Friday, April 26, 2024

రామలక్ష్మణులకు బుుష్యమూక పర్వతానికి దారి చెప్పిన కబంధుడు

రామాయణమ్92

‘‘ఋక్షరజస్సు అనే వానరుడి భార్యకు సూర్యదేవుడి అనుగ్రహము వలన పుట్టిన వాడీ సుగ్రీవుడు. సూర్యకిరణములు ప్రసరించినట్లు అతని దృష్టి పుడమి నాలుగు దిక్కులా ప్రసరిస్తుంది. ఆయన ఋష్యమూకము అనే పర్వతము మీద నలుగురు వానరులతో కలిసి నివసిస్తున్నాడు. అతని అన్న అయిన వాలి అతని మీద కోపించి రాజ్యము నుండి వెడలగొట్టినాడు.

‘‘ఆయన చాలా గొప్పపరాక్రమము ,తేజస్సు సాటిలేనికాంతికలిగినవాడు. సత్యసంధుడు. వినయవంతుడు. ధైర్యవంతుడు. బుద్ధిశాలి. ఇతను వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు. ఆయన కృతజ్ఞుడు. స్వేచ్చానుసారము రూపము ధరించగల సమర్ధుడు. అతనికిప్పుడు మీ అవసరమున్నది, అతని కార్యమొకటి నెరవేర్చవలసి ఉన్నది.

Also read: కబంధుని వధ, విమోచన

‘‘ఇంకోక్కమాట! అతని కార్యము నేరవేరిననూ నేరవేరకపోయిననూ అతడు నీ పని చేయగలడు. సీతాదేవిని రావణుడు ఎక్కడ దాచి ఉంచినా కనుగొనగలడు. రామా నీవు శీఘ్రమే ఇక్కడనుండి బయలుదేరి సుగ్రీవుని వద్దకు వెళ్లి అగ్నిసాక్షిగా ఆయనతో స్నేహము చేసికొనుము.

‘‘రామా, సుగ్రీవునకు నరమాంస భక్షకులయిన రాక్షసుల స్థావరములన్నియు తెలియును.  నదులు, పర్వతాలు, సముద్రాలు, దుర్గములు అన్ని ప్రదేశములు తన అనుచరుల చేత వెదికించి సీతాదేవి జాడ కనుగొనగలడు.

Also read: కబంధుడి చేతచిక్కిన రామలక్ష్మణులు

‘‘రామా, ముందుగా ఇక్కడనుండి పడమర దిక్కుగా ప్రయాణము సాగించండి. ఆ మార్గములోని అరణ్యమునందు ఎక్కడ చూసినా పుష్పించి ఫలములతో నిండి ఉన్న వివిధములైన వృక్షజాతులతో దట్టముగా మార్గములల్లుకొని ఉండును. నేరేడు, మొరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి ,కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, బొగ్గు, కానుగ, అశోక, కదంబ, గన్నేరు, భల్లాతక, నల్ల అశోక, రక్తచందన, వేప వృక్షజాతులతో ఆ అరణ్యము శోభాయమానముగా ఉండును.

‘‘నీవూ, లక్ష్మణుడు ఆ వృక్షములను ఎక్కిగానీ, బలముచేత క్రిందకు పడగొట్టి కానీ దారులు చేసుకొని మరియూ వాటి అమృత ఫలములను భక్షిస్తూ వెళ్ళండి. రామా పుష్పించిన ఆ వనము దాటిన పిమ్మట మరియొక సుందరమైన వనమున్నది. చైత్రరధమునందువలే ఆ వనమందు అన్ని ఋతువులు ఒకే సమయమున ఉండును.

Also read: సీతాపహరణ గాథ తెలిపి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు

‘‘రామా, అచటనున్న పర్వతము దాటి మరియొక పర్వతము తదుపరి మరియొక వనము దాటిన పిదప మీరు పంప అనే పద్మ సరస్సును చేరగలరు. ఆ సరస్సు కడు నిర్మలముగా ఉంటుంది. జారుడు ప్రదేశముగానీ, నాచుగానీ అస్సలు కనుపించదు. అన్ని ప్రదేశములు సమతలముగా ఉంటాయి. అక్కడ హంసలు నీరుకోళ్ళు, క్రౌంచపక్షులు, కురరపక్షులు, మధురధ్వనులతో ఆ సరస్సులో కూస్తూ కనబడతాయి. నేతిముద్దల వలె పెద్ద ప్రమాణములో ఉన్న పక్షులను మీరు భక్షించవచ్చును. ఆ రమణీయమైన ప్రదేశము నీ దుఃఖము పోగొట్టగలదు. అక్కడ మతంగ మహాముని శిష్యురాలు శబరి, తన తోటివారంతా స్వర్గస్థులైనా కన్నులలో ప్రాణములు నిలుపుకొని నీ దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది.

Also read: రాముడిని శాంతపరచడానికి లక్ష్మణుడి ప్రయత్నం

‘‘ఆ పంపా తీరమునకు పడమర దిక్కున నీకు సాటిలేనిదీ, రహస్యమూ అయిన ఒక ఆశ్రమము క‌నపడుతుంది. ఆ ఆశ్రమమునందు ఇప్పటికీ  మతంగ మహాముని ఏర్పాటు చేసిన నియమములు పాటింపబడుతున్నవి. దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళినచో ఋష్యమూక పర్వతము నీకు అగుపించగలదు. ఆ పర్వతము మీద నిదురించినవారు తమ కలలో చూసిన ధనమును వెంటనే పొందగలరు. దురాచారి అయినవాడు ఆ కొండ ఎక్కినచో అతనిని నిద్రలోనే రాక్షసులు చంపివేయుదురు.

‘‘రామా, ఆ పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉండి దానికి అడ్డముగా ఒక పెద్దకొండరాయి నిలబెట్టబడి ఉంటుంది. ఆ గుహలోనే తన అనుచరులైన నలుగురు వానరులతో కలిసి సుగ్రీవుడు నివసిస్తున్నాడు’’ అని కబంధుడు చెప్పగా రామలక్ష్మణులు విని అతనిని ‘ఇక నీవు వెళ్ళుము’ అని అనుమతించారు.

Also read: రామచంద్రుని వ్యధాభరితమైన క్రోధావేశం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles