Saturday, May 4, 2024

నిరంతరం యవ్వనంలో ఉన్న గోకులంలో గోవులన్నీ

11. తిరుప్పావై

మాడభూషి శ్రీధర్

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ
ఎత్తుక్కుఱగుం పొరుళ్ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

ఎప్పుడు దూడలైయుండు ఆల పాలు పితుకు వారు

వైరి కోటల ముట్టడించి గెలిచెడి వీర గోపాలురు వారు

కొరత లెరుగని వంశమున బుట్టిన యాదవ శూరులు

పాముపడగ నితంబుముల దాన, నెమలి రంగుదాన

బంగారు తీగ మెరుపు మేనుదాన బంధుసఖుల మెల్ల

నీదు భవనపు వాకిటచేరి నిలిచినాము మొగలి వన్నెవాడు 

మోహన మురళీ కృష్ణు ముద్దుల జవరాల నిదుర ఇంకేలనమ్మ

కరుణించి కదలి రావమ్మ సిరినోముజేయ మాదరి జేరవమ్మ

మాధవీ పుష్పంలో పుట్టిన ఆళ్వార్

మొదటి ఆళ్వార్ పొయిగై ఆళ్వార్. రెండో ఆళ్వార్ ఈ రోజు పూదత్తాళ్వార్ ను పిలుస్తున్నారు. (పేయాళ్వార్ మూడవ వాడు). మహాబలిపురం దగ్తర తిరుక్కుడల్ మల్లై లో శ్రీమన్నారాయణుడి గదాంశం (కౌమోదకి) తో బండి గుఱిగింజ పూవులో(మాధవీ పుష్పం)జన్మించిన ఆళ్వార్ వీరు. ‘పూతమ్’ అనగా యథార్థము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యథార్థమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన వీరికి’పూదత్తాళ్వార్’ అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ అనే పేర్లు కూడా ఉన్నాయి. 7వ శతాబ్దం వారు, పుట్టిన వాడు, మైసూరు. ప్రేమ అనే ప్రమిదలో నెయ్యిగా జ్ఞానదీపాన్ని వెలిగించిన వారు. భగవంతుడు భక్త సౌందర్యంతోనేవశమవుతాడని గోద ఈ పాశురంలో సందేశం ఇస్తున్నది. 

పూదత్తాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు ‘ఇరణ్డాన్ తిరువందాది’ పాడిచెప్పిన వారు.వీటిని రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు అంటారు. దివ్య ప్రబంధాలలో ఇవి రెండవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా ఉండడం వల్ల ఈ పాశురములు “అందాది” అని అన్నారు. ఈ ఇరణ్డాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరుమల, మహాబలిపురము, తిరుక్కోవలూరు, కంచి, అడకసింగరు, తిరుక్కోట్టియూర్, తిరునీర్మలై దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతి చేసినారు. 

ముదలాళ్వారులల సమావేశం

వేదం సంస్కృతంలో లేదా అంతకన్న ముందే వేదం వినిపించాయి. దాన్ని ఆళ్వారులు రచనలతో ద్రవిడ వేదం వచ్చిందంటారు. ఈ ముగ్గురు ముదలాళ్వారుల సమావేశం గురించీ, ద్రవిడ వేదం ఆవిర్భవించడం గురించీ ఒక గాథ ప్రచారంలో ఉంది. ఇది తిరుక్కోవలూర్‌లో జరిగిందట.

Also read: హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

వర్షం కురుస్తున్న ఒక చీకటిరాత్రి పోయ్‌గై ఆళ్వారు ఇంటి యజమాని అనుమతి తీసికొని అక్కడ చిన్న అరుగుపైన పడుకొని భగవధ్యానమ్ చేస్తున్నారు. కొంత సేపటికి పూదత్తాళ్వారు అక్కడికి వచ్చి తాను కూడా తలదాచుకొనవచ్చునా అని అర్థించారు. అప్పుడు పోయ్‌గయాళ్వారు, ‘ఈ అరుగు మీద ఒకరే పడుకోవాలి కదా, కాని ఇద్దరు కూర్చునవచ్చు కదా, కూర్చుందాం రండి’. అని పూదత్త ఆళ్వారును ఆహ్వానించాడు. మరి కొంత సేపటికి పేయాళ్వాఱు వచ్చి తనకు కూడా చోటు దొరకునా అని అర్ధించాడు. కూర్చొని ఉన్న ఇద్దరు ఆళ్వారులు, ‘ఈ అరుగు మీద ఇద్దరే కూర్చోగలరు. అది సరే కాని ముగ్గురు నిలబడి ఉండే వీలవుతుంది కదా. రండి ముగ్గురమూ నిలబడి ఉందాం.’ అని ముగ్గురు మొదలాళ్వార్లు వచ్చారు. అది ఆ రాత్రిపూట, కన్ను పొడుచుకున్నా కానరాని ఆ కటిక చీకటిలో, ఈ ముగ్గురూ భగవద్గుణానుభవామృతపానమత్తచిత్తులై మైమరచిపోయి ఉన్నారు. వారి ఎంత గొప్ప భక్తులంటే ఆ ముగ్గురు కలిసిపోతే చాలు, స్వయంగా భగవంతుడే అక్కడికి చేరుకుంటారట. వారి భక్తి ప్రకర్షకు పరవశించి శ్రీ హరి ఉన్నట్లుండి అదృశ్యరూపంలో వచ్చి వారినడుమ నిలిచి చిందులు వేయసాగాడు. తమ మధ్య మరొకరు ఉన్నారని ఆమొదలు ముగ్గురు ఆళ్వారులు గ్రహించారు.

అపుడు పొయ్‌గయాళ్వారు ఆ మహామూర్తిని గుర్తించటానికి ఒక దివ్యదీపం వెలిగించాడు. భూమిని ప్రమిదగా చేసి, దానిలో సముద్రజలం అనే నెయ్యిపోసి, ఉష్ణకిరణాలతో వెలిగే సూర్యుణ్ణి వత్తిగా వేసిన దీపంతో సుదర్శన చక్రధారియైన స్వామని అర్చిస్తానన్నాడీ కవి.

వైయం కళియా వార్ కడలే నెయ్యాక

వెయ్యకతిరోన్ విళక్కాక – శెయ్య

శుడరాళియా నిడిక్కే శూట్టినేన్ శొన్మాలై

ఇడలాళి నీంగుక వే యెంగుఅని పూజించినారు.

(తిరుమల ఆనందనిలయం దగ్గర కనిపించే అరలలనే భాండాగారంలో అన్నమయ్య రాగి రేకులు దొరికాయి. అక్కడ అన్నమయ్యకు, మరొక కీర్తనార్యుని శిల్ఫం కూడా చూడవచ్చు.)

అన్నమాచార్యుని వంశీయులైనవారి కవులను తాళ్ళపాక కవులు అంటారు.(పద కవితా పితామహుడు. తాళ్ళపాక వంశానికి మూల పురుషుడు. జీవిత కాలం 1408 – 1503 ప్రాంతం. ఇతని భార్యలు అక్కాంబ, తిమ్మాంబ లేదాతిమ్మక్క,వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు మొదలైనవారు తాళ్లపాక కవులు). తాళ్ళపాక చిన్నన్నగా ప్రసిద్ధుడైన తాళ్ళపాక తిరువేంగళనాధుడు ‘‘పరమయోగి విలాసము’’ అనే భక్తి కావ్యాన్ని రచించారు. ఈ పాశురమును తెలుగులో ఈ పాశురాలుని ఈవిధంగా అనువదించినారు.

Also read: లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె

ధరణి పంతియ సముద్రంబులు నేల

యరుణు దీపము జేసి యరుణాంశ తతుల

గారాబు చక్రంబు కైబూన్చినట్టి

నీరజాక్షునకిత్తు నీరాజనంబు

ఆ తరువాత పూదత్తాళ్వారులు తమ హృదయంలోనే ప్రజ్వలిస్తూ ఉన్న ఙ్ఞానదీపంతో ఆ శ్రీపతి ఈ విధింగా అర్చించినారు.

అన్బే తకళియా ఆర్వమే నెయ్యాక

ఇన్బురుకుశిందై ఇడుతిరియా – నన్బురుకి

జానచ్చుడర్విళ క్కేత్తినేన్ నారణ్ర్కు

జానత్తమిళ్ పునిందనాన్

భక్తిని ప్రమిదగా చేసి, ఆర్తిని నెయ్యిగా దానిలో పోసి, భగవత్సందర్శన జనితానందం అందులో వత్తిగావేసి, అఙ్ఞానాంధకారం దూరం అయ్యేటట్లుగా పరభక్తి అనే ఉజ్జ్వల దీపాన్ని నిండుమనస్సుతో అర్పించి ఆ శ్రీ హరిని అర్చిస్తున్నాను అని వివరించారు.

(కళాకారుడు పద్మశ్రీ బాపు అద్భుత చిత్రం)

(source:https://www.tirumala.org/AnnamaCharyaLifeHistory.aspx)

తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన పరమయోగి విలాసములో ఈ విషయాన్ని ఇలా వర్ణించారు.

…. … … ప్రేమ

పంతియ మితి లేని భక్తియే చమురు

నానంద భరిత హృదబ్జంబె వత్తి

గానొనరించి వికాసమై యాత్మన్

తిరమొందు జ్ఞానంబు దీపంబు జేసి

పెరియ నారాయణార్పితము గావించె

ఈ ఇద్దరు భక్తులూ వెలిగించిన ఙ్ఞానదీపం ఆధారంగా పేయాళ్వారులు ఆ భగవానుని దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కన్నుల కరువు తీరా సందర్శించాడు. ఆ శుభక్షణంలో అయత్నంగా వెలువడిన సుమథుర వాణియే ఇది:-

తిరుక్కండెన్ పొన్మేనికండేన్ తికళుమ్

అరక్కన్ అణినిరముంకండెన్

పొన్నాళికండేన్ పురిశంగం కైక్కండేన్

ఎన్నాళి వణ్ణన్ పొల్ ఇంగు

(ఈ పాశురాలను తిరువారాధన లేదా శ్రీవారి ఆరాధనలో తప్పనిసరిగా పఠిస్తారు)

అహో! శ్రీమహాలక్ష్మితోపాటు శ్రీహరి సువర్ణ శరీరసౌందర్యం ప్రత్యక్షమైంది నాకిప్పుడు. పాపాత్ముల్ని ఛేదించే సుదర్శనాయుధం కూడా స్వామి చేతిలో ఉంది. అంతేకాదు – ప్రళయకాలాభీల పర్జన్యగర్జననుకరించే పాంచజన్యాన్ని సైతం కాంచగల్గిన సుకృతిని పొందాను. ఇట్టి నాకింకేమి కావాలి! అని వర్ణించినారు.  తాళ్ళపాక తిరువేంగళనాధుడు ఇంకా ఈ విధంగా వివరించి వర్ణించారు.

సిరి గంటి చెన్ను మించిన మేను గంటి

కరమొప్పు వదన వికాసంబు గంటి

సల్లలితావనీస్తన కుంభశుంభ

పల్లవంబులబోలు పాదముల్గంటి

సరసీజ హల శంఖ చక్రాంకుశాంక

చరణముల్ జగదేక శరణముల్ గంటి

ధరణీ బింబము చాయ దరళించు కనక

సురుచిరాంశుకము నంశుకము గన్గొంటి

శ్రీ మించు కటితట శ్రీ సతీవరణ

దామముల్ మేఖలా దామముల్గంటి

వాత్సల్య జలధి కైవడి నొప్పుచున్న

వత్సంబు గంటి శ్రీవత్సంబు గంటి

చుట్టు కైదువు వలచుట్టు శంఖంబు

పట్టి చూపట్టిన బాహువుల్గంటి

శీతాంశు మండల శతకోటి కోటి

రీతి జూపట్టు కిరీటంబు గంటి

మలగులై తెల్ల దామరల దామరలన్

గలహించు నిడువాలు గన్నుల గంటి

మకర కుండల బాల మార్తాండ రుచుల

వికసించు వవదనార విందంబు గంటి

ఈ విధంగా ఆ మహనీయులకు భగవత్ దర్శన కాంక్ష ఒకసందర్భంలోనే నేరవేరించింది అని శ్రీవైష్ణవ సంప్రదాయ గాథలలో వివరిస్తారు. (శ్రీ తిరుమంగై ఆళ్వార్దివ్యదేశ వైభవ ప్రకాశిక లో కిడంబి గోపాల కృష్ణమాచార్యుల రచన, ఎన్.వి.ఎల్.ఎన్.రామానుజాచార్యుల ఆంధ్ర వివరణ, దివ్య ప్రబంధ మాధురి, ద్వాదశ సూరి చరిత్ర అనే రెండు రచయిత కె.టి.ఎల్.నరసింహాచార్యులు, ఆళ్వారాచార్యుల సంగ్రహ చరిత్ర రచించిన పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వేంకట లక్ష్మీనృసింహాచార్యులhttps://te.wikipedia.org/ఆధారంగా ఈ వివరాలు దొరికినాయి)

Also read: గోదా తపన: ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల!

పూదత్తాళ్వార్ తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్ (స్మరణ ప్రణామ శ్లోకము) :

తులాయాం శ్రవణే జాతం | కాఞ్చ్యాం కాఞ్చన వారిజాత్ ||

ద్వాపరే పాఞ్చజన్యాశం | సరోయోగి సమాశ్రయే ||

కాఞ్చ్యాం సరసి హేమాబ్జే | జాతాం కాసార యోగినమ్ ||

కలయే యశ్శ్రియఃపత్యూ | రరవిన్దీప మకల్పయత్ |

గోదమ్మ, తిరుప్పావైలో పాశురాల్లో ఈరోజు 11వరోజున గురుపరంపర వాక్యం శ్రీమద్ యామునమునయేనమః ఆ ఆళ్వార్ ను ఆళవందార్ అని కూడా అనేవారు. ఆధునిక కాలంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని మన్నార్‌గుడి పుట్టిన వారు.యమునాచార్యుడు (తమిళంలో యమునత్తురైవర్) లేక అళవందార్ 11వ శతాబ్దం మధ్యభాగంలో శ్రీరంగంలో నివసించిన వైష్ణవ బోధకుడు. విశిష్ఠాద్వైతాన్ని ప్రవచించిన రామానుజుడు యమునాచార్యుడి శిష్యుడే. యమునాచార్యుని రచనలు రామానుజుడే విశిష్ఠాద్వైతానికి మూలబీజాలు వేసిన వారు.

గోదమ్మ రచన పాశురం అర్థం

కత్తుకఱవై= దూడల వంటి పశువులు, పలకణంగళ్ = అనేక మందలను, కఱందు=పాలుపితుకుతున్న వారు, సెట్రార్= శత్రువుల, తిఱల్ అఝియ= బలం నశించే విధంగా, చెన్ఱు= దండెత్తి, శెరుశెయ్యుమ్=యుద్ధం చేసే వారును, కుట్రమ్ ఒన్రు ఇల్లాద= కొరత ఏదీ లేని వారయిన, కోవలర్ తమ్= గోపవంశంలో జన్మించిన పొర్ కొడియే = బంగారు తీగ వలెనున్నదానా, పుట్రు అరవు అల్ గుల్ = పుట్టలోని పాముపడగవంటి నితంబము గలదానా, పునమయిలే= తోటలోని నెమలి వలె ఉన్నదానా, పోదరాయ్=బయలుదేరి రావమ్మా, శుట్రత్తు=చుట్టములు, తోఝిమార్= చెలికత్తెలు, ఎల్లారుమ్= ఎల్లరును, వందు= వచ్చి, నిన్ ముట్రమ్ పుగుందు= నీ భవనమునందు ప్రవేశించి, ముగిల్ వణ్ణన్= మొగిలి వర్ణముకలగిన (మేఘపు మేని రంగువాడు) శ్రీకృష్ణుడు, పేర్ = పేరు, పాడ= పాడుటకు, శెల్వ= అందమైన, పెండాట్టి నీ=సతీమణీ, శిట్రాదే పేశాదే= ఉలకకుండా పలకకుండా, ఎత్తుక్కు= ఎందుకు, ఏ ప్రయోజనాన్న ఆశించి, ఉరంగుమ్= నిద్రిస్తున్నావు, పోరుళ్= దీనికి కారణమేమిటి?

మేలు కొలుపులు

ఎంత అందమైన భావన? కొమ్ములతో కుమ్ముతాయని భయపడకుండా పాలు పిదికే వారు. రణంలో బాణాలు లెక్క చేయక అరివీరుల ప్రాణాలు తీసేందుకు వెనుకాడని వీరులు

యాదవులనే హరివంశంలో వీర పుత్రికకు మేలుకొలుపుల గీతికలు.

మరో భక్తురాలిని గోప బాలిక ప్రశ్న:

ఓ సౌందర్యరాశీ నెమలిపింఛాల నెలతా, పడగ

నితంబపు పడతీఅందాల భరణీ ఎంత సేపీ నిద్ర నీకు.

భక్తురాలి జవాబు:

నీవు కృష్ణప్రియవని, నీవు తోడైతే నెమలి పింఛమువాడు మమ్ము కాచేనని నీకై వేచి వేచి, మా కనులు కాచినా కదలవేమిది కమలాక్షీ

గోప బాలిక:

మొద్దునిద్దుర వదిలి ముద్దుగుమ్మా లేవవమ్మా. మోహన రూపుని

జగదేకసుందరు కృష్ణమూర్తిని ఆడిపాడి కొనియాడుదాం దావమ్మా

భక్తురాలు:

తొలి కిరణాల వెచ్చని వెలుగుల యమునలో మునకతో  లోకులందరికీ దారి చూపిన

గోపికా కన్నెల గొప్ప నోముకు కదలవే రేపల్లె పిల్లా లేచిరావే తల్లీ

ఆ భక్తురాలి అయిన గోద పాడిన మధుర గీతం ఈ పాశురం.

“కత్తుకఱవై” దూడలు గల ఆవులు, దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే “క్కణఙ్గళ్” గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల “పలకఱందు” పాలు పితకటంలో నేర్పరులు. “శెత్తార్ తిఱల్ అరియ” శత్రువుల బలం నశించేట్టుగా “చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం” వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, “కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం” ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అవి బాగా పెరిగిన పశువులుకావు. దూడలు. అవి అనేక మందలుగా ఉన్నాయి.

గోధూళి దూసరిత కోమల గోపి వేషం గోపాల బాలక శతై రనుగమ్యమానం

సాయంతనే ప్రతిగృహ్యం పశుబన్ధనార్థం గచ్ఛన్త మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యమ్

ఆ పశువులపాలూ పితకగలరు, అదే చేత్తో శత్రువులపై దండెత్తిన వారిని నాశనమూ చేయగలరు, వారు యాదవులు. ఏ దోషమూ లేని వారు ఆ కులంలో పుట్టిన గోపాల బాలికవు నీవు.

కారణం కృష్ణ స్పర్శ

గోకులంలో గోవులన్నీ నిరంతరం యవ్వనంలో ఉన్నాయట. వాటన్నింటికీ దూడలు కూడానట. అవన్నీ కడవల నిండా పాలు స్రవిస్తూనే ఉంటాయట. ఇది ఏ విధంగా సాధ్యం? కారణం కృష్ణ స్పర్శ. గోవున్నింటనీ కన్నయ్య ప్రేమతో తడుముతాడట. తానే వాటికి గ్రాసం వేస్తాడట. తినిపిస్తాడట. తానే ప్రతి గోవునూ కట్టివేస్తాడట. అక్కడ ఎన్ని గోవులో అందరు కృష్ణులట. వత్సమధ్యగతం బాలం, అంటే దూడల మధ్య తిరుగాడే బాలుడు ఈ దేవుడు. ముక్త పురుషులు నిత్యసూరులు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారట.

పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం

యాదవులు అరివీరులు, అమాయకులు. హరివంశానికి చెందిన “పొఱ్కొడియే” బంగారు తీగ, తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ. పాము పడగవంటి నితంబము, వనమయూరము వంటి వయ్యారము కలిగిన సౌందర్యవతివి. బంధువులు చెలికత్తెలంతా చేరి నీ భవనం ఆవరణలోకి వచ్చి ఉన్నాం. “పుత్తరవల్ గుల్ ” తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, “పునమయిలే” ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. “పోదరాయ్”రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం.

“శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు” ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి, “నిన్-ముత్తం పుగుందు” నీ ముంగిట ప్రవేశించి, “ముగిల్ వణ్ణన్ పేర్-పాడ” నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. మొయిలు వంటి (మేఘం) వర్ణం కలిగిన శ్రీ కృష్ణుని తిరునామాలను కీర్తిస్తున్నాము. నీవు మాకందరికీ పెన్నిధివి. ఉలకవు పలకవు, ఎందుకు నిద్రపోతున్నావమ్మా తల్లీ, లేచి రావమ్మా.

భగవద్దర్శనముతో గోపికలూ స్పర్శనముతో గోవులూ పులకిస్తున్నా గోలోకం బృందావనం. అవి దూడలే అయినా శ్రీకృష్ణుని కరస్పర్శచేత అవి పొదుగులనుంచి పాల ధారలను కార్చగల పశువులవుతున్నాయి. భగవంతుని స్పర్శమాత్రం చేతనే నిరంతర పైలా పచ్చీసు (మొదటి 25 ఏళ్ల వయసు) నిత్యయవ్వనంతో ప్రకాశించేవారే నిత్యసూరులు.

64వేల సంవత్సరాల వయసున్న దశరథుడు, గంభీరగమనుడైన రాముని చూచినప్పుడల్లా మళ్లీ యవ్వనవంతుడిగా మారుతున్నట్టు చెప్పుకున్నాడు. భగవంతుడిని దర్శనమే యవ్వనమిస్తే, స్పర్శనము ఏదైనా ఇవ్వగలదు కదా? గోపాలురు స్వతంత్రులు. వారు గోపాల కృష్ణుడికి ఆప్తులు, కాని వారికన్న అస్వతంత్రులైన గోపికల ఎడల అధిక ప్రేమానురాగాలు. వారికంటె ఎక్కువగా గోపకన్యల పట్ల ఆదరాభిమానాలు, వారికంటే కూడా తనను సదా అనుసరించే మూగజీవులైన పశువులంటే ఎంతో ప్రేమ. పశువులకన్న ఏమీ తెలియని దూడలమీద మరింత ప్రేమ వర్షం కురిపిస్తుంటాడు. ఆ మందలు ఎన్నో, వేలకు వేలు. పెక్కు జీవులన్నమాట. కాని పశువులు ఎన్ని వేలున్నా, గోపాలుడు ఒక్కడు చాలు అన్ని పశువులనే మేపడానికి, పాలు పితకడానికి.శత్రుసైన్యాన్ని సమూలంగా నాశనంచేయగల వీరులు యాదవులు. శ్రీకృష్ణుని ఓర్వలేని వారు యాదవుల శత్రువులు. భాగవతులను బాధించే వారు శ్రీకృష్ణుడికి శత్రువులు. వీరులకు ఏవో దోషాలు ఉంటాయి.

రాముడు ‘‘నేడు పోయి రేపురా’’ అని, రావణుడుతో బతికించిపోయాడు

కుట్రమ్ మిల్లాద, వీరిక మాత్రం ఏ దోషాలు లేవు. వెనుదిరిగిపోరు, నిరాయుధులతో యుద్దం చేయరు.బంధువులను హరించి, రథాన్ని కూల్చి, ఆయుధాలను ధ్వంసంచేసి, చేష్టలుడిగి నిలిచిన రావణుడికి మరో అవకాశం ఇచ్చి ‘‘నేడుపోయి రేపురా’’ అని పంపించిన కరుణా సముద్రుడు రాముడు.యుధ్దంలో తనపై ప్రయోగించిన ఆయుధాలన్నీ కోల్పోయిన రావణుడిని చంపవచ్చు. కాని గచ్చానుజానామి రణార్థితస్త్వమ్, ‘‘అలసిపోయిన ఓ రావణా ఇంటికి వెళ్లు మళ్లీ ఆయుధాలను సమకూర్చుకుని రేపు రా’’ అని పంపిస్తాడు. అవక్రపరాక్రములు, దోషం లేని మహావీరులు యాదవ వీరులు. వారి కులానికే అలంకారం సకలసంపదలున్న ఈ గోపిక, బంగారు తీగ, ఫణిఆకార నితంబిని, వన మయూరి. కేశభారము నెమలి పింఛము వలె ఉందట. నడిస్తే నెమలివలె నడుస్తుందట. ఇక మయూరపింఛ ప్రియుడైన శ్రీకృష్ణుడు ఎందుకు ఇష్టపడడు? అందరూ వచ్చారా మరి అని అడిగిందట ఆమె. గోకులంలోని గోపికలంతా వచ్చి చేరుకోగలిగేంత పెద్ద ప్రాంగణం ఉంది.

కరిమబ్బు వంటి కన్నయ్య

అక్కడ మొయిలు (కరిమబ్బు) వర్ణమువాడైన శ్రీకృష్ణుడిని స్తుతిస్తున్నారు. మేఘం తో పోలిక ఎందుకంటే ఎవరు తనవారు ఎవరు కారు అనే వివక్ష లేకుండా కరిమబ్బు అందరిమీదా వాన కురిపిస్తుంది, మురిపిస్తుంది. శ్రీ కృష్ణుడూ అంతే. పాపపుణ్యాల తారతమ్యాలు లేకుండా స్వపరభేదం లేకుండా అందరిమీదా కరుణ కురిపిస్తాడు. ఆమె శ్రీకృష్ణానుభవమనే విశిష్ఠమైన సంపద కలిగిన శెల్వపెండాట్టీ.

నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి పరుగెత్తివచ్చినట్టు, నీలి మేఘశ్యాముడిని మేము కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, “శిత్తాదే” ఉలుకు లేదు “పేశాదే” పలుకు లేదు “శెల్వప్పెణ్డాట్టి” ఓ సంపన్నురాలా! “నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్” ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.

పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం

పదోరోజున రోజున జ్ఞానవతి అయిన గోపికను నిద్రలేపిన ఆండాళ్ 11వ రోజున సౌందర్యవతి అయిన మరో భక్తురాలైన గోప బాలికను తోడ్కొని పోవడానికి ఆమె వాకిట నిలిచి ఆహ్వానిస్తున్నారు. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం. గోపికలు ఒక కంటి రెప్పపాటు కూడా గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తులు తమనొక నాయికగా భగవంతుడిని నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానములే వారి సౌందర్యప్రకాశాలు. కాబట్టి, ఈ గోపికను తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ప్రయత్నిస్తున్నారు.

గోపికలు “యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే” అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు కూడా గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తులు తమనొక నాయికగా భగవంతుడిని నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానములే వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తే ఆ భక్తి సౌందర్యానికి ఆయన వశమైపోతాడు. సంపన్నురాలైన ఈ గోపబాలికకు పురుషోత్తముడిని ఆకర్శించే భక్తి సౌందర్యం ఉంది. భగవత్ సేవా సంపద అధికంగా కలిగిన ఈ గోపికను తీసుకుని వెళితే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని గోద భావం.

Also read: ఆధ్యాత్మిక బోధకులు న.చ. రఘునాధాచార్యులు

గోదమ్మ పాదాలే మనకు శరణు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles