Monday, April 29, 2024

మేయర్ పీఠంపై టీఆర్ఎస్ ధీమా

  • మేయర్ ఎంపికలో కీలకం కానున్న ఎక్స్‌అఫీషియో ఓట్లు
  • 31 డివిజన్లు గెలిస్తే మేయర్‌ పీఠం టీఆర్ఎస్ కైవసం
  • గులాబీ ఖాతాలో 35 ఎక్స్‌అఫీషియో ఓట్లు
  • మజ్లిస్‌ ఓట్లనూ కలుపుకొంటే 45 ఓట్లు
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఆప్షన్‌తో 3 ఓట్లు

హైదరాబాద్ :  గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి మళ్లీ టీఆర్‌ఎస్‌ దక్కించుకోనుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తక్కువ సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకున్నా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్‌ఎస్‌ కేవలం 41 డివిజన్లలో విజయం సాధించినా మేయర్‌ పదవిని సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మేయర్ ఎంపికలో కీలకం కానున్న ఎక్స్అఫీషియో సభ్యులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ కి  ఉన్న ఎక్స్ అఫీషియో ఓట్లే మేయర్‌ పీఠం దక్కేలా చేస్తాయని అంటున్నారు విశ్లేషకులు. దీనికి తోడు ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుండటంతో ఎంఐఎం సహకారం ఎలాగూ ఉండనే ఉంటుంది. బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేస్తామంటూ టీఆర్‌ఎస్‌ నేతలు మొదటి నుంచీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్స్ అఫీషియో సభ్యుల ప్రమేయం లేకుండానే సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని అంటున్నారు.

2016లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున 99 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి మరో ముగ్గురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో  ఆ పార్టీ బలం 102కు పెరిగింది. ఈసారి కూడా 100కు పైగా డివిజన్లలో విజయం సాధిస్తామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. అయితే అంచనా మేరకు విజయం సాధించలేకపోయినా ఎక్స్అఫీషియో ఓట్లతో మేయర్‌ పదవిని కైవశం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జీహెచ్‌ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం ఇపుడు ఆ పార్టీకి కలిసి వస్తోంది. వీరి సంఖ్య ఏకంగా 35 వరకు ఉంది. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో ఆయన ఓటుపై మాత్రమే అనుమానాలున్నట్లు తెలుస్తోంది.

మేజిక్‌ ఫిగర్‌కి చేరువలో టీఆర్ఎస్

జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. మేయర్‌ పదవికి మేజిక్‌ ఫిగర్‌ 76 సీట్లు. మేయర్‌ ఎన్నికలో ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ కు 35 ఎక్స్అఫీషియో ఓట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 41 మంది కార్పొరేటర్లు గెలిస్తే మేజిక్‌ ఫిగర్‌ 76కు చేరుకుంటుంది. అంటే టీఆర్‌ఎస్‌ నుంచి కేవలం 41 మంది కార్పొరేటర్లు విజయం సాధిస్తే  మేయర్‌ పదవి దక్కుతుంది. దీనికి ఎంఐఎం సాధించే సీట్లు అదనపు బలాన్ని చేకూర్చుతుంది.

మేయర్ ఎంపికలో ఎంఐఎం కీలకం

ఎంఐఎంకు జీహెచ్‌ఎంసీలో 10 ఎక్స్అఫీషియో ఓట్లున్నాయి. వీరు కూడా మేయర్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్ కు మద్దతిస్తే ఎక్స్అఫిషియో ఓట్ల సంఖ్య 45కు చేరుతుంది. అప్పుడు టీఆర్‌ఎస్‌ 31 డివిజన్లలో విజయం సాధించినా మేయర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయవచ్చు. 2016 ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్ఎస్ కి ఈ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

టీఆర్ఎస్ ఖాతాలో మరో మూడు ఎక్స్అఫీషియో సీట్లు

వీటికి తోడు టీఆర్‌ఎస్ కి  మరో మూడు ఎక్స్అఫీషియో ఓట్లు పెరగనున్నాయి. ఇటీవల గవర్నర్‌ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు  నామినేట్‌ అయ్యారు. ప్రభుత్వ సిఫారసు మేరకు నామినేట్‌ అయినందున వీరు ముగ్గురి ఓట్లు టీఆర్ఎస్ కు అదనపు బలం కానున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం వీరు జీహెచ్‌ఎంసీలోనే ఎక్స్అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. దాంతో టీఆర్‌ఎస్ కు ఎంఐఎంతో కలిపి ప్రస్తుతమున్న 45 ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య 48కి చేరుతుంది. అప్పుడు టీఆర్ఎస్ కేవలం 28 డివిజన్లలో విజయం సాధిస్తే మేయర్‌ పదవి దక్కినట్లేనని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

కాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా 2016 గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా జీహెచ్‌ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇందులో కొంత మంది నగర శివార్లలో కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా సభ్యులకు లేఖలు రాసి స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు అందగానే టీఆర్‌ఎస్‌ ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య స్పష్టమవుతుంది.

మేయర్ రేసులో ప్రముఖులు

టీఆర్‌ఎస్‌ తరపున మేయర్‌ పదవిని ఆశిస్తున్న వారిలో పలువురు ప్రముఖ నేతల బంధువులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోడలితోపాటు మాజీ హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి కూతురు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి భార్య మమతారెడ్డి ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి కుమార్తె, డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు కోడలు, పి.జనార్దన్‌రెడ్డి కూతురు విజయ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోడలు మేయర్ రేసులో ఉన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles