Monday, April 29, 2024

హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

9 తిరుప్పావై

మాడభూషి శ్రీధర్

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్ !

తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక

నవరత్న ఖచిత స్వర్ణ దీపస్థంభములు కాంతులీన

ధూపసుగంధ పుప్పొడుల మెత్తని పట్టు పరుపుపైన

హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

చిరుగంటలు వేలాడు మణిద్వారాలగడియ తీయవమ్మ

అత్త నీవైన బిడ్డనులేపవమ్మ, ఆమె వినదా మూగదా

మాయలేవైన సోకెనా మత్తుమందేమైన జల్లిరా యేమి,

మాయావి మాధవుని వైకుంఠవాసుని గొంతెత్తి కీర్తించి

గరుడవాహనునోముకై కలిసిరమ్మని గట్టిగాజెప్పవమ్మ

అర్థం

తూమణి మాడత్తు=స్వచ్ఛమైన సహజమైన మణులచేత నిర్మించిన భవనంలో, చుట్రుం= చుట్టూ..అంతటా, విళక్కు ఎరియ=దీపాలు వెలుగుతూ ఉండగా,దూపం కమఝ=సుగంధ ధూపాలు వ్యాపిస్తుండగా, త్తుయిల్ అణైమేల్=పడుకున్నవెంటనే నిద్రవచ్చేంత మెత్తని పడకపై, కణ్ వళరుమ్=కనులుమూసుకుని నిద్రిస్తున్న, మామాన్ మగళే=మామకూతురా, మణిక్కదవమ్=మణులతో నిర్మించిన తలుపు, తాళ్=గడియను, తిఱవాయ్=తెరవవోయ్, మామీర్ = ఓ అత్తా, అవళై ఎఝుప్పీరో= నీ కూతురును లేపవమ్మా, ఉన్ మగళ్ దాన్= నీకూతురు ఏమైనా, ఉమైయో=మూగదా, అన్ఱి=లేకపోతే, చ్చెవిడో=చెవిటిదా, అనన్దలో= అలసిపోయి నిద్రిస్తున్నదా,ఏమప్పట్టాళో=కావలిలోఉంచినారా, పెరుందియిల్= చాలా సేపు నిద్రపోయేట్టు, మందిరప్పట్టాళో=మంత్రంచే కట్టుబడి ఉన్నదా, మామాయన్=మహామాయావీ, మాదవన్=మాధవుడా, వైగుందన్= వైకుంఠవాసా, ఎన్ఱు ఎన్ఱు= అని మళ్లీ మళ్లీ, పలవుమ్= సహస్రాధికమలైన అతని, నామమ్ భగవన్నామాలను, నవిన్ఱు=కీర్తించాము.

భావార్థం:

          మేలైన తొమ్మిదరకాల మణులతో నిర్మితమైన మేడ, అందులో పడుకోగానే నిద్రవచ్చే మెత్తని పరుపు, చుట్టూ దీపాల వెలుగులు, సుగంధ ధూపాల ఘుమఘుమలు, హాయిగా నిద్రపోతున్నావా ఓ మామ కూతురా ! మణి కవాటపు గడియతీయవా? ఓఅత్తా ! నీవైనా నీకూతురిని నిద్రలేపవా? నీకుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక ఎవరైనా కదలినా ఒప్పుకోమంటూ కావలి పెట్టారా, లేక గాఢనిద్రపట్టునట్లు మంత్రించినారా? మహామాయావీ!మాధవా ! వైకుంఠవాసా ! అని అనేక భగవన్నామములను కీర్తించి ఆమె నిద్రలేచునట్లు చేయుము.

Also read: లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె

‘శ్రీమతే రామానుజాయ నమః’

కృతయుగంలో అనంతుడు, త్రేతాయుగంలో లక్ష్మణస్వామి, ద్వాపరంలో బలరాముడు, కలియుగంలో శ్రీరామానుజులు అని వైష్ణవుల నమ్మకం. తాళ్లపాక అన్నమయ్య భగవద్రామానుజులవారిని ఈ పల్లవితో రచించిన కీర్తన ఇది: గతులన్ని ఖిలమైన కలియుగమందును |గతి ఈతడే చూపె ఘన గురుదైవము ||

చరణం 1:

ఈతని కరుణనేకా ఇల వైష్ణవులమైతి |
మీతని వల్లనే కంటిమీ తిరుమణి |
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము |
ఈతడే రామానుజులు ఇహపర దైవము ||

చరణం 2:

వెలయించె నీతడేకా వేదపు రహస్యములు |
చలమి నీతడే చూపె శరణాగతి |
నిలిపినాడీతడేకా నిజముద్రా ధారణము |
మలసి రామానుజులు మాటలాడే దైవము ||

చరణం 3:

నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు |
దయతో మోక్షము చూపె తగనీతడు |
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను |
దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి దైవము ||

(ఈ కీర్తన వినవచ్చు https://www.youtube.com/watch?v=N408dIIVTaw, https://www.youtube.com/watch?v=5rdJ-YCrSoI)

భగవద్రామానులకు ‘తిరుప్పావై జియ్యర్ అని పేరు. తిరుప్పావై రచయిత్రి తిరునామంలో గోదానామ అమృతమైన మాటగా మిగిలింది.

ఈ రోజు నాలుగో గోపికను, తిరుమళిశయాళ్వార్లను మేల్కొలుపుతున్నారు గోదమ్మ. ఆచార్య నమస్కార మంత్ర పరంపరలో ‘శ్రీమతే రామానుజాయ నమః’ మంత్రాన్ని సంబోధించారు. భగవంతునితో మనకు ఉన్న సంబంధాన్ని వివరించే పాశురం ఇది. తొమ్మిదో పాశురం పూర్ణత్వాన్ని సూచిస్తుంది. నవ విధ మణులను, నవ విధ భక్తులను సూచిస్తుంది. శ్రీమతే రామానుజాయనమః మంత్రపూతమైన పాశురంజీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం.

నవ విధ మణులను, నవ విధ భక్తులను గుర్తు.

         మొదటి రెండు పాశురములలొ శ్రవణము గురించి వివరించారు. తర్వాతి పాశురములో మననము ప్రాధాన్యత నిరూపించారు. నాలుగు పాశురములలొ ధ్యానదశ వివరించారు. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగినవారికే తాను దక్కుతానని అన్నాడు శ్రీకృష్ణుడు. అట్లా అయితే మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు. కనుక మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానములో పరాకాష్టపొంది నిద్రిస్తున్న నాల్గవ గోపికను ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఓ మామకూతురా ! మరదలా లేవమ్మా ! అంటున్నారు.

         గోపికలు నిద్రిస్తున్న గోపాంగనా భవన వైభవ వర్ణనతో పాశురం మొదలవుతుంది. నవరత్నఖచిత భవనం, ధూపదీపాలతో వెలిగే నివాసం. మణులు దోషరహితమైనవట. పరిశుధ్దముచేసినవట. శరీరమనే భవనం సంసారబంధాలచే కప్పబడి ఉండడం వల్ల ప్రకాశాన్ని కోల్పోతాయి. మోక్షదశకు చేరేనాటికి కర్మబంధాలు తొలగి ప్రకాశిస్తూ ఉంటాయి. నవమణులు అంటే నవద్వారాలతో కూడిన శరీర భవనమని ప్రతీక. మలినములు తొలగిన జీవివలె భవన శరీరం భాసిస్తున్నది. జీవుడికి పరమాత్మతో ఉన్న సంబంధాలలో ఆధార ఆధేయ సంబంధం ముఖ్యమైంది. జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం అని దీని అర్థం. అంటే జీవునకు పరమాత్మశరీరం వంటి వాడు. ఆ పరమాత్మ ఎప్పుడూ సహజమైన మణులతో ప్రకాశిస్తూ ఉంటాడు. మరకతపేటికలో పెట్టిన వస్తువు ఏ విధంగా బయటకు కనిపిస్తుందో అదే విధంగా భగవంతుడి హృదయంలో భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. భగవంతుని భవనం కన్న ఈ గోపాంగనా భవనం సహజమణులతో నిర్మించబడిందని గోపికలు మెచ్చుకుంటున్నారు.

Also read: గోదా తపన: ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల!

చుట్రుమ్ విళక్కెరియ: మణికాంతులతో భవనం ప్రకాశిస్తున్నప్పడికీ మంగళార్థంగా దీపాలు వెలిగిస్తున్నారు. పగటివేళల్లో కూడా భగవత్సన్నిధానంలో దీపాన్ని వెలిగించడానికి ఇదే కారణం. బయట మాహృదయాలనే దీపాలు చీకట్లో ఉంటే లోపల అంతటా దీపాలు వెలుగుతున్నాయే అని గోపికలు అడుగుతున్నారట. శ్రీకృష్ణుడు తనను వెతుక్కుంటూ వస్తాడనీ, అతనితో సల్లాపాలాడాలనీ దీపాలు వెలిగించి ఉంచారట. దీపం లేని ప్రాణం లేని శరీరం తో సమానం. దీపపు ప్రమిద శరీరం అయితే అందులో నేయి లేదా నూనే మనలోని ప్రేమ, ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అవుతుందని, ఆ విధంగా ప్రకాశింప చేసే శాస్త్రాలు మనకు ఉండాలి, మనం పెట్టే వత్తులురెండు శాస్త్రాలకు గుర్తు. వేదం, వేదాలపై వ్యాఖ్యానం అనే రెండు వత్తులు దేవుడివైపు తిరిగి ఉండాలనీ, వెలిగించే నిప్పు మన జ్ఞానమని, ఆ జ్ఞానం ప్రేమమయమై శాస్త్రాలకు అనుగుణంగా ఉంటే ఎదుట ఉన్న రూపం మనకు స్పష్టంగా దర్శనం ఇస్తుందని జీయర్ ఉపదేశించారు. కేవలం వెలుతురుకోసమే కాకుండా దీపాన్ని మంగళ ప్రదంగా వెలిగిస్తారు,

         దూపమ్ కమఝ: కంటికి కనిపించని దూపం పరిమళాలు వెదజల్లుతున్నది. జ్ఞానం పరిమళిస్తున్నదని భావం. తుయులనై మేల్ కణ్ వళరుమ్: పడుకున్నవెంటనే నిద్రబుచ్చే పడక. నిద్ర అనకుండా మర్యాదగా కళ్లుమూతపడుతున్నాయని అన్నారట, భాగవతుల శయన సౌందర్యవర్ణన ఇది. సకల లోకాధినేత అయిన శ్రీకృష్ణుడిని పొందగలుగుతున్నాను కనుక ఈమె ఏ విచారమూ లేకుండా నిద్రిస్తున్నది. ద్వయంలో పూర్వభాగపు అర్థాన్ని భావిస్తూ ఉన్నదట లోపలున్న ఈ గోపబాలిక.

         మామాన్ మగళే అంటే ప్రేమాదరాలతో బాంధవ్యాలను కల్పించుకుని మాట్లాడుకోవడం వంటిది. మామ కూతురా అని సంబోధించడం. మామాన్ అంటే మాలాకారులనే అర్థం కూడా వస్తుంది. బలరామకృష్ణులు మాలాకారుని గృహానికి వస్తారు, విష్ణుచిత్తులను కూడా అభిమానించారు. మామాన్ మగళే అని పిలువగానే గోపిక సంతృప్తురాలై బయటనుంచి కూడా తలుపు తెరుచుకోవచ్చు. తెరుచుకుని లోనికి రావచ్చుననే భావనతో ఆమె పడకమీదనుంచి కదలడం లేదట. వీరేమో బయటనుంచి మణిక్కదవం తాళ్ తెరవాయ్ అంటే మాణిక్య కవాటాల తాళం తీయమ్మా అంటున్నారు. ఆమె తల్లితో కూడా బంధుత్వం కలుపుకుని అత్తా ఆమెను లేపరాదా అని చెలికత్తెలు ప్రశ్నించారు. అయినా లేపకపోతే కొంత కోపంతో నీకూతురు అంటారట. కూతురు మీద ప్రేమ ఉన్నప్పుడు మామీరు అత్తగారూఅని పిలిచారు. కొంత కోపం రాగానే తల్లితో ఉన్ మగళ్ నీ కూతురు అనేంత దాకా వెళ్లిందట.

         మేం వాకిట నిలబడి పరితపిస్తూ ఉంటే తెలిసి కూడా అయ్యో అనకుండా ఉండడానికి ఆమె మూగదా. అన్ఱి చ్చెవిడో పోనీ మూగ అనుకుందాం. మాటలువిని తలుపు తీయొచ్చు కదా? చెవిటిదికూడా అయిందా? ఆనందలో…అదీకాకపోతే రాత్రంతో శ్రీ కృష్ణసంశ్లేషంతో ఉన్నందున ఇప్పుడుగాఢనిద్రలో ఉందేమో. మాట వినికిడి మనసు మూడూ భగవంతుడిమీదే సంలగ్నమై ఉంటే మామాట ఎందుకు వినిపిస్తుంది?

ఏమప్పట్టాలో, శ్రీకృష్ణుడితో మాట్లాడకుండా ఈమెనెవరైనా బంధించారో ఏమో. వాగ్బంధం చేశారా? పెరుందుయిల్ మందిరప్పట్టాలో.. చాలాసేపు నిద్రించేట్టు ఏమైనా మంత్రా వేశారా ఏమి?

         మామాయన్.. శ్రీకృష్ణుడి లీలలు మాయలు ఆశ్చర్యంగొలిపేవి. ఆ చేష్టలతో అబలలైన మమ్మల్ని ఉద్ధరించిన వాడు మాయావి, మాధవుడు లక్ష్మీపతి. నీవేమో నిన్ను బాధించిన రాక్షసస్త్రీలపైన కూడా కరుణ చూపించే దయావారాశివి కదా. నీ దయతో వారు రామగోష్ఠిగా మారారు. వైకుంఠమనే ఉన్నత లోకంలో ఉన్నజగన్నాథుడు ఊహాతీతుడై శ్రీదేవితో కూడిన వాడు భాగవతులతో కొలువుదీరిన వాడు..ఇంకా ఎన్ఱెన్ఱు ఎన్నెన్ని నామాలని చెప్పడం.. వనామమ్ పలవుమ్నవిన్ఱు వేలనామాల వెన్నుని స్తుతించాము కదా. కోరతేముంది.

మణులు తొమ్మిది రకాలు. భగవంతునితో చేతనుడికి తొమ్మిది సంబంధాలు ఉంటాయని ఈ శ్లోకం వివరిస్తుంది.

పితాచ రక్షక శేషి భర్తా జ్ఞేయో, రమాపతి, స్వామ్యాధారో, మమాత్మచ,భోక్తా చాద్యమనూదితః

         భగవద్రామానుజులు గోదమ్మకు అన్నయ్య

         1. పిత (పితాపుత్ర సంబంధం), 2. రక్షకుడు (రక్ష్యరక్షకసంబంధం), 3. శేషి (శేషశేషి సంబంధం), 4 భర్త (భర్తృభార్యాసంబంధం), 5. జ్ఞేయుడు (జ్ఞాతజ్ఞేయసంబంధం), 6. స్వామి (స్వామిస్వత్వ సంబంధం), 7. ఆధారము (ఆధార ఆధేయ సంబంధం), 8. ఆత్మ (శరీరాత్మసంబంధం), 9 భోక్త (భోక్తృభోగ్య సంబంధం). ఈ తొమ్మిది రకాల సంబంధజ్ఞానమే నవవిధరత్నాలు. ఆ రత్నాలతో నిర్మించిన మేడలో గోపిక సంపూర్ణమైన భగవదానందంతో నిదురిస్తూ ఉంటుంది. తొమ్మిది సంబంధాలతో భగవంతుడిని భావించడమే ప్రజ్ఞ అంటారు, ఆ ప్రజ్ఞయే మణిమయభవనము. చుట్టుదీపమంటే శాస్త్రాధ్యయము వలన కలిగిన జ్ఞానదీపము. అగరు ధూప పరిమళం అంటే జ్ఞానం మాత్రమే కాక అనుష్టానమును సూచిస్తున్నది. మణులతో నిర్మించిన తలుపులంటే వ్యామోహజనకములైన అహకార మమకారములు, ఇవన్నీ ఆచార్య కటాక్షముచేత మాత్రమే తొలగిపోతాయి. భగవంతుని యందు దృఢాధ్యవసాయము కలవారు మూగవారుగా చెవిటివారుగా బద్ధకస్తులుగా కనిపిస్తారు. వారిని మంత్రించేది కావలి యుండునది భగవంతుడు మాత్రమే.నవ విధ భక్తులు అర్చనము, ఆత్మనివేదనము, కీర్తనము, దాస్యము, పాదసేవనము, వందనము, శ్రవణము, సఖ్యము, స్మరణము. రామానుజులు నవ రత్నముల వంటి గ్రంధాలు మనకు ఇచ్చారు.

అవి 1. శ్రీ భాష్యము, 2. వేదాంత దీపము, 3. వేదాంత సారము, 4. వేదార్థ సంగ్రహము, 5. నిత్యగ్రంథము, 6. గీతా భాష్యము, 7. శరణాగతి గద్యము, 8. శ్రీ రజ్ఞ గద్యము, 9. శ్రీవైకుంఠగద్యము.

ఈ పాశురంలో తిరుమళిశైయాళ్వార్ల ప్రస్తావన ఉందని తెలుసుకున్నాం కదా. మామాన్ మకళే అని సంబోధన. గోదాదేవి లక్ష్మీదేవికి చెల్లెలు. లక్ష్మి భృగుమహర్షి కూతురు. గోదాదేవి తండ్రి కూడా భృగువంశ సంజాతులే. కనుక వారు మామాన్ మకళే (మామకూతురా) అన్నారు. ఆండాళ్ అందరికీ తల్లి. భ్రాతాచేత్ యతిశేఖర అంటే భగవద్రామానుజులు ఆమెకు అన్న. కనుక యతిరాజు మామ లవుతారు. కనుక ఇది శ్రీమతే రామానుజాయనమః అనే నమోవాకంతో కూడుకున్న పాశురం అని కందాడై రామానుజాచార్యస్వామి వివరించారు. బయట నిలిచి పిలిచే వారు లక్ష్మణుని వంటి వారు, అంటే స్వామికి కైంకర్యము చేసే ముముక్షువు వంటి వారు. లోపల నిద్రించే యువతి నిత్యసూరుల వంటి వారు అంటే స్వామిని అనుభవించేవారు. లోపలిబాలికకు పెరుమాళ్లే ఉపాయము అంటే తదేక ఉపాయ నిష్ట. ఇతర సాధనములద్వారా ఉపాయముల ద్వారా స్వప్రయత్నంచేత స్వామిని చేరాలనుకునే గోష్టి సభ్యులు అనన్య ఉపాయ నిష్ట అవలంబించేవారు. ఆండాళ్ దివ్యతిరువడి ఘళే శరణం అంటే  గోదమ్మ పాదాలే శరణు.

10. తిరుప్పావై – మాడభూషి శ్రీధర్ 

తలుపు తెరవకున్నపోనిమ్ము పలుకైన పలుకవేమినోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక

నోములెన్నొనోచి కృష్ణసంస్పర్శస్వర్గాన తేలుతున్నావా

తలుపు తెరవకున్నపోనిమ్ము పలుకైన పలుకవేమి

కిరీటి, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు

పల్లాండు పాడిన పరవశించు పరమానందమూర్తి

పఱై నిచ్చి పర తత్త్వజ్ఞానమ్ముకూడా బోధించువాడు

రామబాణహతుడు కుంభకర్ణుడు నిద్రలో నీచేత ఓడెనా

నారీ రత్నమా మత్తులో తొట్రుపడక నెమ్మదిగ

గడియ తీయరమ్ము, నోము కై మా తోడ కలిసి రమ్ము.

శ్రీ కృష్ణానుభవం, శ్రీ కృష్ణ సంశ్లేషమే, స్నానం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా. అటువంటి విశేషమైన గోపికను, జ్ఞానదీపం వెలిగించిన పేయాళ్వారులను ఈ రోజు మేల్కొలుపుతున్నారు.  శ్రీవైష్ణవంలో పొయ్ గై ఆళ్వార్, తరువాత పూదత్తాళ్వారులు, ఆ తరువాత పేయాళ్వార్ వచ్చారు. ఈ రోజు గురువాక్య పరంపరలో శ్రీపరాంకుశ దాసాయ నమః మంత్రాన్ని అనుసంధానం చేసారు గోదాదేవి. అందరూ ఒకటే అనీ, భూమిమీద నివసించే వారంతా కలిసి ఉండాలని, మంచి తనం పెంపొందించుకోవాలని, అందరినీ కలుపుకుని పోవాలని, అందరూ భగవద్గుణాభవాన్ని పొందాలని గోదాదేవి అభిలషిస్తూ ఈ వ్రతాన్ని రూపొందించారు.

అర్థం

నోట్రు= నోము నోచి, సువర్గమ్ పుగుగిన్ఱ = స్వర్గాన్ని ప్రవేశిస్తున్నంత సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా, వాశల్= వాకిలి తలుపు, తిఱవాదార్= తీయని వారు, మాట్రముమ్ తారారో= ఒక బదులు మాటైనా మాట్లాడరా, నాట్రత్తుఝాయ్ ముడి = పరిమళాలు గుబాళిస్తున్న తులసీమాలచే అలంకృత కిరీటముగల, నారాయణన్=నారాయణుడు అనే దివ్యనామాంకితుడు, నమ్మాల్= మనచేత, పోట్ర=పల్లాండును, పాడించి, ప్పఱైతరుమ్ = మనకు ప్రాయమైన కైంకర్యాన్ని పఱైని అనుగ్రహించే వాడు, పుణ్డియనాల్= పుణ్యస్వరూపుడైన శ్రీమహావిష్ణువుచే, పండు ఒరునాళ్ = ముందొక కాలంలో, కూట్రత్తిన్ వాయ్ వీఝన్ద = యుముని నోట్లో పడిన, కుంబకరణనుమ్, కుంభకర్ణుడును, ఉనక్కే తొట్రు= నీకు ఇచ్చి వెళ్లాడా, ఆట్ర ఆనందలుడైయాయ్= గాఢమైన నిద్రను కలిగిన దానా, అరుంగలమే =దుర్లభమైన ఆభరణమా, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలిచుకొని వచ్చి, తిఱ=తలుపు తీయి.

సారాంశం

నోమునోచి హాయిగా నిద్రిస్తున్న అమ్మా, వాకిలి తలుపు తీయకపోతే పోయే కనీసం మాటైనా మాట్లాడకూడదా, కిరీటంలో తులసిమాలను ధరించి నారాయణ దివ్యనామంతో భాసిల్లేవాడు, మనకు పల్లాండు పాడే అవకాశం కల్పించి మనకు పఱైని లేదా పరాన్ని అనుగ్రహించేవాడు ధర్మం మూర్తీభవించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు, అతని చేతిలో పడి యముని జేరిన కుంభకర్ణుడు అంతకు ముందే నీతో ఓడిపోయి తన గాఢనిద్రను నీకు ఇచ్చాడా ఏమి? సొగసుగా నిదురించే దానా, దొరకని ఆభరణమా, నిద్రమత్తువదిలించుకుని తలుపు తెరువమ్మా.

వివరణ

శ్రీకృష్ణుడిని చేరి ఆయన ఇస్తానన్న వ్రత పరికరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తున్నది గోద. ఈమె అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ అని తెలిసి జ్ఞానంతో కూడిన భక్తి కలిగిన ఈమెఇంటికి  చేరుకుని సుప్రభాతం పాడి తమతో రమ్మంటున్నారు.

గోద: నోట్రు అమ్మానాయ్ ..ఏవమ్మా మాతో చేరి నోము నోచుదామని చెప్పి, నీవు ముందే వ్రతం ముగించి శ్రీ కృష్ణానుభవమనే స్వర్గాన్ని అనుభవిస్తున్నావా. నీతో కలిసి జీవించడమే స్వర్గం, విడిచి ఉండడమే నరకం అని రాముని గురించి చెప్పింది. గోపికలకు కూడా స్వర్గమంటే శ్రీకృష్ణానుభవమే. ఆ అనుభవంలో లీనమైన వారికి స్వర్గం లెక్కలోకి రాదు. వీళ్ల దృష్టిలో వ్రతమంటే శ్రీ కృష్ణుడే తమకు ఉపాయమనుకుని ఎదమీద చేయి వేసుకుని హాయిగా నిదురించడమే. ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. “తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః ” ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు (త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి వివరణ) భగవంతుడి నిజస్వరూపం తెలుసుకున్నారంటే అన్ని నోములూ నోచుకున్నట్టే.

Also read: ఆధ్యాత్మిక బోధకులు న.చ. రఘునాధాచార్యులు

అందరినీ కలుపుకుని భగవద్గుణాభవాన్ని పొందాలి

గోద: అమ్మనాయ్, నీవు మా అందరికీ నాయికగా ఉండడం అందంగా ఉంది. రక్ష్యారక్షక భావాన్ని నిరాకరించకు తల్లీ, మేం మాత్రం వదలము’’ అన్నారు.

గోపిక: (ఈమాటలు విన్న గోపిక ఆనందాతిశయంతో మౌనంగా ఉందట, మరో అర్థం. ‘‘వీరికి చెలికత్తెను నేను, నన్ను అమ్మనాయ్ అంటున్నారు’’, అని కూడా మౌనంగా ఉందట.

గోద: ‘‘తలుపు తెరవకపోయినా బదులైనా ఇవ్వవా’’ అని బయటనుంచి అడిగారు.

మాట్రముమ్ తిఱవాదార్= ‘‘తలుపు మూస్తే మాట కూడా మూయాలా? కళ్లకు కష్టం ఇచ్చినట్టు, చెవులకు కూడానా? మీరు సుఖానుభవంలో ఉంటే మా గురించి చింతించరా ఏమి? శ్రీకృష్ణునికి సర్వం సమర్పించినప్పుడు మాకు కనీసం మాటలు వినే భాగ్యమైనా కలిగించవా తల్లీ’’.

‘‘మాట్రముమ్ తారారో… విచ్చేయండని స్వాగతం చెప్పాలనేం లేదు. చెప్పండి అని ఓమాటన్నా చాలు. లేదా కోపంగానైనా ఒక మాట చెప్పండి’’. అని గోపికలు అడిగారు.

లోపలి గోపిక: ‘‘శ్రీకృష్ణుడికి సర్వం సమర్పించినానని అంటున్నారే, శ్రీకృష్ణుడైమైనా ఇక్కడున్నాడా?’’ఆనందరూపుడైన వాడు కృష్ణస్వామి, ఆయనే ఆనందము కూర్చేవాడు, ఆయనను తలుచుకుంటూఆనంద స్థితిలో ఉన్నందున గోపిక బదులు పలకలేదట. బయటవారేమో శ్రీ కృష్ణుడు లోపల ఈమెతో ఉన్నాడనీ అందుకే బయటకు రావడం లేదని అనుకుంటున్నారట.

గోద, బయటి గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడి.. నీవు దాచాలన్నా శ్రీకృష్ణుడి కిరీటం చుట్టిన తులసీ మాల సుగంధాలు వెదజల్లుతున్నాయి కదా. నీవలెబహిర్గతం కాని తత్త్వమా ఆయనది’’. తులసి అంటే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి. తులసి విష్ణుపత్ని. తులసీ వనములు ఉన్నచోట శ్రీ హరి తప్పక ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తులసీ పరిమళం ఉంటుంది.

లోపలి గోపిక: ‘‘శ్రీ కృష్ణుడు ఇదివరకొకసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు అంటిన తులసి వాసనల సౌరభం అది.  తులసీదామ భూషణుడి వాసన చూసి ఆయన లోపల ఉన్నాడనడం సరికాదు. అదీగాక నిన్న సాయంత్రం నుంచి అక్కడే మీరు కాపలా ఉన్నట్టున్నారు. మీకు తెలియకుండా శ్రీకృష్ణుడు లోనికెలా వస్తాడుచెప్పండి’’. అది తులసీ దళ పరిమళమే కాని తులసీ ప్రియుడైన శ్రీ కృష్ణుడు ఇక్కడ లేడు.

Also read: పూర్ణం దేనితో నిండినది?

బయటి గోపికలు: ‘‘నారాయణన్..సకల చేతన అచేతన వస్తుజీవములలో లోన పైన వ్యాపించియున్న నారాయణునికి తలుపులు అడ్డమా? సర్వవ్యాపి కనుకఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగలడు. నమ్మాల్ పోత్తప్పఱై తరుం….దేవతలకే అందని ఆ కృష్ణ స్వామి మనవంటి సామాన్యులందరికీ సులభంగా అదేవాడు. పుణ్నియనాల్… పుణ్యాన్ని ఉదారంగా అందరికీ ఇచ్చేవాడు కదా నీ ఒక్క దాని  దగ్గరే పెట్టుకోవడం సబబా?

బయట గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడినారాయణన్ = ‘‘పరిమళ భరిత తులసీమాలాధరుడైన వాడు నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు ఆ వాసన జన్మజన్మాలకూ వీడదు కదా’’.

లోపలి గోపిక మాట్లాడలేదు. మనం జవాబులు ఇస్తూ ఉంటే ‘ప్రతిదానికీ జవాబిస్తూ ఉందే’ అనుకుంటుందని మాట్లాడడం లేదేమో.

బయటి గోపిక: పండొరునాళ్ ఇదివరకు ఒకనాడు కూత్తత్తిన్ వాయ్వాళంద కుమ్బకరణనుం….. కుంభ కరణుడు మృత్యువునోట్లో దూరాడు. అందరినీ రక్షించే రాముడుకుంభకరణుడిని ఎందుకు చంపుతాడు. ఆయనే నడిచి వచ్చి రాముని తో యుద్ధానికి దిగి దీపకాంతికోసం వచ్చి ఆహుతైన కీటకం వలె మృత్యు ముఖంలో తలదూర్చాడు.తొత్తు ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో… ఎంత చెప్పినా నిద్రలేవడం లేదంటేఆ కుంభకర్ణుడు మరణిస్తూ తన నిద్రను నీకిచ్చాడా ఏమి?’’ అని వ్యంగ్యంగా పలుకుతారు గోద.

గోద (లోపలి గోపికతో) అంతటి  మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా? ‘‘లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట ఒక్కటే చాలు మాకు. అదే మా ప్రాణం కాపాడుతుంది.

ఆ నారాయణుని వెలుగే తొమ్మిదో పాశురంలో వెలుగని గోదాదేవి ప్రస్తావించినారు. అయితే ఈ పాశురంలో గోద నిద్రలేపే గోప బాలిక నిజానికి తామస నిద్రలో లేదు. నిరంతరం భగవంతుని తలుస్తూ ఆయన గుణాలను అనుభవిస్తూ కళ్లు మూసుకుని మౌనంగా ఉన్నారామె. అది శ్రీ కృష్ణ సంశ్లేషమనే  నిద్ర. ‘‘నీవు మాకు శిరోభూషణురాలివి. నిద్రలోనుంచి ఒక్క ఉదుటున లేవకు తల్లీ, తొట్రుపడతావేమో. కాస్త సంభాళించుకో సర్దుకో,తరువాతే తలుపు తెరుద్దువుగాని’’ అని గోదమ్మ ఆమెకు విన్నవించుకుంటున్నఘట్టం.

వింధ్య పర్వతం పెరుగుదలను వంచిన

అగస్త్యుడి గొప్పదనం

అగస్త్య ముని దక్షిణ భారతదేశపు ఆధ్యాత్మిక పితామహుడి. ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియను వ్యాప్తి చేయడానికి వాడు. కాంతి సరోవరం అంటే “అనుగ్రహపు సరస్సు”. మొట్టమొదటిగా యోగ విజ్ఞాన ప్రసారం ఈ సరస్సు ఒడ్డున జరిగినందున దీనికి “అనుగ్రహపు సరస్సు” అని పేరు పెట్టారు. పదిహేను వేల సంవత్సరాల క్రితం, హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో, ఆదియోగి కనిపించినప్పుడు, ప్రజలు వేలాదిగా గుమిగూడారు. ఆయన ఉనికే ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. అలా నెలల తరబడి కదలకుండా కూర్చున్నాడు. ఎవరైనా ఇలా కూర్చుని ఉండాలంటే, అతను తన శారీరక స్వభావానికి అతీతంగా వెళ్ళాలి. కేవలం ఏడుగురు మాత్రమే దీనిని గుర్తించారు. అందువల్ల వారు అక్కడే ఉండిపోయారు. ఆ ఏడుగురు వ్యక్తులనే ఈరోజు ‘సప్త ఋషులు’ లేదా ‘సప్త దేవర్షులుగా’ మనం పిలుస్తున్నాం.  అగస్త్యమహర్షిసప్తఋషులలో ఒకరు. ఆయన ఒక నక్షత్రం(Canopus). ఆ సప్త ఋషులు 1. భృగుడు. 2. అంగీరసుడు. 3. కశ్యపుడు. 4. అత్రి. 5. వశిష్టుడు. 6. అగస్త్యుడు. 7. విశ్వామిత్రుడు.ఒక వేదకాలపు ఋషి. మిత్రావరుణులు వేదకాలపు జంటదేవతలు. ఒకసారి వీరిరువురు ఊర్వశిని చూసి మోహపరవశులై వీర్యస్ఖలనం చేసుకున్నారు. ఆ వీర్యాన్ని ఒక కుండలో ఉంచి రక్షించగా దాని నుంచి ఇద్దరు శిశువులు జన్మించారు. ఒకరు అగస్త్యుడు. రెండవవారు వశిష్టుడు.

Also read: అంతర్యామి ఉత్తర మధురలో కృష్ణుడై

ఆ తరువాత దివ్యజ్ఞాని అగస్త్యునితో లోపలి గోపికను పోలుస్తూ మాట్లాడతారు వారు. అగస్త్యుడు కూడా ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా ఏమి అని అంటుంది.కుంభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఒక కుండలో పుట్టిన వాడు. కేదార్ నాథ్ సమీపంలో త్రియుగ్ నారాయణ్ వద్ద పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చూడడానికి అందరితో వచ్చినట్టు అగస్త్యుడు హిమాలయపర్వతాన్ని పైకి ఎక్కుడూతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. మరో సందర్భంలో వింధ్య పర్వతం మేరు పర్వతంతో పడి విపరీతంగా పెరుగుతూ ఉంటే, సూర్యగమనాన్ని కూడా అడ్డుకుంటాడేమోనని భయపడి, వింధ్య పెరగడాన్ని నిలిపి వేయాలని దేవతలంతా అగస్త్యుని వేడుకున్నారు. అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించగానే, గురువుకు వంగి నమస్కారం పెట్టాడట. మహాముని, సరే ఇట్లాగే ఉండు, ‘తథాస్తు’ అన్నారు. అంతే అక్కడే వంగి పోయాడు. వింధ్య పర్వతం పెరుగుదలను ఆవిధంగా ఆయన వంచినాడు.  అని పెరుగుదలని వంచాడు. ఒక్కొక్క పర్వతానికి అధిష్ఠాన శక్తివిశేషం ఉంటుంది. దాన్ని బట్టే ఒక్కో పర్వతానికి విశిష్టత చేకూరుతుంది.
అగం అంటే పర్వతం,  స్తంభింపచేసిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య. మరొక అర్థం ఏమంటే మనలో పెరిగిపోతున్న పాపపు కొండలని స్తంభింపజేసే శక్తి గల మహాముని. అగస్త్యుని గొప్పతనాలు ఇంకా చాలా ఉన్నాయి.  మొత్తం సముద్రాన్ని పానం చేసినశక్తి శాలి. ద్రావిడ భాషకంతటికి వ్యాకరణ సూత్రాలను రచించిన మహ జ్ఞాని. వాతాపి అనే రాక్షసుడిని కడుపులోనే జీర్ణింపచేసి సంహరించిన అద్భుత ముని.

పిచ్చి ఆళ్వార్

పన్నిద్దరు 12 మంది ఆళ్వారులలో ఒకరు పిచ్చి ఆళ్వార్. శ్రీ కృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఆళ్వారులను ప్రస్తుతించే పద్యం ఇది:

‘‘అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగావున్న బె

గ్గలికం దానము బావ నా నిజ మన:కంజాత సంజాత పు

ష్కల మాధ్వీక ఝురిన్ మురారి పొగియంగా జొక్కి ధన్యాత్ములౌ

నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్”

ద్వాదశాదిత్యులు – అంటే పన్నెండు మంది సూర్యులు. వారి వేడిమి తీవ్రత దుర్భరమైనది. ఆ తాప తీవ్రత తగ్గించి మానవుల హృదయాల్లోని అఙ్ఞానాంధకారం దూరం చేసి ఙ్ఞాన దీపం వెలిగించడానికే భూమి మీద ఈ ద్వాదశ దినసూర్యు లవతరించారు. వారికి ప్రణామములు.ఆళ్వారుల నందరికీ వారి సంస్కృత నామాలు చెప్పి సంగ్రహంగా నమస్కరించే శ్లోకమిది:

భూతం సరస్చ మహదాహ్వాయ భట్టనాథ

శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్;

భక్తాంఘ్రీ రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్

శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్”

ఈ శ్లోకంలో 11 ఆళ్వారుల పేర్లున్నాయి – వారు (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్.(‘శ్రీ’, ‘భక్తిసార’ అనే పదాలను విడదీసి ‘శ్రీ’ అనగా అండాళ్ అని కూడా వివరించడం జరుగుతుంది.ఒకోమారు మధుర కవిని కలుపకుండా అండాళ్‌ను మాత్రమే జాబితాకు జోడించి పన్నిద్దరు ఆళ్వారులని లెక్క కట్టడం కూడా లెక్కవేస్తారు. అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు, వారి సంస్కృత పేర్లు ఇవి.

పొయ్‌గయాళ్వార్ – మరొక పేరు సరోయోగి

పూదత్తాళ్వార్ – మరొక పేరు భూతయోగి

పేయాళ్వార్ – మరొక పేరు మహాయోగి

పెరియాళ్వార్ – మరొక పేరు భట్టనాథులు

తిరుమళిశై యాళ్వార్ – మరొక పేరు భక్తిసారులు

కులశేఖరాళ్వార్ – మరొక పేరు కులశేఖరుడు

తిరుప్పాణ్‌ఆళ్వార్ – మరొక పేరు మునివాహనులు

తొండరడిప్పొడి యాళ్వార్ – మరొక పేరు భక్తాంఘ్రి రేణువు

తిరుమంగయాళ్వార్ – మరొక పేరు పరకాలయోగి

ఆళ్వారుక్కు అదియాన్ – మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకులైన ఉడయవర్‘, ‘ఎమ్బెరుమనార్అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)

ఆండాళ్ – మరొక పేరు గోదాదేవి

నమ్మాళ్వార్ – మరొక పేరు శఠకోపముని

ఆళ్వారుల కాలం గురించి నిర్దిష్టమైన ఆధారాలు లేవు. వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం సా.శ. 7వ శతాబ్దం – 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు.

జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష అని జీయర్ వివరించారు. ఈ పాశురంలో పేయాళ్వార్ గురించి ప్రస్తావించారు. 1. పొయగై ఆళ్వారు, (సరోయోగి) 2. పూదత్తాళ్వార్, (భూతయోగి) 3. పేయాళ్వార్ (మహాయోగి) అను ముగ్గురు ముదలాళ్వార్లు. వీరు ముగ్గురు ద్వాపరయుగంలో అవతరించినారు. పేయాళ్వార్లు చెన్నపట్టణానికి సమీపంలో మైలాపూర్ లో నున్న ముణికైరవమను బావిలో ఎర్రకలువ పువ్వులో ఆవిర్భవించినారు.

వీరికి భగవంతుని మీద విపరీతమైన ప్రేమ ఉండి లోకులకు పిచ్చిగా కనిపించేవారు. జడభరతునివలె అంటే మూగవానిలా, జడునిలా, గ్రుడ్డివానిలా, చెవిటివానిలా, పిచ్చెక్కినవానిలా భగవంతుని మీద పాటలు పాడుతూ సంచరించేవారు. వీరిని పేయాళ్వారని పిలిచేవారు. “పేయ్” అంటే పిచ్చి అని అర్ధం.

వీరి భక్తినిష్ఠను పరీక్షిద్దామని ఓసారి పార్వతీ పరమేశ్వరులు వచ్చారట. తామెవరో వెల్లడించి, ఆది దంపతులు ఏదైనా వరం కోరుకొమ్మన్నారట. భగవంతుడిని మించి కోరుకునేదేమిటి అని ఆలోచించి, సరే నాకు బొంత కుట్టుకోవడానికి కష్ఠం అవుతున్నది. ఈ సూదిలోకి దారం ఎక్కించి పెడతారా అని వరం కోరుకున్నాడట. ఆయనకు ఏ అవసరాలు లేవని, భగవంతుడిని తప్ప ఏదీ కోరబోరని ఇది సంకేతం. పేయాళ్వార్ అమితమైన భక్తికి మెచ్చి సాక్షాత్ శ్రియః పతి సర్వాభరణ భూషితుడై, సపరివార సమేతంగా సాక్షాత్కరించాడు. పేయాళ్వారులు తిరుక్కోవలూర్ లో ఉన్న స్వామి శ్రీ త్రివిక్రమన్ (వామనుడు) దర్శించి ఆనంద పరవశులై ఈ క్రింది పాశురమును పాడినారు.

“తిరుక్కణ్డేన్ పొన్ మేని కణ్డేన్ తిఱయుమ్అఱుక్కన్ అణి విరముం కండేన్ శెరుక్కిళరుంపొన్నాయ్ కండేన్ పురిశంగం కైక్కణ్డేన్
ఎన్నాయ్ వణ్ణన్ పాలిన్దు.

గోదమ్మ చరణాలే శరణు

Also read: వెన్నెలలు కురిసే చాలా మంచి రోజులివి

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles