Wednesday, May 8, 2024

తండ్రి ఆజ్ఞను శిరసావహించవలసిందే: భరతుడితో రాముడు

రామాయణమ్ 53

భరతుడిని అన్ని విధాలుగా విచారించి  ‘‘నీవు నారచీర జటలు ధరించి ఇచటికి ఎందుకు వచ్చావు కారణమేమిటి?’’ అని ప్రశ్నించాడు రాముడు.

‘‘నేను నీ దాసుడను. నన్ను అనుగ్రహించి దేవేంద్రుడిలాగా  రాజ్యాభిషిక్తుడవు  కమ్ము. మన తల్లులు, మన ప్రజలు అందరూ ఆశగా నీ వద్దకు వచ్చినారు. మమ్ములను నీవు అనుగ్రహించవలెను. మన వంశాచారమును బట్టి జ్యేష్ఠుడవైన నీకే రాజ్యాధికారము కలదు. ఈ రాజ్యము నీది. దీనిని స్వీకరించు! ఈ సచివులు, నేను ఇక్కడచేరిన ప్రజలంతా శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్ధిస్తున్నాము ఈ రాజ్యలక్ష్మిని స్వీకరించు. నీ సోదరుడను, నీ శిష్యుడను, నీ దాసుడను నన్ను అనుగ్రహించు’’ అని మహాబాహువైన భరతుడు అన్నను ప్రార్ధించి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలను మరలమరల తాకి నమస్కరిస్తూ వేడుకుంటున్నాడు.

Also read: భరతుడి యోగక్షేమాలు అడిగిన రాముడు

అంత రాముడు భరతునితో ‘‘నాయనా ఉత్తమవంశములో జన్మించినవాడు రాజ్యము కొరకు పాపము చేయునా? (నీ విషయంలో నాకేమీ అనుమానం లేదని అర్ధం)

‘‘భరతా, నీలో ఏవిధమైన దోషములేదు. బాలుడి వలే నీ తల్లిని నీవు నిందించవద్దు. తన భార్యా పుత్రులవిషయములో మన తండ్రి నిర్ణయాన్ని నీవు తప్పుపట్టవద్దు. అంతేకాక మహారాజుగా ఆయనకు మనలను శాసించే అధికారమున్నది.

ధర్మశీలురైన నా తల్లితండ్రులు ఇరువురూ అరణ్యమునకు వెళ్ళమని ఆజ్ఞాపించగా ఇంకొక విధముగా నేనెలా ప్రవర్తించగలను? (కైకేయి విషయములో రామునకు స్వంత తల్లా, సవతితల్లా అనే భేద భావము లేదు. గమనించగలరు)

Also read: రాముడి పాదాల చెంతకు చేరిన భరతుడు

‘‘మన తండ్రి గారు నిన్ను అయోధ్యలో రాజ్యపాలనము గావించమన్నారు. నన్ను దండకారణ్యములో నివసించమన్నారు. ఇది ఆయన చేసిన పంపకము. మహారాజు నిర్ణయమే ప్రమాణము తండ్రి గారు నీకిచ్చిన భాగాన్ని నీవు అనుభవించు. నా కిచ్చిన భాగాన్ని నేను అనుభవిస్తాను.’’

‘‘అన్నా, మన వంశమునకు ఉన్నధర్మము, అనాదిగా అందరూ పాటించేది జ్యేష్ఠుడు రాజుగా బాధ్యతలు స్వీకరించడం. నేను ఆ విషయంలో ధర్మహీనుడను కాలేను. నాకు రాజ్యముతో పనిలేదు. నాకు దాని వలన ప్రయోజనమూ లేదు. రామా, నీవు మాతో కూడి అయోధ్యకు రావలే! రాజ్యాభిషిక్తుడవు కావలే. మన తండ్రిగారు నిన్ను అడవికి పంపిన తరువాత నీ వియోగము వలన కలిగిన శోకము భరించలేక స్వర్గస్తులైనారు. నా తల్లి మూలముగా ఆయన తన కీర్తిని శాశ్వతముగా నశింప చేసే ఈ పాపపు పనికి ఒడిగట్టినాడు. నా తల్లి కోరినది రాజ్యము. కానీ  ఆవిడకు లభించినది మాత్రము వైధవ్యము!

అన్నా, నీవు సీతా లక్ష్మణసమేతుడవై అరణ్యమునకు వెళ్ళిన వెంటనే ఆ బాధ భరించలేక, దుఃఖపీడితుడై దశరధమహారాజు  స్వర్గస్తుడైనాడు. రామా, లేచి తండ్రిగారికి జలతర్పణాలిమ్ము. నేనూ శత్రుఘ్నుడూ ఇంతకుపూర్వమే ఆయనకు తర్పణాలు ఇచ్చియున్నాము. నీవు దూరమైన పిదప నిన్నుగూర్చి ఆలోచిస్తూ, దుఃఖిస్తూ నిన్ను చూడవలెనని కోరుకుంటూ, నిన్ను స్మరిస్తూ, నీయందే లగ్నమైన మనస్సును మరల్చలేక ఆయన మరణించాడు. ఆయనకు అపరక్రియలు చేయవలసినవాడవు, ఆయన ప్రియపుత్రుడవైన నీవే.’’

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యంలో సేద తీరిన భరతుడి సేన

ఇంతసేపటి తరువాత భరతుడు ఎరిగించిన తండ్రి మరణవార్త విని రాముడు స్పృహతప్పి మూర్ఛపోయాడు. తండ్రి మరణవార్త విని మొదలు నరికిన చెట్టులా కూలపడి బాలుడిలా రోదించసాగాడు రాముడు. ‘‘నా తండ్రి లేని అయోధ్యతో నాకేమి పని? అరణ్యవాసము అయిన పిదపకూడ నేను అయోధ్యలో కాలు పెట్టను. నాకిక మంచిమాటలు చెప్పేవారెవ్వరు? అయ్యో, నేనెంత నష్ట జాతకుడను? నా వలన దుఃఖిస్తూ నా తండ్రి మరణించినాడే! కడసారి చూపుకు కూడా నోచని వాడనైనానే! భరతా! నీవు శత్రుఘ్నుడు ఎంతో పుణ్యము చేసినారు కావున తండ్రిగారి అంత్యక్రియలు గావించగలిగినారు.’’ అని దుఃఖిస్తూ ఉన్న రాముడికి కర్తవ్యం గుర్తు చేశాడు భరతుడు.

సుమంత్రుడు వెంటరాగా రామలక్ష్మణులు ఇరువురూ కొండదిగి మందాకినిని సమీపించారు. బురదలేకుండా నిర్మలంగా ఉన్న రేవు చూసుకున్నారు. సుమంత్రుడు సాయం చేయగా అందులో మునకలు వేసి తండ్రికి జలతర్పణాలు విడిచి, ఇంగుదీకాయలపిండితో పిండప్రదానము చేసి భారమైన హృదయంతో మరల కొండ ఎక్కి తమ పర్ణశాలను చేరుకున్నారు.

అక్కడ అన్నదమ్ములు మరల ఒకరి నొకరు కౌగలించుకొని బిగ్గరగా రోదించసాగారు. వారి రోదనలధ్వనికి మొత్తం అడవి అంతా కలతచెందింది.

ఏడుస్తున్న వీరిని తల్లులు దగ్గర చేరి ఓదార్చసాగారు.

Also read: గంగానదిని దాటిన భరతశత్రుఘ్నులు, పరివారం

కౌసల్యా మాత రాముని దగ్గరకు తీసుకొని ఆయన వంటికి అంటివున్న దుమ్ము ను మెల్లగా తుడుస్తూ ఆయన వీపు నిమరసాగింది.

రాముడు అంత అక్కడకు వచ్చియున్న జనులందరినీ పలకరించి కొందరిని కౌగలించుకొని వశిష్ఠమహర్షికి పాదాభివందనం చేసి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. అప్పుడు భరతుడు ,లక్ష్మణ,శత్రుఘ్నులు అందరూ అన్నప్రక్కనే ఆసీనులైనారు.

నిశ్శబ్దం తాండవిస్తున్నది అందరు జనమంతా కూడా రాముడు ఏం చెపుతాడా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు.

ఆ రాత్రి అంతా మరల రోదనలతోనే గడచిపోయింది! మెల్లగా అందరూ హోమజపాదులు పూర్తిచేసుకొని మరల రాముని వద్దకు చేరారు.

మౌనాన్ని చీలుస్తూ భరతుడు అన్నమాటలు అందరికీ వినిపించాయి.

‘‘అన్నా! నా తల్లిమాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చావు. దానిని నీకే తిరిగి ఇచ్చివేయుచున్నాను. స్వీకరించు. నిష్కంటకమైన రాజ్యాన్ని ఏలుకో! సువిశాలమైన ఈ సామ్రాజ్యాన్ని ఏలగల సమర్ధుడవు నీవే. మాకెవ్వరికీ అంత సమర్ధత లేదు. నీ గమనము గరుడపక్షి వంటిది. మేమో మామూలు పిట్టలవంటి వారము. నిన్ను అనుసరించే శక్తికూడా లేని వారము’’ అని భరతుడు పరిపరివిధాలుగా అన్నను ప్రార్ధించాడు. రోదించాడు.

Also read: భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

అప్పుడు రాముడు, ‘‘భరతా! నీవు ఈ విధంగా రోదించడం తగదు. మనిషికి స్వాతంత్ర్యము కానీ, తన ఇష్టము వచ్చినట్లు పనులు చేసే సామర్ధ్యము కానీ లేవు. ప్రతి ఒక్కడినీ దైవము అటూ ఇటూ లాగుతుంటుంది. ఎంత పోగు చేసుకున్నా ధనము నశిస్తుంది. ఎంత ఉన్నతి పొందినా ప్రతిఒక్కడునూ పతనము చెందవలసినదే (you can’t always be on the crest of success). మనుష్యుల పరస్పర సంబంధాలు  విచ్ఛిన్నం అయితీరవలసినదే. పుట్టిన వాడు మరణించవలసినదే!  (Inevitabilities of LIFE).

పండిన పండ్లకు చెట్టునుండి రాలిపోవడమే భయము.

అట్లే పుట్టిన మనిషికి గిట్టుట ఒకటే భయము.

ఎంత బ్రహ్మాండమైన ఆకాశహర్మ్యాలు దృఢమైనవి అని నీవు అనుకుంటూ నిర్మించినా కొంతకాలానికి జీర్ణమై, శిధిలమై కూలిపోవలసిందే.

కాలానికి జీర్ణము చేసే శక్తి ఉన్నది! గడచిన రాత్రి తిరిగి వస్తుందా?

మనిషిని ఆతని మృత్యవు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అది అతనితోటే కలిసి కూర్చుంటుంది. కలిసి ప్రయాణం చేస్తుంది. ముఖము ముడుతలు పడి, వెంట్రుకలు నెరిసి, శిధిలమైపోతున్న శరీరాన్ని మనిషి తిరిగి సమర్ధవంతంగా చేసుకోగలడా! అది ఎవరి వల్లా కాదు. సూర్యోదయమవ్వగనే పనులు చేసుకుంటూ చీకటి పడగానే నిద్దురిస్తూ ఉన్న మనిషి కాలంగడిచిపోతున్నది అనే విషయాన్ని మాత్రం గమనించలేకున్నాడు. ఋతువులు వస్తున్నాయి. పోతున్నాయి, దానితోపాటే ప్రాణుల వయస్సు కూడా క్షీణిస్తున్నది. ఒక ప్రవాహంలో కొన్ని కట్టెముక్కలు కలిసివెడుతున్నాయి. కాస్తదూరము వెళ్ళగానే అవి విడిపోయి కనపడుతున్నాయి. కాలప్రవాహంలో జీవనగమనంలో బంధువులూ, స్నేహితులూ, భార్యాపుత్రులూ అలాంటి కట్టెముక్కల లాంటి వారే! అందరూ విడిపోక తప్పదు. మన తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గము చేరుకున్నాడు. మన తండ్రి నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించినాడో అది మాత్రమే నేను పాటిస్తాను. దశరధమహారాజు మన తండ్రి, మన బంధువు. అది రాజాజ్ఞ! దానిని పాటించి తీరవలసినదే. అదే ధర్మము! మన తండ్రి ఆజ్ఞను మనము పాటించవలసినదే. ఆయన ఆజ్ఞ  తిరుగులేనిది’’ అని చెప్పి ముగించాడు రాముడు.

Also read: రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles