Thursday, April 25, 2024

తెలివి లేమిగల గొల్లల నీవు బుట్టుటే మాభాగ్యమోయి

మాడభూషి శ్రీధర్ తిరుప్పావై 28

కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్ న్ద్ ఉణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱున్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

అడవులందు మేతపశువులకు నేతలము మేము

ఆలమందల వెంట దిరుగు అల్పజీవులమేము

పసులు పక్షులతోడనేమెసలెదము మెసవెదము,

తెలివి లేమిగల గొల్లల నీవు బుట్టుటే మాభాగ్యమోయి

లోపమేమిలేని లోకాలనాథుడే మాకన్నయ్య అయిన

ఎన్నడెడతెగని కృష్ణ బంధమే మాకెనలేనివరము

మర్యాదలెరుగక ఇన్నాళ్లు చులకనగ పిలిచినాము

అలగక కృష్ణయ్య, ఆశయాల దీర్పఆదరించవయ్య

నేపధ్యం:

నిన్నేకోరుకున్నాం. మాకే ఉపాయాలూ తెలియదు. నిన్నే ఉపాయంగా నమ్ముకుని వచ్చాం. పఱై పొందడానికి సాధనానుష్టానంచేసి యోగ్యత తెచ్చుకున్నామో లేదో కూడా తెలియదు. మాకే యోగ్యతాలేదు. ఇతరంగా ఏ ఉపాయాలు కోరినా మాకు అవి అడ్డుపడతాయని మాత్రం తెలుసు. మాజాతిలో నీవు పుట్టడమే మాబలం. అదే మా అర్హత. కనుక మేము అడిగింది మాకివ్వాలని నిన్నటి పాశురంలో అడిగారు గోపికలు. నీవు విరోధులను పరాజితుల్ని చేస్తావు, ఆశ్రితులచేతిలో పరాజితుడివవుతావు. నలుగురితో కలిసి భగవత్ గుణానుసంధానం చేయడమే ఆనంద దాయకం అంటున్నారు.

అర్థం

లోపమనేదేలేని గోవిందా (కుఱవొన్ఱుమిల్లాద గోవిందా) మేము (యామ్) పశువుల వెంట నడిచి (కఱవైగళ్ పిన్ శెన్ఱు) అడవిలో కలుసుకుని (కానమ్ శేర్ న్దు) తిని తిరుగుతూ ఉంటాం (ఉణ్ బోమ్) ఏమాత్రం వివేకంలేని (అఱివు ఒన్ఱుమ్ ఇల్లాద) యాదవకులంలో (ఆయకులత్తు) నిన్ను (ఉన్ దన్ను) మా వంశంలో పుట్టిన (ప్పిఱవి పెఱుందనై) పుణ్యాన్ని (పుణ్ణియమ్) పొందియున్నాము (ఉడైయామ్), ఓ దేవా (ఇఱై) నీతో మా సంబంధం (ఉన్ దన్నోడు ఉఱవు) ఇక్కడ మనకు (ఇంగు నమక్కు) పోగొట్టుకుందామన్నా పోయేది కాదు (ఒజిక్క ఒజియాదు) లోకజ్ఞానం లేని పిల్లలం (అఱియాద పిళ్లైగళోమ్) నిన్ను(ఉన్ దన్నై) ప్రేమతో (అన్బినాల్) చిన్న పేరుతో పిలిచినందుకు (శిరుపేర్ అజైత్తనవుమ్) నీవు (నీ) కోపించి అనుగ్రహించకుండా వదలకు (శీఱి అఱుళాదే) మేము ఆశించిన ప్రయోజనాన్నిమ్ము (పఱైతారాయ్).

Also read: రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు

అంతరార్థం

యాదవులు అమాయకులు, ప్రకృతితోనూ సహజ సిద్ధమైన పశుపక్ష్యాదులతోనూ నిష్కల్మష స్నేహం చేసేవారు, నోరులేని జీవులు, మనను పాలిచ్చి పోషించే తల్లుల వంటి పశువులే సంపద, పశువులే స్నేహితులు. అమ్మ తరువాత మనకు తమ శరీరంలో భాగమైన పాలను పంచుకునేది పశువులే కదా. అవి పశువులా? తల్లులనుకోవలసిందే కదా. ఆ పశువులను మనుషులతో సమానంగా ప్రేమించే అమాయత్వాన్ని మించిన దైవత్వం లేదు. పాడిపశువులను బంధువులగా భావించి సేవించే గొల్లవారికి శారీరక శుచి శుభ్రత తక్కువ అని అనుకుంటారేమో. మాకు ప్రకృతితో సమాగమమే దైవ సన్నిధానం అని పైకి చెప్పడం కూడా రాదు. వారి జీవనంలో అదొక భాగం, అంతే. పశువులకు గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుని అక్కడికి పశువులను తోలుకుపోవడం వారి పని, వాటితోనే ఉంటారు వాటితోనే కలిసి తెచ్చుకున్న సద్ధిమూట తింటారు. ఇన్ని లోపాలున్న మాతో ఏ లోపంలేని గోవిందుడు కలిసి తిరుగాడినాడంటే ఎంత ఆనందం, ఎంత అదృష్టం. యాదవ కులం మొత్తం పరమ పావనమైపోయింది. యుగయుగాల దాకా. కృష్ణుడు యోగులకు కూడా అందనంత ఎత్తున ఉన్నాడని వారికి తెలియదు. తమకు అందుబాటులో తమతో ఉన్న సులభుడనీ తెలియదు. కనుక చిన్ననాటి మిత్రుడిని పిలిచినట్టు, రారా పోరా అని చిన్న చిన్న మాటలతో పిలుచుకున్నాం అంటున్నారు. లౌక్యం తెలియని చిన్న వారమయ్యా, కోపం రాలేదు కదా. చిన్నబుచ్చుకోలేదు కదా. నీతో సహవాసమే, నీతో చెరగని స్నేహమే మాకు తరగని పెన్నిది కన్నయ్యా అంటున్నారు గోల్లవారు గోపికలు, బాలికలు, గోవులు, ఆబాల గోపాలం, అదేమాట, ఇదే ఈ రోజు పాట, గోదమ్మనోట.  కన్నయ్య వారితో మాట్లాడుకుంటున్న మాటలివి.

Also read: హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ

శ్రీ కృష్ణ: నామీద భక్తి కుదరాలంటే వేల ఏళ్ల పాటు కర్మ భక్తి మార్గాలలో ఒక్కటైనా మీరు అనుష్టించి ఉండాలి కదా.. అదేమైనా ఉందా?

గోపికలు: మా తెలివి నడవడికలు చూస్తే కర్మభక్తి మార్గాలలో ఒకటైనా ఉంటుందనే అనుమానం వస్తుందా అసలు. మాకు జ్ఞానం ఎక్కడిది. పుట్టిన ప్పడినుంచి పశువులే మాకు బంధువులు మిత్రులు. వాటి వెంట అడవులు తిరిగే వాళ్లం.

శ్రీ కృష్ణ: అడవుల వెంట తిరిగినా సరే, ఏవైనా పుణ్యక్షేత్రాల్లోనైనా ఉన్నారా, కనీసం ఆ కారణంమీదైనా మీకోరికలు తీర్చవచ్చు.

గోపికలు: పశువులకు గడ్డిమేయడానికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడ ఆగుతాం. అదే మాకు పుణ్యక్షేత్రం. అయినా అడవుల్లో కర్మయోగాదులు చేయడానికి ఏ సౌకర్యాలుంటాయి. ఆ ప్రసక్తే లేదు.

శ్రీకృష్ణ: పోనీ అడవుల్లో వానప్రస్థాశ్రమ ధర్మమైనా పాటించవచ్చుకదా.. ఆ కర్మయోగమైనా ఉందా?

గోపికలు: ఎక్కడి వానప్రస్థం. ఆకులు అలమలు తిని శరీరాన్ని కృశింపచేసి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ల లేదు. పొట్ట నింపుకోవడానికి తిండి తీసుకుపోయి తినేవాళ్లం. స్నానంలేదు సంధ్య లేదు. అతిధులకు ముందు పెట్టి తినాలన్న నియమాలూ లేవు. తూర్పుకు ఎదురుగా కూచొని తినాలని చెప్పిన వారూ లేరు. చేసే వారూ లేరు. పశువులు కూర్చుంటే మేం కూర్చుంటాం నిలబడితే నిలబడతాం. అవి నడిస్తే మేమూ నడుస్తాం. ఆవులు నెమరు వేయనపుడు కూడా మేం మేస్తూ ఉంటాం. ఎంగిలని, తినకూడదని, పులిసిందనే ఆంక్షలేమీ లేవు. ఇదే కర్మయోగం అనుకుంటే.. అనుకోవచ్చు.

శ్రీ కృష్ణ: కర్మ ఏం చేస్తేనేం. అందులో కూడా జ్ఞానయోగం అనుష్టించవచ్చుకదా. మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడు గొప్పజ్ఞాని కాలేదా? మీరు ఆవులను రక్షించిన వారు కదా, నగరంలో ఉండే విదురుడు జ్ఞానాధికుడైతే మీరెందుకు కాకూడదు. మైత్రేయి, శ్రమణి మొదలైన అమ్మాయిలు మంచి జ్ఞానులుగా కీర్తి నొందలేదా. మీరు జ్ఞానయోగాన్ని అవలంబించవచ్చు కదా.

Also read: రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత

గోపికలు: మాకు వివేకం ఉంటే కదా జ్ఞానయోగం. మాకూ జ్ఞానయోగానికి మధ్య సముద్రానికి పర్వతానికి ఉన్నంత తేడా ఉంది.

శ్రీకృష్ణ: వివేకం లేకపోతే పోనీ మీకు అనురాగం ఉంది కదా. జన్మాంతరాలనుంచి వచ్చిన జ్ఞానం పరిపక్వమై భక్తి యోగంగా మారాలి కదా.

గోపికలు: వివేకమేలేకపోతే అందులో భాగమైన భక్తి ఎక్కడినుంచి వస్తుంది? జ్ఞానమూ లేదు. భక్తీ లేదు.

శ్రీ కృష్ణ: సరే జ్ఞానులు వివేకవంతులూ కూడా ఇదే అంటుంటారు. ఇప్పుడు మీలో జ్ఞాన భక్తులు లేకున్నా ఇక ముందు రారని ఎలా అంటారు?

గోపికలు: మాకుల పరిస్థితులన్నీ చూస్తే ఎప్పడికైనా వివేకం వస్తుందని ఎవరైనా అనుకుంటారా? భక్తులమై, సర్వజ్ఞులమై మిమ్ము ఆశ్రయించగల సమర్థత లేదు. నీవు తప్ప మరో ఉపాయమే మాకు లేదు. కలలో కూడా తోచదు.

శ్రీ కృష్ణ: కర్మ లేదు, జ్ఞానంలేదు, భక్తి లేదు. అయితే ఇక మిమ్మల్ని వదిలేయవలసిందేనా?

గోపికలు: అదేం మాట? ‘‘రామో విగ్రహాన్ ధర్మః’’, ‘‘కృష్ణః ధర్మం సనాతనం, పుణ్యానామపి పుణ్యోసౌ’’ అని కీర్తించబడే పుణ్యమూర్తికి పాలు అన్నం పెట్టి పోషించే మాకు పుణ్యం లేకపోవడమేమిటి? స్వార్జిత ఆస్తి లేకపోతే పిత్రార్జితం లేదంటారేం? సాధ్యమైన పుణ్యం లేదేమో కాని సిద్ధమైన పుణ్యం ఉంది కదా. నిన్ను పొందిన మా పుణ్యం చిన్నదా ఆ భాగ్యాన్ని మించిందేదయిన ఉందా కన్నయ్యా.

శ్రీ కృష్ణ: వివేకహినులమంటారు, భాగ్యశాలురమనీ అంటారు. పొంతన లేదు కదా.

గోపికలు: అదే మరి మా అవివేకం అంటే..

శ్రీకృష్ణ: అయితే మిమ్మల్ని పరిత్యజించవలసిందేకదా.

గోపికలు: ఏ కొరతా లేని గోవిందుడివి నీవు. కాని మాజ్ఞానహీనతను తొలగించితేనే కదా నీవు పరిపూర్ణుడవయ్యేది.

శ్రీ కృష్ణ: ఓహో అయితే భగవానుడే శక్తి జ్ఞాన పూర్ణతలను ఇస్తాడని మీకు తెలుసన్నమాట. అయితే మీరు స్వరూప జ్ఞానము కలవారన్నమాట.

గోపికలు: మీకు స్వరూప జ్ఞానముంటేకదా మాకుండేది. నీవు నిత్యసూరులను వదిలి పరమపదాన్ని వదిలి ఈ గోవులమధ్య ఉంటున్నావు. నీవు నీస్వరూపజ్ఞానం మరిచిపోయావు అది మాభాగ్యం. నీ స్వరూపం నీకు జ్ఞాపకమున్నా, మా స్వరూపం మాకు జ్ఞాపకం ఉన్నానీవు మాకు లభించేవాడివే కాదు. మేము అపరాధాల్లో చక్రవర్తులం. నీవో సర్వస్వతంత్రుడివి. పరతత్వంలో లోపం ఉంది. తనతో సామ్యము పొందిన వారికి సమానులకు గానీ ఆయన దర్శనం లభించదు. ఈలోపం శ్రీకృష్ణా నీకు లేదు. పశుప్రాయులమైన మాతో కలిసి మెలిసి ఉంటావు. మాకోసం పశువులకోసం గోవర్ధనం ఎత్తావు. గోవిందుడివైనావు. మాకే జ్ఞాన కర్మ భక్తి మార్గాలు తెలిస్తే మీకు దూరంగా వెళ్లేవాళ్లం. రాక్షసవధ చేసి అమేయుడవైనా నీకు గోవిందనామమే ప్రీతి. ‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకమ్ శరణం వ్రజ’’ అని నీవే చెప్పావు కదా. సాధనాలన్నింటినీ సమూలంగా వదలి నన్ను ఒకణ్ణే ఉపాయంగా స్వీకరించు అని ఆదేశించావు కదా. నీవు పరిపూర్ణుడివి. లోపం లేని వాడివి.

Also read: రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ

శ్రీకృష్ణ: నేను పరిపూర్ణుడినైతే మీ కోరికలు తీర్చాలనే నిర్బంధం ఏదీ లేదు కదా.

గోపికలు: నీకు మాకు ఉన్న సంబంధం గమనిస్తే మా అభీష్ఠం తీర్చకుండా ఉండలేవు. అయినా ఈ బంధం పొమ్మంటే పోయేదా? మమ్ము వదలి నీవు లేవు. నిన్నువదలి మేమూ లేము. నీవు దయతో పరిపూర్ణుడవుగానూ మేము దయనీయతా పరిపూర్ణులము గాను ఉన్న ఈ సంబంధాన్ని తొలగించడం వీలు గాదు కదా. నేను మీకు బంధువుగా జన్మించి ఉన్నాను. మీరు వేరుగా భావించనవసరం లేదని నీవే హెచ్చరించావు కదా నీవే అన్యథా భావించవచ్చునా.

శ్రీకృష్ణ: నారాయణ అనేది పర్వతాన్ని గుర్తుకు తెచ్చే పేరు. నేను విసుగెత్తి వదిలేసిన పర్వతాన్ని నాకు గుర్తు చేస్తూ నారాయణ నామంతో పిలిచారు. ఇప్పుడేమో ఏలోపమూ లేని గోవిందా అనీ కూడారై వెల్లుంగోవిందా అనీ అంటున్నారు.

గోపికలు: మేము తెలియక ఆ పేరుతో పిలిచినందుకు కోపగించకుండా సహించడం నీ కర్తవ్యం కదా శ్రీ కృష్ణా. నీ మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆ విధంగా పిలిచాం. ప్రేమకలిగిన వారు పక్కపక్కనే పడుకున్నప్పుడు నిద్రలో ఒకరి కాలు మరొకరికి తగిలితే కోపం తెచ్చుకుంటారా? నారాయణా అనీ నారాయణనే నమక్కే పఱైతరువాన్ అని చిన్న పేరుతో పిలవడం తెలియక చేసిన తప్పు. మన్నించు.

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే మాధవ హే సఖేతి

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేనవా2పి

శ్రీకృష్ణుని చేత గీతా జ్ఞానాన్ని అందుకున్న తరువాత గాని అర్జునుడికి ఆయన పరమాత్మ తత్వం ఏమిటో అర్థం కాలేదు. అప్పుడు అయ్యో స్నేహితుడిగా భావించి కృష్ణా మాధవా స్నేహితుడా అని ఎన్ని సార్లో నోరుజారాను కదా అని అర్జునుడు బాధపడినట్టే మేమూ బాధపడుతున్నాం. నీ సౌలభ్యం తెలిపే గోవిందుడి నామం ముందు పరత్వ ప్రకాశమైన నారాయణ నామం ఎంతో చిన్నది. అజ్ఞులకు గోవింద నామం చిన్న అనిపిస్తుంది. కాని సర్వజ్ఞులకు నారాయణ నామ చిన్నగా తోస్తుంది. మేము కూడా ఒకరినొకరు పిచ్చిపిల్లా, చెవిటివా మూగవా అని అనుకున్నాం. అందుకు మాలోమేము క్షమాపణ కోరుకుంటున్నాం. శీరి అరుళాదే ఇఱైవా నీ తారాయ్ పఱై అంటూ సర్వాన్ అశేషతః క్షమస్వ అని శ్రీమద్రామానుజులు ప్రార్థించినట్టు సకల పాపాలను అశేషాం క్షమించి కటాక్షించాలి శ్రీ కృష్ణా.

శ్రీ కృష్ణ: అది సరే మీరు ఫల సిధ్ధి పొందడానికి తగిన సంబంధం మన ఇద్దరి మధ్య ఉందనుకున్నా మీరూ దానికోసం కొంత ప్రయత్నం చేయాలి కదా.

గోపికలు: నీవు ఇవ్వదలచుకోకపోతే మేం ఎన్ని ప్రయత్నాలు చేసి ఏంలాభం? కాళ్లు చేతులు తప్పుచేసాయని వాటిమీద కోపం ప్రకటిస్తారా ఎవరైనా? మేం నీ సొత్తు. సొత్తు మరిచినా స్వామి సొత్తును మరవకూడదు కదా. మీ ఆస్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు వదులుకొంటారా? నీ శేషత్వం కాపాడుకోవడానికైనా మాకు పఱై ఇవ్వాలి. అర్థించు వాడి అభిమతాన్ని నెరవేర్చడమే సర్వేశ్వరుని ఈశ్వరత్వానికి ఉచితంగా ఉంటుంది. కనుక స్వామీ నీవే మా అభిమతాన్ని పూర్తి చేయి.

ఈ విధంగా సంభాషణారూపంలో సాగిన తత్వబోధ ఈ పాశురంలో విశదం అవుతుంది.

జీయర్ స్వామి వాఖ్యానం ఇది:

ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళు కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం “హే గోవిందా” నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుందని జీయర్ స్వామి వాఖ్యానం ఇది.

అవి ఏమిటంటే

1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.

2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.

3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.

4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.

5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.

6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.

ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!

గోపికలు ఈ విధంగా అంటున్నారు. మాకై మేం కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమీ ఆర్జించుకోలేదు. ఇవి కావాలంటే అంటే వేదాధ్యయనం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట వెళ్ళితే కదా అవి ప్రాప్తిస్తాయి.మరి మేమేమోకఱవైగళ్ పిన్ శెన్ఱుపాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోషిస్తాం. లేకుంటే లేదు.

ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి.కానమ్ శేర్నుంద్ణ్భోమ్అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానంలేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేంఅఱివొన్ఱు మిల్లాద వాయ్క్కులత్తుఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా.మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటేఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నీవు.

కుఱైవొన్ఱుమిల్లాద గోవిందాకళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా.ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదునీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు.అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా.ఉన్ఱన్నై చ్చిఱు పేర్అళైత్తనవుంచిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం.శీఱియరుళాదేకోపించక అనుగ్రహించు.ఇఱైవా! నీ తారాయ్ పఱైమాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు. అనుగ్రహించమని గోపికలు వేడుకున్నారని జీయర్ స్వామి వారు వివరించారు.

1. సత్కర్మాభావవిజ్ఞాపనము (భగవంతుని చేరడానికి సాధనంగా నేనే మంచి కర్మా చేయలేదు అని చెప్పుకోవడం)

2. స్వనికర్షానుసంధానము (అయోగ్యుడనని, తప్పులుచేసానని, అల్సుడనని చెప్పుకోవడం),

3. ఈశ్వరగుణ పూర్తి (తనకేదయినా పుణ్యం ఉంటే అది భగవంతుడి అనంత కల్యాణ గుణ పరిపూర్ణుడి కరుణే అని నమ్మడం),

4. సంబంధ జ్ఞానము (మాకే వేరే తెలివేదీ లేదు, శ్రీకృష్ణుడితో విడదీయరాదని సంబంధం తప్ప),

5. పూర్వాపరాధక్షమాపణము (చేసిన అపచారములకు, ఉపచారభావంతోచేసిన అపచారములకు నీ ఘనత తెలియక నీపట్ల చేసిన తప్పులను మన్నించు),

6. భగవదేకోపాయత్వ స్వీకారము (నీవు తప్ప మాకు మరొక దారి లేదనినమ్మడం), అనే ఆరు లక్షణాలు మనను భగవంతుడిదరిచేర్చుతాయని గోదమ్మ వివరించారని శ్రీ భాష్యం గారు పేర్కొన్నారు.

అజ్ఞానులం, దోష పూరితులం, కనుక మనం శ్రీమన్నారాయణుని పొందగలమా అని ఎవరికైనా సందేహాలు కలిగితే, వాటిని పటాపంచలు చేయడానికి ఈ పాశురాన్ని రచించారు గోదమ్మ. మన దోషాలు పోగొట్టగల పరిపూర్ణుడు గోవిందుడు. సులభంగా దొరకడమే అతని లక్షణం. గోవిందుడన్నది ఎంత పెద్ద బిరుదు? దాని ముందు నారాయణ అన్న దెంత చిన్న పేరు? ఆయనతో ఉన్న బంధుత్వం పోయేదేనా?కుటుంబ సభ్యులతో, బంధువులతో తగాదాలు పెట్టుకుని బాంధవ్యాలు తెంచుకోవచ్చునేమో కాని భగవంతుడితో బాంధవ్యం తెంచుకోగలరా ఎవరైనా? సంబంధ జ్ఞానమే అన్ని జ్ఞానాలకన్న గొప్పబంధం. నీ తిరు చరణాలే ఉపాయము ఉపేయమూ. ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతమని గోదాదేవి ఈ పాశురంలో పాడారు. గోదాదేవిలో మనకు జగద్గురువు కనిపించడం లేదూ.

శ్రీ కృష్ణునికి రుక్మిణి లేఖ

రుక్మిణి కుమారి శ్రీ కృష్ణుని పంపిన లేఖ ఇది. (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వివరిస్తూ దీన్ని సర్వస్య శరణాగతి. జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను.పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను.అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను, ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.వాడెవరు నన్ను చేసుకోవడానికి?నీవు పురుష సింహానివి. అంటారు. అచ్చం గోదాదేవి కూడా ఈ విధంగానే శరణాగతి కోరినారు.

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?

Also read: సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles