మేమూ అలిగి మీకు తోడుగా తిండి మానేసి అలిగి కూర్చుంటాం’’ అని అలిగారు వీళ్ళు.

Also read: మృగరాజు

ఏడుస్తున్న పిల్లల్ని ఏడుపు మానిపించాలంటే మనమూ ఏడుస్తే పోతుందని తేల్చిన ప్రభుత్వం.

తెల్లబోయిన రైతుల ఆత్మహత్యలే నిరసన అనుకొన్నారో ఏమీ …ఆత్మహత్యలు ఆగలేదు.

అన్ని జబ్బులకీ మందులున్నాయి. అన్ని సమస్యలకీ పరిష్కరాలు ఉన్నాయి. మరి యీ జబ్బుకి పరిష్కారం ఏమిటో!

Also read: హెడ్డు ఎప్పుడు మారతాడు?

Krishna Rao Nandigam
Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 33345

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles