Friday, March 29, 2024

గాంధీజీ స్థానంలో సావర్కరా? హవ్వ-సిగ్గుచేటు!

వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విషచరిత్ర. కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్ర్య పారాటాన్ని అడ్డుకుని, బ్రిటీషువారికి సహకరించివాడు. పైగా సెల్యూలార్ జైలులో ఉన్నప్పుడు బ్రిటీషు ప్రభుత్వానికి ఎనిమిది సార్లు వినతిపత్రాలు సమర్పించి క్షమాపణలు కోరిన వ్యక్తి. అంతకు ముందు అతను బ్రిటన్ లోఉండగా ఒక రేప్ కేసులో దొరికిపోయి, తప్పు ఒప్పుకుని, శిక్ష అనుభవించినవాడు. ఇలాంటివాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెడతారా? ఆ ఆలోచనే సిగ్గుపడాల్సిందిగా ఉంది. ఆ నాటి హిందువుల్ని ముఖ్యంగా ఆర్యబ్రాహ్మణుల్ని ఏకం చేయడానికి ఇతర మతస్థుల మీద, ఇతర కులస్థుల మీద విషం చిమ్మిన వ్యక్తి-సావర్కర్! దేశంలో కేవలం ఆర్యబ్రాహ్మణులు మాత్రమే ఉండాలని తాపత్రయ పడినవాడు. శత్రువులు బ్రిటిష్ వారు కాదు, అంతర్గత శత్రువులు దేశంలోనే ఉన్నారని ప్రకటించినవాడు. ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, బౌద్ధులు, జైనులువంటి ఇతర మతస్థుల్నని చంపేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చినవాడు. వారి ఇండ్లలోని తల్లులు, భార్యలు, అక్కాచెల్లెళ్ళు ఎవరైనా సరే గర్భిణులు ఉండే, వారి పొట్టల్ని చీల్చి, పుట్టబోయే పిల్లల్ని చంపేయాలని పిలుపు నిచ్చిన ‘మహనీయుడు.’ ఈ విషయాలన్నీ సావర్కర్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) లిబయ రాస్తే బయటికొచ్చినవే! అందువల్ల సావర్కర్ ని విమర్శించడం నేరం కాదు. ప్రతి భారతీయుడి హక్కు-

Also read: హేతుబద్ధత కొరవడిన దేశాల్లో భారత్ ఫస్ట్!

ఏ ప్రభుత్వమూ, ఏ సంస్థా ఇవ్వకపోయినా తనకు తానే ‘వీర్’ అనే పదం తన పేరుకు ముందు తగిలించుకుని, ‘వీరసావర్కర్’గా ప్రాచుర్యం పొందిన నీచ ప్రవృత్తి గలవాడు సావర్కర్. తొలి దశలో దేశభక్తుడిగా నటించినా, తర్వాత కొంత కాలానికే అతని అనైతికత ఈదేశ ప్రజలకు అర్థమైంది. అంతే కాదు, ఆనాటి బ్రిటీషు ప్రభుత్వానికి ఇంకా బాగా అర్థమైంది. అందుకే జైలుపాలయ్యాడు. బయటికి వచ్చి గాడ్సే ను తయారు చేసి, ప్రోత్సహించి, గాంధీ హత్యకు దోహదం చేశాడు. ఇలాంటివాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతిపిత స్థానాన్ని ఒక దేశద్రోహికి అంటగట్టాలని చూస్తోంది. అందువల్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ కుతంత్రాల్ని బట్టబయలు చేయాలి. ఆధునిక భారతీయ చరిత్రలో నీచాతి నీచుడుగా మిగిలిపోయినవాడు ఎవరూ? అంటే- దేశ ప్రజలంతా ఏకకంఠంతో ‘సావర్కర్’ అని నినదించాల్సిన అవసరం ఉంది. అందుకు అతనికి అన్ని అర్హతలూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ చాలా మంది చెప్పినవే.మరీ ముఖ్యంగా ముంబాయ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సావర్కర్ నైతికతను దుయ్యబడుతూ, ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోల మాట్లాడారు. ఆనాటి విషయాలు నేటి తరానికిఅందించాలన్న తపన కొద్దీ ఆయన మాట్లాడారు. విషయపరిజ్ఞానం ఉన్న ఆ న్యాయమూర్తి జస్టిస్ కె. పాటిల్ ను ఈ దేశ ప్రజలు నమ్ముతారు.

Also read: నిత్యజీవితంలో వైజ్ఞానిక స్పృహ

ఇటీవల గుజరాత్  ఎన్నికల ర్యాలీలలో తిరుగుతూ, తన స్థాయి మరిచి, ప్రతి గల్లీ తిరుగుతూ మాట్లాడారు, భారత ప్రధాని-ఆ సందర్భంలో ఆవును గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవు గురించి మాట్లాడటం ఏమైనా అపరాధమా? పవిత్రమైన గోమాత గురించి ఎవరైనామాట్లాడొచ్చు’’-అని అన్నారాయన. అయితే ఆయన తెలుసుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. 1930లలో కూడా ఇప్పటి వలెనే గోవు గురించి చర్చలు జరిగాయి. ఆ రోజుల్లో మహారాష్ట్రలో ‘భాలా’ పేరుతో ఒక పత్రిక వెలువడేది. అందులో ‘ప్రశ్నోత్తరాలు’ శీర్షిక ఒకటి నడిచేది. అందులో ఒక సారి ఒక ప్రశ్న వచ్చింది. ‘‘నిజమైన హిందువులు ఎవరూ?’’ అని! ‘‘ఎవరైతే గోవును పూజిస్తారో-సంరక్షిస్తారో వారే నిజమైన హిందువులు’’ అని కొంతమంది జవాబు రాశారు. అవన్నీ చదివిన సావర్కర్ సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఆ తర్వాత ఒక పుస్తకమే రాశాడు. దాని పేరు ‘‘విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్.’’ ఆ పుస్తకాన్ని స్వాతంత్ర్య వీర్ సావర్కర్ సమితి-ప్రచురించింది. సావర్కర్ ఆలోచనల్ని ఈ దేశ ప్రజలు చాలా నిశితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ‘‘దేశద్రోహ-దేశభక్తుడు’’ నేటి మోదీ-యోగీల జోడీకి ఆరాధ్యుడు. వారి దృష్టిలో మహానాయకుడు. ఒక దశలో ఆరెస్సెస్ నాయకత్వం సావర్కర్ పేరు ఉచ్ఛరించడానిక్కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పటి నాయకులు ఆయనను నెత్తికెక్కించుకుని, జాతిపిత స్థానాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. అయితే, అది అయ్యే పని కాదు. దేశ ప్రజలు చేతులు ముడుచుకుని ఏమీ కూర్చోరు.

Also read: విజ్ఞానమా? మతవిశ్వాసమా? ఏది కావాలి?

సావర్కర్ ఎంతటి దేశద్రోహానికి తలపడ్డా, తన పుస్తకం-‘‘విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్’’లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. వాటిని ప్రభుత్వ పెద్దలు శ్రద్ధగా మళ్ళీమళ్ళీ చదువుకోవడం అవసరం. ఎందుకంటే ఆ రాసినవాడు వారి దృష్టిలో మహానాయకుడు గనక! సావర్కర్ తన పుస్తకంలో ఇలా రాశాడు-‘‘ఎవరైతే గోవునుపూజిస్తారో వారు మానవ జాతి స్థాయి నుండి కిందికి దిగజారిన వారవుతారు….ఇంకా గోవు ఒక జంతువని, దానికి లేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటే అది మూర్ఖత్వమవుతుందనీ-’ స్పష్టంగా రాశాడు-వినాయక్ దామోదర్ సావర్కర్! ‘‘ఆవు ఎంతటి నికృష్ట జంతువంటే, అది తన మలంలోనే అది పొర్లుతుంటుంది. దానికి బుద్ధీజ్ఞానం ఉండవు. గనకనే తను వేసిన పేడలో అది బొర్లుతుంటుంది.’’ అని కూడా రాశాడు. ఇది కాక, సావర్కర్ మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి తెచ్చాడు. మొఘలులు లేక ఇతర విదేశీయులు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు – వారిని ఎదిరించి యుద్ధం చేయకుండా హిందువులు గోవులను పూజిస్తూ కూర్చున్నారనీ, దాని మహిమతో విజయం వరిస్తుందన్న భ్రమలో ఉండిపోయారనీ, అదెంతో సిగ్గుచేటనీ రాశాడు సావర్కర్! సైనికులూ, పౌరులూ అందరూ గోపూజ చేస్తూ కూర్చున్నందువల్ల యుద్ధం చేయగల ధైర్యం, నైపుణ్యం పోగొట్టుకున్నారని – యుద్ధ కౌశలం పోగొట్టుకున్నాక విజయాలెలా సాధిస్తారనీ- ఒక రకంగా ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారణం నిస్సందేహంగా గోవే!- అని సావర్కర్ విశ్లేషించారు. దుర్గం, ఖిల్లా, కోట-ఏదైనా సరే రక్షించుకోవడం ఈ ‘‘గోపూజారుల’’వల్ల కాలేదు – అని తీర్మానించాడు. ‘‘ఒక వేళ సైనికులకు యుద్ధసమయంలో ఆహారం కొరత ఏర్పడితే, గోవుల్ని కోసుకుని తినాల్సింది. అలా చేసైనా తమతమ రాజ్యాల్ని తాము కాపాడుకోవాల్సింది’- అన్నది సావర్కర్ అభిప్రాయం!

‘‘గోపాలన్ హవే గోపూజన్ నభే’’ (మరాఠీ శీర్షిక) గోవుల పాలన అవసరమే కానీ గోపూజ వద్దు- అనేది ఆ మరాఠీ శీర్షికకు అర్థం. ఈ శీర్షికతో సావర్కర్ ఏమి చెప్పారంటే-గోవు పాలిస్తుంది. గనుక మనుషులు దాన్ని పోషించుకోవాలి. కానీ వాటిని పూజించడం ఎందుకూ? అన్నది ఆయన ప్రశ్న! ఆయనలాగే గోవుల్ని పూజించడం ఎందుకూ? అని ఈ దేశ ప్రజల్లో కొందరు అనుకుంటే అది పారపాటు కాదు. తప్పిదం కాదు. గోవుకు ఏ పవిత్రతా లేదు అంటే అది నేరమూ కాదు – ఈ విషయం నేటి ప్రధాని, అతని అనుచరగణం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ దేశంలో శ్వేతవిప్లవం కురియన్ నేతృత్వంలో గతంలో జరిగింది. పాల ఉత్పత్తిలో ఈ దేశం చాలా ముందుంది. ఇందులో ఇప్పటి ప్రభుత్వ పెద్దల కృషి ఏమీ లేదు.  వీరు అధికారంలోకి రాకముందే ఈ పని జరిగిపోయింది. ఇక పోతే గోమాంసం ఎగుమతులు ఎవరు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. బీజేపీ పెద్ద నాయకులే కదా ఆ పని చేస్తున్నదీ? వీరిలో ముస్లింలు లేరు. అల్ కబీర్ – అల్ దువా- అంటూ ఉరుదూ పేర్లు పెట్టుకుని హిందువులే గోమాంసం ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే మన దేశం మొదటి  రెండు స్థానాల్లో ఉంది. ప్రపంచ స్థాయి గోమాంస విక్రేతల్లో మొదటి 20 మంది హిందువులేనన్నది అధికారంలో ఉన్నవారు కావాలనే చెప్పరు. ఆ పని ముస్లింలే చేస్తున్నారనే భ్రమను దేశ ప్రజలకు కలిగిస్తారు. ‘చాలా తక్కువ ధరకు గోమాంసం అందిస్తామని’’ ఇదే బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంలో గోవా ఓటర్లకు హామీలిస్తారు! అని కూడా పక్కన గల కర్ణాటక నుండి తెప్పిస్తామంటారు. కర్ణాటకలో ఎవరి ప్రభుత్వం ఉందో మనకు తెలుసు.

Also read: ‘జ్ఞానం’- సంపాదించినవారంతా బౌద్ధులే!

17 జనవరి 1948న చివరిసారి సావర్కర్ ను దర్శించుకోవడానికి నాథూరామ్ గాడ్సే, ఆప్టే, బాడ్గే, శంకర్ లు వెళ్ళారు. నాధూరం, ఆప్టేలు లోపలికి వెళ్ళారు. మిగిలిన ఇద్దరూ బయట కాపలా కాశారు. సావర్కర్ ను కలిసి, నాథూరామ్, ఆప్టేలు బయటికి రాగానే – ఆప్టే, బాడ్గేతో ఓ మాట చెప్పాడు. ‘‘యశస్వి హో ఉన్యా’’- విజయుడవై తిరిగి రమ్మని సావర్కర్ నాథూరామ్ ని దీవించారని-గాంధీకి నూరేళ్ళూ పూర్తయ్యాయనీ-అనుకున్న ప్రకారం పథకం పూర్తవుతుందనీ సావర్కర్ ఆశగా ఉన్నాడన్న విషయం – ఆప్టే బయట ఉన్న సహచరులకి చెప్పాడు. గాంధీజీ హత్య కేసులో సరైన ఆధారాలు దొరకక శిక్ష పడలేదు. కానీ, ఒక రకంగా సావర్కర్ నిత్యనూతన  క్రిమినల్. అతని పేరు ముందు ‘వీర్’ అని రాయడం, పలకడం పెద్ద తప్పిదం అవుతుంది. ఒక్కోసారి దేశభక్తుడిగా, హేతువాదిగా కనిపించినా, ఎక్కువ శాతం దేశద్రోహిగా, హిందూ మత ఛాందసుడుగా అనిపిస్తాడు. ఈ దేశ ప్రజలు సావర్కర్ నుండి ఏం నేర్చుకోవాలి? ఏ విషయంలో అతను ఆదర్శప్రాయుడవుతాడూ? విశ్లేషించుకుంటున్న ఈ దేశ ప్రజలు, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల నిర్ణయాల్ని అసహ్యించుకుంటున్నారు. సావర్కర్ కు వీరు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.

చంద్రనాథ్ బసు అనే అతను ‘హిందుత్వ’ అనే పదాన్నిరూపొందిస్తే, దాన్ని విరివిగా వాడుకుని, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు సావర్కర్. ఒక దశలో సిక్కులు పంజాబ్ ను సిక్కిస్థాన్ గా చేసుకోవాలని, అందుకు తను సహకరిస్తాననీ అన్నాడు. పాకిస్థాన్, సిక్కిస్థాన్ లు విడిపోతే, ఇక హిందూ రాష్ట్ర (హిందుస్థాన్) మిగులుతుందని కలలుగన్నాడు. ఒక నాడు ఒక క్రిమినల్ కన్న కలల్ని నేటి ఈ కేంద్ర ప్రభుత్వం నిజం చేయాలనుకుంటోంది. దేశంలో అదే ‘హిందుత్వ’ సెంటిమెంట్  విస్తృత ప్రపంచంలోకి తెచ్చి – ఎలాగైనా దొడ్డి దారిన మళ్ళీ మళ్ళీ గెలవాలన్నదే వీరి ప్రయత్నం! ఉపాధి, అభివృద్ధి, ధరల తగ్గింపు వంటి వాటి గురించి వీరు ఏ మాత్రమూ మాట్లాడరు. ఆవు మూత్రం, ఆవుపేడ దగ్గర ఆగిపోయిన  ఈ దేశ నాయకుల మెదళ్ళు  – బహుశా వాటితోనే నింపుకున్నారేమో! అందుకే ఇతర అంశాల గూర్చి మాట్లాడలేక పోతున్నారేమో! అని – నేటి యువతరం అనుకుంటూ ఉంది. ఏమైనా ఈ దేశ ప్రజలు నాయకులను అనుసరించకుండా, స్వతంత్రంగా ఆలోచించడం అన్ని విధాలా మంచిది.

Also read: ప్రపంచంలోని తొలి భౌతికవాదులు మన చార్వాకులు

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles