Saturday, April 27, 2024

జగన్ కు మేలుచేస్తున్న జాతీయ రాజకీయాలు

జాన్ సన్ చోరగుడి

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత,

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ క్రియాశీలం కావడంతో,

అక్కడ తన బలం ఏమిటో తెలుసుకోవడానికి

బిజెపి 2024 ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమయిందా? 

స్ట్ ఇండియా సముద్ర తీరాన ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో అధికారంలో వున్నవి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు. పశ్చమ బెంగాల్ – మమత బెనర్జీ, ఒడిస్సా – నవీన్ పట్నాయక్, తమిళనాడు – ఎం.కే. స్టాలిన్, వీరందరిలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జూనియర్. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. నరేంద్ర మోడీ 2014 జూన్లో మొదటిసారి ప్రధాని అయ్యేసరికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడంతో తీరాంధ్ర ప్రధానంగా రాయలసీమ, దక్షణ కోస్తాతో ప్రస్తుత ఏపీ ఏర్పడింది. తొలి టిడిపి ప్రభుత్వంతో బిజెపి జతకట్టింది.

Also read: పాత ‘ వెర్షన్ ‘ సరుకును వదిలించుకుంటున్న జగన్

పైకే అనేసారు!

ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల నాటికి వైఎసార్సీపి 151 మంది ఎమ్మెల్యేలతో స్వతంత్రంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంతేకాకుండా- “ఎన్డీఏ మనపై ఆధారపడకుండా, స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేన్ని సీట్లు గెలిచింది…” అంటూ 22 మంది ఎంపిలను తన ఖాతాలో వేసుకున్న జగన్మోహన్ రెడ్డి; కేంద్రంలో బిజెపి విజయం పట్ల తన నిరుత్సాహాన్ని ప్రమాణస్వీకారం రోజే పైకే అనేసారు.

ఐదేళ్ల క్రితం అటు కేంద్రంలోను, మన రాష్ట్రంలోనూ ఎవరి లెక్కలు వారివి ఇలా వున్నప్పుడు; మూడవసారి దేశ ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్న నరేంద్ర మోడీ – దక్షిణాదిన ఎన్డీయేకి దూరంగా ఉంటూ, రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని స్వంతం చేసుకోబోతున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశిస్తున్నది ఏమిటి?

తటస్థ వర్గం అంచనాలు

సరే, వారివి వారి పార్టీల రాజకీయాలు కనుక, వాటిని అలా ఉంచి- దేశవిస్తృత ప్రయోజనాలు దృష్టి నుంచి దీన్ని చూసినప్పుడు- ఈ ఏడాది మధ్యలో ఏర్పడే కొత్త పార్లమెంట్ ముందుండే ప్రాధాన్యతలు ఏమిటి? రాజకీయాలతో సంబంధం లేని తటస్థ మేధావి వర్గం అంచనాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ భద్రత దృష్ట్యా ఎలా వున్నాయి?

Also read: ‘న్యూట్రల్’ ఓటరు కీలకం కానున్న 2024 ఎన్నికలు

దేశ సరిహద్దున తూర్పు తీరంలో పొడవైన తీరం వున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పదేళ్లకు సముద్రతీరం అభివృద్ధి ప్రణాళికలతో ఇప్పుడిప్పుడే స్థిరపడతున్న మన రాష్ట్రం విషయంలో, కేంద్రం వైఖరి రాబోయే ఐదేళ్లు ఎలా ఉండాల్సి ఉంటుంది? దేశ విస్తృత భౌగోళిక ప్రయోజనాలు కోసం ప్రధాన మంత్రిగా మోడీ దక్షిణాదిన బిజెపి రాజకీయ అవసరాలను మించిన వైఖరిని- ‘జగన్ ప్రభుత్వం-2’ విషయంలో తీసుకుంటుందా?

దక్షిణాది ‘షెల్టర్’

ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగే సహజ సందేహాలివి. ఢిల్లీ సర్కార్ కు  ఇల్లు చక్కబెట్టుకోవడానికే సమయం చాలనప్పుడు, స్థిమితంగా ఉన్న రాష్ట్రాల్లో కొత్త వివాదాలు తెచ్చుకోవాలని ఎవ్వరు అనుకోరు. ఇప్పటికే సమీప భవిష్యత్తులో  దక్కను ప్రవేశం సాధ్యం కాదేమో, అనే అనుమానం 2023 కలిగించింది.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశీయ విధానం (హోమ్) కారణంగా, ఐదేళ్ల క్రితం ఉత్తరాదిన ఊపిరి సలపని రాహుల్ గాంధీ దక్షిణాదికొచ్చి కేరళలో ‘షెల్టర్’ తీసుకోవలసి వచ్చింది. పోనీ అమెధీలోనో యుపిలోనో ఆ పార్టీ తీసుకున్న వైఖరి వారికి ఉపయోగపడిందా అంటే, కొంత మేర ఉండొచ్చు.

కానీ రాహుల్ కేరళ వచ్చాక, బిజెపి కర్ణాటకను పోగొట్టుకోవడమే కాకుండా, అక్కడి నుంచి మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ కొత్త పార్టీ ప్రసిడెంట్ గా రాకకు, జైరాం రమేష్ వంటి ‘డెస్క్ వర్క్’ చేసిపెట్టే నైపుణ్యమున్న  సీనియర్ రాహుల్ ‘రెస్క్యూ’కు రావడానికి ఉపకరించింది.

Also read: కొన్నాళ్ళు ‘చిత్రం’ ఇలా అస్పష్టంగానే ఉంటుంది…  

‘జియో-పాలిటిక్స్’

ఒకప్పుడు ఖండాలు దేశాల మధ్య సంబంధాల విషయంలో భౌగోళిక-రాజకీయాలు (జియో-పాలిటిక్స్) దృష్టి ఉండేది. అయితే అదిప్పుడు, భారత్ వంటి విశాల దేశంలో ‘రీజన్స్’ మధ్యకు కూడా వచ్చేసింది. ఈశాన్య రాష్ట్రాల విషయమే చూస్తే, మయన్మార్ (బర్మా) సరిహద్దున వున్న మణిపూర్ విషయంలో ఇటీవల కేంద్రం తీసుకున్న వైఖరి అందుకు తాజా ఉదాహరణ.

మణిపూర్ వార్తలు అక్కడ క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అనే కోణంలో మనవద్ద బయటకు రాగా, అది దేశ సరిహద్దున ఏర్పడిన జాతుల మధ్య ఘర్షణ అనే దృష్టితో, గత ఏడాది జూన్ 30 – 1 జులై మధ్య మన రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అర్మానే (వీరు గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు) మయన్మార్ లో రక్షణ శాఖ మంత్రి, సీనియర్ అధికారులను కలిశారు.

 

ఢాకా వీధుల్లో ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీల పోస్టర్లు

చేతులు కాల్చుకోదు 

పశ్చమ బెంగాల్ కు బంగ్లాదేశ్ తో సరిహద్దు సమస్య ఉంటే, నరేంద్ర మోడీ – మమతా బెనర్జీ కల్సి మరీ 6 జూన్ 2015న ఢాకా వెళ్లి మరీ దౌత్యం చేయాల్సి వచ్చింది. కనుక వివాదాలు లేకుండా సరిహద్దున స్థిమితంగా ఉన్న రాష్ట్రాల నుంచి కేంద్రం కొత్త తలనెప్పులు తెచ్చుకోవాలని అనుకోదు.

Also read: ‘వైఎస్’ పిల్లల రాజకీయాలతో మనకేంటి మేలు?

పైగా భారత ప్రభుత్వం ఆధీనంలోని- ‘నీతిఆయోగ్’ ఎపి ప్రభుత్వం పనితీరుకు ఇస్తున్న ‘ర్యాంకులు’ గురించి తెలిసి కూడా; బిజెపి దీర్ఘకాలిక ప్రయోజనాలు కాదని, ఇక్కడ రాజకీయ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోదు. 

ఏమిటి ఈ ‘జియో – పాలిటిక్స్’? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి? అని చూసినప్పుడు, ఈ రిపబ్లిక్ డే రోజున చెన్నైలో మొదలైన ‘ది హిందూ’ లిట్ ఫెస్ట్ 2024 లో ‘విల్ ఇండియా బికం ఏ వెల్తి నేషన్ బై 2047? అంశంపై జరిగిన సదస్సులో మాజీ ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా మాట్లాడుతూ-

“నికరంగా 8.5% వృద్ధి రేటు సాధించాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమీ చిన్న విషయం కాదు. మారుతున్న ‘జియో-పాలిటిక్స్’, శరవేగంగా మారుతున్న టెక్నాలజీ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఇక్కడ కీలకం. 70% కేంద్ర ప్రభుత్వ నాణ్యతను నిర్ధారించేది రాష్ట్రాలు” అంటూ ఆయన ఉన్న విషయం స్పష్టం చేసారు.

ఇదే విషయాన్ని మరింత సవివరంగా జాతీయ భద్రతా మాజీ సలహాదారు ఎం.కె. నారాయణన్ జనవరి 29న ‘ది హిందూ’ ఆంగ్ల పత్రికకు రాసిన సంపాదకీయ వ్యాసంలో చెప్పారు. ‘న్యూ ఇయర్ కమెన్స్, బట్ విత్ డీప్ ఫోబొడింగ్’ (కొత్త ఏడాది మొదలయింది, కానీ పరిస్థితులేమీ బాగులేవు) శీర్షికతో వచ్చిన ఆ వ్యాసంలో ఆయన ఇప్పటికే మనం పీకల్లోతుకు కూరుకుపోయి వున్న సమస్యలు, కొత్త ఏడాదిలోకి బట్వాడా అవుతున్నాయి అంటారు.

Also read: ఢిల్లీకి ఇక్కడ ఐదేళ్ళలో అమిరిన ‘సెట్టింగ్’ ఇది…

‘రాంగ్ సైడ్ రబ్బింగ్’

రేపు ఎన్నికల తర్వాత ఏర్పడబోయే మన పార్లమెంట్ ముందుకు వచ్చేవి, గతానికి కొనసాగింపే అవుతాయి, అంటూ కొన్ని ప్రధాన అంశాలను ఆయన ప్రస్తావించారు. 1. ఇద్దరు ఆగంతకులు పార్లమెంట్ భవనం ప్రాంగణంలోకి ప్రవేశించి సభ జరుగుతూ ఉండగా ‘గ్యాస్’ వదులుతూ పట్టుబడడం మన తీవ్ర భద్రతా వైఫల్యం 2. పార్లమెంట్ రెండు సభల్లోనూ అధికార – ప్రతిపక్షాల మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభన 146 మందిని రెండు సభల నుంచి సస్పెండ్ చేయడానికి దారితీసింది 3. ఎన్నికల తర్వాత కూడా వీటి మధ్య ఇదే తరహా అపోహలు కొనసాగితే, సభల ప్రతిష్టంభనకు మరిన్ని కొత్త  ప్రయత్నాలు కొనసాగుతాయి.

నారాయణన్ చెబుతున్న రాజకీయ స్పర్ధ మూలాలు, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం వెలుగులో చూసినప్పుడు, విభజన తర్వాత రెండవ దశకంలోకి ప్రవేశిస్తున్న ‘ఎపి’ లో ప్రభుత్వాల పరిపాలనా సమర్ధతను ‘నీతిఆయోగ్’ కంటే మెరుగ్గా మదింపు చేసే యంత్రాంగం ఢిల్లీలో కూడా లేదు. టిడిపికి 2004 ఓటమి తర్వాత పదేళ్లకు, అదికూడా మరో ఇద్దరి తోడ్పాటుతో 2014లో గెలుపు సాధ్యమయింది.

అటువంటప్పుడు, 2024లో ఒంటరిగా ఎన్నికలకు ‘సిద్ధం’ అంటున్న వైఎసార్సీపి ప్రభుత్వంతో బిజెపి నాలుగున్నర ఏళ్ళు కొనసాగించిన- ‘వర్కింగ్ రిలేషన్స్’ ను కాదని; వేరెవరి అవసరాలకో తాము- ‘హ్యాండ్ హోల్డ్’ ఇవ్వడం  దానికి ఎంత అవసరం ఉంది అనే అనుమానం ఉండనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి బిజెపి సిద్దమవడం అనే- ‘పాసివ్ పాలిటిక్స్’ కూడా మరో రకం- “జియో – పాలిటిక్స్” అవుతాయా? అనే అనుమానం ఇప్పుడు కొత్తగా మొదలవుతున్నది.

Also read: ఈ ప్రభుత్వం ఆ పని పూర్తిచేసింది!

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles