Saturday, April 27, 2024

తొలి భారతీయులు ఎవరు?-1

ఆర్యుల గురించి, ద్రావిడుల గురించి తెలుసుకోవడం మాత్రమే చరిత్ర కాదు. భారత స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలన గూర్చి, లేదా అంతకు ముందు మొఘలుల పాలన గూర్చి తెలుసుకోవడమే చరిత్ర కాదు. ఇంకా అంతకు ముందు చంద్రగుప్తుడి కాలం గూర్చి తెలుసుకున్నా మనకు ఈ గడ్డమీద విలసిల్లిన తొలి భారతీయులెవరో తెలియదు. అది తెలుసుకోవాలంటే ఇంకా వెనక్కి, అరవై లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆధునిక చరిత్ర పరిధిని దాటి నరశాస్త్రం వివరాల్లోకి వెళ్ళాలి. మనిషి-మనిషిగా రూపొందడం,  ఖండాంతరాలకు వలసలు వెళ్ళడం, వ్యవసాయం-వ్యాపారం చేస్తూ క్రమంగా నాగరికుడు కావడం… ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా జరిగింది. అయినా ఇక్కడ విషయాల్ని మన భారత భూభాగానికి అన్వయించి పరిశీలిద్దాం!

జీవపరిణామ క్రమంలో బాగంగా హోమో పేపియన్స్ అవతరించిన తీరు

జీవపరిణామం కొనసాగుతూ, కొనసాగుతూ తూర్పు ఆఫ్రికాలోని లోయ ప్రాంతాల్లో (GREAT VALLEYS) చెట్ల మీద తిరుగాడే ఏప్స్ (APES)తొలిసారి  భూమి మీద నివసించడం ఆరంభించాయి. ఆఫ్రికా ఖండంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా చెట్ల సంఖ్య తగ్గి, మైదానాలు ఏర్పడడం వల్ల  మరో మార్గం లేక ఏప్స్ మైదానాల్లోకి రావల్సి వచ్చింది. APE అంటే మామూలు కోతి/వానరం  కాదు. తోక లేని కోతి అని అంటారు గానీ, వానర-నరులు అంటే బాగుంటుందేమో! అంటే – నరులుగా మారబోతున్న వానరులు! ఇవి చెట్లపై ఉన్నప్పుడు ఒక కొమ్మ నుండి మరో కొమ్మపైకి సులువుగా వెళ్ళడానికి పోడవైన ముందు కాళ్ళు ఉపయోగపడేవి. నడవాల్సి వస్తే నాలుగు కాళ్ళతో నడిచేవి. మైదానాల్లోకి వచ్చిన తర్వాత, అవి పైకి లేచి నిటారుగా రెండు వెనక కాళ్ళపై నడవడం ప్రారంభించాయి. అప్పుడు ముందు కాళ్ళు చేతులయిపొయ్యాయి. చేతులు ఖాళీగా ఉండడం వల్ల వాటితో ఇతర పనులు చేయడం మొదలయ్యింది. అలా నాలుగు కాళ్ళ నడక మానేసి, రెండు కాళ్ళపై నడవగలగడం జీవపరిణామ క్రమంలో విప్లవాత్మకమైన మార్పు. జంతువు మనిషిగా పరిణతి చెందే క్రమంలో అదొక తొలిమెట్టు. రెండు కాళ్ళపై నడిచే ఈ ప్రాణుల్ని (BIPEDAL) హోమినిన్స్ (HOMININS)- అని అన్నారు. తర్వాత కాలంలో ఏర్పడ్డ అనేక మానవజాతులు ఈ హోమినిన్స్ నుండే పుట్టుకొచ్చాయి.  ముందు కాళ్ళు రెండూ చేతులై పోవడం వల్ల ఈ వానర న రులు (ఏప్స్)-రాళ్ళతో రాళ్ళను పగలగొట్టడం, క్రమంగా మొనతేలిన ఆయుధాలు చేయడం నేర్చుకున్నాయి. ఇది ఇరవై అయిదు లక్షల ఏళ్ళ క్రితం జరిగిన పరిణామం.

Also read: అంబేడ్కర్ బాటలో … గుజరాత్ లో బౌద్ధం

మానవ జాతులకు మూలాధారమైన ఈ హోమినిన్స్ నుండి మొదట మూడు జాతులు ఉద్భవించాయి. 1. హోమో ఎర్గాస్టర్ 2. హోమో ఎరెక్టస్ 3. హోమో హబిలస్ (HOME ERGASTER/H. ERECTUS/H. HABILUS). వానర నరులు చెట్లను వదిలి మైదానాలకు (GRASS LANDS) రావడం ఒక మార్పయితే, వాటి జనాభా పెరగడం, ఆహారపు  కొరత ఏర్పడడం మరొక మార్పు. ఫలితంగా హొమినెన్స్ జాతులు మెల్లగా ఆఫ్రికా ఖండాన్ని వదిలి, దూర ప్రాంతాలకు వలస పోవడం ప్రారంభించాయి. అదెప్పుడూ?  పది లక్షల సంవత్సరాలకు పూర్వం! వలసలు వెళుతూ వెళుతూ మానవ జాతులన్నీ ప్రపంచంలోకి అన్ని దేశాలకు చేరుకున్నాయి. 70 వేల సంవత్సరాలకు పూర్వమే మానవ జాతులు ప్రపంచ వ్యాప్తమైనట్టు ఆధారాలున్నాయి.

అరుణ్ సొనాకియా. నర్మదా లోయలో రెండు లక్షల సంవత్సరాల నాటి మనిషి పుర్రెను కనుగొన్న శాస్త్రవేత్త

ఈ వివరాలన్నీ పురాణాల్లోని కట్టుకథల్లాంటివి కావు. ఎందరో శాస్త్రవేత్తలు భూగర్భంలోంచి తవ్వితీసిన ఆధారాలను అనుసరించి నమోదు చేసిన అంశాలు. మన భారత దేశానికి సంబంధించిన విషయాలు చెప్పుకోవలసి వస్తే ఇక్కడ ఐదు లక్షల సంవత్సరాలకు పూర్వమే శిలలతో ఆయుధాలు, పరికరాలు చేసిన హోమినిన్స్ ఉండేవని అర్థమవుతూ ఉంది. పైగా ఇవి హోమీఎరక్టస్ జాతివని నిర్థారణ అయ్యింది. ఈ విషయానికి  1982లో అరుణ్ సోనాకియా అనే భూగర్భ శాస్త్రవేత్త చేసిన పరిశోధనలు రుజువులు చూపాయి. నర్మదా వ్యాలీలోని హత్ నోరా గ్రామంలో దొరికిన శిలాజం – మానవుడి పుర్రె –రెండున్నర లక్షల సంవత్సరాలనాటిదనీ, అది హోమో ఎరక్టస్ దనీ ఆ శాస్త్రవేత్త గుర్తించాడు. హోమో ఎరక్టస్ అనేది శాస్త్రీయ నామమైతే ఆయన దానికి ఒక సాధారణ నామం కూడా పెట్టాడు. నర్మదా వ్యాలీలో దొరికింది గనుక, ఆ శిలాజాన్ని ‘నర్మదా మ్యాన్’ అని అన్నాడు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం – ఈ నేల మీద నడయాడిన తొలి భారతీయులెవరంటే హోమో ఎరక్టస్ జాతికి చెందిన నర్మదా మ్యాన్- సంతతివారు. అయితే ఆ జాతి ఇప్పుడు లేదు. ఇప్పుడు భారత దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క మావన జాతి- అది హోమో సేపియన్! ఇది నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రూపొందింది. 70 వేల ఏళ్ళ క్రితం ఈ భూమి మీద ఏడు మానవ జాతులు వర్థిల్లుతూ ఉండేవనీ, ఫది వేల సంవత్సరాల క్రితం నాటికి ఒకే ఒక్క మానవజాతి హోమో సేపియన్ మిగిలిందనీ తెలుస్తూ ఉంది.

హోమో పేపియన్స్ నియాండర్ తల్స్ ప్రతీక

అంటే ఇప్పుడు ప్రపంచంలో మనిషి అనేవాడు ఎక్కడున్నా- అతడు/ఆమె హోమో సేపియనులే నన్నమాట! స్వతహాగా వీరిలో అప్పుడు జాతి, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలు లేవు. అంతా ఒక్కటే. ఇప్పుడు జీవించి ఉన్న మనుషులంతా ఆ మహా మానవ మిశ్రమ జాతిలోంచి పుట్టుకొచ్చినవారే. తారతమ్యాలు లేవు. అవన్నీ తర్వాత కాలంలో మనుషులు తమ కుత్సిత బుద్ధితో ఏర్పరుచుకున్నవి. దీనితో మనకు అర్థమయ్యేదేమంటే- ఒక అరవై వేల  ఏళ్ళపాటు  మావన జాతులన్నీ కలిసి తిరిగాయి. కలిసి బతికాయి. కలిసి ఆహారం పంచుకున్నాయి. ఒక్కోసారి ఆహారంకోసం పాట్లాడుకున్నాయి కూదా! అంతేకాదు, ఒకే జాతికి చెందినవి కాబట్టి  కొన్నిటి మధ్య లైంగిక సంపర్కం కూడా జరిగింది. హోమో సెపియన్, హోమో  నియాండర్ తల్స్ మధ్య శారీరక సంబంధాలుండేవన్న విషయం ధృవపడింది కూడా! ఫలితంగా జన్యుమార్పిడి జరిగింది. మనుషులంతా ఒకటే అయినా, వివిధ ప్రాంతాల మనుషుల ముఖ కవళికలు వేరువేరుగా ఉన్నాయి.  రంగు, ఎత్తూ వేరువేరుగా ఉన్నాయి. నైపుణ్యాలు వేరువేరుగా ఉన్నాయి. ఇవి మనం గమనిస్తున్న తేడాలు. ఆ కాలంలో గుహల కోసం, ఆహారం కోసం జరిగే కొట్లాటల్లో తెలివైన హోమో సెపియనులే నెగ్గుకొచ్చేవారు. తెలివైన వాడికీ, బలవంతుడికీ మాత్రమే రాజ్యాధికారం దక్కుతుందనేది ఆనాటి ఆదిమానవుల పోరు కూడా తేల్చి చెప్పింది. అందుకే హోమో సేపియన్ జాతి బలపడుతున్నకొద్దీ, మిగతా జాతులు  క్రమంగా నశించి పొయ్యాయి. దీన్ని వైజ్ఞానికులు ‘రిప్లేస్ మెంట్ థియరీ’ (REPLACEMENT THEORY)గా వర్ణించారు. అంటే మిగతా జాతులన్నింటి స్థానాన్ని హోమో సేపియన్ జాతి ఆక్రమించింది (రిప్లేస్ చేసింది) అని అర్థం!

రామసామి పిచ్చప్పన్

ఈ హోమో సేపియన్ జాతి భారత దేశానికి ఎలా చేరుకుంది? అనే దానికి రెండు వాదలనలున్నాయి. 1. యాభై వేల ఏళ్ళ క్రితం పశ్చిమ ఆసియా(MIDDLE EAST)నుండి ఒక సమూహం భారత్ లోకి ప్రవేశించింది. 2. అలాగే ముప్పయ్ వేల ఏళ్ళ క్రితం ఈ జాతికకి చెందిన మరొక సమూహం అరేబియా సముద్ర మార్గంగా, దక్షిణ భారత దేశానికి చేరింది. దొరికిన ఆదారాల ప్రకారం పరిశోధకులు వెల్లడించిన విషయాలు ఇవి! అయితే 2005లో నేషనల్ జియోగ్రాఫిక్, ఐ.బి.యం లు సంయుక్తంగా చేపట్టిన జీనోగ్రాఫిక్ ప్రాజెక్ట్ (GENOGRAPHIC PROJECT)-అనేక విషయాలు స్పష్టం చేసింది. మానవుల వలసలు అతి పురాతన కాలంలో ఎక్కడి నుండి ఎలా జరిగాయో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్టు ఇది! దీనిలో ప్రపంచ ప్రఖ్యాత జన్యుశాస్త్రవేత్త స్పెన్సర్ విల్స్, భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ రామసామి పిచ్చప్పన్ లు కలిసి పని చేశారు. రామసామి పిచ్చప్పన్ తమిళనాడులోని కల్లార్  గ్రామంలో విరుమండి అనేవ్యక్తి డి.ఎన్.ఎ లో M1-30 అనే ఒక ప్రత్యేకమైన జన్యువు ఉన్నట్టు గుర్తించాడు. ఇదే జన్యువు 70-60 వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చినవారిలో కూడా లభించింది. అంటే ఇప్పటి పౌరుల పూర్వీకులు తప్పకుండా ఆఫ్రికా నుండి వచ్చినవారేనని నిర్థారణ అయ్యింది. ఇక్కడ ఒకే ఒక్క ఉదాహరణ చెప్పుకున్నాం. నిజానికి వారు చాలా మంది డి.ఎన్.ఎలు సేకరించి పరిశీలించారు. మనకు ఇక్కడ సారాంశం ముఖ్యం! ఆ ప్రాజెక్టు వెల్లడించిన వివరాలన్నీ కాదు-

Also read: మనిషన్నది మరిచాక మతమేదైతే నేమిటి?

ఇక పోతే, మనిషి రాళ్ళతో ఆయుధాలు తయారు చేసుకున్న  ఆ కాలానికి సంబంధించి కొన్ని వివరాలు  చూద్దాం! ఆ కాలాన్ని వైజ్ఞానికులు శిలాయుగంగా పరిగణించారు. కాలక్రమంలో జరిగిన పరిణామాల్ని అనుసరించి, ఆ శిలాయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించారు. 1. పురాతన శిలాయుగం (PALEOLITHIC AGE). 2. మధ్య శిలాయుగం (MESOLITHIC AGE). 3. నవీన శిలాయుగం (NEOLITHIC AGE). ఈ మూడు యుగాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది పురాతన శిలాయుగమే – ఈ యుగంలో మనుషులు చెట్ల నుండి పండ్లు, కూరగాయలు, భూమి నుండి కందమూలాలు, దుంపలు వగైరా సేకరించుకునేవారు. వారు తయారు చేసుకున్న పెద్ద ఆయుధాలతో పెద్ద జంతువుల్ని వేటాడి తినేవారు. విశాలమైన మైదానాల్లో ఉండడానికి ఇష్టపడేవారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కోసారి గుహల్లోకి వెళ్ళేవారు. విషయాల్ని వివరంగా చర్చించుకోవడానికి అనువుగా పరిశోధకులు పెలియోలిధిక్ యుగాన్ని మళ్ళీ మూడుగా విభజించారు. 1. కింది(LOWER) పేలియోలిధిక్ , 2. మధ్య (MIDDLE)పేలియోలిధిక్ 3. పై (UPPER) పేలియోలిధిక్. కింది పేలియోలిధిక్ కు సంబంధించిన ఆధారాలు పాకిస్థాన్  సోన్  వ్యాలీ (SOAN VALLEY)లోనూ, తమిళనాడు – చెన్నై పరిసర ప్రాతాల్లోనూ లభించాయి. మధ్య పేలియోలిధిక్ కు సంబంధించిన రుజువులు మహారాష్ట్రలోని నివాస (NEVASA)లోనూ,  పట్నే (PATNE)లోనూ లభించాయి. అలాగే పై పేలియోలిధిక్ కు సంబంధించిన ఆధారాలు మధ్య ప్రదేశ్ లోని భీంబెట్కా (BHEEM BHETKA)లో లభించాయి. ఇక్కడి గుహల్లో ఆ కాలపు మనుషులు గీసిన రాతి చిత్రలేఖనాలు (STONE PAINTINGS) లభించాయి.

Also read: గాంధీజీ స్థానంలో సావర్కరా? హవ్వ-సిగ్గుచేటు!

(ఇంకా ఉంది)

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, బయాలజీ ప్రాఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles