Friday, April 26, 2024

ఇంద్రజిత్తు మయాయుద్ధతంత్రం

రామాయణమ్ 199

‘‘దేవాంతకుడు పోయాడు. నరాంతకుడు పోయాడు. మత్తుడు పోయాడు. ఉన్మత్తుడు పోయాడు. చివరకు అతికాయుడుకూడా హతుడయ్యాడు ..ఏమిటిది? మహాబలికుంభకర్ణుడు, అకంపన, ప్రహస్త, ధూమ్రాక్షుల నిధనము నా కన్నులముందే జరిగినదేమి?

Also read: అతికాయుని యమపురకి పంపిన రామానుజుడు

అసలు ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగబంధనమునకు పట్టుబడి ఏల విడిచిపెట్టబడినారు ఆ రామలక్ష్మణులు? నా వారు ఇలా నేలకొరుగుట ఏమి? రామలక్ష్మణులకు కించిత్తు హాని కలుగకుండుటేమి?

ఆ రాముడు నారాయణుడు కాడు గదా? ఏమో నాకు అటులనే అనిపించుచున్నది.

ఇక వారిని నిర్జించగల పోటరులేరి నా దగ్గర?

ఆహా, రాముడు ఎంత బలశాలి! ఆయన అస్త్రబలమెంత గొప్పది!

Also read: తమ్ముడి మరణంతో బేజారైన రాక్షసరాజు

‘‘సైనికులారా, ఇటురండు’’ అనుచు భటులను పిలచి, ‘‘మీరు ఏమరపాటు లేకుండా అశోకవనమును రక్షించండి. ఆ వానరులు సామాన్యులు కారు. ఎవరు ఎటునుండి వచ్చుచున్నారో ఎటు వెళుచున్నారో నిశితముగా గమనింపుడు. ఏ మాత్రము అజాగ్రత వలదు’’ అని ఆజ్ఞాపించి దీనుడై తన గృహములోనికి ప్రవేశించెను.

తండ్రి యొక్క ఈ స్థితిని మునుపెన్నడూ కానని ఇంద్రజిత్తు ..‘‘తండ్రీ నేనుండగా

నీకేల చింత! ఆ రామలక్ష్మణుల శరీరములను నా వాడియైన బాణములతో తూట్లుపొడిచెదను. నాకు ఆనతి ఇవ్వుము. రణరంగమున ఇప్పుడే ప్రవేశించెదను’’ అని తండ్రి అనుమతి తీసుకొని వాయువేగముతో పరుగెత్తగల శ్రేష్ఠములైన గాడిదలు కట్టినరధమునెక్కి బయలు దేరెను.

Also read: కుంభకర్ణుని వధ

‘‘దాశరధులిరువురికీ, వనచరులందరికీ నేడే జీవితపు ఆఖరి రోజు నీవు చింతపడవలదు తండ్రీ’’ అని రావణునితో పలికి యుద్ధానికి బయలు దేరిన మేఘనాధుడు రణరంగంలోనే అగ్నిని ప్రజ్వలింపచేసి హోమంచేసి నల్లనిమేకను బలి ఇచ్చాడు ….తన ధనుస్సును అభిమంత్రించాడు. సకల అస్త్రాధిదేవతలనూ ఆహ్వానించి అస్త్రాలన్నింటినీ స్వీకరించాడు. తన రధాన్ని, ఆయుధాలను అభిమంత్రించాడు ….అన్నింటినీ స్వీకరించి ఆకాశంలోకి సింహనాదం చేస్తూ చటుక్కున ఎగిరి కనపడకుండా మాయమైపోయినాడు.

ఆకాశంలో ఒక్కసారి కనపడి వానర యోధుల మర్మావయవాలలో, ఆయువుపట్లలో బాణాలతో కొట్టి మాయమై వికటాట్టహాసం చేయసాగాడు.

Also read: కుంభకర్ణుడి స్వైరవిహారం

తమతో యుద్ధం చేసే వ్యక్తి ఎవరో తెలియటంలేదు. వాడెక్కడున్నాడో కూడా కనిపించడంలేదు. వాడివాడిబాణాలు వీరుల శరీరాలను తూట్లు పొడిచి వేడివేడి రక్తాన్ని ప్రవహింపచేస్తున్నాయి. అంతా అయోమయంగా ఉంది

ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండో బాణాలు రామలక్ష్మణుల మీద వచ్చిపడ్డాయి.

‘‘లక్ష్మణా; అడుగో మరల వచ్చాడు. వాడే నిన్నునన్ను నాగాస్త్రంతో బంధించినవాడు.  ఇంద్రజిత్తే మరల వచ్చాడు. వీడు కూటయుద్ధం చేస్తున్నాఢు. వీడు మునుపటి వలెనే వానర సైన్యాన్నంతా బాణప్రవాహంలో ముంచెత్తి మన ఇద్దరినీమూర్ఛిల్లచేసి చనిపోయరనుకొని భ్రమపడి తిరిగి వెడతాడు….’’

సరిగ్గా రాముడు ఏదైతే ఊహించాడో అదే జరిగింది. మొత్తం వానర సేనమీద బ్రహ్మస్త్రప్రయోగం చేశాడు ఇంద్రజిత్తు. అందరూ నశించారని సంబరపడుతూ లంకకు తిరిగి వెళ్ళాడు.

Also read: రణరంగానికి బయలుదేరిన కుంభకర్ణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles