Saturday, April 27, 2024

నవతరం రాజకీయాల్లోకి – వై.ఎస్. షర్మిల

న ఆలోచనల్ని- ‘టైమింగ్’ ఎంతగా ప్రభావితం చేస్తుందో నిర్ధారించే సందర్భమిది.  ఆగస్టు 31న ముంబైలో జరుగనున్న జాతీయస్థాయి అఖిలపక్ష కూటమి- ‘ఇండియా’ మూడవ సమావేశానికి బయలుదేరే ముందు; సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు వై.ఎస్.ఆర్.టి.పి. నేత- వై.ఎస్. షర్మిలను కలిశారు. ఎటువంటి ముందస్తు ప్రచారం లేకుండా, అరగంట పాటు ఢిల్లీ సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో చోటు చేసుకున్న వివరాలు బయటకు రాకపోయినా, గత కొంత కాలంగా జరుగుతున్న ఊహాగానాలకు ఈ ఇరువురి భేటీ ఒక ముగింపు ఇచ్చినట్టుగా అయింది.

Also read: తన పుస్తకంతో మనకు తూర్పు దారులు తెరిచిన సంజయ్ బారు

షర్మిల తన స్వంత రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్న వేళ గత ఏడాది- ‘సకలం ‘లో ‘షర్మిల ఫ్యాక్టర్’ అంటూ ఒకటి, ‘కనుమరుగై రెండయిన వై.ఎస్.ఆర్.’ అంటూ మరొకటి   ఈ రచయిత రాసిన రెండు వ్యాసాలు ఇక్కడే ఉన్నాయి కనుక వాటిని చూడవచ్చు. ఆ వ్యాసంలో ఆమెను ‘ఫ్యాక్టర్’ అనడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేవారికి ఏ కారణాల వల్ల- ‘హై పెడస్టల్’ ఏర్పడుతుంది? అనేది సూచన మాత్రంగా ప్రస్తావించడం జరిగింది.

Also read: కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!

 ఇది జరిగిన ఏడాది తర్వాత, సార్వత్రిక ఎన్నికల ముందు- ఎన్.డి.ఏ.కి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో షర్మిల- ‘ఫ్యాక్టర్’కు నేరుగా సోనియా గాంధీ అరగంట సమయం కేటాయించి మాట్లాడే స్థాయికి పరిస్థితులు ఎలా మారాయి అనేది ఈ వ్యాసంలో చూద్దాం.

Also read: ‘ఫుడ్ ప్రాసెసింగ్’ తో తొలి ‘హైబ్రిడ్’ రాష్ట్రంగా ఏ. పి.  

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల వారసుల రాజకీయ ప్రస్థానం ఎటువంటిది? అని కనుక మనం చూసినప్పుడు, ఈ విషయంలో దేశంలోనే డా. వై ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబానిది ఇతరులకు భిన్నమైనది అనిపిస్తుంది. కొంచెం అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. సమకాలికుల బిడ్డల జాబితా చూడండి-

సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా; కాంగ్రెస్ నుంచి వేరై స్వంత పార్టీ పెట్టుకున్న శరద్ పవార్ కుమార్తె సుప్రియ సులే, పి. ఏ. సంగ్మా కుమార్తె అగాథా సంగ్మా, ఇవి ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో కనిపిస్తున్న కొన్ని పేర్లు. వీరిలో కొందరు పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బి.జే. పి. లోకి వెళ్లి మంత్రులు అయినవారు ఉన్నారు.

Also read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పిల్లల్లో – కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, కోట్ల వియభాస్కరరెడ్డి, ఎన్. జనార్ధనరెడ్డి కొడుకులు ఎమ్మెల్యే, ఎం.పి, రాష్ట్ర మంత్రులు వరకు అయ్యారు. ఇందులో వై.ఎస్. కుటుంబం రాజకీయ వైవిధ్యం అంతా వై.ఎస్. కాంగ్రెస్ పార్టీలో అనుసరించిన రాజకీయాల శైలిలోనే ఉంది. అదే ఆయన్ని రాటుదేలిన నాయకుణ్ణి చేసింది.

ఆయనగానీ ఆయన పిల్లలుగానీ పంక్తిలో చోటుకోసం కాకుండా వడ్డించే బాధ్యతలు తీసుకునే స్థాయిని- ‘క్లెయిమ్’ చేయడం, అంత తేలిగ్గా అందరికీ అర్ధమయ్యే విషయం కాదు. కాంగ్రెస్ అనుసరించే- ‘సీల్డ్ కవర్’ సి.ఎం. కావడానికి వై.ఎస్. శైలి రాజకీయాలు బొత్తిగా నప్పవు. అందుకే 1994-2004 మధ్య ఆ పార్టీకి రాష్ట్రంలో వచ్చిన పదేళ్ల విరామాన్ని వై.ఎస్. తనదైన- ‘పొలిటికల్ ఫిలాసఫీ’ వ్యూహంతో ‘అడ్రెస్’ చేశారు. 

Also read: ఉద్రిక్తతల్లో ‘ఆమె’ లక్ష్యం కావడం అనాగరికం!

‘ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం’ నినాదాన్ని ఆమె కనుమరుగైన ఇరవై ఏళ్ల తర్వాత (1984-2004) మళ్ళీ వై.ఎస్. బ్రతికించారు. నిజానికి దాంతో పని అవుతుందని ఆ పార్టీలో ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే, అప్పటికే అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ఆర్ధిక సంస్కరణలు, దానితో వచ్చిన- ‘మార్కెట్ ఎకానమీ’ రాజ్య మేలుతున్నది. అయితే, ఆ సంస్కరణల ఫలాలు ఇంకా చేరని సమూహాలు ఉన్నాయని గుర్తించినవాడు- వై.ఎస్.ఆర్. అందుకు ఆయన తన పాదయాత్రను- ‘టూ-వే’ – ‘కమ్యూనికేషన్ టూల్’ గా వినియోగించుకున్నాడు.

వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యాక, పబ్లిగ్గా బహిరంగ సభల వేదికల మీద ఆయన అబద్ధాలు కూడా చెప్పేవారు. ఆయన మాట్లాడుతూ – ” నా అక్కలు చెల్లెమ్మలు కళ్ళల్లో తాను కన్నీరు చూడకూడదు, అని సోనియా గాంధీ గారు తరుచూ అంటుంటారు” అని ఆమె తరపున ఈయన చెప్పేవారు!

 సోనియా షర్మిల భేటీ అంటున్నప్పుడు దాని- ‘టైమింగ్’ కూడా ఇక్కడ చూడాల్సి ఉంది. ‘సముద్రం’ వంటి కాంగ్రెస్ లో ఒకసారి కలిశాక, విడిగా మనకంటూ ఒక గుర్తింపు తగ్గడం అనేది నిజమే కావొచ్చు. అయితే, మనం ఎటువంటి సామాజిక దృక్పధంతో రాజకీయాలు చేయాలి అనుకుంటున్నాము, అనేది ఇక్కడ కీలకం అవుతున్నది.

తండ్రి మరణం తర్వాత, సోనియా గాంధీ ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన- ‘ఓదార్పు యాత్ర’ ఆయన తండ్రి జనానికి చెప్పిన- “సోనియా-కన్నీళ్లు-అబద్దం” వంటిది కాదని, యువకుడైన జగన్ అప్పటి కాంగ్రెస్ నాయకుల్ని ఒప్పించ లేకపోయాడు. సరే, దాని పర్యవసానాలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అక్కరలేదు. 

ఇక్కడ ‘టైమింగ్’ అంటున్నది ఎందుకంటే, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ‘వై.ఎస్’ అవసరం పడింది. దేశం- ‘నమో’ జపం మొదలెట్టాక, కాంగ్రెస్ వైఖరిలో వచ్చిన ప్రధానమైన మార్పు ఇది. ఇందులో అంతర్లీనంగా వున్న ‘విన్-విన్’ ధోరణిని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అందుకు ఉత్తర భారతదేశం నుంచి రాజకీయ యవనిక పైకి ‘ఫ్రెష్’గా వస్తున్న- జిగ్నేష్ మేవాని, హార్దిక్ పటేల్, కన్హయ్య కుమార్ వంటి యువతరం నాయకుల్ని చూడాలి.

బి.జె.పి. విషయం అటుంచితే, కాంగ్రెస్ గత పదేళ్లలో పలు సైద్ధాంతిక నేపధ్యాలలో ఎదిగిన యువనాయకత్వాన్ని తనతో కలుపుకోవడానికి సిద్ధమవుతున్నది. ఇది, బి.జె.పి. దాని వైఖరిలో తెచ్చిన మౌలికమైన మార్పా? అంటే కావొచ్చు కూడా. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర తర్వాత ఆ పార్టీ వైఖరిలో వచ్చిన మార్పు ఇప్పుడు కార్యాచరణలో మొదలయింది.

తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఫలాలు అందుకున్నవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారిలో ప్రజలతో సజీవ సంబంధాలున్నది ఎవరికి? అనే ప్రశ్నలకు- ‘గాంధీ భవన్’ టపాలతో పనిలేకుండా అర్ధం చేసుకునే అనుభవం ఆ పార్టీ నాయకత్వానికి ఈ పదేళ్లలో సరిపడినంత వచ్చేసింది! ఎక్కడుండి ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారు, అనేది కూడా ఆలస్యంగా అర్ధమవుతున్నది.

‘పబ్లిక్ లైఫ్’ లో ఉంటూ జాతీయ ప్రయోజనాల దృష్టిలో నుంచి చూసినప్పుడు, దేశం భవిషత్తు కీలక దశలోకి చేరుతున్నప్పుడు, వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయోజనాలు, కష్టనష్టాలు గురించి యోచిస్తూ, అక్కడే ఆగిపోవడం హ్రస్వదృష్టి అవుతుంది. విస్తృత ప్రయోజనాలు కోసం పనిచేయాల్సిన- ‘టైం’ వచ్చినప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం అనేది, అందరికీ ఒకేలా అర్ధం కానక్కరలేదు. వై.ఎస్. పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నది, వారి తండ్రి విడిచివెళ్లిన బాధ్యతలు కావొచ్చు. ఎందుకంటే, ఈ దేశం పురోగతి నుంచి ఆ కుటుంబం తరతరాలుగా ఇచ్చిపుచ్చుకుంటూనే ఉంది.  

Also read: విభజనతో సరళమైన కమ్మతెమ్మెరలు!

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles