Friday, April 26, 2024

ఏడు జన్మలెత్తినా సరే నీ సేవచేసే భాగ్యం ఇవ్వవయ్యా క్రిష్ణయ్యా

  • 29 వ పాశురం
  • 29వ గోదా గోవింద గీతం
  • ఇది నారాయణ అష్టాక్షరీ మంత్ర పాశురం

నేపథ్యం:

ఇన్నాళ్లూ పఱై కావాలని గోపికలు కోరుకున్న ప్రస్తావన కనిపిస్తుంది. నిన్న పఱై, అలంకార వస్తువులు, పరమాన్న భోజనం అడిగారు. ఇంతకూ ఆ పఱై ఏమిటి?  పఱై అంటే శ్రీ కృష్ణుని శ్రీచరణాలే కాని మరేదీ కాదు. నీకైంకర్యమే మాకు పరమపురుషార్థం అని గోపికలు చివరకు తేల్చిచెప్పేశారు. భగవంతుడినే పొందడానికి ఈవ్రతము. ముందు భగవత్ సంబంధులతో సంబంధం ఏర్పరచుకోవాలి. శమము దమము అనే గుణాలను అలవర్చుకుని ఆచార్యుని వద్ద సమాశ్రయణం పొందాలి. వారినుంచి మంత్రోపదేశం పొంది, మంత్రార్థము తెలుసుకుని, పురుషకారం కట్టుకొమ్మని అమ్మను ఆశ్రయించాలి.ఆమె ద్వారా స్వామియే ఉపాయమని వారి కటాక్షం సంపాదించాలి. స్వామిని దర్శించి మంగళాశాసనం చేసి, స్వరూపం జ్ఞానం మొదలైనవి కావాలని కరుణించి దయచేయమని అడగాలి. అందుకు కావలసిన అలంకారాలు ఇవ్వమని అడిగి, అవి ధరించి సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడినిచేరి భగవదనుభవం పొందే మార్గాన్ని విధానాలను ప్రక్రియలను 27 పాశురాలలో గోదమ్మ వివరించారు. ప్రధానంగా తెలియవలసిన విషయాలను 28, 29వ పాశురాల్లో చెప్పి, వ్రతఫలం 30 వ పాశురంలో వివరించారా తల్లి
నారాయణనే నమక్కే పఱైతరువాన్ అని నారాయణుడే మనకు పఱ అనే వాయిద్యం ఇస్తారని మొదటి పాశురంలో చెప్పి వ్రతం ఆరంభించారు. ధర్మ అర్థ కామ మోక్షాలలో మొదటి మూడు, నాలుగవ పురుషార్థమును పొందడానికి మెట్లు. భగవత్సేవ రూపంలో భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అందుకే నారాయణుడే ఫలం ఇస్తాడని, నారాయణుడై ఫలమవుతాడని, ఆ ఫలమే పఱై. ఈ మాట 28, 29 పాశురంలో వివరిస్తారు. దానికి ఉపాయము శ్రీకృష్ణుడే అని 28వ పాశురంలో చెప్పారు. ఫలం పొందే అర్హత మనకే ఉన్నదని ఈ రెండు పాశురాల్లో చెప్తున్నారు. భగవానుని పొందడమే ఫలం. పఱై అంటే అదే. భగవంతుడు తప్ప మరొక ఉపాయం ఉందనుకోరాదు. అనుకుంటే అది మురికి (అపరిశుద్ధత), భగవంతుడు ప్రాప్తించిన తరువాత వేరొక ప్రయోజనం అడగడం మరొక అపవిత్రత. భగవంతుని కైంకర్యము తన కోసం అనుకుంటే అది మరొక అపవిత్రత. ఈ అపవిత్రతలన్నీ తొలగించుకోవడమే ఫలశుద్ధి. నీవే ఉపాయమనేది ఒక పరిశుద్ధి. నీవే ఫలమనేది ఫల పరిశుద్ధి. 28 వ పాశురంలో ఉపాయ పరిశుద్ధి, 29 వ పాశురంలో ఫల పరిశుద్ధి ప్రధానం. నోము ఒక మిష, పఱ ఒక మిష. నిజంగా వారికి కావలసింది శ్రీకృష్ణసేవ.

ఈ మిషతో వచ్చి శ్రీ కృష్ణుని లేపి, సింహాసనం మీదకు రప్పించి, మంగళం పాడి, కొన్ని ఉపకరణాలు అడుగుతారు. శ్రీకృష్ణుడు అవి ఇవ్వడానికి సిద్ధమయితే నీవే మాపుణ్యం మాకు పఱై ఇవ్వు చాలంటారు. అది మామూలు పఱ కాదు అని తెలుసుకుని శ్రీకృష్ణుడు మౌనంగా ఉంటాడు. అయ్యో మీరే మా ఉపాయం అని చెప్పి నిత్య కైంకర్యమనే ఫలం ఇవ్వమని అడుగుతారు. జన్మజన్మలకు నీ సాపత్యం, సాంగత్యం, బాంధవ్యం కావాలని అడుగుతున్నారు 29 వ పాశురంలో.

శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై శేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం ఆట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్

శిట్రం శిరుకాలే -తెల్లవారుఝాముకన్నా ముందటి బ్రాహ్మీ ముహూర్తంలో, వందు-వచ్చి ఉన్నైశేవిత్తు – నిన్ను సేవించి,  ఉన్ పొన్ తామరై అడి – నీ అందమైన పాదకమలాలకు, పొట్రుమ్ పొరుళ్, మంగళాశాసనం చేయడానికి గల ప్రయోజనాన్ని, కేళాయ్ – వినాలి, పెట్రమ్ మేయ్ త్తు – పశువులను మేపి, ఉణ్ణుమ్ జీవించే, కులత్తిల్ – యాదవకులంలో, పిఱందు-జనించి, నీ – నీవు, ఎంగళై –మాచే, కుట్రేవల్ ఆంతరంగిక కైంకర్యాన్ని, కొళ్లామల్ పోగాదు- స్వీకరించకుండా ఉండడం తగదు, ఇట్రై – ఈ రోజు, పఱై కొళ్వాన్ అన్ఱు కాణ్ నీవు కరుణించి ప్రసాదిస్తున్న పఱైని తీసుకొనడానికి వచ్చిన వారిమి.  గోవిందా – ఓ గోవిందా, ఎట్రైక్కుమ్ – ఈ కాలమున్నంతవరకు, ఏజేజ్ పిఱవిక్కుమ్-ఏడేడు జన్మలకు, ఉన్ తన్నోడు– నీతోనే, ఉట్రేమే ఆవోమ్ సంబంధం కలిగిన వారై ఉంటాము, ఉనక్కే నీకు మాత్రమే, నామ్ మేము,  ఆట్చెయ్ వోమ్ -దాస్యం చేయాలని కోరుకుంటున్నాము, నమ్– మాయొక్క, మాట్రైకామంగళ్ – తదితర కోరికలు, మాట్రు-పోగొట్టాలి.

ప్రాతః వేళలు మూడు – కాలై, చిరుకాలై, శిట్రం శిరుకాలై.  తామసులు లేచే వేళ కాలై, గోపస్త్రీలు చేలుకుని చల్ల చిలికే వేళ చిరుకాలై, దానికన్న ముందుగా గోపబాలికలు లేచిన వేళ శిట్రం శిరుకాలే. శ్రీకృష్ణుడి వియోగ దుఃఖం అనే చీకటి పోగొట్టడానికి ఉదయించే సూర్యబింబం పోలిన ముఖాన్ని శ్రీకృష్ణుడిని చూడడానికి పోతున్నందున ఇదే ఉదయమైపోయింది. ‘‘ఆవిర్భూతమ్ మహాత్మానా’’ అంటే భగవంతుడు ఆవిర్భవించిన అర్ధరాత్రి కూడా ఉదయకాలమే అవుతుంది.

Also Read : గోదమ్మ పాటకు అన్నమయ్య పదం.. పరమపురుషుడట పశుల గాచెనట

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారి తెనుగు సిరినోము

వేకువనే లేచి నీ కోవెలకె వచ్చి

          నిన్ను సేవించు ఈ నియతి పూని

పొందామర విరుల వోని నీ పదములు

          పాడి మేము గడించు భాగ్యము విను:

గోవుల కాసెడి గొల్ల కులమ్ములో

          పొడమిన నీకు మా పొందు తప్ప

దెట్లును, నేడు నీ విచ్చు ఈ ‘డక్కి’ కై

          కాదు, యుగయుగాలు గడిచి చనిన

ఏ అవతారమ్ములెత్తినన్ తప్పదు

          నిన్నెపొందెద మోయి నీరజాక్ష

మా దాస్యమును నీకె మీదు కట్టితి మోయి

          వేరు కామన్నమమ్ము చేర నీకు

బంగారంవలె ఉన్నాయి, కాని ఆ లోహం వలె కఠినమైనవి కాకుండా తామర పూల వలె మెత్తనివి. వాసనలేని లోహం కాదు, మంచి గంధపు వాసనలు విరజిమ్మేవి అమృతస్యంది అయిన నీ తిరు (శ్రీ) చరణాలను ఎందుకు కోరుతున్నాము. కిరీట ధారణ చేయాలని నీవే స్వయంగా బతిమాలినా అంగీకరించకుండా నీ చరణాలనే సేవిస్తానని లక్ష్మణుడు కోరినాడు. అదే విధంగా మాకూ నీ పాదాలమీదే ప్రియత్వం అధికంగా ఉంది. ‘‘ధనం మదీయం తవ పాద పంకజం’’ అన్నట్టు, ‘‘మీ పాదాలే మాకు ధనం. మాకే ఇతర ప్రయోజనాలూ లేవు. నీ పాదసేవే మా పరమలక్ష్యం. పశువులను మేపుకుని తినే మా కులంలో ఎందుకు పుట్టావు? దీనులైన మమ్మల్ని ఉద్ధరించడానికే కదా? కైంకర్యం చేయకుండా మేముండలేము. మా సేవలను స్వీకరించకుండా నీవూ ఉండలేవు. మా సేవలు వద్దనుకుంటే మరి నీవెందుకు జన్మించావు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది పొందాలి కదా. మాలో ఒకరిని పొందడానికి నీవు వచ్చావు. పశువులను రక్షించడానికి వేరెందరో ఉన్నారు’’ అన్నారు గోపికలు.

‘‘నేను స్వీకరించదలచిన అంతరంగ కైంకర్యాలను నాకు కావలసినపుడు నేను స్వీకరిస్తాను. మీరు వ్రతం చేసిందే పఱై కోసం కదా అదిస్తాను తీసుకువెళ్లండి’’ అని శ్రీ కృష్ణుడు అన్నాడు.

‘‘పఱై కావాలని అన్నాం కాని అది నిజంగా ఉళ్లో వాళ్ల కోసం చెప్పిన నెపం మాత్రమే. మాకు నీవు తప్ప మరేదీ అవసరం లేదు’’ అన్నారు.

‘‘మరి పఱై అంటే ఏమిటని మీ ఉద్దేశం. ఆ పేరుతో మీరు అడుగుతున్నదేమిటి’’ అని శ్రీ కృష్ణుడు అడిగాడు.

‘‘నీవు ఎన్ని అవతారాలెత్తినా, నిన్ను సేవించి కైంకర్యంచేసే భాగ్యం మాకు కావాలి. నీవు దేవుడివైతే దేవతగానూ మానవుడివైతే మానవిగానూ జనించే శ్రీదేవి వలె మేమూ కైంకర్యం చేయాలని కోరుకుంటున్నాం’’ నీవు ఎక్కడ పుడితే అక్కడ మేముండాలి. నీకు తల్లిగా, భర్తగా తండ్రిగా,తమ్ముడిగా బంధువులుగా మేమే ఉండాలి మాకు అన్ని బంధుత్వాలు నీవే కావాలి. సీత భరతుడు నిన్ను కొన్నాళ్లు విడిపోయారు. కాని లక్ష్మణుడి వలె నిన్ను ఎప్పుడూ ఎడబాయకుండా ఉండే భాగ్యం మాకుండాలి. మా ఆనందం కోసం కాదు. మన ఇద్దరి ఆనందం కోసం కూడా కాదు. కేవలం నీ ముఖం ఆనందంతో వికసించడం కోసం నీకే దాస్యం చేస్తామని అంటున్నాం’’ అని గోపికలు అంటున్నారు.

‘‘ఇదికాకుండా మాలో పొడిచూపగల ఇతర కామభావనలన్నీ నీవే పోగొట్టాలి. భోగంలో ఇద్దరూ కలిసి మెలిసి ఉండడంలోఇద్దరికీ ఆనందం సమానంగా ఉంటుంది. కాని భోక్తవైన నీవు మాసేవలతో ఆనందించడాన్ని చూసి మేము సంతోషించాలి’’.

goda govinda geetham tiruppavai 29

నారాయణ మంత్రం

ఉనక్కు లో అకారాన్ని అనుసంధించారు. ఉనక్కే లో ‘ఏ’ కారం వలన ఉపకారం వెల్లడవుతున్నది. నామ్ లో ‘మ’ కారార్థమైన జీవస్వరూపం ఉంది. ఉన్దన్నోడు ఉట్రోమే యావోమ్ అనడంలో ‘నారాయణ’ పదం ఉంది. ఎట్రైక్కుమ్ ఏజేజు పిఱవిక్కుమ్ ఆట్ చెయ్ వోమ్ లో అమ్ మాట ద్వారా చతుర్థి అర్థం చెప్పారు. మట్రైనమ్ కామంగళ్ మాట్రు అనడంలో నమ శబ్దానికి అర్థం చెప్పారు. కనుక ఇది అష్టాక్షరీ మంత్రానికి వివరణ అని సర్వ మంత్ర అర్థాలను గర్భంలో దాచుకున్న పాశురమని అన్నారు. ఆచార్యులు మరో పుట్టుక వద్దన్నారు. కాని ఆండాళ్ పుట్టుక వద్దనలేదు. నీతో పాటు ఏడేడు జన్మలు మళ్లీ పుట్టాలని కోరుకున్నారు. పరమపదం కన్న మోక్షం కన్న నీ తో బంధుత్వం ఉన్న పుట్టుకే కావాలని అంటున్నది ఆండాళమ్మ. అదే ఆమె విశిష్ఠత. అహంకారాన్ని తొలగించడానికి కూడా అతని సాయాన్ని అనుగ్రహాన్ని అర్థించాలి. స్వామికి హృదయానందం కలిగించడమే లక్ష్యం. దానికి మనమే సాధనం. ఎప్పడికీ కైంకర్యం చేస్తున్నామన్న భావనే ఉండాలి.

Also Read : జ్ఞానమనే ఆరని దీపం అమ్మనే వ్రతఫలంగా ఇచ్చిన శ్రీకృష్ణుడు

అజ్ఞానదశపోయి భగవత్ ప్రాప్తిదశ రావడానికి ముందు కాలమట ‌- శిత్తమ్ శిరుకాలము  అంటే. అభిముఖులు అయినతరువాత ఆత్మహితం ఆలోచించడాని అనుకూలమైన సత్వ గుణము కలిగించే మార్గళి మాసం శుక్ల పక్షం. బ్రాహ్మీముహుర్తములో నీరాడడానికి వచ్చాము.

నడిచి వచ్చామని చెప్పుకుంటున్నారు గోపికలు. గుహుడు రాముడిదగ్గరకు వచ్చితే నిషాదరాజా మాకోసం నీవు నడిచి వచ్చావా అని చాలా సంతోషిస్తాడట. మరి మేము కూడా గుహునివలె నడిచి వచ్చాం తెలుసా మమ్మల్ని గుర్తించు అంటున్నారు. సాధారణంగా జన్మవద్దని కోరుకుంటారు. కాని మాకు ఏడు జన్మలిచ్చినా ఫరవాలేదు, కాని ప్రతి జన్మలోనూ నీతో బాంధవ్యం, నీ సేవాభాగ్యం కావాలి అంటారు.  నారాయణుడు ఏ అవతారం ఎత్తినా లక్ష్మీ తాయారు, వెంట వస్తుందట. రాముడైతే సీత, కృష్ణుడైతే రుక్మిణి, మనిషి అయితే మనిషి దేవుడైతే దేవత అయి వచ్చినట్టు, మాకూ ఏదో రూపం ఇచ్చి రప్పించుకోవాలి.

జీయర్ స్వామి వ్యాఖ్య

జీయర్ స్వామి వారి వాఖ్యానం ఇది: గోపీజనులతో వచ్చిన ఆండాళ్ తన మూల కోరిక ఏమిటో వివరించిన పాశురం ఇది.”శిత్తుమ్ శిఱుకాలే” ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో “వంద్” మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృషేకదా. “ఉన్నైచ్చేవిత్తు” అన్నీ నీవు చేసినవాడివి, శబరి వంటి వారిని నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవారమని చెప్పగల్గితే, ఇది రాగ ప్రయుక్తం. “ఉన్ పొత్తామరై యడియే పోట్రుం” నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.

goda govinda geetham tiruppavai 29

“ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్ధకం సేవాయ” ఈ లోకంలో అల్పమైన పురుషార్థం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీళ్ల వాళ్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. “నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి” సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటానికి వచ్చాం అని చెప్పారు. ఏమీ విననట్టు సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్లనే చూస్తున్నాడు.”పొరుళ్ కేళాయ్” మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతున్నారు గోదమ్మ. “పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు” మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, “నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు” నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరం అని అన్నారుకదా ఇదిగో అని అవన్నీ అక్కడ పెట్టాడు.

Also Read : దేవకి, యశోద ‌- దివ్యమైన నారాయణ మంత్రాలు

“ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!” మేం ఏదో ఒకటి అడగాలని అది అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

“ఎత్తెక్కుం” ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్థల యందు, “ఏజేజ్ పిఱవిక్కుం” ఏడేడు జన్మలలో కూడా ‘‘ఉన్ తన్నోడుత్తోమేయావోమ్’’ నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి “ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్” కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.
నీవే కావాలని నీతో సంబంధబాంధవ్యమే కావాలని గోదాదేవి నిర్ద్వంద్వంగా చెప్పడంతో అందరికీ వ్రతఫలితం దక్కింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే శ్రీకృష్ణుడు వివాహమాడిన రోజు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక ఈ రోజు”భోగి” అని శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వివరించారు.

Also Read : జ్ఞానదశనుంచి ప్రేమాతిశయంతో భక్తి దశలోకి….

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles