Friday, April 26, 2024

సైరా… ఉయ్యాలవాడనూ యాది చేసినోడా!

దే నెల ఇప్పటికి పదమూడేళ్ళ క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పేరుతో యు.పి.ఏ. చైర్మన్ సోనియాగాంధీ రిబ్బన్ కత్తిరించారు. మరో కొద్ది నెలల్లో 2009 అసెంబ్లీ పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ ఉండగా, అప్పట్లో డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి చూపిన చొరవ అది. ఆమె రిబ్బన్ కత్తిరించాక, అదే లాంజ్ లో కూర్చున్న ప్రముఖులకు ‘పైలెట్ రాజీవ్ నుంచి పి.ఎం. రాజీవ్ వరకు’ కొద్ది నిముషాల పాటు, సోనియాకే వై.ఎస్. రాజీవ్ ‘సినిమా’ చూపించి తన ప్రత్యేకతను, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను కూడా ఆయన చూపించారు. 

అయితే, ఇప్పుడు విషయం అదేమీ కాదు. ఇది జరిగిన వారంలోనే, ప్రముఖ చరిత్రకారుడు కాలమిస్టు రామచంద్ర గుహ దానికి రాజీవ్ పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ తన వెబ్సైట్ లో వ్యాసం రాసారు. దాని తర్జుమా వారం వారం ప్రచురించే ‘ఆ రెండు’ పత్రికలుగా అప్పట్లో పిలవబడే వొక పత్రిక ప్రచురించింది. గుహ తన వ్యాసంలో దానికి ‘రాజీవ్’ పేరు పెట్టడం ఎలా అనుచితమో చెప్పడానికి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చేసారు. అందుకు ఆయన అల్లూరి సీతారామరాజు నుండి శ్రీశ్రీ గురజాడ వరకు కొందరి పేర్లు కూడా ప్రస్తావిస్తూ, వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? అంటూ ప్రశ్నించారు.

అయితే వై.ఎస్. సరే, హైదరాబాద్ నగరానికి అవుటర్ రింగ్ రోడ్ (వో.ఆర్.ఆర్.) ప్రతిపాదనలు చేసిన… అస్సలు ఆ ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనలు కూడా చేసిన… అప్పటి ముఖ్యమంత్రి సి.బి.ఎన్. కూడా గుహ ముందుకు తెచ్చిన ఆర్గుమెంట్ ను ఇప్పటికీ ఒప్పుకోకపోవచ్చు.

ఇదీ చదవండి: జగన్ కేలండర్ @ 2021

ఎందుకంటే, అప్పటికి ఆర్ధిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్న రాష్ట్రంగా ఏ.పి. ముందు వరసలో ఉంది. అప్పటివరకు సి.బి.ఎన్. వద్ద వున్న ‘ఆ పని’ని ఏదైనా ఏ.ఐ.సి.సి. అధిష్టానం పరిధిలో చేయవలసిన వై.ఎస్. దాన్నే మరో శైలితో  కొనసాగిస్తున్నారు. అంతేనా, ఆగ్నేయ-ఆసియా దేశాల వాణిజ్య వేదిక ‘ఆసియాన్’ ఒప్పందంలో అప్పటికే మనం భాగస్వాములు అయ్యాం. అటువంటప్పుడు, 970 కి.మీ. సముద్ర తీరం ఉన్న రాష్ట్ర రాజధానిలో వచ్చిన తొలి అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచ దేశాల్లో రావలసిన గుర్తింపు ఏ పేరు పెడితే వస్తుంది?

ఈ దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 21 మే 1991 న శ్రీ పెరంబదూరులో వేదిక ఎక్కుబోతూ మానవ బాంబు పేలుళ్ళుతో చనిపోవడానికి ముందు, ఆయన పాల్గొన్న ఆఖరి కార్యక్రమం జరిగిన స్థలం – ఈ రాష్ట్రంలోని విశాఖపట్టణం. ఆ విషయంగా కూడా తెలుగువారు, దేశ ప్రజలు కూడా ఆయన్ని గుర్తు ఉంచుకుంటారు. ఏదేమైనా అప్పట్లో రామచంద్ర గుహ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాజీవ్ ‘నామకరణం’ గురించి ఎందుకు చేసినా, ఆయన చాలా పేలవమైన ఆర్గ్యుమెంట్ చేసారు. అయినా కొంతకాలంగా ‘సెలబ్రిటీ’ స్థాయి ‘అప్ కంట్రీ కాలమిస్ట్’ లు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పత్రికల తర్జుమా కోసం రాస్తున్నవి, తరుచూ ‘నాన్ సీరియస్’ గా మిగిలిపోవడం కొంతకాలంగా చూస్తున్నదే!  

ఇదీ చదవండి: మూలాలను వెతుకుతున్న – ‘జగనిజం’

సందర్భం ‘నామకరణం’ అయినందుకు, మరొక ‘యాది’ ఇక్కడ తప్పడం లేదు. ఎందుకోసం చేసినప్పటికీ, అప్పట్లో వై.ఎస్. వొక్క శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తోనే ఆగలేదు. ఆయన ‘అధిష్టానం’ ఏమనుకున్నప్పటికీ, చెయ్యాలి అనుకున్నది ఆయన చేసారు. సెంట్రల్ హైదరాబాద్ లో ఉన్న లకిడీకపూల్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తో కలపడానికి, మాసాబ్ ట్యాంక్ వద్ద ఫ్లై వోవర్ ప్రతిపాదించి, దానికి ‘పి.వి. నరసింహారావు ఎక్ప్ ప్రెస్ వే’ పేరుతో వై.ఎస్. శంఖుస్థాపన చేసారు. వై.ఎస్. కన్నుమూసిన రెండు వారాలకు 19 అక్టోబర్ 2009 నాటికి దానిపై ట్రాఫిక్ వదిలారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి అప్పట్లో రామచంద్ర గుహ అభిప్రాయం ఏమిటో ఇప్పుడు మనకు తెలియదు. ఏదేమైనా అది జరిగి అప్పుడే ఆరేళ్ళు అవుతున్నది, ఇప్పుడున్నది విభజిత ఏ.పి. కి రెండవ ప్రభుత్వం. ఇది రెండవ దశ వికేంద్రీకరణ లక్ష్యంగా, రాజధానులను మూడు చోట్ల స్థాపిస్తూ ఆరేళ్ళ క్రితం జరిగిన విభజనను సూక్ష్మ స్థాయికి తీసుకుని వెళుతున్నది. అందుకు కర్నూలును న్యాయ రాజధాని చేస్తున్నది. ప్రస్తుతం ‘అమరావతి’ లో వున్న శాసన రాజధాని నుంచి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్టణం మే మొదటి వారం నాటికి తరలి వెళ్ళడానికంటే ముందే, కర్నూలు కు విమానాశ్రయం ఓర్వకల్లు వద్ద మార్చి 25 న ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రారంభించారు.

అయితే విషయం అది కాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు కర్నూల్ ఎయిర్ పోర్ట్ కు పెట్టి, వొక రాష్ట్ర ‘లీడర్’ కు స్వాత్యంత్రం ఉంటే ఏమి జరుగుతుందో; మరొక తొలి స్వాత్యంత్ర యోధుడి పేరుతో ఆయన నిరూపించాడు. ప్రధమ స్వాత్యంత్ర పోరాటంగా పిలువబడే సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ళ ముందు 1847 నాటికే రాయలసీమ ప్రాంతం నుంచి  బ్రిటిష్ రాజ్యంపై తిరుగుబాటు చేసిన యోధుడి పేరు ఇప్పుడు అధికారికంగా ఎయిర్ పోర్ట్ సందర్భంగా వెలుగు చూసింది. దేశం 75 ఏళ్ల స్వాత్యంత్రం వేడుకలు జరుపుకోబోతున్న ఏడాది ఆరంభంలో, ఇలా వొక తిరుగుబాటు యోధుడి – ‘నామకరణం’ తో మూడు రాజధానుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఏ.పి. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి.  

ఇదీ చదవండి: వి’నాయకులు: విగ్రహాలు – నిగ్రహాలు

పదమూడు ఏళ్ల క్రితం ఇదే విషయం గురించి రామచంద్ర గుహ మాట్లాడ్డం ఎంత అసందర్భమో, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడకపోవడం కూడా అంతే అసందర్భం అవుతుంది. అందుకే, వొకసారి సైరా… ఉయ్యాలవాడనూ యాది చేసినోడా! అని అభినందించడం.

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles