• తొలివిడతలో నేటినుంచే నామినేషన్ల స్వీకరణ
• ఎలాంటి ఏర్పాట్లు చేయని జిల్లా అధికారులు
• సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్ పై నేడు విచారణ
• న్యాయస్థానం ఏం చెబుతుందోనని ఉత్కంఠ
ముహూర్తం ముంచుకొచ్చింది. పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో అని ఆసక్తి. ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషనర్ ఆదేశాలను అమలుపరుస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. కలెక్టరేట్ ల నుంచి పంచాయతీ కార్యాలయాలలోనూ స్తబ్ధత నెలకొంది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అభాసుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అయితే ఎక్కడా కోడ్ అమలు జరగడంలేదు.
ఇదీ చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
జిల్లా అధికారులకు ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీచేయలేదు. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలను రిటర్నింగ్ అధికారులు ఈ రోజు పంచాయతీ కార్యాలయాలలోని నోటీసు బోర్డులో పెట్టి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదు. జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయలేదు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు
తొలివిడత నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఎన్నికల నిర్వహణా ఏర్పాట్లు జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పును బట్టి ముందుకు వెళతామని ప్రభుత్వం అంటోంది. తొలిదశలో ప్రకాశం, విజయనగరం జిల్లాలు మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సిఉంది. ఎన్నికల విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా నిరాకరించడంతో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ