Thursday, April 18, 2024

ఫేక్ వర్సెస్ రియల్

అబద్ధం – మందబలంతో అధికారంలో ఉన్నప్పుడు మనం వింటున్నది, చూస్తున్నది అబద్ధమా? నిజమా? అని తేల్చుకోలేక సతమతమౌతున్నాం. అబద్ధాలు విస్తృతంగా వ్యాపింపజేస్తున్న ఈ కాలంలో వాస్తవాల్ని గుర్తించడం సామాన్యుడికి కష్టమవుతూ ఉంది. పీల్చే గాలి, తాగేనీరు, తినే తిండీ అన్ని కలుషితమై పోతున్నప్పుడు శుభ్రమైన గాలి, ఆహారం సంపాదించుకోవడం తలకు మించిన భారమే కదా? ప్రజలు నైతికతకు  కట్టుబడి ఉన్నప్పుడు పై వాటిని కాలుష్యాలకు దూరంగా ఉంచుకోవచ్చు. ప్రజలే అనైతికతతో కలుషితమైపోయినప్పుడు…గాలి, నీరు, ఆహారమే కాదు, వారు ఎన్నుకునే నాయకులు కూడా ఆ స్థాయిలోనే అలాగే ఉంటారు. అందువల్ల రాజకీయ నాయకులు చెప్పే మాటలు, చేసే చేతలు అన్నీ కలుషితమయ్యే ఉంటున్నాయి. స్వచ్ఛత, నిజాయితీ, నిబద్ధతా లోపించినపుడు అధికారంలో కొనసాగడానికి నాయకులు ఇక అబద్ధాలనే ఆశ్రయిస్తున్నారు. యోగ గురించి, ఆధ్యాత్మికత గురించి ఉపన్యాసాలిస్తూ జనాన్ని శాశ్వతంగా సమాధిలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం!

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో లక్ష్మి కథ

‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’- పథకంలో ఇరవైనాలుగు లక్షలమందికి పక్కా ఇండ్లు లభించాయని ఒక ఇంగ్లీషు జాతీయ వార్తాపత్రికలో పూర్తి పేజీ ప్రకటన వెలువడింది. అందులో ఒక వైపు అక్ష్మి అనే మహిళ ఫోటో మారో వైపు ప్రధాని ఫొటో ప్రచురించారు. అది చూసి, విషయం నిర్థారించుకుందామని ఒక మహిళా వీడియో జర్నలిస్ట్ ఆ లక్ష్మి అనే మహిళను వెతుక్కంటూ వెళ్ళింది. లక్ష్మి అనే ఆ మహిళ చిన్న గుడిసెలో నెలకు ఐదు వందల అద్దె చెల్లిస్తూ ఉంటోంది. గంగా నది ఒడ్డున బాబూఘాట్ ల పది రోజులు పనికి వెళ్ళానని…అప్పుడు తన ఫొటో ఎవరు తీశారో, ఎప్పుడు తీశారో తనకు తెలియదని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన ఆ ప్రభుత్వ ప్రకటన ఒక పెద్ద అబద్ధమని – ఆ శ్రామిక మహిళ స్పష్టం చేసింది. దేశ నాయకులు, ప్రభుత్వం తాము భ్రమల్లో బతుకుతూ దేశ ప్రజలను భ్రమల్లో ముంచాలని ఎలా ప్రయత్నిస్తున్నారో ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది.

Also read: మాల్గుడి సృష్టికర్త ఆర్. కె. నారాయణ్

పశ్చిమ బెంగాల్ భవనాలు చూపించి యూపీలో ప్రచారం

ఇలాంటి అసత్య ప్రకటనలకు లెక్క లేదు కాని, ఉదాహరణకు రెండు, మూడు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. పశ్చిమబెంగాల్ లోని ఎత్తయిన భవనాల ఫొటోలు చూపి, ఆ అభివృద్ధి ఉత్తరప్రదేశ్ లో జరిగినట్లుగా ఆ రాష్ట్రప్రభుత్వం తమ ముఖ్యమంత్రి ఫొటోతో సహా – టముకు వేసుకుంది. ఆ ప్రభుత్వ ప్రకటన హిందీ, ఇంగ్లీషు జాతీయ దిన పత్రికలలో వచ్చింది. బీజేపీ అసత్య ప్రచారాలకు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ ఒక మంచి ఉదాహరణ. మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఫొటోని పెట్టుకుని దాన్ని ఉత్తర ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ ప్రజల నీటీ అవసరాల కోసం నిర్మించిన కొత్త ప్రాజెక్ట్ గా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకూ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఆవు-ఆక్సిజన్, ఆవు మూత్రం – ఆవు పేడల గుణగణాల్ని ప్రమోట్ చేయడానికే తెగ ఆయాస పడిపోతున్న ఈ ప్రభుత్వానికి అంత ‘విజన్’ ఉంటుందా? దేశ ప్రజల దురాశ గానీ-

Also read: శాస్త్రవేత్తల్లో మతవిశ్వాసాలు

అగ్రవర్ణాలవారు ఆవుల్ని మేపుతారా?

దేశవ్యాప్తంగా పవిత్రులైన అగ్రవర్ణంవారు ఎక్కడైనా ఆవుల్ని మేపుతూ కనిపించారా? వాటి పాలన పోషణల బాధ్యత తీసుకున్నారా? ఆవుల పటాలు ఇళ్ళలో పెట్టుకుని, కుంకుమ జల్లినందువల్ల వారిని ‘గోరక్షకులు’ – అని అనాలా? పశుపోషణ సమాజంలో ఇతర వర్గాల వారు చేస్తున్నారు. వారే గోరక్షకులు, వారే పశురక్షకులు. మనుషుల మలమూత్రాల్ని శుభ్రం చేసి, మొత్తం సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేవాళ్ళను అంటరానివాళ్ళని ముద్దవేశారు. ఆవుమూత్రరం తాగుతూ, దాని పేడతినే వారు పవిత్రుడయిపొయ్యాడా?  భవ్యభారతం అంటే ఇదేనా? ‘జైశ్రీరామ్- అంటూ నినాదాలు చేస్తూ, ముస్లింలను చంపేయడం జరుగుతోంది.

Also read: మా‘నవ’వాదానికి వెన్నెముక – సైన్స్

దళితులు గుడిలోకి వస్తే తన్ని తగలేస్తున్నారుగా?

దళితుల గుళ్ళలోకి వస్తే తన్ని తగలేయడం, బహిరంగంగా కత్తులు తళతళలాడిస్తూ దాడులు చేయడం హిందూత్వకాదా? ధార్మిక హింస అని ఎందుకు అనకూడదు? – అని ప్రజల్లో అధిక సంఖ్యాకులు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఐసిస్ – బోకోహరమ్ ల వంటి తీవ్రవాదులకూ వీరికీ తేడా ఏమిటీ?’- అని ప్రతిపక్షంలో ఉన్న దేశ నాయకులు ప్రశ్నిస్తుంటే – అధికారంలో ఉండి కూడా సమాధానం చెప్పే బాధ్యత లేదా?సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడేవారికి కనీస సంస్కారమైనా ఉండాలి కదా? ‘‘అంబేడ్కర్, పెరియార్లను అనేసరించేవారు అంతర్జాతీయ తీవ్రవాదులు’- అని అన్నాడు పతంజలి రామ్ దేవ్. ఎందుకు అలా అనగలిగాడూ అంటే తన వెనక కేంద్రప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న ధీమానే కదా? అలాంటివాణ్ణి వెంటనే శిక్షించకపోవడం వల్ల – అంబేడ్కర్, పెరియార్లకు వచ్చిన నష్టం లేదు. వారి ఆలోచనా ధోరణిని బలపరుస్తున్న అశేష జనవాహినికీ నష్టం లేదు. ప్రజల దృష్టిలోవిలువ తగ్గించుకున్న ప్రభుత్వానికే నష్టం! ఇకపోతే సందర్భం వచ్చింది గనుక, ఇక్కడ మరొక విశేషం చెప్పుకోవాలి. అదేమంటే అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఈ సారి మన దేశం నుండి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం గూర్చి తెలుసుకుంటే  నోబెల్ కాస్తా గోల్ మాల్ అవుతుంది. ఆయన ఏం ప్రతిపాదించారంటే-‘గోమూత్రం – గోవు పేడ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను తప్పక పటిష్ఠపరుస్తాయని’ సిద్ధాంతీకరించారు!

Also read: జీవ-జీవన రహస్యాలు

మానవజాతి నశించి పోయేది నైతిక విలువల పతనం వల్లనే

‘‘భవిష్యత్తులో మానవజాతి నశించి పోవడమంటూ జరిగితే అది అణుబాంబుల వల్లనో, అంటురోగాల వల్లనో కాదు. నైతిక విలువల పతనం వల్ల మాత్రమే!’’- అని అన్నారు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్. ఇది తేలికగా తీసి పారేయాల్సిన విషయం కాదు. ఎవరికి వారు, వారి వారి నైతికతను బేరీజు వేసుకోవాల్సిన తరుణం. ప్రస్తుత ప్రభుత్వ పెద్దల నైతికత గురించి దేశ ప్రజలకు తెలిసిందే! ‘నువ్వు చరిత్రను సృష్టించలేనప్పుడు అధికార బలంతో చరిత్రను మార్చేయ్-’ అనేది నేటి ప్రభుత్వ విధానం. అందుకే చూడండి. విద్యాలయాల్లో పుస్తకాలు, సిలబస్ లు మారుస్తున్నారు. వారు నమ్మిన చరిత్రను దేశంమీద రుద్దుతున్నారు. ఏకంగా మూఢత్వానికి రహదారులు వేస్తున్నారు. నటుడు నాసిరుద్దీన్ షా (ముస్లిం) శివాజీగా నటించడం, నటుడు ఓంపురి (హిందు) ఔరంగజీబ్ గా నటించడం ఈ దేశంలో జరిగింది.సామాన్య ప్రజలలో ఆ కలయిక, ఆ సుహృద్భావం, ఆ అలాయ్ బలాయ్ అలాగే ఉంది.  మత విద్వేషాలు లేకుండా గౌరవభావంతో మెలిగేవారు. అప్పుడు పార్లమెంటులో పువ్వు గుర్తు సభ్యులు ఇద్దరే ఉండేవారు. ఇప్పుడు వారి మందబలం పెరిగింది. ఫలితంగా, మతాల మధ్య అడ్డుగోడలు లేపి జనాన్ని విడదీస్తున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలు మునిగిపోతున్నా వారికి ఏం పట్టడం లేదు. హాలీవుడ్ నిమా ‘టైటానిక్’ చాలా మంది చూసే ఉంటారు. అందులో టైటానిక్ అనే పేరుగల నౌక సముద్రంలో మునిగిపోతుంటే, కొందరు సంగీతంలో తేలిపోతూ ఉంటారు. దేశం అన్ని రకాలుగా కృంగిపోతున్నా, పువ్వు గుర్తు దేశభక్తలు తమ గొప్పదనానికి తామే పొంగిపోతున్నారు.

Also read: మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి

మతాలలో అసంబద్ధత

మతాలలో ఉన్న అసంబద్ధత గూర్చి, అబద్ధాల గూర్చి ఎన్నెన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని చూద్దాం! భర్త లేకుండా మేరీ మగబిడ్డకు ఎలా జన్మనిచ్చింది? ఏసు మగవాడయితే అతనిలోని ‘వై‘ క్రోమోజోమ్ ఎవరిది? సరే. అది అలా ఉండనిచ్చి విష్ణువు సంగతి చూద్దాం. తొలుత విష్ణు స్త్రీగా ఉన్నప్పుడు ఆ అందానికి శివుడు ఆకర్షితుడై పరవశించి శారీకరంగా కలుస్తాడు. ఫలితంగా గర్భం దాల్చిన విష్ణు బ్రహ్మకు జన్మనిస్తాడు. (శ్రీవాయు మహాపురాణం, పూర్వార్థ: పేజి. 229). దేవుడి పటాలలో కూడా ఈ విషయం కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువు పవళించి ఉంటాడు. అతని బొడ్డు నుండి ఒక కమలం వువ్వు కాడపైకి ఆకాశంలోకి దూసుకు వెళ్తుంది. ఆ పువ్వులో బ్రహ్మకూర్చుని ఉంటాడు. విష్ణు బొడ్డులోంచి బ్రహ్మపుట్టినట్టుగా చిత్రించి ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఎవరిదీ బాధ్యత లేదు – ఇలాంటి అబద్ధాలను సమర్థిస్తూ జనాన్ని ఇంకా ఇంకా మూర్ఖులుగా తయారు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని బాలీవుడ్ సినిమా నటుడు, అటల్ బిహారీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పని చేసిన బీజేపీ నాయకుడు శతృఘ్న సిన్హానే ఇలా అన్నారు – ‘‘రాముని పేరు చెప్పి వీధుల్లో బిచ్చగాళ్లు కూడా అడుక్కుంటారు. దమ్ముంటే చేసిన పనులు చూపి ఓట్లు అడగంగి! అయోధ్య రామాలయం పేరు చెప్పి కాదు-’’ అని విమర్శలు గుప్పిస్తే ఎవరూ నోరెత్తలేదు.

Also read: ‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?

ఒక్క చాయ్ చాలు!!

అదే మాట ప్రతిపక్షంలోని వారంటే దాన్ని పెద్ద రచ్చ చేసేవారు. పైన చైనాలో, కింద శ్రీలంకలో, ఇటు పాకిస్తాన్ లో, దానిపైన అరబ్ దేశాల్లో, అటు పక్క యూరోప్ దేశాల్లో, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో అంతటా మన పువ్వు గుర్తు పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక దేశభక్తుడు అన్నాడు. అతడు అలా ఎందుకన్నాడబ్బా  అని ఆలోచిస్తే ఒక విషయం తడుతుంది. ఒకే దేశం కాబట్టి ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆలోచనాధోరణి ఉండాలని మన నాయకులు అంటున్నారు కదా! ఇదీ అలాంటిదే-ఒకే ప్రపంచం కాబట్టి ఒకే ప్రభుత్వం ఉండాలని ఎందుకు అనుకోకూడదు? ఒకే ప్రభుత్వం-ఒకే మతం/ ఒకే మతం – ఒకే నాయకుడు/ ఒకే నాయకుడు – ఒకటే మన్ కి బాత్/ ఒకటే మన్ కి బాత్-ప్రపంచానికంతటికీ ఒక్క చాయ్ చాలు!!

Also read: చరిత్ర అంటే కొందరికి ఎందుకు భయం?

భారత్ ను అమెరికా రెండు వందల ఏళ్ళు పాలించిందట!

‘‘భారత్ ను అమెరికా రెండు వందల ఏళ్ళు పరిపాలించింది. అలాంటి దేశం ఇప్పుడు కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది,’’ అని అన్నాడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్. ‘‘ప్రతి ఒక్క భారతీయుణ్ణి మోది కాపాడుతున్నాడు’’- అని కూడా అన్నాడు. ఇది 2021 మార్చ్ 22 నాటి మాట. ‘‘తల్లి యశోదా కృష్ణుడితో రాసలీలలాడేది’’-  అని అన్నాడు జగ్గీవాసుదేవ్. ఇతణ్ణి ఒక మానసిక రోగి అని అనకుండా ఎవరైనా ఉండగలరా? తనకు తానే జగద్గురువునని డప్పు వాయించుకోగానే సరిపోదు. ‘వీడి మెదడు కాస్త నడి సెంటర్లోనే ఉంది’- అని జనాలకు అనిపించాలి. అటు రాజకీయ నాయకులు, ఇటు ఆధ్యాత్మిక గురువులు ఎంత అసంగతంగా, ఎంత అసంబద్ధంగా ఎన్నెన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారో సామాన్య ప్రజలు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మాట్లాడేది కల్పిత పాత్రల గురించి అయినా, వాస్తవ పరిస్థితుల గురించి అయినా అందులో నిజమెంత? అనేది ప్రజలు బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిస్థితులను గమనించే –జర్మన్ సోషలిస్టు రాజకీయవేత్త, రచయిత, వక్త అయిన ఆగస్ట్ బాబెల్ ఇలా అన్నారు,‘‘ ప్రజలు-వాస్తవమైన ఆనందమేమిటో గ్రహించిన రోజున, ఆ ఆనందాన్ని పొందడం సాధ్యమేనని తెలుసుకున్న రోజున మతం అదృశ్యమౌతుంది! అయితే పాలకవర్గాలు తమ ప్రయోజనాల రీత్యా – ప్రజలు  ఆ విషయం తెలుసుకోకుండా అడ్డగిస్తుటారు! తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఉపయోగిస్తుంటారు.’’ ‘‘ఇదెప్పుడూ? వంద ఇరవై యేళ్ళ క్రితం చెప్పిన మాట! మనిషి ఒక వైపు వైజ్ఞానికంగా ఎదుగుతూ ఉంటే…మరొక వైపు నైతికంగా పతనమౌతున్నాడు. అందుకే అబద్దానికీ నిజానికీ నిరంతరం భీకరపోరాటం జరుగుతూ ఉంది. అందుకే, ఆలోచనల్లో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం.

Also read: సైన్స్ ఫిక్షన్ మాంత్రికుడు – అసిమోవ్

(జూన్ 21, వరల్డ్ హ్యూమనిస్ట్ డే)

(రచయిత ప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles