Friday, April 26, 2024

ఐదేళ్ల ఆలస్యంగా మనమూ ఆరు రాష్ట్రాల సరసన!

జాన్ సన్ చోరగుడి

తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్టుగా ఐదేళ్ల ఆలస్యమైనా, ప్రభుత్వం సకాలంలో స్పందించి తీసుకున్న నిర్ణయం వల్ల, ఆంధ్రుల భావోద్వేగాల గౌరవం మళ్ళీ మనకు దక్కింది. అలా రాష్ట్రావతరణ దినమైన నవంబర్ ఒకటి, గత చరిత్రలోకి చేజారి పోకుండా మళ్ళీ మనకు ‘స్వాధీనం’ అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప పరిణతిని ప్రదర్శించింది. ఇక్కడ స్వాధీనం అంటున్నది- ‘క్లెయిమ్’ అనే ఆంగ్ల పదాన్ని దృష్టిలో ఉంచుకుని. తెలంగాణ మన నుంచి విడిపోయినప్పుడు, 1956 నుండి నైసర్గిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను ‘క్లెయిమ్’ చేసుకోవలసిన- ‘పెద్దన్న’ పాత్రను గత ప్రభుత్వం తొలి ఐదేళ్లు  వదులుకుంటే, చివరికి ఆ లోపాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిచేసింది.

Also read: ‘సీన్’ ఇండియా మ్యాప్ క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

ముఖ్యమంత్రిగా ఆయనకు తొలి అనుభవం అయినప్పటికీ, నిర్ణయానికి అవసరమైన మేధోమథనం, ఎంత వేగంగా జరిగింది అంటే, 2019 జూన్ లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి- నవంబర్ 1 రాష్ట్రావతరణ దినోత్సవం అని ప్రకటన వెలువడింది. అది కూడా అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని ప్రకటించడం ద్వారా, ఈ ప్రభుత్వం ‘బిజినెస్ లైక్’ పనిచేస్తుందనే సంకేతాలు కూడా మొదట్లోనే వెలువడ్డాయి.

Also read: ఏ. పి.లో మొదలైన ‘గ్రీన్ పాలిటిక్స్’

సమ్యక్ దృష్టి

ఐదేళ్లు ఆలస్యం అయినప్పటికీ కడకు ప్రభుత్వం తల నెరిసినతనంతో, సమ్యక్ దృష్టి (హోలిస్టిక్ అప్రోచ్) తో వ్యవహరించి ఒక చారిత్రిక తప్పిదాన్ని సరిచేసింది. నిజానికి మనతో పాటు- హర్యానా, ఛతీస్ఘర్, కేరళ, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు; లక్షద్వీప్, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు నవంబర్ ఒకటిన తమ రాష్ట్రావతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత మళ్ళీ మనం ఆ వరసలో చేరడం ద్వారా, దేశచరిత్రలో మొదటి నుంచి మనకున్న- ‘హెరిటేజ్’ ని మనం ప్రకటించుకున్నట్టుగా అయింది.

Also read: ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యతతోనైనా ఏపీ పట్ల ఢిల్లీ వైఖరి మారేనా?

‘స్టేట్ ఫంక్షన్స్’ నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, అధికార యంత్రాంగాన్ని ముందుగా ప్రతిపాదనలు అడుగుతుంది; అధికారులు అందుకు- ‘బుక్’ అనుసరిస్తారు. అలా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వొక ప్రాంతంలోనూ పౌరులలోను క్రమంగా వొక సౌహార్ద వాతావరణాన్ని ఇనుమడించేట్టుగా ఉంటాయి. కాలక్రమంలో అవి తర్వాత తరాలకు బదిలీ అవుతుంటాయి. అందుకు- ‘బ్యూరోక్రసీ’ కూడా పలు రాష్ట్రాల్లో అనూచానంగా అనుసరిస్తున్న సంప్రదాయాల్ని పరిశీలించాక, ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఆ దశలో వాటిని అనుసరించడం లేదా కాదని తమకు తోచినట్టుగా చేయడం, ఎన్నికయిన ప్రభుత్వం ఇష్టం.

Also read: యూనివర్సిటీ పేరులో- ‘నేముంది’?

తుమ్మలపల్లి కళాక్షేత్రం సభతో మొదలు

అలా ఈ ప్రభుత్వం తొలి ఏడాది- విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రావతరణ దినోత్సవాలు- ‘స్టేట్ ఫంక్షన్’గా జరిగాయి. ఇది జరిగాక, అదే వారంలో 2019 నవంబర్ 6న దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసింది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారంగా భావిస్తున్న భారత రత్న, పద్మ విభూషణ్ తరహాలో రాష్ట్రంలో సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రజా రంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పురస్కరాలతో ప్రభుత్వం సత్కరిస్తుంది అని అందులో ప్రకటించింది.

Also read: దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?

కరోనా అంతరాయం

అయితే, కరోనా కారణంగా 2020లో ‘మెడికల్ ఎమర్జెన్సీ’ కావడంతో అది ఆగినా, ఆ తర్వాత రెండేళ్లుగా నవంబర్ ఒకటిన రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పలు రంగాల్లో విశేషమైన సేవలు చేస్తున్న వారిని ప్రభుత్వం సత్కరించడం గొప్ప విషయం. గత ఏడాది- ‘వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు’ పురస్కారానికి పది లక్షల నగదు, మొమెంటో, ప్రశంసాపత్రం 11 సంస్థలకు, 18 మంది వ్యక్తులకు ఇచ్చారు. అలాగే, ‘వై.ఎస్.ఆర్. ఎచీవ్ మెంట్ అవార్డు’ పురస్కారానికి ఐదు లక్షల నగదు, మొమెంటో, ప్రశంసాపత్రం 7 సంస్థలకు, 25 మందికి అందించారు. ఈ ఎంపిక కోసం ప్రభుత్వం పకడ్బంది ‘స్క్రీనింగ్’ విధానాన్ని అనుసరిస్తున్నది.

Also read: ‘అభివృద్ధి’ పట్ల తెలుగు సమాజం వైఖరి ఎటువంటిది?

అన్ని ప్రాంతాలకూ ప్రాతినిథ్యం

‘ఏ.పి. వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత వృద్ధి చట్టం-2020’ అమలు చేస్తున్న ప్రభుత్వం, ఆచరణలో దాన్ని క్రియా రూపంలో చూపించడానికి పలు  పద్దతులను ఎంచుకుంది. గత ఏడాది రాష్ట్రావతరణ దినోత్సవాల్లో- ధార్మిక, సేవా రంగంలో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్, విజ్ఞాన రంగంలో కడప సి.పి.  బ్రౌన్ లైబ్రరీల విశేష సేవలకు గుర్తింపు లభిస్తే, వ్యక్తిగత స్థాయిలో సవర గిరిజన జీవిత చిత్రణ ‘వాల్ పెయింటింగ్స్’ గా ప్రాచుర్యంలోకి తెచ్చిన చిత్రకారుడు సవర రాజుకు (ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా) మన దేశ పత్రికా చరిత్రలో భాగం అయిన ఆంగ్ల దిన పత్రిక- ‘ది హిందూ’ కార్టూనిస్ట్ సురేంద్ర  (కడప జిల్లా)ను ఈ పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది.

Also read: మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…

భూమిపుత్రులకు పురస్కారం

 ‘సెలబ్రిటీ’ సంస్కృతి విస్తరిస్తున్న తరుణంలో, ప్రచార పటాటోపాలు లేకుండా తమదైన రంగాల్లో నిశబ్దంగా పనిచేసుకుపోతున్న ‘భూమి పుత్రుల’ను గౌరవిస్తూ ప్రభుత్వం ఇలా వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నది. గత ఏడాది జరిగిన అవార్డుల సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వీరిని- ‘అన్ సంగ్ హీరోస్’గా అభివర్ణించారు. గత ఏడాది వీరిలో బోటు ప్రమాదాల్లో నదుల్లో మునిగి జాడ తెలియని పడవల్ని గుర్తించి ఒడ్డుకు చేర్చే- ‘నాటు నేర్పరి’ ధర్మాడి సత్యం వంటివారు కూడా ఉన్నారు. ఇలా ఈ జాబితా వైవిధ్యభరితమైంది. అయితే 2022 పురస్కారాలకు ‘వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు’కు 20మంది, ‘వై.ఎస్.ఆర్. ఎచీవ్ మెంట్ అవార్డు’కు 10 మందిని ఎంపిక చేసారు. వీరిని- వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగం, విద్యారంగం, కళారంగం, సాహిత్యం, మీడియా, స్త్రీ రక్షణ – సాధికారికత రంగాల నుంచి ఎంపిక చేసారు.   

Also read: జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి? 

అదనపు విలువ

విభజన గాయం సృష్టించిన అలజడి తర్వాత కుదురుకోవడం గురించి యోచించడానికి, అధినేతకు ప్రజలు – ప్రాంతము మధ్య ఉండే భావోద్వేగాల బంధం ఎటువంటిదో తెలియాలి. లేనప్పుడు, అస్పష్టం అయోమయం మిగులుతుంది. ‘రాజ్యం’లో భాగమైన- ‘ఎగ్జిక్యూటివ్’ అందించే విలువైన మార్గదర్శనాలను అధినేత నిర్ణయాత్మకంగా వినియోగించుకున్నప్పుడు, ప్రజల తీర్పుతో ఎన్నికయిన ప్రభుత్వాలకు అది అదనపు విలువ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రికి ఏ.పి. ‘బ్యూరోక్రసీ’కి మధ్య వయస్సులో కుదిరిన సారూప్యత వల్ల, ఇక్కడ తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావవంతంగా ప్రస్తుతం ప్రభుత్వంలో పని సాగుతున్నది. 

Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…

(రచయిత అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత)

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles