Monday, April 29, 2024

‘‘నాతో అటాచ్ అయితే వదులుకోను’’ – సద్గురు శివానంద

గురువు నా ఆలోచన

మాడభూషి శ్రీధర్

నాకు తెలిసినంతవరకు నాన్నగారు ఎం ఎస్ ఆచార్య ‘‘గురువులపేరు’’తో ఎక్కడికీ తీసుకువెళ్లేవారు కాదు. సైకిల్ మీద వెనుక స్టాండ్ పైన కూచో బెట్టి వరంగల్ నుంచి నన్ను సుబేదార్ కు తీసుకువెళ్లారు. శివానందమూర్తి అప్పుడు డిఐజి కార్యాలయంలో ఆఫీసర్ గా పనిచేసేవారు. ఉదయం దాదాపు 8 గంటలకు వారితో పూజ చేసి, తానే తీర్థం ఇచ్చేస్తే అంతా బాగుంటుందని అమ్మ చెప్పేవారు. నాకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండేవి. నాకు వివరాలు తెలియదు.

ఓ సారి గురువుగారితో తీర్థం పుచ్చుకుంటే బాగుంటుందన్నారు. అమ్మ అడగడం, అందుకు నాన్నా ఒప్పించడం పెద్ద పని. మొత్తానికి నన్ను తీసుకు వెళ్లారు. అప్పుడు నేను గురువుగారిని చూసినాను. చిన్నతనం కనుక అప్పుడు నాకేమీ తెలియదు.

సద్గురు శివానంద మూర్తిగారిని చూశాను. విభూతి ముఖాన కళకళగా కనిపిస్తున్నది. చాలా సీదా సాదాగాఉన్నారు. ఏ మహిమలూ చూపలేదు. నేనూ అడగలేదు. పూజా మందిరంలో నేను నాన్న, గురువుగారు తదితర పెద్దలకు నమస్కరించాము.

మంత్రాలతో శివలింగానికి అభిషేకం చేసి, ఆ తీర్థాన్ని నాకు ఇచ్చారు. ‘ఫరవాలేదు, ఏ సమస్యా ఉండదు’ అన్నారు. తరువాత నమస్కరించాము వెళ్లిపోయాం. అది మొదటి సంఘటనం. నాకు దొరికిన దర్శనం ఇది.

నల్సార్ ప్రొఫెసర్, రెండో సంఘటన

అది 2010. అప్పడికీ నేను నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నాను. చాలా మంది పాఠాలు చెప్పేవారు. నన్ను చూసి పలకరించేంత గొప్పతనం నాకేముంది? అనుకున్నాను. 2010 లో వై సుదర్శన్ రావ్ గారు చరిత్ర ప్రొఫెసర్ నాకు తెలుసు. వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీలో విలేకరిగా నేను పనిచేశాను కనుక తెలుసు. కాని వరంగల్ కు 1984లోనే హైదరాబాద్ వెళ్లిపోవలసి వచ్చింది. ఉదయం పత్రిక విలేకరిగా పదేళ్లు పనిచేసాను. వారి గురించి విన్నాను. ఒక సారి చూశాను కదా అనుకునే వాణ్ణి.  నల్సార్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు శ్రీ సుదర్శన్ గారు, మరో ప్రొఫెసర్ మల్లికార్జున్ గారు నాకు ఫోన్ చేశారు. అదీ శివానంద మూర్తిగారు పిలిచారని అంటే ఆశ్చర్యపోయాను. 1994 తరువాత నేను జర్నలిజం వదిలేసిపోయాను. లా ప్రొఫెసర్ గా ఉన్నాను. అయితే నేను లా గురించి అనేక వ్యాసాలు రాసేవాడిని. శివానంద మూర్తిగారు నావ్యాసాలు చూస్తారని, నన్ను పిలిపిస్తారని నేను అనుకోలేదు. ఆశ్యర్యం.

వరంగల్లులో ములుగు వెళ్లే దారిలో  గురువుగారు శివానంద మూర్తిగారు సప్తధామ్ అనే పేరుతో గురుధామ్ అని నిర్మించారు. అద్భుతంగా ఉంది. అంతకుముందు చూళ్లేదు.  ప్లాటినమ్ ప్లాట్ ఫార్మ్ సప్తధామ్ ప్రియాతీ అనే పేరుతో మూడు రోజుల పాటు సమావేశాలు సభలు నిర్వహించారు. గురువుగారు నన్ను రమ్మన్నారు. ప్రసంగించాలన్నారు. అప్పుడు నేను పుణెలో నల్సార్ పక్షాన మీడియాలా లా పై మూడు రోజులు పాఠాలుచెప్పాలి. సమావేశాల చివరిరోజున రాగలను అని చెప్పుకున్నాను. ఆయన గారు రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్లాలేమో అని కాని 50 మంది అక్కడ చదువుకోవడానికి వచ్చిన వారిని వెళ్లకుండా ఉండలేను.

సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వల్ల లక్షలాదిమంది ప్రజలకు న్యాయం కలిగిస్తుందని నేను వ్యాసాలు రాసేవాడిని. గురువు శివానందమూర్తిగారికి నచ్చిఉండి వచ్చు. అది కూడా ఆశ్చర్యమే. నిజానికి సమావేశాలు పూర్తి అయిపోయాయి. కేవలం నాకోసం మరునాడు మరొక ప్రముఖులు మాట్లాడాలి.  అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది, ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి. అనుగ్రహ నారాయణ్ తివారీ.

వరంగల్ కలెక్టర్ గారు 1980 సమయంలో. అప్పుడే వరంగల్ వాణి పత్రిక ప్రారంభానికి నేను తివారీ గారిని ఆహ్వానించాను. వచ్చారు. నాన్నగారు సంతోషించారు. చాలా బాగా ప్రారంభసభలో మాట్లాడారు.  తరువాత 2010 అంటే 30 సంవత్సరాల తరువాత కలిసాను. అదీ తివారీగారు నేను గురువుగారితో కలిసి కేవలం ఇద్దరి ప్రసంగాలు వినడానికి గురువుగారు వచ్చారు. తను స్వయంగా కూర్చుని మొత్తం వినడం నాకు ఆశ్చర్యం, మరోసారి. అది వారి అనుగ్రహం ద్వారా, అనుగ్రహ నారాయణుని ద్వారా.

కేంద్ర సమాచార కమిషనర్ గా

నాకు కేంద్ర సమాచార కమిషన్ పదవి రావడంతో సద్గురుగారితో ఒక లంకె ఉంది. అదేమంటే, 2010లో అనుగ్రహ నారాయణ్ తివారి నాతో కలిసి సమావేశమైనప్పుడు ఆయన కేంద్ర సమాచార కమిషనర్. ఆ తరువాత తివారీ గారు ముఖ్య సమాచార కమిషనర్ అయ్యారు. అప్పుడు నేను కలలో కూడా అనుకోలేదు ఆనాటి కలెక్టర్ తో జర్నలిస్టుగా ఉన్న నేను 2013లో కేంద్ర సమాచార కమిషనర్ కావడం. గురువుగారు, నా తండ్రిగారు నాకు ఆశీర్వచించారన్నమాట అని అర్థమవుతున్నదిప్పుడు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాలంలో అనుగ్రహ నారాయణ్ గారు సమాచార చట్టం నిర్మాణంలో కీలకమైన పనులు చేశారు. ముఖ్య సెక్రటరీ ఉండేవారు.  రిటైరయిన తరువాత కమిషనర్ గా, ఆ తరువాత చీఫ్ సమాచార కమిషనర్ గా అయ్యారు. మరొక ఛీఫ్ కమిషనర్ గారి పదవీ స్వీకారంలో నాటి ప్రధానమంత్రి కలవాలనుకున్నాను. తివారిగారు నేను పరిచయం చేస్తానన్నారు. ఎందుకంటే మొత్తం 5 గురిని కమిషనర్లుగా నియమించినపుడు, ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నలుగురు చాలా బాగా తెలిసిన వారు. ప్రధాని నన్ను ఈ కీలకమైన పదవి ఇచ్చిన వారాయనే. కాని నేనొక్కడనే  తెలియని వాడిని.  నలుగురు తెలుసు. దగ్గరగా ఉండి తివారీ గారు ప్రధానితో కలిపించారు. ఆయన చాలా నెమ్మదిగా ‘ఓహొ మీరా అయిదో కమిషనర్’ అని అభినందించారు.

\భారత్ …ప్లాటినమ్ ప్లాట్ ఫార్మ్ చరిత్ర, సాహిత్యం, సామాజిక శాస్త్రాల పేరుతో పుస్తకం ప్రచురించారు. ప్రొఫెసర్లు వై సుదర్శన్ రావ్, కోవెల సుప్రసన్నాచార్య, పి మల్లికార్జున్ రావ్, వి కిషన్ రావు ఎడిట్ కమిటీలో పనిచేసారు.

  నా వ్యాసంలో తప్పులు సవరించారు ప్రొఫెసర్ మల్లికార్జున్ గారు. గురువుగారు నా వ్యాసం ప్రచురించారు. నా మాటలు విన్నారు. ఆశ్చర్యం కదూ. బహుశా శివానంద మూర్తిగారు వరంగల్లు ద్వారా, గురువుగారి ఆశీర్వచనం ద్వారా, తివారీ గారి ద్వారా నన్ను సంధించి ఉంటారు. చాలా ఆశ్చర్యం కదా.

నేను చాలా సార్లు విశాఖ మిత్రుడు వివి రమణమూర్తిని కలుద్దామనుకున్నాను. అన్నాడు కూడా. కాని ఆ అదృష్టం కలగలేదు. గురువుగారి ఆశీస్సులతోనే రమణ మూర్తి లీడర్ పేరుతో చాలా కాలంనుంచి విజయవంతంగా డైలీ పత్రికను నిర్వహిస్తున్నారు.

నేను సద్గురువుగారి వీడియో ఒకటి విన్నాను. వారి కిందటి జన్మ కు సంబంధించిన కలకత్తా కలిసిన కథ స్వయంగా వివరించడం. నన్ను 14 సంవత్సరాల వారు, ఆ ఫోటో చూస్తే నాలాగా ఉన్నాడను కనబడుతుంది. అక్కడ గురుధామ్ అని ఉంది అదే పేరు. అక్కడ ఎప్పుడూ చూడలేదు. కాని చూసినట్టు నాకు తెలుసు. ఆ 14 ఏళ్ల వ్యక్తి పేరు శివానంద అంటారు. ఫోటో ఉంది. నా పోలికతో కలుస్తుంది. సిధ్ధి పొందారు అని వివరించారు.


ఆ తరువాత వీడియోలో ఈ విధంగా అన్నారు….‘నాకు ఆ విధంగా ఉపదేశం చేసి ఉన్నారనుకుంటాను. దైవ ధాన్యం చేసుకొండి. నాతో అటాచ్ అయ్యారు. నాతో ఉంటారు, మూడు వేలమంది నాతో ఉంటారు, మొత్తం ప్రపంచంలో అటాచ్ అయి ఉంటారు. కొన్ని సంవత్సరాలు జరగవచ్చు. తరువాత అటాచ్ అవుతారు. అయ్యారు. అయిన వారిని వదులుకోబోను. అన్న మాట నాకు చెప్పారనుకుంటాను. నాలోపల ఉంటారు. కొందరి మిత్రులు తెలిసిన వారు రకరకాలుగా ఉంటారు. ఎలాగా అటాచ్ అయ్యారు? తెలియదు. వారవుతారు. కొందరు సరెండ్ అవుతారు. నేనేదీ చేయను. దానంతటే అది అవుతుంది. మీకు తెలియాలి. అంతే. ఆ తేజస్సు ఉండేది. మేము చూసాను.’
వరంగల్ లో గురుధామ్ సప్తధామ్ ద్వారా శ్రీ సద్గురు శివానంద మూర్తి గారితో అటాచ్ అయితే ఆ తేజస్సు మనతో ఉండాల్సిదే కదా.

(10 జూన్ సద్గురు శివానంద వర్థంతి సందర్భంగా)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles