Saturday, April 27, 2024

సత్యసాయి పుట్టినరోజు

  • మనిషిని ప్రేమించమని చెప్పిన మనీషి
  • పరోపకారాన్ని ఉద్భోదించిన శాంతమూర్తి
  • విశిష్టమైన వ్యక్తిత్వం, సేవానిరతి

ఆయన నిన్నటి వరకూ మన మధ్యే సంచరించిన మనలాంటి మనిషే. వేషభాషలు, రూపురేఖలు కొంచెం విభిన్నంగా కనిపించినా, మనలాగే మాట్లాడి,మన వలె చమత్కార, హాస్య సంభాషణలు చేసినవాడే. కానీ, ప్రపంచం ఆయనను వింతగా చూసింది, కొత్తగా చూసింది, కొందరు మహోన్నతంగా చూశారు. ఎందరో అనుమానించారు కూడా. ఇప్పటికీ కొందరు ధ్యాన, యోగ మార్గాల్లో ఊహించుకుంటూ, దర్శించుకుంటూ ఉంటారు. తద్వారా మనోబలాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కొండలు, బండరాళ్లు, పిచ్చి మొక్కలు వెలసిన చోటే ఆయనా వెలిశాడు. అక్కడే వెలిగాడు. ఎందరికో వెలుగులు పంచాడు, చీకట్లు పారద్రోలాడు, ఇక్కట్లు తొలిగించాడు. ఎప్పుడో వాన కురిస్తే తప్ప అక్కడ నీరు కనిపించదు, మొక్క వికసించదు. ఎద్దుల బండ్లే ప్రయాణ సాధనాలు, దీపపు బుడ్లే విద్యుత్ సౌధాలు. అంతగా వెనకబడిన ఆ నేల వైపే ప్రపంచమంతా చూసేట్టు చేశాడు. గుడిసెల స్థానంలో ఆకాశహర్మ్యాలు వెలిసేట్టు చూశాడు.నిరక్షర కుక్షులు నడిచిన చోటే విశ్వవిద్యాలయాలు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు  నిర్మాణమయ్యాయి. ఆ రాళ్ళ బాటల్లో రోల్స్ రాయిస్ కార్లు తిరిగాయి. బస్సెక్కాలంటే, ట్రైన్ పట్టుకోవాలంటే మైళ్ళు నడవాల్సిన చోట ప్రత్యేక విమానాశ్రయమే వెలిసింది. విసిరి పడేసినట్లు ఎక్కడో ఉండే ఆ కుగ్రామానికి ప్రపంచ దేశాల పెద్దలంతా నడచి వచ్చారు.

మహాసంకల్ప బలం

నిధులు, యంత్రాంగం కలిగిన ప్రభుత్వాలు చేపట్టిన  ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయిన దాఖలాలు తక్కువ. అక్కడ మాత్రం, ఎప్పటికి పూర్తవ్వాలనుకుంటే, కచ్చితంగా అప్పటికే  విజయవంతంగా ఆ ప్రాజెక్ట్ సంపూర్ణమవుతుంది. అది అక్కడి ప్రత్యేకత. అదీ, వారి సంకల్పబలం. ఈ బలానికి, బలగానికి మూలం సత్యసాయిబాబా. ఆ ఊరు పుట్టపర్తి. అక్కడ పొద్దున్నే ఓంకారం వినిపిస్తుంది. మధ్య మధ్యలో భజనలు మారుమ్రోగుతుంటాయి. పేరెన్నిక కన్న కళాకారులు పాడి వెళ్లిపోతుంటారు. దేశాధినేతలు, సెలెబ్రెటీలు, వ్యాపార దిగ్గజాలు బాబాను దర్శించుకోవడం కోసం ఆ సీమకు బారులు కట్టినవారే. ఆ కేంద్రానికి  పెట్టిన పేరు  ‘ప్రశాంతి నిలయం’. పేరుకు తగ్గట్టుగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా  అయస్కాంతం అక్కడ వెలిసిందా? అని ఇప్పటికీ ఎందరో ఆశ్చర్యపోతుంటారు. ఆ అయస్కాంతం, ఆ అకర్షణ, ఆ శక్తి, ఆ వైభవం ఆ నేలకు తెచ్చిపెట్టిందీ, ఆ మట్టిని బంగారంగా మార్చిందీ సత్యసాయిబాబా అనే ఒకే ఒక  వ్యక్తి. లెక్కల ప్రకారం 1926లో నవంబర్ 23వ తేదీ నాడు జన్మించారు. అందరి వలె కొంతకాలం జీవించి, భౌతికంగా ఈ లోకం వీడివెళ్లిపోయారు. సత్యసాయి,శాంతిసాయి, ప్రేమసాయి ఈ పేర్లు ఆయనవే. మహారాష్ట్రలో వైభవ ప్రాభవంతో వెలిగిపోతున్న ఆధ్యాత్మిక కేంద్రం షిరిడీ.ఆ శక్తికి మూలపురుషుడు పేరు కూడా సాయిబాబా. “ఆయనే నేను -నేనే ఆయన”, అని ఈ పుట్టపర్తి సాయి  చెప్పుకున్నారు. శివుడు, శక్తి నాలో ఉన్నాయని చెప్పారు. నమ్మిన వాళ్లు నమ్మారు. నమ్మని వాళ్లు నమ్మలేదు. ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు, నమ్మనివారూ ఉన్నారు. ఒకటి మాత్రం అందరూ నమ్ముతారు.

ఆయన ద్వారా జరిగిన సేవ గొప్పది

ఆయన దేవుడా, దైవదూతా, మ్యాజిక్కులు చేసే గారడీవాడా అనే విమర్శలు ప్రశంసలు పక్కన పెట్టి చూస్తే, ఆయన ద్వారా జరిగిన  సేవ గొప్పది. ఆయన వల్ల జరిగిన మేలు గొప్పది. విద్య, వైద్యం, భోజనం ఎందరికో అందింది. ఇప్పటికీ ఎందరికో అందుతోంది. దీన్ని అందరూ నమ్ముతారు, అందుకు ఆయనను  అభిమానిస్తారు. అదే గొప్ప విషయం. అదే సత్యసాయిబాబా ఆకర్షణ. అదే ఆయన వల్ల జాతికి జరిగిన ప్రయోజనం. ప్రేమ, సేవ రెండింటినీ ఆయన నమ్మాడు, అందించాడు, అందించమని  అందరికీ చెప్పాడు. ప్రేమ, సేవ రెండూ గొప్ప మార్గాలు. వాటిని ఆచరించినవారు, ఆచరణకు దారి ఇచ్చినవారు, ఆచరించమని ప్రబోధించిన వాళ్లు అందరూ గొప్పవాళ్లే. ఆ విధంగా, పుట్టపర్తి సత్యసాయిబాబాను గౌరవిద్దాం. సత్యమే సుందరం, అదే శివం, అదే శుభం అని బాబా విరివిగా ప్రచారం చేశారు. ముంబయి, హైదరాబాద్, చెన్నైలో సత్యం,శివం,సుందరం అనే కేంద్రాలు స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా 166దేశాల్లో 10వేలకుపైగా సత్యసాయి సేవాసంస్థల ద్వారా కొన్ని లక్షల మందికి  విద్య,వైద్య సేవలు, సహకార, ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇది మాములు విషయం కాదు. శాంతి, ప్రేమ, సేవల గురించి బాబా చేసిన బోధనలు ఎందరినో ఆకర్షించాయి. మత సామరస్యం, సకలజీవుల పట్ల ప్రేమ, అహింసభావన కలిగి ఉండమని బాబా చెప్పిన మాటలు ప్రపంచానికి బహుళ ప్రయోజనాన్ని కలిగించే గొప్ప శక్తి మంత్రాలు. అబ్దుల్ కలామ్ నుంచి పివి నరసింహారావు వరకూ, గవాస్కర్ నుంచి టెండూల్కర్ వరకూ, లతా మంగేష్కర్ నుంచి పి.సుశీల వరకూ, వాజ్ పేయి నుంచి మోదీ వరకూ, మన్ మోహన్ సింగ్ నుంచి టి ఎన్ శేషన్ వరకూ ఎందరెందరో పెద్దలు బాబాను గౌరవించారు, ఇష్టపడ్డారు. బాబాతో సన్నిహితంగా మెలిగినవారికి, స్వయంగా అనుభవాలు పోగుచేసుకున్నవారికి, అనుభూతులు పొందినవారికీ, బంగారూ… అని పిలిపించుకున్నవారికీ ఆయన గురించి తెలుసు. వారిలో నాస్తికులున్నారు, తార్కికులున్నారు, మనోవైజ్ఞానశాస్త్ర నిపుణులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, మేధావులున్నారు. వారందరూ ఆయనలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని గ్రహించినవారే కావడం బాబా విశేషం. మహిమలు మొదలైన అంశాలను అలా ఉంచగా, ఆయన వల్ల ఎందరో స్ఫూర్తి పొందారు, ఊరట పొందారు, మార్గదర్శనం నిర్దేశించుకున్నారు. లక్షలాది మంది సామాన్యులకు ఎన్నో మేళ్లు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంతటి గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసి, బాబా వెళ్లి పోయారు. అయన దైవమా, దైవదూతా, మామూలు మనిషా.. అనే విషయాలు అప్రస్తుతం. ఆయన నిర్మించిన వ్యవస్థల ద్వారా జాతికి జరిగే మేలు ఎప్పటికీ ప్రస్తుతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సత్యసాయిబాబా భారతీయుడు, మన తెలుగువాడు. అదీ మనకు గర్వకారణం.జాతిని జాగృతి వైపు, సమాజాన్ని శాంతి వైపు, మనుషుల్ని ప్రేమ,సేవలవైపు, దేశాన్ని ప్రగతి వైపు నడిపించే ఏ వ్యక్తి అయినా ఆరాధ్యుడే. అటువంటివారు ఈ లోకానికి ఇంకా కావాలి, రావాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles