Friday, April 26, 2024

శ్రీవిష్ణుచిత్తువిరిబూవు, శ్రీవిల్లిపుత్తూరు శ్రీనోముపంట

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 30

వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్

తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక

ఓడలెన్నొ తిరుగు పాలకడలి చిలికిన మాధవుని కేశవుని

జేరి నోచి చంద్రవదనులు రేపల్లెలో ధన్యులైన రీతి

శ్రీవిష్ణుచిత్తువిరిబూవు, శ్రీవిల్లిపుత్తూరు శ్రీనోముపంట

చిన్నారి పసిడి హస్తాల తామరలమాలలల్లి రంగనికిచ్చి

గోదపాడిన సిరినోము ముప్పది తమిళ పాటల మాల

నోచి పాడిన చాలు తప్పును సంసార పాప కుహరాలు

నాల్గుకొండల కైదండలవాడి అండదండలందరికినందు

సుందరసిరిధర కరుణా కటాక్షానందమగ్నులగుదురెల్ల

నేపథ్యం
‘‘మీరు కోరిన అంతరంగ కైంకర్యాన్ని నేను స్వీకరిస్తాను. మీరు పొందిన ఈ మహాభాగ్యం ఇతరులు పొందాలని మీకు ఉందా దానికి మార్గం ఏమిటి’’. అని శ్రీ కృష్ణుడు అంటే

‘‘మేం పాడి మిమ్ము సాధించిన ఈ గోదాగీతాన్ని పాడుతూ సిరినోము చేసిన వారికి శ్రీమన్నారాయణానుగ్రహం కలిగి రేపల్లెలో గోపికల వలె, శ్రీవిల్లిపుత్తూరులో మా వలె ఆనంద సాగరంలో ఓలలాడుతారు’’ అని గోపికలు అంటారు.

దూడను కోల్పోయిన ఆవు గడ్డితో చేసిన దూడ బొమ్మను చూసినా కూడా ఆ వాత్సల్యంతో సేపులు వస్తాయి. ఆ గోమాత ఆవిధంగా ఉప్పొంగి పాలధారలను స్రవించినట్టు పరమాత్ముడు అనుగ్రహామృతాన్ని కురిపిస్తాడు.

Also read:నారాయణనే నమక్కే అంటూ…. నారాయణుడే ఫలం ఇవ్వడమే

ఆ అనుగ్రహమే ఈ గోదా పాశురాలు,ఆ అనుగ్రహం కోసమే గోదా గీత గోవిందం. దానికి అర్థాలు వివరించడానికి నెలరోజులు ప్రతి ప్రబోధకుడు చెప్పే ప్రవచనాలు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యకర్తలు, విన్నవారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసిన వారు ఉండడం కూడా  ఈ లోకపు తండ్రి అనుగ్రహమే వారందరికీ తండ్రి అనుగ్రహమే, అదంతాఅమ్మ అనురాగమే.

ఆతడిని హిరణ్యకేశుడని వేదాలు వర్ణించాయి. ఎంతటి సాగరాన్నయినా అధిగమించగల సమర్థుడతను. కడలిని మధించినపుడు పుట్టిన శ్రీదేవి అందరూచూస్తుండగా శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని చేరుకున్నది. క కార వాచ్యుడైన బ్రహ్మకు ఈశుడైన శివునకు కారణం కేశవుడని శాస్త్రం. సౌలభ్య సౌశీల్య వాత్సల్య స్వామిత్వ గుణాలు నిండిన వాడు అని నారాయణ శబ్దార్థం.

అర్థం

ఓడలున్న పాలకడలి (వంగమ్ కడల్) దేవతలకోసం చిలికిన (కడైంద) లక్ష్మీపతిని (మాదవనై) శ్రీకృష్ణుని (కేశవనై) చందమామవంటి అందమైన ముఖాన్ని (తింగళ్ తిరుముగత్తు) సుందరాభరణాలు ధరించిన గోపికలు (చేయిజైయార్) చేరి (శెన్ఱు) నమస్కరించి (ఇఱైంజి), ఆ రేపల్లెలో (అంగు), ప్రసిద్ధమైన (అప్పరైకొండ వాట్రై) పురుషార్థాన్ని పొందిన వృత్తాంతాన్ని (తమ) అందమైన శ్రీ విల్లి పుత్తూరులో (అణి పుదువై) బంగారు కాంతులీనుతున్న తామర పూవులతో చేసిన అందమైన మాలలు గలిగిన పెరియాళ్వారుల కుమార్తె గోదాదేవి (ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై) చెప్పిన (శొన్న) ఆపాత మధురమైన ముఫ్పై తమిళ గీతాల మాల (శంగ త్తమిర్ మాలై ముప్పదుం) తప్పనిసరిగా (తప్పామే) ఈ భూమిలో (ఇంగు) ఈ విధంగా (ఇప్పరిశు) అనుసంధానం చేసే వారు (ఉరైప్పార్) కొండంత భుజాలు నాలుగు కలిగిన వాడు (ఈరిరండు మాల్ వరైత్తోళ్) ఎరుపైన అందమైన ముఖం కలిగిన వాడును (శెంగణ్ తిరుముగత్తు) ఐశ్వర్య (చెల్వమ్) శ్రీమంతుడైన శ్రీమన్నారాయణుని చే (త్తిరుమాలాల్) అన్ని చోట్ల (ఎంగుం) అతని కరుణా కటాక్షాలను పొంది (తిరువగుళ్ పెట్రు) ఆనంద మగ్నులవుతారు (ఇన్భుఱువర్).

Also read: తెలివి లేమిగల గొల్లల నీవు బుట్టుటే మాభాగ్యమోయి

అంతరార్థం

సముద్రం చిలికితే ఒక చంద్రుడే ఉదయిస్తే గోపికలు అయిదులక్షల చంద్రుల వలెభాసిస్తున్నారు. ఈ పాశురం మాదవన్ తో మొదలై తిరుమాల్ తో ముగియడం ద్వయంలోని రెండు పాదాల అర్థాన్ని సూచిస్తున్నాయని పెద్దలు వ్యాఖ్యానించారు.

సఖ్య పశ్యత కృష్ణస్య ముఖమత్యరుణేక్షణం – శ్రీమహాలక్ష్మి సంబంధం వల్ల గోపికలు ఆనందం వల్ల, దివ్యవిభూతి ఐశ్యర్యం వల్ల స్వామి కనులు ఎర్రబారినవని అర్థం. లక్ష్మీ, లక్ష్మీపతీ అనుగ్రహించిన పరమానందం ఈ పాశుర సారాంశం.

నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తన ఊరు రేపల్లెగా భావించి తనను తాను ఒక గోపికగా సంభావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి, అతనినే ధ్యానించి, గీతించి, ఆతనినే వివాహమాడాలని అత్యంత దృఢ సంకల్సంతో అతన్ని బలవంతంగా భర్తను చేసుకుంది. ఫలితంగా శ్రీవిల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని పల్లకిలో రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడని చరిత్ర.

భోగరంగని గోదమ్మ కలిసిన రోజే భోగి

గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన ఈ శుభదినాన్ని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. సంక్రాంతి నాడు దక్షిణాయనం పూర్తై ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు ధనురాశినుంచి మకరరాశికి సంక్రమిస్తాడు కనుక ఇది సంక్రాంతి.

Also read: ద్వేషాలు వదిలేయడం శాంతికి దారి

జీయర్ స్వామి సం అంటే మంచి అనీ, క్రాంతి అంటే అడుగుపెట్టడం అని, మంచిగా బతకడానికి నిర్ణయం తీసుకోవలసిన శుభదినం కనుక ఇది సంక్రాంతి అని వివరించారు. ధనుర్మాసంలో ప్రతి తెల్లవారుఝామున ఒక పాశురం భక్తితో పాడి రంగనాథుడిని పొందిన గోదాదేవి వలె, ప్రతి కన్య భర్తగా రంగనాధుడినే పొందినట్టు భావించి, ఆ అమ్మాయి తండ్రి విష్ణుచిత్తుడైన పెరియాళ్వారుగా మారి తన అల్లుడిని రంగనాథుడుగా సన్మానించి పండుగ చేసుకోవడమే సంక్రాంతి పండుగ.

గొబ్బిళ్ల వ్రతంలో గోపికలు ఎవరికి వారు శ్రీకృష్ణుడిని కోరుకుని మధురభక్తిని ప్రకటిస్తారు. జీవాత్మ తాను స్త్రీగా భావించుకుని పురుషోత్తముడైన పరమాత్ముడిలో సమైక్యం కావాలను కోరుకోవడం తిరుప్పావై. ఈ రోజు దంపతులు రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు.

Also read: శ్రీకృష్ణుడుఇంద్రనీలమణి, మణివణ్ణా, భక్తులకు కొంగుబంగారం

జనజీవనాన్ని ఆధ్యాత్మికతేజస్సుతో పరంధాముడి కాంతివైపు నడిపించి ఉజ్జీవింపజేసే తిరుప్పావై ఒక దివ్య ప్రబంధం. ప్రేమభక్తి కావ్యం. ఈ అత్యద్భుత ప్రబంధ  విశేష ఫలాలను ప్రాధాన్యాలను వివరాలను ప్రస్తావిస్తూ ఫలశృతిని వినిపిస్తూ శుభం పలికేది ఈ చివరిపాశురం.


ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేదా చివరి రెండు (29, 30వ) పాశురాలనయినా తప్పని సరి గా అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది. ఇది కాత్యాయనీ వ్రతం.

జీయర్ స్వామి వారు హృద్యంగా చేసిన వ్యాఖ్యానం ఇది. “వంగ క్కడల్ – అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని, కడైంద చిలికినప్పుడు “మాదవనై” ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు, ఆయనే “క్కేశవనై కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.  దేవలోక ఐశ్వర్యాన్ని వెలికితీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ పామును గాడుగా కట్టి దేవతలు అసురులు పరస్పర మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి మరోరూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శణం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకిచేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ “మాదవనై” అనే పదప ప్రయోగం ద్వారా నారాయణ రహస్యం చెబుతుంది.

Also read: గుండెలో కంసుని ద్వేషమనెడు నిప్పు
“శేయిరైయార్” భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల “శెన్ఱిఱైంజ్ఞి” ఆ గోపికలు “అంగ ప్పఱై కొండవాత్తై” చంద్రుడివలె ప్రకాశించే “తింగళ్ తిరుముగత్తు” ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. “అణి పుదువై” భూమికి అలంకారమైన శ్రీవిల్లిపుత్తూర్ లో “ప్పైంగమల త్తణ్ తెరియల్” చల్లటి తులసి మాలను ధరించి ఉన్న “పట్టర్బిరాన్” విష్ణుచిత్తుల వారి కూతురైన “కోదై” గోదాదేవి”శొన్న” చెప్పిన “శంగ త్తమిళ్ మాలై” తీపైన ఈ పాటల మాలయైన “ముప్పదుం తప్పామే” ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి.

తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. “శెంగణ్ తిరుముగత్తు” వాత్సల్యమైన ఆ ముఖంతో “చ్చెల్వ త్తిరుమాలాల్” ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు,”ఇంగిప్పరిశురైప్పర్” ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి.”ఈరిరండు మాల్ వరైత్తోళ్” రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. “ఎంగుం తిరువగుళ్ పెత్త్” అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది “ఇన్బుఱువర్” ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అని గోదాదేవి పాశుర అంతరార్థాన్ని జీయర్ స్వామి  సులువుగా తెలిసేట్టు వివరించారు.

విశేషార్థం

మనకు కావలసిన మోక్షమే అమృతం. అందుకు శాస్త్రమనే మహాసముద్రాన్ని మథించాలి. బుద్ధి మంధరం. అనుకూల ప్రతికూల శక్తులు దేవతలు రాక్షసులు. మంధరాన్ని తెచ్చి సముద్రంలో వేయాలని గరుడుని స్వామి ఆదేశిస్తాడు. బుద్ధిని భగవంతుడే ఇస్తాడు. బుధ్ది ఆచార్యుడి ద్వారా లభిస్తుంది. ఇక్కడ గరుడుడంటే ఆచార్యుడు.


సంసారం మహాసముద్రం. శరీరం నావ, భగవత్సంకల్పమే మంధరం, భగవంతుడి కృప తాడు. ఆయన కటాక్షమే చేతులు. లక్ష్మి (పిరాట్టి) ఆత్మవస్తువు. తన సంకల్పమనే మంధరానికి కృపఅనే తాడు గట్టి కటాక్షమనే చేతులతో సాగరమును మధించి, ప్రియమైన ఆత్మను పొందుతాడు. చేతనులు పరమాత్మకు కౌస్తుభమణి వంటివారు. వారి పాపపుణ్యాల వలన సంసారం సముద్రంలో పడిపోయారు. వారికి మార్గం లేక అలమటిస్తూ ఉంటే భగవంతుని నిర్హేతుక కటాక్షము పడుతుంది. సత్వగుణం పెరిగి ఆ ఆత్మ భగవంతుడిని ప్రగాఢంగా కోరుతూ ఉంటుంది. అదే సముద్ర ఘోష. ఈ ఘోషతో పరమాత్మ కృప పెరుగుతుంది. ఆయన సంకల్పాన్ని మార్చుతుంది. భక్తియోగాన్ని ప్రసాదిస్తాడు. భక్తిలో అజ్ఞానం పోవడం జ్ఞానం రావడం జరుగుతుంది. అమృతమధనం అది. దాంతో లభించే అమృతం భగవత్ప్రాప్తి. అదేమోక్షం. ఈవిధంగా మోక్షం ప్రసాదించమని ప్రార్థించడం తిరుప్పావు వ్రతం. అమృతం లభిస్తుందనిచెప్పడమే ఫలశృతి ఈ పాశురం. వేదం సముద్రజలం వంటిది. కాని తాగడానికి పనికిరాదు. తిరుప్పావై గోదాదేవి ముఖారవిందంనుంచి వెలువడింది కనుక అది మేఘం వంటిది. సముద్రంనించి ఉప్పునీటిని త్రావి, మధురమైన జలాన్ని కురిపించే మేఘం తిరుప్పావై. ఉపనిషత్తుల సారం. అమృతం.


తిరు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. ప్పావై అంటే వ్రతం అనే అర్థం తోపాటు ఆమె దయ అనీ కరుణ అనీ అర్థం. బ్రతుకు అర్థం తెలియక అట్టడుగున పడి కొట్టుమిట్టాడుతున్న పిల్లలమైన మనందరినీ పైకి చేదుకోవడానికి ఆండాళ్ గా ఆ మహాతల్లి అవతరించి మనను మన జగన్నాధుడు, తండ్రి, పరమాత్ముడినిచేర్చడానికి చూపిన మార్గం తిరుప్పావై.

ఓడలున్న సముద్రం అంటే చాలా పెద్ద సముద్రం అని భావం. దాన్నే మథించినారు. అప్పుడు ఉద్భవించిన అమృతమయి శ్రీ లక్ష్మీని స్వీకరించి ‘మా’ (లక్ష్మి) ధవుడు (భర్త) అయినాడు. వేదోపనిషద్ శాస్త్ర సాగరాన్ని మధించి గోదాదేవి తిరుప్పావైలోంచి శ్రీరంగడు ఆమెకు లభించాడు.

గోదాదేవి పదకొండో ఆళ్వార్. శ్రీవైష్ణవ మతంలో మొత్తం పన్నెండు మంది ఆళ్వార్ పరమభక్తులు, అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మంగళం పాడిన వారు ఉన్నారు. వారిలో తండ్రీ కూతుళ్లిద్దరూ ఆళ్వార్ లు ఉన్నారు. వారే విష్ణుచిత్తులు, గోదాదేవి.  ఈ పన్నెండు మంది తనను తాము స్త్రీగా సంభావించుకుని పరమాత్మను పతిగా ప్రేమించి మధురభక్తి ఉప్పొంగి పోయి ఆయనను సాధించిన పరమ భక్తులు.  భగవంతుని భక్తులను భాగవతులు అంటారు. ఆ భాగవతులలో ఉత్తముడిని భాగవతోత్తములని అంటారు. వీరు భాగవతోత్తములు. 1. పోయ్ గై ఆళ్వార్…  వీరిని సరోయోగి అంటారు. 2. పూదత్తాళ్వార్ … వీరిని భూతయోగి అంటారు. 3. పేయాళ్వార్ …. వీరిని మహాయోగి అంటారు. 4. తిరుమళిశైయాళ్వార్ … భక్తిసారులని మరోపేరు. 5. నమ్మాళ్వార్…వీరినే శఠగోపముని అంటారు. 6. కులశేఖరాళ్వార్, 7. పెరియాళ్వార్ లేదా విష్ణుచిత్తులు, గోదమ్మ తండ్రి, 8. తొండరడిప్పొడి యాళ్వార్ – భక్తాంఘ్రి రేణువు విప్రనారాయణుడు, 9. తిరుప్పాణి ఆళ్వార్…వీరినే యోగివాహనులు అంటారు.10. తిరుమంగై ఆళ్వార్ ..పరకాల ముని అంటారు. 11. ఆంఢాల్ గోదాదేవి, 12. మధురకవి ఆళ్వార్

‘గోవిందా నీకు మేము’ అను మాట ప్రయోగించి జగత్తుకు కారణం, జగత్తుకు రక్షణం పరమాత్మ అని ‘అ’ కారము చెప్పినారు గోదమ్మ. నీకే అనే ఏ కారములో ‘‘ఓం’ లోని ‘ఉ’ కార అర్థం తెలుపుతున్నారు. ‘మేము’ అనడంతో జీవసముదాయానికి చిహ్నమయిన ‘మ’ కారార్థము వివరిస్తున్నది. ఇది ఓం కారం అంటే ప్రణవం, ప్రణవార్థం. నీతో సర్వ విధ బంధుత్వం మాకు ఉంది అనడంతో నారాయణ శబ్దార్థము చెప్పారు. ఆ అనుబంధం ఏఢేడు జన్మలదాకా అని చెప్పడం (ఆయ) అనే చతుర్థీ విభక్తి అర్థమును తెలుపుతున్నది. ఈ విధంగా మూల మంత్రాన్ని 29వ పాశురంలో ప్రతిపాదించి, ప్రతిష్టించి, గోదాదేవి నారాయణునితో పత్నీ బంధుత్వాన్ని స్థాపించి జగన్నాథుడే తన నాథుడని నిరూపించి, 30వ పాశురంలో ఫలశృతి వివరించిన గోదా వ్రతం తిరుప్పావై.

Also read: పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles