Wednesday, May 1, 2024

ఇడబ్ల్యూ ఎస్ అంటే ఏమిటీ?

  • అగ్రవర్ణాల పేదలు అభివృద్ధి చెందేది ఏలా?
  • రాజ్యాంగసవరణ ఎందుకు చేయవలసి వచ్చింది?

అగ్రవర్ణ పేదల సహేతుకమైన కోరికను కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని తెలంగాణ రాష్ట్రం లోని అన్నీ ఓసీ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.  దేశంలో అగ్రవర్ణాలుగా ఉంటూ ఆర్థికంగా బలహీన వర్గం అయిన వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్నీ పరిశీలించాక ఒక నిర్ణయానికి వచ్చింది.

కేంద్ర మంత్రిమండలి 7 జనవరి 2019 న జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీనమైన విభాగం (ఎకనామికల్ బ్యాక్ వర్డ్ సెక్షన్స్-ఇడబ్ల్యుఎస్) కోసం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 10% రిజర్వేషన్లను ఆమోదించారు. ఎస్సీ / ఎస్టీ / ఓబిసి వర్గాలకు ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లకు విఘాతం కలగకుండా అగ్రవర్ణ పేదలకు ఈ పదిశాతం రిజర్వేషన్లు కలగజేసింది.

సవరణ బిల్లు ఎట్లా వచ్చింది?

భారత పార్లమెంటు దిగువ సభ (లోక్‌సభ)లో 8 జనవరి 2019 న రాజ్యాంగం (నూట ఇరవై నాలుగవ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అదే రోజున బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లును ఎగువ సభ రాజ్యసభ జనవరి 9 న ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ బిల్లుకు 12 జనవరి 2019 న అనుమతి ఇచ్చారు.  బిల్లుపై గెజిట్ విడుదల చేశారు, దాంతో ఇది చట్టంగా మారింది. 14 జనవరి 2019 నుండి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని నూట మూడవ సవరణ ఇడబ్ల్యుఎస్ కేటగిరీకి 10% రిజర్వేషన్లను అనుమతించేలా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15 (6) మరియు 16 (6) ను సవరించింది. అనేక రాష్ట్ర మంత్రివర్గాలు ఈ చట్టాన్ని ఆమోదించాయి.  10% EWS రిజర్వేషన్లను అమలు చేయాలనే ఉద్దేశ్యాన్ని  కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

యూత్ ఫర్ ఈక్వాలిటీ

10 జనవరి 2019 న, కుల-ఆధారిత విధానాలను వ్యతిరేకించే యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే ఎన్జీఓ సంస్థ సుప్రీంకోర్టులో ప్రతిపాదిత సవరణను సవాలు చేసింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ సమూహాల నాయకులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు, EWS  రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తూ, EWS సమూహాలు మునుపటి కేసులో అదే కోర్టు పేర్కొన్న రిజర్వేషన్ల ప్రమాణాలకు అనుగుణంగా లేవని వారు వాదించారు. 25 జనవరి 2019 న, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో GEN-EWS వర్గానికి ఇచ్చిన 10% రిజర్వేషన్లను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 6 ఆగస్టు 2020 న ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా బలహీనమైన  అగ్రవర్ణ విభాగం అనే అర్థం.

కుటుంబం నిర్వచనం ఏమిటి?

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లో కుటుంబం నిర్వచనం ఏమిటంటే రిజర్వేషన్ ప్రయోజనం కోరుకునే వ్యక్తి, అతని / ఆమె తల్లిదండ్రులు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తోబుట్టువులు, అతని / ఆమె జీవిత భాగస్వామి, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు విద్యా రిజర్వేషన్లు పొందాలి.

అభ్యర్థి వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలు మాత్రమే ఉండాలి. అతని కుటుంబం ఐదు ఎకరాలకు  పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉండకూడదు.  నివాసం చదునైన ప్రాంతం 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి. నోటిఫైడ్ మునిసిపాలిటీ రంగంలో ఉంటే నివేశన స్థలం 100 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలి. నోటిఫై చేయని మునిసిపాలిటీ రంగంలో ఉంటే నివాస స్థలం 200 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలి.

రాజ్యాంగ సవరణ ఏమంటోంది?

భారతదేశం అంతటా ఉన్నత విద్యలో ఆర్థికంగా బలహీనమైన విభాగానికి 10% రిజర్వేషన్ పొందటానికి ఈడబ్ల్యూఎస్  సర్టిఫికేట్ ఉపయోగించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ మేరకు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్  సర్టిఫికెట్ ను ఉపయోగించుకోవచ్చు. ఇది రాజ్యాంగ సవరణలో లోక్ సభ రాజ్యసభ సభ్యులు ఆమోదించారు. ఈ రిజర్వేషన్‌పై ఇడబ్ల్యుఎస్ వర్గానికి చెందిన ఆశావాదులు పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే వయస్సు సడలింపు, ఫీజు సడలింపు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ఇంటి ప్రమాణాలు వంటి అనేక ప్రయోజనాలు ఇందులో లేవు! ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్ యొక్క వివరణాత్మక నోటిఫికేషన్ ప్రకటించినప్పుడు, అభ్యర్థులు న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద త్రినేత్రా సింగ్, అతని సహచరుల నేతృత్వంలోని ఈడబ్ల్యూఎస్ అరక్షన్ మంచ్ పతాకంపై నిరసనను ప్రారంభించారు.  సాంఘిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ తవార్ చంద్ గెహ్లోట్ కుల ఆధారిత రిజర్వేషన్లకు అందుబాటులో ఉన్న రిజర్వేషన్ల అన్ని ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.  చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఈ డిమాండ్‌ను ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అనుకూలంగా లేవనెత్తారు. బిజెపి పార్లమెంటు సభ్యుడు జివిఎల్ నరసింహారావు 2020 లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ డిమాండ్‌ను బహుళ ప్రధాన స్రవంతి వార్తా వనరులు కూడా కవర్ చేశాయి. వీడియోలు, పోస్టులు, ట్వీట్ల ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఇడబ్ల్యుఎస్ అరక్షన్ మంచ్ ప్రచారం చేస్తున్నారు కూడా. కోవిడ్, లాక్ డౌన్ ల కారణంగా మన రాష్ట్రంలోని అగ్రవర్ణాల పేదలు  EWS ను అమలు చేయాలని చేస్తున్న డిమాండ్ లో వెనుక బడి పోయారు.

అంబేడ్కర్ ఏమి చెప్పారు?

రిజర్వేషన్ల గురించి అంబెడ్కర్ ఏమి చెప్పారంటే 1947 లో భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తి గా కొన్ని ప్రమాణాలు పాటించాలని రిజర్వేషన్ల అమలు పదేళ్ళు మాత్రమే ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ అగ్రవర్ణాల కుట్ర అని అంబేడ్కర్ అలా అనలేదని మరికొంత మంది వాదిస్తారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రతి పదేళ్ల కొకసారి రిజర్వేషన్ల ను పొడిగిస్తూ వస్తున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్ల ఉద్యమం పై బిబిసి  వార్త సంస్థ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసింది… అంబేద్కర్ ఏమి చెప్పారు అనే విషయం పై ఆరా తీసింది. ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ హరి నార్కే తో బీబీసీ మాట్లాడినప్పుడు. ఆయన రిజర్వేషన్లు మూడు రకాలు! రాజకీయ రిజర్వేషన్లు,(రిజర్వుడ్ నియోజక వర్గాలు)చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే పదేళ్ల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో  రిజర్వేషన్ కోసం రాజ్యాంగం ఎలాంటి కాల పరిమితి విధించలేదు అని నార్కే చెప్పారు. అంబెడ్కర్ చెప్పారంటున్న పదేళ్ల రిజర్వేషన్లపై 1949 ఆగస్టు 25 మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ సభ్యుడు నాగప్ప వ్యతిరేకించారు. పదేళ్లు కాదు షెడ్యూల్ కులాల వారు అగ్రవర్ణాల స్థాయి కి వచ్చేవరకు రిజర్వేషన్లు కొనసాగాలని డిమాండ్ చేశారు. దానికి అంబెడ్కర్ సమాధానం ఇస్తూ, ఈ పదేళ్ళలో షెడ్యూల్ కులాలు ఆశించినంత పురోగతి కనబరచక పోతే ఇంకొంత కాలం రిజర్వేషన్లు పొడిగించాలని నియమం పెట్టానని అన్నారని హరి నార్కే బిబిసి కి చెప్పారు.

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles