Friday, April 26, 2024

శ్రీకృష్ణానుభవమే స్నానం, ధ్యానం, నిద్ర

గోదా గోవింద గీతం – 10

నేపథ్యం

శ్రీ కృష్ణానుభవం, శ్రీ కృష్ణ సంశ్లేషమే, స్నానం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా. అటువంటి విశేషమైన గోపికను, జ్ఞానదీపం వెలిగించిన పేయాళ్వారులను ఈ రోజు మేల్కొలుపుతున్నారు.  శ్రీవైష్ణవంటో పొయ్ గై ఆళ్వార్, తరువాత పూదత్తాళ్వారులు, ఆ తరువాత పేయాళ్వార్ వచ్చారు. ఈ రోజు గురువాక్య పరంపరలో శ్రీపరాంకుశ దాసాయ నమః మంత్రాన్ని అనుసంధానం చేసారు గోదాదేవి. అందరూ ఒకటే అనీ, భూమిమీద నివసించే వారంతా కలిసి ఉండాలని, మంచి తనం పెంపొందించుకోవాలని, అందరినీ కలుపుకుని పోవాలని, అందరూ భగవద్గుణాభవాన్ని పొందాలని గోదాదేవి అభిలషిస్తూ ఈ వ్రతాన్ని రూపొందించారు.

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

నోట్రు= నోము నోచి, సువర్గమ్ పుగుగిన్ఱ = స్వర్గాన్ని ప్రవేశిస్తున్నంత సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా, వాశల్= వాకిలి తలుపు, తిఱవాదార్= తీయని వారు, మాట్రముమ్ తారారో= ఒక బదులు మాటైనా మాట్లాడరా, నాట్రత్తుఝాయ్ ముడి = పరిమళాలు గుబాళిస్తున్న తులసీమాలచే అలంకృత కిరీటముగల, నారాయణన్= నారాయణుడు అనే దివ్యనామాంకితుడు, నమ్మాల్= మనచేత, పోట్ర=పల్లాండును పాడించి, ప్పఱైతరుమ్ = మనకు ప్రాయమైన కైంకర్యాన్ని పఱైని అనుగ్రహించే వాడు, పుణ్డియనాల్= పుణ్యస్వరూపుడైన శ్రీమహావిష్ణువుచే, పండు ఒరునాళ్ = ముందొక కాలంలో, కూట్రత్తిన్ వాయ్ వీఝన్ద = యుముని నోట్లో పడిన, కుంబకరణనుమ్, కుంభకర్ణుడును, ఉనక్కే తొట్రు= నీకు ఇచ్చి వెళ్లాడా, ఆట్ర ఆనందలుడైయాయ్= గాఢమైన నిద్రను కలిగిన దానా, అరుంగలమే =దుర్లభమైన ఆభరణమా, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలిచుకొని వచ్చి, తిఱ=తలుపు తీయి.

అర్థం.

నోమునోచి హాయిగా నిద్రిస్తున్న అమ్మా, వాకిలి తలుపు తీయకపోతే పోయే కనీసం మాటైనా మాట్లాడకూడదా, కిరీటంలో తులసిమాలను ధరించి నారాయణ దివ్యనామంతో భాసిల్లేవాడు, మనకు పల్లాండు పాడే అవకాశం కల్పించి మనకు పఱైని లేదా పరాన్ని అనుగ్రహించేవాడు ధర్మం మూర్తీభవించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు, అతని చేతిలో పడి యముని జేరిన కుంభకర్ణుడు అంతకు ముందే నీతో ఓడిపోయి తన గాఢనిద్రను నీకు ఇచ్చాడా ఏమి? సొగసుగా నిదురించే దానా, దొరకని ఆభరణమా, నిద్రమత్తువదిలించుకుని తలుపు తెరువమ్మా.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు తెలుగుసేత సిరినోము

నోచి స్వర్గ సుఖమ్ములాచిన ఓ తల్లి

          తెరువకున్న తలుపు తెరువబోకు:

పెదవి విప్పి ఒకింత బదులు పల్కుట కేమి?

          తలను తులసి మాల దాల్చినట్టి

నారాయణుడు తన నామమ్ము పాడ తా

          ను మనకు ‘డక్కి‘ ననుగ్రహించు

అలనాడు రాముచే యముని నోటికి విందు

          గానైన ఆ కుంభ కర్ణు డట్టు

లోడిపోయెడివేళ నోగి తన పెనునిద్ర

`        నీకిచ్చిపోయెనో నిదురబోత:

అరుదైన చక్కని ఆభరణమ: రావె

          తడయబోకికనైన తలుపు తీయి:

వివరణ

శ్రీకృష్ణుడిని చేరి ఆయన ఇస్తానన్న వ్రత పరికరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తున్నది గోద. ఈమె అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ అని తెలిసి జ్ఞానంతో కూడిన భక్తి కలిగిన ఈమె ఇంటికి  చేరుకుని సుప్రభాతం పాడి తమతో రమ్మంటున్నారు.

గోద: నోట్రు అమ్మానాయ్ ..ఏవమ్మా మాతో చేరి నోము నోచుదామని చెప్పి, నీవు ముందే వ్రతం ముగించి శ్రీ కృష్ణానుభవమనే స్వర్గాన్ని అనుభవిస్తున్నావా. నీతో కలిసి జీవించడమే స్వర్గం, విడిచి ఉండడమే నరకం అని రాముని గురించి చెప్పింది. గోపికలకు కూడా స్వర్గమంటే శ్రీకృష్ణానుభవమే. ఆ అనుభవంలో లీనమైన వారికి స్వర్గం లెక్కలోకి రాదు. వీళ్ల దృష్టిలో వ్రతమంటే శ్రీ కృష్ణుడే తమకు ఉపాయమనుకుని ఎదమీద చేయి వేసుకుని హాయిగా నిదురించడమే. ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. “తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః ” ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు (త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి వివరణ) భగవంతుడి నిజస్వరూపం తెలుసుకున్నారంటే అన్ని నోములూ నోచుకున్నట్టే.

గోద: అమ్మనాయ్, నీవు మా అందరికీ నాయికగా ఉండడం అందంగా ఉంది. రక్ష్యారక్షక భావాన్ని నిరాకరించకు తల్లీ, మేం మాత్రం వదలము’’ అన్నారు.

గోపిక: (ఈమాటలు విన్న గోపిక ఆనందాతిశయంతో మౌనంగా ఉందట, మరో అర్థం. ‘‘వీరికి చెలికత్తెను నేను, నన్ను అమ్మనాయ్ అంటున్నారు’’, అని కూడా మౌనంగా ఉందట.

గోద: ‘‘తలుపు తెరవకపోయినా బదులైనా ఇవ్వవా’’ అని బయటనుంచి అడిగారు.

మాట్రముమ్ తిఱవాదార్= ‘‘తలుపు మూస్తే మాట కూడా మూయాలా? కళ్లకు కష్టం ఇచ్చినట్టు, చెవులకు కూడానా? మీరు సుఖానుభవంలో ఉంటే మా గురించి చింతించరా ఏమి? శ్రీకృష్ణునికి సర్వం సమర్పించినప్పుడు మాకు కనీసం మాటలు వినే భాగ్యమైనా కలిగించవా తల్లీ’’.

‘‘మాట్రముమ్ తారారో… విచ్చేయండని స్వాగతం చెప్పాలనేం లేదు. చెప్పండి అని ఓమాటన్నా చాలు. లేదా కోపంగానైనా ఒక మాట చెప్పండి’’. అని గోపికలు అడిగారు. లోపలి గోపిక: ‘‘శ్రీకృష్ణుడికి సర్వం సమర్పించినానని అంటున్నారే, శ్రీకృష్ణుడైమైనా ఇక్కడున్నాడా?’’ ఆనందరూపుడైన వాడు కృష్ణస్వామి, ఆయనే ఆనందము కూర్చేవాడు, ఆయనను తలుచుకుంటూఆనంద స్థితిలో ఉన్నందున గోపిక బదులు పలకలేదట. బయటవారేమో శ్రీ కృష్ణుడు లోపల ఈమెతో ఉన్నాడనీ అందుకే బయటకు రావడం లేదని అనుకుంటున్నారట.

గోద, బయటి గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడి.. నీవు దాచాలన్నా శ్రీకృష్ణుడి కిరీటం చుట్టిన తులసీ మాల సుగంధాలు వెదజల్లుతున్నాయి కదా. నీవలెబహిర్గతం కాని తత్త్వమా ఆయనది’’. తులసి అంటే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి. తులసి విష్ణుపత్ని. తులసీ వనములు ఉన్నచోట శ్రీ హరి తప్పక ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తులసీ పరిమళం ఉంటుంది.

లోపలి గోపిక: ‘‘శ్రీ కృష్ణుడు ఇదివరకొకసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు అంటిన తులసి వాసనల సౌరభం అది.  తులసీదామ భూషణుడి వాసన చూసి ఆయన లోపల ఉన్నాడనడం సరికాదు. అదీగాక నిన్న సాయంత్రం నుంచి అక్కడే మీరు కాపలా ఉన్నట్టున్నారు. మీకు తెలియకుండా శ్రీకృష్ణుడు లోనికెలా వస్తాడుచెప్పండి’’. అది తులసీ దళ పరిమళమే కాని తులసీ ప్రియుడైన శ్రీ కృష్ణుడు ఇక్కడ లేడు. 

బయటి గోపికలు:  ‘‘నారాయణన్.. సకల చేతన అచేతన వస్తుజీవములలో లోన పైన వ్యాపించియున్న నారాయణునికి తలుపులు అడ్డమా? సర్వవ్యాపి కనుక ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగలడు. నమ్మాల్ పోత్తప్పఱై తరుం….దేవతలకే అందని ఆ కృష్ణ స్వామి మనవంటి సామాన్యులందరికీ సులభంగా అందేవాడు. పుణ్నియనాల్… పుణ్యాన్ని ఉదారంగా అందరికీ ఇచ్చేవాడు కదా నీ ఒక్క దాని  దగ్గరే పెట్టుకోవడం సబబా?

బయట గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడినారాయణన్ = ‘‘పరిమళ భరిత తులసీమాలాధరుడైన వాడు నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు ఆ వాసన జన్మజన్మాలకూ వీడదు కదా’’.

లోపలి గోపిక మాట్లాడలేదు. మనం జవాబులు ఇస్తూ ఉంటే ‘ప్రతిదానికీ జవాబిస్తూ ఉందే’ అనుకుంటుందని మాట్లాడడం లేదేమో.

బయటి గోపిక: పండొరునాళ్ ఇదివరకు ఒకనాడు కూత్తత్తిన్ వాయ్వాళంద కుమ్బకరణనుం….. కుంభ కరణుడు మృత్యువునోట్లో దూరాడు. అందరినీ రక్షించే రాముడు కుంభకరణుడిని ఎందుకు చంపుతాడు. ఆయనే నడిచి వచ్చి రాముని తో యుద్ధానికి దిగి దీపకాంతికోసం వచ్చి ఆహుతైన కీటకం వలె మృత్యు ముఖంలో తలదూర్చాడు. తొత్తు ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో … ఎంత చెప్పినా నిద్రలేవడం లేదంటేఆ కుంభకర్ణుడు మరణిస్తూ తన నిద్రను నీకిచ్చాడా ఏమి?’’ అని వ్యంగ్యంగా పలుకుతారు గోద.

ఆ తరువాత దివ్యజ్ఞాని అగస్త్యునితో లోపలి గోపికను పోలుస్తూ మాట్లాడతారు వారు. అగస్త్యుడు కూడా ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా ఏమి అని అంటుంది.

అగస్త్యుడి కథ

కుంభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఒక కుండలో పుట్టిన వాడు. కేదార్ నాథ్ సమీపంలో త్రియుగ్ నారాయణ్ వద్ద పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి గాను ఆయన హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. మరో సందర్భంలో వింధ్య పర్వతం మేరు పర్వతంతో పడి విపరీతంగా పెరుగుతూ ఉంటే, సూర్యగమనాన్ని కూడా అడ్డుకుంటాడేమోనని భయపడి, వింధ్య పెరగడాన్ని నిలిపి వేయాలని దేవతలంతా అగస్త్యుని వేడుకున్నారు. అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించగానే, గురువుకు వంగి నమస్కారం పెట్టాడట. మహాముని, సరే ఇట్లాగే ఉండు, ‘తథాస్తు’ అన్నారు. అంతే అక్కడే వంగి పోయాడు. వింధ్య పర్వతం పెరుగుదలను ఆవిధంగా ఆయన వంచినాడు.  అని పెరుగుదలని వంచాడు. ఒక్కొక్క పర్వతానికి అధిష్ఠాన శక్తివిశేషం ఉంటుంది. దాన్ని బట్టే ఒక్కో పర్వతానికి విశిష్టత చేకూరుతుంది.
అగం అంటే పర్వతం,  స్త – స్తంభింపచేసిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య. మరొక అర్థం ఏమంటో మనలో పెరిగిపోతున్న పాపపు కొండలని స్తంభింపజేసే శక్తి గల మహాముని. అగస్త్యుని గొప్పతనాలు ఇంకా చాలా ఉన్నాయి.  మొత్తం సముద్రాన్ని పానం చేసినశక్తి శాలి. ద్రావిడ భాషకంతటికి వ్యాకరణ సూత్రాలను రచించిన మహ జ్ఞాని. వాతాపి అనే రాక్షసుడిని కడుపులోనే జీర్ణింపచేసి సంహరించిన అద్భుత ముని.

గోద (లోపలి గోపికతో) అంతటి  మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా? ‘‘లోపల నుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట ఒక్కటే చాలు మాకు. అదే మా ప్రాణం కాపాడుతుంది.

జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష అని జీయర్ వివరించారు.

పేయాళ్వార్ కథ

ఈ పాశురంలో పేయాళ్వార్ గురించి ప్రస్తావించారు. 1. పొయగై ఆళ్వారు, (సరోయోగి) 2. పూదత్తాళ్వార్, (భూతయోగి) 3. పేయాళ్వార్ (మహాయోగి) అను ముగ్గురు ముదలాళ్వార్లు. వీరు ముగ్గురు ద్వాపరయుగంలో అవతరించినారు. పేయాళ్వార్లు చెన్నపట్టణానికి సమీపంలో మైలాపూర్ లో నున్న ముణికైరవమను బావిలో ఎర్రకలువ పువ్వులో ఆవిర్భవించినారు.

వీరికి భగవంతుని మీద విపరీతమైన ప్రేమ ఉండి లోకులకు పిచ్చిగా కనిపించేవారు. జడభరతునివలె అంటే మూగవానిలా, జడునిలా, గ్రుడ్డివానిలా, చెవిటివానిలా, పిచ్చెక్కినవానిలా భగవంతుని మీద పాటలు పాడుతూ సంచరించేవారు. వీరిని పేయాళ్వారని పిలిచేవారు. “పేయ్” అంటే పిచ్చి అని అర్ధం.

వీరి భక్తినిష్ఠను పరీక్షిద్దామని ఓసారి పార్వతీ పరమేశ్వరులు వచ్చారట. తామెవరో వెల్లడించి, ఆది దంపతులు ఏదైనా వరం కోరుకొమ్మన్నారట. భగవంతుడిని మించి కోరుకునేదేమిటి అని ఆలోచించి, సరే నాకు బొంత కుట్టుకోవడానికి కష్ఠం అవుతున్నది. ఈ సూదిలోకి దారం ఎక్కించి పెడతారా అని వరం కోరుకున్నాడట. ఆయనకు ఏ అవసరాలు లేవని, భగవంతుడిని తప్ప ఏదీ కోరబోరని ఇది సంకేతం. పేయాళ్వార్ అమితమైన భక్తికి మెచ్చి సాక్షాత్ శ్రియః పతి సర్వాభరణ భూషితుడై, సపరివార సమేతంగా సాక్షాత్కరించాడు. పేయాళ్వారులు తిరుక్కోవలూర్ లో ఉన్న స్వామి శ్రీ త్రివిక్రమన్ (వామనుడు) దర్శించి ఆనంద పరవశులై ఈ క్రింది పాశురమును పాడినారు.

“తిరుక్కణ్డేన్ పొన్ మేని కణ్డేన్ తిఱయుమ్
అఱుక్కన్ అణి విరముం కండేన్ శెరుక్కిళరుం
పొన్నాయ్ కండేన్ పురిశంగం కైక్కణ్డేన్
ఎన్నాయ్ వణ్ణన్ పాలిన్దు.

తొలి ముగ్గురు ఆళ్వారుల సమాగమం

తొలి ముగ్గురు ఆళ్వారుల గొప్పతనాన్ని వివరించే ఒక సంఘటన ఉంది. తిరుక్కోవలూరు గ్రామంలో పేయాళ్వార్ (సరోయోగి) ఒక చిన్నగదిలో శయనించి ఉన్నారు. బయట హోరున వర్షం కురుస్తున్నది. తలదాచుకోవడానికి భూతయోగి లోనికి వచ్చారు. ఒకరు పడుకోవడానికి సరిపోయే చిన్నస్థలం లో ఇద్దరు కూర్చోవచ్చుకదా రండి స్వామీ అని  అని భూతయోగిని సరోయోగి రమ్మన్నారు. మరి కాస్సేపడికి  మూడో ఆళ్వారు మహాయోగి వచ్చారు. వారు కూడా లోపలికి రావలసిన పరిస్థితి. ఫరవాలేదు ఇద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు నిల్చోవచ్చు కదా..అంటూ ఆయన్ను రమ్మన్నారు. ముగ్గురు యోగిపుంగవులు ఒకచోట చేరుకుని నిలబడి ఉండడం అనేది చాలా గొప్పవిశేషం. ఇంతటి మహాపురుషులు ఒక్కచోట ఉన్న విశేష దృశ్యాన్ని చూద్దాం అని శ్రీమన్నారాయణుడే స్వయంగా అక్కడికి  ఆళ్వారుల స్పర్శాసుఖం అనుభవించేందుకు  ఒక వెలుగై ఆ అంధకారంలోకి నాలుగో వ్యక్తిగా విచ్చేసారని, ఆ వెలుగును చూసి ఆయన రాకను తెలుసుకున్న ఆ ముగ్గురు ఆళ్వారులు కలసి మంగళం పాడినారు, అప్పుడే ముదల్ తిరువందాది (పేయ్), ఇరండామ్ తిరువందాది, మూన్రామ్ తిరువందాది (పూదత్త) పాశురాలు వెలువడ్డాయి.

ఆ నారాయణుని వెలుగే తొమ్మిదో పాశురంలో వెలుగని గోదాదేవి ప్రస్తావించినారు.

అయితే ఈ పాశురంలో గోద నిద్రలేపే గోపబాలిక నిజానికి తామస నిద్రలో లేదు. నిరంతరం భగవంతుని తలుస్తూ ఆయన గుణాలను అనుభవిస్తూ కళ్లు మూసుకుని మౌనంగా ఉన్నారామె. అది శ్రీ కృష్ణ సంశ్లేషమనే  నిద్ర.  ‘‘నీవు మాకు శిరోభూషణురాలివి. నిద్రలోనుంచి ఒక్క ఉదుటున లేవకు తల్లీ, తొట్రుపడతావేమో. కాస్త సంభాళించుకో సర్దుకో, ఆ తరువాతే తలుపు తెరుద్దువుగాని’’ అని గోదమ్మ ఆమెకు విన్నవించుకుంటున్న ఘట్టం ఇది. 

ఇదీ చదవండి:జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles