Wednesday, May 1, 2024

దేశాన్నిఅబద్ధాల ప్రచార కేంద్రంగా మార్చకండి!

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అబద్ధాల ప్రచారం పెరిగింది’- అని జనంలో ఒక అభిప్రాయం ఉంది-నిజానికి అది నిజమే అయినా, మనువాదులు కొన్ని శతాబ్దాల  క్రితమే ఆ పని ప్రారంభించారు. బౌద్ధ, జైన ఆలోచనా విధానాల్ని నాశనం చేసే క్రమంలో దేశంలో ఎన్నెన్ని అఘాయిత్యాలు చేశార, ఎన్నెన్ని అబద్ధాల్ని పురాణాలుగా మలిచారో నిశితంగా విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. వారు ప్రచారం చేసిన అబద్ధాల సుడిలో కొట్టుకుపోతే ఏవీ అర్థం కావు. ఆ ప్రవాహానికి  ఎదురు నిలిచి, అవగాహన పెంచుకుని, ఒక విహంగ వీక్షణంలా అన్ని విషయాలు ఆకళింపు చేసుకుని గమనిస్తే గాని….విషయం బోధపడదు. గడుస్తున్న ఇప్పటి కాలం మరీ మరీ గడ్డు కాలం. కరోనా వైరస్ ఎలాగయితే వీరవిహారం చేస్తోందో, అంతకు మించి అధికార పార్టీ నిర్వహిస్తున్న ఐటీ సెల్ ఎన్నెన్నో  అబద్ధపు వైరస్ లని సమాజంపైకి పంపుతోంది. పైన  నిర్ణయాలు తీసుకునేవారు ఎలాగుంటే, కిందున్న మామూలు జనం కూడా అలాగే ఉంటారు. పైన ఉన్నవారిని అనుకరిస్తుంటారు. నిజాయితీ, నిబద్ధతా లేక, తమ పని జరిగితే చాలునన్నట్లు తయారవుతుంటారు. సమాజంలో వీరి సంఖ్య పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం.

Also read: ప్రపంచ నాస్తిక సభలు జరిపిన – గోరా

ఎవరెవరో తాగి బండ్లు నడుపుతున్నారు. ప్రమాదాలు జరిగి, సంబంధం లేనివారు చనిపోతున్నారు. చట్టాల్లో లోపాలు, లాలూచీ పడే అధికారులు, లిక్కర్ అమ్మకాలతోనే నిలబడుతున్న ప్రభుత్వ ఖజానాలు…అమాయకుల చావులకు బాధ్యులెవరూ? అని ప్రశ్నిస్తే సమాధానం సూటిగా రాదు. ఇదీ అలాంటిదే – అసత్య ప్రచారాలతో జనం ఆలోచనల్ని భ్రష్టు పట్టిస్తున్నవారు దేశ ప్రతిష్ఠ, దేశ ప్రజల ప్రతిష్ఠ దిగజారిపోతున్న విషయం పట్టించుకోరు. స్విచ్ ఎక్కడో వేస్తే, లైటు ఎక్కడో వెలిగినట్టు- వీళ్ళు చేసే అబద్ధ ప్రచారాల ఫలితం భవిష్యత్ తరాల మీద బలంగా ఉండబోతోంది. అందుకని, సత్వరం జాగ్రత్త వహించాల్సి ఉంది. అబద్ధాన్ని అబద్ధమని విసుగులేకుండా చెప్పాల్సి ఉంది. తప్పదు! ఇలాంటి వారిని ఎవరూ అడ్డుకోక వదిలేస్తే భవిష్యత్తు అంధకారమౌతుంది. రాబోయే ప్రమాదాన్ని పసి గట్టి సామాన్య పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ప్రజాసంకల్పం ముందు, ప్రజాబలం ముందు ఏ ప్రభుత్వాలూ నిలవవు. ప్రతిఘటిస్తూ, ప్రపంచానికి ఉద్యమస్ఫూర్తిని తెలియజెప్పిన మన రైతు ఉద్యమకారుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరికివారు వారివారి లక్ష్య సాధన దిశగా సాగిపోవాలి. ప్రజల్లో మార్పు వస్తే, వ్యవస్థలు, ప్రభుత్వాలు అవే మారతాయి.

Also read: దేశాన్ని నగ్నంగా నడిపించినవారు మన పాలకులా?

రైట్ బ్రదర్స్, వారు కనిపెట్టిన విమానం

భారతీయ బ్రాహ్మణ సంస్కృత పండితుడు శివకర్ బాపూజీ తల్ పడే (1864-1916) మహారాష్ట్ర పౌరుడు. 1895లో అతను మానవ రహిత విమానాన్ని మెర్క్యూరీ ఇంజన్ తో 1500 అడుగుల ఎత్తులో నడిపించాడని ప్రచారం చేశారు. ఇది రైట్ బ్రదర్స్ కనిపెట్టిన దానికన్నా ఎనిమిదేండ్లు ముందని ఢంకా బజాయించారు. దానికి తల్ పడే ‘మారుత్ సఖీ’ అని పేరు పెట్టాడని చెపుతారు. మారుతి అంటే గాలి. సఖా అంటే స్నేహితుడు. ఆ విమానాన్ని ఆయన రుగ్వేదం 96.2లోని విషయాల ఆధారంగా తయారు చేశాడని చెపుతారు. ముంబాయిలో బరోడా మహారాజు తన ఆస్థాన సభ్యులతో కొలువుదీరి ఉండగా తల్ పడే తన విమానాన్ని గాల్లో నడిపించాడని, మళ్ళీ సురక్షితంగా నేలపైకి తీసుకొచ్చాడనీ చెప్పుకుంటారు. దురదృష్టవశాత్తు బ్రిటీష్ వారు ఆ కుటుంబాన్ని వేరు వేరు కేసులలో ఇరికించి చంపేశారనీ…దానితో  ఆ విమాన పరిజ్ఞానం మనకు దక్కలేదనీ ఎస్పీహెచ్ నిత్యానంద పరమశివం వివరణ ఇచ్చారు. ఆక్సిజన్,   హైడ్రోజన్ ల కలయికతో నీరు ఏర్పడిందన్న ప్రాథమిక సమాచారమే వేదాలలో లేనప్పుడు, విమాన తయారీ గూర్చి ఉందని అంటే ఎలా నమ్మడం? తల్ పడే గొప్పదనాన్ని భరించలేక ఆ కుటుంబాన్ని, ఆ పరిజ్ఞానాన్ని బ్రిటీషువారు నాశనం చేసిందే నిజమయితే – బ్రిటీషు పాలనలోనే సి.వి. రామన్, విశ్వకవి టాగూర్ నోబెల్ సాధించారు కదా? ఎంతో మంది వైజ్ఞానికులు బ్రిటన్ వెళ్ళి పరిశోధనలు చేశారు. గాంధీ, నెహ్రూలతో సహా ఎంతోమంది బారిస్టర్లయ్యారు. వీరందరికన్నా తల్ పడే గొప్పోడని అనుకునే వీరి కహానీలు నమ్మాలా?

Also read: వాస్తవిక సృజనకారుడు మున్షీ ప్రేమ్ చంద్

మైక్రోస్కోపు ఆవిష్కరించక పూర్వమే ఫలదీకరణ, పిండోత్పత్తిపై ప్రాచీన భారత దేశంలో అవగాహన ఉందని ఒక అబద్ధానికి తెరలేపారు. ఆ విషయాలకు సంబంధించిన శిల్పాలు తమిళనాడులోని కాలభైరవనాథ ఆలయంలో లభించాయనీ, అవి సుమారు వెయ్యేండ్ల క్రితంవనీ చెప్తారు. అయితే వెయ్యేళ్ళ క్రితం అంటే 1021 సి.ఇలో భారత దేశ పరిస్థితి ఎలా ఉందో ఒక సారి గమనించాలి. కామన్ ఎరా 1001-1027మధ్య కాలంలో వరుసగా మహ్మద్ గజనీ భారత దేశంపై దండయాత్రలు చేస్తున్నాడు. అప్పటికి 500 ఏళ్ళకు ముందే అంటే 500 సి.ఇ. వరకే గుప్తరాజులు పూర్తిగా పతనమైపోయారు. ఉత్తరాన పశ్చిమ దిశ నుండి దండెత్తి వస్తున్న ఆ ముస్లిం చొరబాటుదారులను ఎదుర్కునే స్వతంత్ర ప్రతిపత్తి గల రాజు ఆ కాలంలో ఎవరూ లేరు. ఇక దక్షిణాన పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు పరిపాల సాగిస్తూ ఉండేవారు. ఎంత సేపటికి తమ రాజ్యాల్ని ఇతరుల నుండి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారే గాని, వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది, పురుషుల వీర్యకణాల గూర్చి, స్త్రీల అండాల గూర్చి, ఫలదీకరణ గూర్చి, పిండ దశ గూర్చి ఏ భారతీయులు అధ్యయనం చేశారూ? మైక్రోస్కోపు లేనిది అలాంటి అధ్యయనాలకు వీలేలేదు. అప్పటికి  సూక్ష్మదర్శిని ప్రపంచంలోనే లేదు. అయితే, సూక్ష్మంగా ఉండే ఆ జీవకణాల్ని నాటి రుషులు తమ ‘దివ్యదృష్టి’తో చూశారా? ఏమో- చెవిలో పువ్వు పెట్టుకున్నవాళ్ళు ఏమైనా చెప్పగలరు. మూఢ విశ్వాసంలో మునిగి ఉన్నవారు దేనినైనా నమ్మగలరు.

ఆంటన్ వాన్ లీవెన్ హాక్

మైక్రోస్కోప్ కు రూపకల్పన చేసిన అంటన్ వాన్ లీవెన్ హాక్ అనే డచ్ శాస్త్రవేత్త జీవించిన కాలం 1632-1723 సి.ఇ. అయినప్పుడు భారతీయులకు వెయ్యేళ్ళ క్రితమే సూక్ష్మదర్శిని ఎక్కడిది? ఆలోచిస్తే పొయ్యేదేముంది – అజ్ఞానం తప్ప? ఇదే కాదు, ఇలాంటివి ఇంకెన్నో అద్భుతాలు కేవలం భారత దేశంలోనే జరుగుతాయి. ప్రపంచంలో మొదటి సైకిల్ ఇక్కడే తయారయ్యిందని,  శివపార్వతులు ‘లొడో’ ఆట ఇక్కడే ఆడారని వాటి తాలూకు శిల్పాలు ఫలానా  ఫలానా ఆలయాల గోడల మీద చెక్కి ఉన్నాయని మనువాదులు దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే గెలీలియో టెలిస్కోపు 1609లో కనిపెడితే, దానికంటే ముందే 12వ శతాబ్దంలో దేశంలో టెలిస్కోపు ఉందనీ, దాని శిల్పాలు కర్నాటక హళైబీడు ఆలయంలో ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అలాంటిదే మరొకటి – 4 వేల ఏళ్ళ క్రితం, ఆగత్స్యుడు విద్యుత్తున కనిపెట్టాడని చెప్పే దేశభక్తులున్నారు. సరే. ఒక్క క్షణం ఒప్పుకుందాం. కానీ, ఆ కాలంలో విద్యత్తు ఏయే ప్రాంతాలకు సరఫరా చేశారో చెప్పాలి! పైగా ఆ విద్యుత్ తీగలు ఎలా తయారు చేశారో కూడా చెప్పాలి. జంతువుల్ని బలి ఇచ్చినప్పుడు ఆ జంతువుల మెడనరాలో లేక తోక  నరాలో తీసి వాటితో విద్యుత్ తీగలు తయారు చేశారా? ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్ కు సంబంధించి సమాచారమంతా మనదగ్గరుంది. తీగలు ఏయే లోహాలతో తయారవుతున్నాయో కూడా తెలుసు. ఏది ఎంత ఓల్టేజో తెలుసు. మరి అప్పటి వివరాలు ప్రకటించాలి కదా? వాస్తవానికి ఆధారాలుంటాయి కానీ అబద్ధాలకెక్కడ?

కాళీయమర్జనలయొేల

శ్రీకృష్ణుడి ‘కాళీయమర్ధనం’ గురించి కల్పిత కథల్లో వినడమే తప్ప అందుకు  ప్రాచీన శిల్పాల్లో, కట్టడాల్లో ఏ ఆధారాలూ లేవు. ఆధునిక చిత్రకారులు గీసిన చిత్రాలలో మాత్రం నాగుపాము పడగమీద శ్రీకృష్ణుడు నిలబడి వేణువు ఊదుతూ ఉండడం…చుట్టూ గోపికలు ఆయనను స్తుతిస్తూ, నమస్కరిస్తూ నిలబడడం కనిపిస్తుంది. అది మార్పులు చేర్పులు చేసుకున్న ఊహాచిత్రం – అని తెలుస్తూ ఉంది. అయితే, బార్ హుత్-ప్రసేన్ జిత్ స్తంభంపై చెక్కిన ‘కాలీయ దమన్’- వెలుగులోకి వచ్చింది. అందులో ధర్మబోధ చేస్తున్న బుద్ధుడు ఒక నాగుపాము పడగ మీద కొంచెం ఎత్తులో నిలబడి ఉంటాడు. రాజవంశీయులు, పురప్రముఖులు అందరూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటారు. నేపథ్యంలో ఒక పెద్ద వృక్షం, పెద్ద పెద్ద ఆకులూ చెక్కి ఉంటాయి. బుద్ధుడు రాజ్యాన్ని వదిలేసినా, ప్రజలు ఆయనను నాగవంశీయుల మహానాయకుడిగా ఆరాధించుకున్నారు. అత్యున్నత స్థానంలో నిలుపుకున్నారు. ఆ శిల్పం ఆ విషయాన్నే ప్రతిబింబించింది. శ్రీకృష్ణుడు కూడా నాగవంశీయుల మహానాయకుడే అని-వేద సంస్కృతిలో భాగమైన కల్పిత కావ్యాల్లో రాసుకున్నారు. కృష్ణుడు కల్పిత పాత్ర అయితే, బుద్ధుడు చారిత్రక పురుషుడు. ఆ తేడాను మనం అర్థం చేసుకోవాలి!

Also read: దేవనూరు మహదేవ: దేశంలో ఒక  సంచలనం!

కృష్ణుడు మరెవరో కాదు, మనువాదులు మార్చుకున్న బుద్ధుడే అని మధుర తవ్వకాల్లో బయటపడింది. అక్కడి తవ్వకాల్లో సుమారు నాలుగు వేల బౌద్ధ ప్రతిమలు, ధమ్మచక్రాలు మొదలైనవి లభించాయి. మధుర, కనిష్కుడు పరిపాలించిన ప్రాంతం. అతడు బౌద్ధం స్వీకరించిన సమ్రాట్టు. అందువల్ల, లభించిన ఆధారాలన్నీ బౌద్ధానికి సంబంధించినవే కావడంలో ఆశ్చర్యంలేదు. అయితే, బుద్ధుణ్ణి శ్రీకృష్ణుడిగా మార్చుకుని, కథలల్లుకున్నది మాత్రం తర్వాతి కాలంలోని బ్రాహ్మణ పండితులు. బుద్ధుడి ధమ్మచక్రాన్ని మార్చి, కృష్ణుడికి సుదర్శన చక్రం చేశారు. బుద్ధుడి ధమ్మచక్రం శాంతి, అహింస, నైతికతల ప్రచారానికైతే – మార్చుకున్న శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శత్రుసంహారానికని కథల్లో రాసుకున్నారు. బుద్దుడు నాగవంశానికి తలమానికమైనవాడు – అని గుర్తుంచుకున్నవారికి విషయం బోధపడుతుంది. బంకించంద్ర ఛటోపాధ్యాయ తన ‘రచన బోలి కి సమ్య’లో బ్రాహ్మణులు ఎన్నో తప్పుడు కథనాలు, కావ్యాలు, మహాకావ్యాలుగా రాసి, ప్రచారం చేసి – బ్రాహ్మణేతరులను ఇక్కట్లపాలు చేసినట్టు-రాశారు. పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘ఓల్గా సే గంగా’లో ఈ విషయాలు చాలా వివరంగా రాశారు. మనువాదులు ప్రచారం చేసిన తప్పుడు విషయాలనే మనం ఇంకా సంస్కృతీ సంప్రదాయాల పేరుతో నెత్తిన మోస్తున్నాం.

ఇలా సంస్కృతీసంప్రదాయాల పేరుమీద ఇంగిత జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నాం. వైజ్ఞానిక అవగాహనను చంపుకుంటున్నాం. మట్టి బొమ్మల్ని, టెర్రకోట ప్రతిమల్ని లేదా ఇటీవలి కాలంలో చెక్కిన శిల్పాల్ని చూపుతూ అవి బీసీఏ కాలంనాటివనో, లేదా కామన్ ఎరా మొదటి దశాబ్దం కాలంనాటివనో – చెప్పుకోవడంలో అర్థం లేదు. ఆత్మద్రోహానికీ, అబద్ధాలకూ అలవాటుపడితే నిజాలు రుచిచవు. వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలు మాట్లాడితేనే ఎదుటివారి దగ్గరైనా, ఇతర దేశాల్లోనైనా గౌరవం దక్కుతుంది. అబద్ధాలతో మన హుందాతనాన్ని నమే చిదిమేసుకుంటున్నామన్న విషయం – దేశ ప్రధాని నుండి సామాన్య పౌరుడి దాకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం!

Also read: మ్యాన్ వర్సెస్ వైల్డ్

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles