Thursday, April 25, 2024

తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్రను క్షమించని జర్నలిస్ట్ కెఎల్ రెడ్డి

1980 జనవరిలో ‘వరంగల్ వాణి’ అనే మా నాన్నగారు, ఎడిటర్ ఎంఎస్ఆచార్య దినపత్రిక నడిపేవారు. అంతకుముందు జనధర్మ పేరుతో 1958 నుంచిపత్రికనడిపేవారు. 1971 సెప్టెంబర్ 23 నాటి తొలి పేజీనాడు, తరువాత సంపాదకీయం నాడు రాసిన పేజీ మీ ముందుంది. ఒక సారి చదవండి దీన్ని.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో దేవులపల్లి ప్రభాకరరావు సారథ్యంలో వెలువడిన ‘జనత’ పత్రికలోనెలకు రూ.150ల వేతనానికికెఎల్ ఆర్ చేసేవారు. ‘జనత’ ఆగింది. తర్వాత ‘నేడు’ అని కరపత్ర దినపత్రిక వచ్చేది.  మూడు నెలల పాటు పేజీ కరపత్రం, పదిపైసలుపత్రికవచ్చేది. సికిందరాబాద్ దినపత్రిక విక్రయించే ఏజెంటు మల్లయ్య ఆర్థిక సహాయం ఇచ్చేవాడు. 1969 కొన్నరోజుల్లోచెన్నారెడ్డి ఉద్యమ వార్తలతో ‘నేడు’ మొదటి కరపత్రంలో ‘తెలంగాణసింహ కిశోరం చెన్నారెడ్డి’ అంటూ రాశారు. అదే కెఎల్ ఆర్ చివరి కరపత్రంలో ‘‘తెలంగాణ ద్రోహి చెన్నా’’ అనే ప్రధాన శీర్షిక తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. ఆయనకు మంత్రులు, నాయకులు అవసరం లేదు. తెలంగాణముఖ్యంఆయనకు.  అంతకుముందు 14 స్థానాల్లో 10 లోక్ సభ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. నాటి ప్రధాని ఇందిరాగాందీ అకస్మాత్తుగా అర్ధరాత్రి హైదరాబాద్ కి వచ్చిచొక్కారావుతోనూ, చెన్నారెడ్డితోనూ మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కాసుబ్రహ్మానందరెడ్డిని తీసేస్తే చాలన్నారు చెన్నారెడ్డి. అందుకు ఇందిర అంగీకరించారు. అంతే, చెన్నారెడ్డి పార్టీని కాంగ్రెస్ లొ విలీనం చేసేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమం చల్లారి పోయింది. చెన్నారెడ్డి ఈ  ద్రోహాన్ని కెఎల్ రెడ్డి క్షమించలేదు.

అప్పుడే ప్రజా ఉద్యమానికి ఐదు వెన్ను పోట్లు అంటూ ఎం ఎస్ ఆచార్య సంపాదకీయం రాశారు. అది చాలా సంచలనం కలిగింది. ఆయన నిప్పులు చెరిగారు.

పది పైసల పత్రిక

ప్రముఖ పత్రికా సంపాదకులు ఎంఎస్ ఆచార్య

కెఎల్ ఆర్ కరపత్రం పేరుతో నడిచే పత్రిక చెన్నారెడ్డితో ఆగిపోయింది. హాయిగా గవర్నర్ గా చెన్నారెడ్డిఉండేవారు. కాని కరపత్ర ‘పత్రిక’ అని ప్రచురించినందుకు కెఎల్రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో నిలబెట్టారు. దిల్లీ నుంచి వార్తాపత్రికల రిజిస్ట్రార్ ఆమోదం లేకుండా పత్రికలాంటి కరపత్రం నడిపినందుకు ఓ న్యాయాధికారి రెడ్డికి నెల రోజుల కఠినకారాగార శిక్ష విధించారు. కెఎల్ రెడ్డిని ఒక ఖైదీ ‘నువ్వుఎవరిని చంపావు?’’ అని అడిగాడు. ‘నేనెవ్వరినీ చంపలేదు. ఏ నేరమూ చేయలేదు’’ అనిచెప్పాడు. ‘‘మరి ఏ నేరానికి జైల్లో తోసిండ్రు’’ అనిమరోప్రశ్న.  ‘‘తెలంగాణ కోసం పత్రిక తీసినందుకు’’ అంటేఆశ్చర్యపోయారు. అప్పుడు ఖైదీలలో సానుభూతి,  గౌరవం పెరిగింది.  జైలులోఇతర తోటి ఖైదీలు పనులు చేసేవారు.  ముషీరాబాద్ లో రెడ్డి రోజూ దినపత్రికలు చదివి విశేషాలు తెలియజేసేవారు. వరసగా ప్రతి రోజూ ప్రచురిస్తే అది పత్రికగా అనడం న్యాయమే. అయితే జరిమానా ఇవ్వాల్సిన శిక్ష వేసినా సరిపోయేది.  జైల్లో తోసేంత నేరం కాదు. అది పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించే అన్యాయం. కాని కోర్టులో వాదించి గెలవగలిన శక్తి లేనందున కఠిన కారాగార శిక్ష విధించారు. అన్యాయంగా కెఎల్ రెడ్డి నెల రోజులు కఠిన శిక్షపై జైలుకు వెళ్లారు.

ఇద్దరుసహాధ్యాయులు ఎంఎస్ ఆచార్య, కెఎల్ రెడ్డి

‘‘నువ్వు పెద్ద పత్రికలో వార్తలు రాస్తే చాలమంది కితెలిసిపోతుంది. ఏదో ఒక చిన్న పత్రికకు రాస్తే  ఎవరికైనా అందుతుందా?’’ అని కెఎల్ రెడ్డి మానాన్నతో, (సహాధ్యాయుడుఎంఎస్ ఆచార్యతో) పంచాయితీ పెట్టుకునేవాడు. పెద్ద పత్రికలో చిన్నవాడుగా ఉండే కన్నా చిన్న పత్రికలో పెద్దవాడుగా ఉండాలని మా నాన్న అనేవారు. పెద్ద పత్రికలు న్యాయంగా, నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యమా అనికెఎల్ఆర్ తో నాన్నఅనేవాడు.

జనధర్మ సంపాదకీయం

పత్రికలు నడపడానికి లంచాలు అడిగే ప్రభుత్వంలోని కొందరితో లాలూచీ పడే వాడేకాదు.  దాని బదులు పత్రికలు నిలిపి వేయడం నయం అనుకునేవాడు. ఈ తరువాత పెద్ద పత్రికలు నడిపేవారు పార్టీలతో లాలూచీ చేసేవారని కెఎల్ ఆర్ కు అర్థమై పోయింది. చెన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం విరమించడాన్ని విద్రోహచర్య అని విమర్శించారు కెఎల్ రెడ్డి. తరువాత పత్రికలు ప్రజలకు అనుకూలంగా కాకుండా తమఅవసరాలకు, డబ్బుసంపాదనే ధ్యేయంగా మారిపోయాయి.

మలిదశ పోరాటం

ఈ తరువాత తెలంగాణ మలిదశ పోరాటం మొదలైంది. 2001లో దిన పత్రికలలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తెలంగాణ పార్టీ ప్రారంభిస్తారని వార్త తెలియగానే కె. ఎల్. జర్నలిస్టులనుకొందరితోమీటింగ్ కు వెళ్ళారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం నివాసగృహం పైభాగంలోనే కెసీఆర్ తెలంగాణ సమితి పార్టీ ఆఫీసు ఉండేది. కెసిఆర్ మెట్లుదిగి కిందికి వస్తుండగా కె.ఎల్. ని చూశారు. అప్పుడు మనిషి బక్కపలుచగా ఉన్నారు. ముక్కు కార్టూన్కు అనువైనది. ముఖం గంభీరంగా ఉంది. ఆత్మవిశ్వాసం గుండెనిండా కనిపిస్తోంది.

‘‘కేసీఆర్ నోరు తెరిచారు. పెదాలు కదలాడాయి. తెలంగాణ మాండలిక పదాలు విస్ఫులింగాల్లా బయటికి దూసుకొచ్చాయి. చెన్నారేడ్డి సహా తెలంగాణ నాయకులెవ్వరూ తెలంగాణ భాషలో, యాసలోమాట్లాడలేదు. కానీ ఇతడు స్థానిక ప్రజల భాషలో గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు. ఈయన ప్రసంగాలు నిస్సందేహంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటాయి. వారిని ప్రభావితం చేసి తీరుతాయి. నివురు గప్పిన తెలంగాణ నిప్పును కేసీఆర్ మళ్ళీ రాజేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా ఈ నిప్పు ఆరదనిపిస్తున్నది. నా  ఈ నమ్మకం వమ్ముకాదు. బక్కోడు నిజం చేసి చూపిస్తాడు. కేసీఆర్ ప్రసంగం విన్నతర్వాత కెఎల్ రెడ్డి మదిలో మెదిలిన భావ వీచికలు ఇవి,’’ అంటూ చక్రధర్ ‘తెలంగాణ అక్షర యోధుడు’ అనే వ్యాసంలో వివరించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే కెఎల్ కు చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్ర సమితిని సమర్థించారు.  కాంగ్రెస్, బిజెపి దొందుదొందే అని అనుకునేవాడు.  ఈ పార్టీల కన్నా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్యుడని నమ్మాడు. కె. తారకరామారావు (కెటిఆర్) కూడా చాలా సమర్థుడని అన్నారు కూడా.  కెసిఆర్, కెటిఆర్ ల పార్టీ నిసమర్థించారు.

కే సి ఆర్ ప్రోత్సాహం

కెఎల్ రెడ్డి మొత్తం తెలంగాణ జనానికి తెలియడానికి కారణం కే. చంద్రశేఖర్రావ్. దానికి కారణం కెఎల్ రెడ్డి గురించి గోవిందరాజు చక్రధర్ రాసిన ఒక వ్యాసం. ఆ వ్యాసం చదివింది ఎవరంటే మన ముఖ్యమంత్రి. చదవగానే చేసిన పని – పాత్రికేయుడు బతకడానికి ఇబ్బంది పడుతున్నాడని కెఎల్ రెడ్డికి వెంటనే ఫోన్ చేశారుముఖ్యమంత్రి.  మరో ప్రముఖ వ్యక్తి ఎవరంటే.. ఎంవి ఆర్ శాస్త్రి. 20 సంవత్సరాల పాటు పని చేసిన గొప్ప సంపాదకుడు, మంచి రచయిత. వార్తా రచనా వీరుడు.  కెఎల్.   పత్రికకు రాయగలిగినా కనీసం కావలసిన డబ్బు లేదని అడిగారు. శాస్త్రి బాధ పడ్డారు. ముందు ఆయన కష్టం గురించి రాయాలనుకున్నారు. చక్రధర్ ఆ పనిచేసాడు, అద్భుతంగా. దాన్ని భూమిక పేరుతో ‘ఆంధ్రభూమి’ పత్రికలో శాస్త్రి ముద్రించారు.

శాస్త్రిగారు  ఈ విధంగా తన గురించి రాస్తూ ‘…2016 లో ఒక రోజు ఆంధ్రభూమి ఆఫీసులో కె. ఎల్. రెడ్డి  నన్నుకలిశాడు. “నెలకు15 వేలు ఉంటే హాయిగా గడిచి పోతుంది. రోజూ వచ్చి రాసి పెడతాను” అన్నాడు. అప్పటికే ఆయన 80 దాటాడు. గూని వచ్చింది. ఇంకా రాయటం నీ వల్ల కాదు. అది పరిష్కారం కూడా కాదు. నీ గురించి పత్రికలో ప్రత్యేక వ్యాసం వేద్దాం. దాన్నిచూపించి ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి సాయానికి ప్రయత్నం చేద్దాం’’ అన్నాను. సీనియర్ జర్నలిస్టు రెడ్డి గారికి ఆప్తుడు గోవిందరాజు చక్రధర్ చక్కని వ్యాసం రాశారు. దానిని మా డైలీ ఫీచర్ సప్లిమెంటు “భూమిక” మొదటి పేజీలో ప్రముఖంగా వేశాము. ఎవరూ పని గట్టుకుని పైరవీ చేయాల్సిన అవసరం లేకుండా అందరి కంటే ముందు  ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పొద్దున్నే ఆ వ్యాసం చూసి నేరుగా తానే కె.ఎల్.రెడ్డికి ఫోన్చేసి పిలిచారు’’ అని శాస్త్రి వివరించారు.

కరిగి పోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కెఎల్ ని పిలిపించారు. నీకు 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారన్నాడు. దానికి అమాయకుడు ఏమన్నాడో తెలుసా? ‘నాకు 10 వేలొస్తేచాలు’ అన్నాడు. పది లక్షల రూపాయలు వస్తే ఒక అధికారి లెక్కచేసి నెలకు 8 వేలదాకారావచ్చుఅన్నారు. ‘సరేలే చాలు. నేను ఇంకో రెండు వేలకు ఎక్కడనైనా పనిచేస్తాలే. కెఎల్ రెడ్డికి నెలకు 12 వేలు  రావాలంటే  15 లక్షల రూపాయలు ఇవ్వాలని అక్కడి అధికారి ఒకరు లెక్క వేసి చెప్పారు.  వెంటనే నెలకి 12 వేలు వచ్చే విధంగా రెడ్డికి  15 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కెఎల్ ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవాడు. సార్ అనే బదులు మిత్రులెవరినైనా ఆ ‘మానవుడు’ అంటూ ఉండేవాడు. తెలుగు భాషలోనే సాధ్యమైనంతవరకు మానవుడా అనేవాడు. కెఎల్ రెడ్డి ‘మానవుడు’ సంతోషించేవాడని ఎంవిఆర్ శాస్త్రి అనేవారు. ముఖ్యమంత్రి కూడా ఎన్నో సందర్భాల్లో కెఎల్ ను గుర్తుచేసుకునేవారు.

ఆ సామాన్యుడుమాన్యుడుకెఎల్రెడ్డి 93 సంవత్సరాలు దాటిన తరువాత వరంగల్లు దగ్గర గొర్రెకుంటలో కీర్తి శేషులు ప్రొఫెసర్పర్మాజీ నిర్మించిన ఆశ్రమంలో నవంబర్ 3 తెల్లజామున కాలధర్మం చెందారు.

ఉన్నదిఉన్నట్టన్నట్టు

‘ఈనాడు’ దినపత్రికలో 1975 కు ముందు రాత పరీక్షలో గెలిచినాడు. రామోజీరావుతో ఇంటర్వ్యూలోఉ న్నదున్నట్టు చెప్పినాడు. అందుకే ఉద్యోగం ఇచ్చారు రామోజీరావు. ‘‘నువ్వుతాగుతావా?’’ అని ఆయన అడిగారట. ‘‘మందు చాలా మంది తాగుతారు. నేను తెలంగాణ రెడ్డోణ్ణి. రెడ్లందరూ తాగుతరు. నేనైనా అంతే. పండగలూ పబ్బాలూ, పెళ్లి, పేరంటాలూ వస్తే  తాగేవాళ్లం. కానెప్పుడూవాంతులుచేసుకోలే’’ అని ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయనకు నచ్చింది. 

ఎంవిఆర్ శాస్త్రి తన బ్లాగ్ లో రాస్తూ. ‘అప్పట్లో రామోజీరావు గారు రోజూ ఉదయానే పేపరు మొత్తం చదివి, తప్పులు  మార్క్ చేసి, ఘాటుగా కామెంట్లు రాసి అందరికీ సర్క్యులేట్ చేయించేవారు. ప్రతిమంగళవారం ఎడిటోరియల్ హెడ్స్ తో మీటింగు పెట్టి లోటుపాట్లు నిశితంగా చర్చిస్తుండేవారు. ఎప్పుడు చివాట్లు పడతాయోనని న్యూస్ఎడిటర్ సంతపురిరఘువీరరావు, చీఫ్ సబ్ మూరిసుబ్రహ్మణ్యం అంతటి ఉద్దండులు కూడా భయపడుతుండేవారు.  అలాంటి చండశాసనుడైన చైర్మన్ ను పట్టుకుని “మీరసలు పేపర్ చదువుతారాండి” అని ఒక రోజు మీటింగులో అడిగినవాడు కె.ఎల్.రెడ్డి. ఆ మాటకు ఫకాల్న నవ్వారు చైర్మన్’ అన్నాడు

ఎవరినీలెక్కపెట్టడు

శాస్త్రి ఇంకా… ‘‘కె.ఎల్. రెడ్డి ఎవరినీ లెక్కచెయ్యడు. నచ్చకపోతే ఎవరి మాటా వినడు. మొహాన్నే దులిపేస్తాడు. రోజుకు14 గంటలు గొడ్డులా పని చేస్తూ ఎప్పుడు చూసినా ఆఫీసులోనే పని చేసేవాడు. సోమాజిగూడ ఆఫీసులోనే లైబ్రరీమీది సింగిల్రూములో ఉండేవాడు. పెళ్ళి పెటాకులయింది. ఒంటరి జీవితం. నిప్పులాంటిమనిషి. నిజాయతీపరుడు. అల్పసంతోషి. నా వంటి ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన గురువు. మంచిమనిషి. స్నేహశీలి. కడదాకా నాకుమంచిమిత్రుడు.  ‘ఈనాడు’ తరవాత ఎన్నో కొత్త పత్రికలలో పని చేశాడు. ప్రతి పత్రికనూ మొత్తం తానే రాసి  ఒంటిచేత్తో నెట్టుకొచ్చేవాడు. అలా ఎన్ని పత్రికలను నిర్వహించాడో అతడికే లెక్కలేదు’’ అనేవాడు.

‘‘తెలంగాణా ఊసే ఎవరికీ, ఏ నాయకుడికీ పట్టని కాలాన1980లలోనే “తెలంగాణ” పత్రిక పెట్టి అన్యాయాలపై ధ్వజమెత్తి తెలంగాణ క్షేమంకోసం  తపించి, నిస్వార్థంగా పోరాడినవాడు కె.ఎల్.రెడ్డి. అప్పట్లో ఫతేమైదాన్ ఫ్రాంగణంలో చిన్న గదిలో ఉండి అక్కడి నుంచే పత్రిక నడిపేవాడు. జర్నలిస్టులు, జర్నలిస్టులు ఎంతమందిఉన్నా కె.ఎల్. రెడ్డి ఒక్కడు చాలు పాత్రికేయ వృత్తి గర్వంగా చూపించుకోవటానికి. ఎక్కడ ఉన్నా ప్రతి దసరాకూ ఫోన్ చేసి పట్టుబట్టి తన దగ్గరికి పిలిపించుకునే కె.ఎల్.రెడ్డి కన్నుమూయటం నాలాగే చాలామంది జర్నలిస్టులకు తీరనివెలితి’’ అనిశాస్త్రిగారుఅన్నారు.

ఫ్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

శ్రీధర్ ను వరంగల్లులో జర్నలిస్టుగా తీర్చిన కెఎల్ రెడ్డి

1975లో కె. నరసింహారెడ్డి వరంగల్ ‘ఈనాడు’ విలేఖరిగా వచ్చారు. చాలా కమిట్మెంట్ కలిగినవాడు. మేధావి, మహోత్తముడు పాములపర్తి సదాశివరావు గారంత దార్శనికుడు నరసింహారెడ్డి. కానీ, ఆయన తరువాత వరంగల్ విలేఖరగా కెఎల్ రెడ్డి వచ్చారు. అప్పడికీ వారికి మంచి పరిచయాలు. ఆ కాలంలో ‘ఈనాడు’ పత్రికలో సమ్మెరావడంతో కె.ఎల్. హైదరాబాద్ కు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో పత్రికలు ప్రచురించాలని కెఎల్ కంకణం కట్టుకున్నవాడు. కనుక వరంగల్ కు విలేఖరిగా ఈ రచయిత (శ్రీధర్) ను 1977 లో నియమించారు. 

‘ఈనాడు’ పత్రిక కెఎల్ రెడ్డి వరంగల్ విలేఖరి  ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ కు వెళ్లారు.  1977కు ముందు సమ్మెను అధికశాతం కార్మికులు పోరాడుతున్న రోజుల్లో పత్రిక ప్రచురించడానికి మనం నిలబడాలని కెఎల్ రెడ్డి అనుకున్నారు.  ఆ పత్రిక రావాల్సిందే అని కెఎల్ కోరుకున్నారు. ధైర్యంగా న్యాయం కోసం ఆయన పోరాడుతున్నాననుకున్నారు. కాని కొన్ని సంవత్సరాల తరువాత నిష్పాక్షికతలేదని, పక్షపాతం విపరీతంగా ఉందని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆయనకు అర్థమైంది. ఈ రోజుల్లో అటువంటి కారణంగా కెఎల్  జనరల్ షి ఫ్టు (సెంట్రల్డెస్క్) బాధ్యుడుగా అర్ధ రాత్రి దాన తర్వాత ఒంటి గంటకు ఇచ్చేసిన తర్వాత రాజీనామా లేఖ రాసి మర్నాడు రామోజీరావుకు అందజేయమని అటెండర్ కు చెప్పి, లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇవ్వాళ పరిస్థితి ఏమిటి. నిష్పాక్షిగా ఏదీ లేదని, ఏ  పత్రిక ఎవరి దుకాణమో, ఏది కరపత్రమో అందరికీ తెలుసు.  కెఎల్ రెడ్డిని అన్యాయంగా నెల రోజులు జైలుకు పంపించారు. కరపత్రాలునిలదీసేనేరగాల్లేఇప్పుడుదేశంలోవీళ్లంతా. ఆయనమనసుచెప్పినట్టునిలబడ్డాడు.

తెల్లవారింది

తనకు చిన్న గది చాలు, నేను కావాలనుకున్న వార్తలతో జనాన్ని కదిలిస్తాను అని నమ్మిన వాడు కెఎల్ర్ రెడ్డి. కాని నమ్మిన వారు పత్రికలు డబ్బున్న వారికి కొమ్ము కాచేవారని తెలిసింది. అప్పడికి ఆయనకు తెల్లారింది. జీవితం ఆగిపోయింది. 93 సంవత్సరాల జీవితం సరి పోయింది. ప్రభుత్వాలు, పార్టీలు, మంత్రులు, వాళ్ల పత్రికలు, మాధ్యమాల, దేశాన్నిఎంఎల్యే ఏ లను, వోట్లను టోకుగా అమ్మేవారు, మధ్య దళారులు, కలిసిపోయారని పాపం కెఎల్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదు.

1986ల్లో ఒక పత్రికలో రెడ్డి వ్యాసం ప్రచురించారు.  ఎవడ్రా నన్ను తిట్టింది అని టంగుటూరిప్రకాశం అన్నంత తీవ్రంగా రామోజీగారి ‘ఈనాడు’ ను విమర్శించేవాడు కెఎల్. అంత ధైర్యం ఆయనది. దేనికీ భయపడ లేదు.

అవసరంలేదు

స్వార్థంలేదు. వైవాహిక జీవితం లేదు. చిన్నమంచం. ఓ పళ్లెం. కొన్ని గిన్నెలు లేదా నాలుగైదు పాత్రలు చాలు. ఆశలు లేవు. కాళ్లు చాలు. కార్లవసరం లేదు. కొందరు మిత్రులు భోజనం ఇప్పించితే చాలు. నాలుగైదు లాల్చీలు పైజామాలు చాలు. ఒక  కారులో వస్తువులు సరిపోయేవి. వెంట తెచ్చుకున్నవేమంటే పత్రికల కటింగ్ లు కాక మరేదీ కాదు. పెన్నులు, కాగితాలు చాలు. నా రచనలంటే కెఎల్ కి ఇంతో ఇష్టం. 1977 కాలంలో నేను విలేఖరిగా కొన్నిసలహాలు అడిగేవాడిని. ఓ ఉత్తరం రాసి పంపారు. ‘నన్నుఇట్లా అడగవద్దు. నీకు సొంతంగా ఇష్టం ఏంరాసుకోవాలని అనుకుంటే అది రాసుకో. నాకుచెప్పకసలు’ అని. విలేఖరిగా రెండు  సంవత్సరాలు పని చేసిన తరువాత ‘ఈనాడు’ నుంచి మారి మరో సంస్థలో ఉద్యొగం చేసేవాడిని నేను. వరంగల్ లో ‘ఆంధ్రప్రభ,’ ‘ఇండియన్ ఎక్సెప్రెస్’ పత్రికలో పనిచేసాను. తరువాత ‘ఉదయం’ పత్రికలో పదేళ్లు పని చేసాను.  కెఎల్ రకరకాల పత్రికలలో పని చేసేటప్పుడు ఆ పత్రికలలో నేను కొన్ని వ్యాసాలు రాసేవాడిని. డిల్లీకి నేను సమాచార హక్కు కమీషనర్ పదవి వచ్చినప్పుడు కలిసేవాడు. నేను గాంధీనగర్ దగ్గరలో ఉన్నఒక చిన్న ఇంట్లో పత్రికల కటింగ్ కాగితాలతో కాలం గడిపేవారు.

బైంసా దేవదాస్ చాలాకాలం నేటి నిజం పత్రిక నడిపారు. మళ్లీ చిన్నఇల్లు. చిన్న కప్పు చాయ్ సరిపోదు. మొత్తం పెద్దగాసులో చాయ్ ఇవ్వాల్సిందే.  ఆ తరువాత మహానగర్ అనే పత్రికలో కెఎల్ కొన్ని సంవత్సరాలు పని చేశారు.

తెలుగు పదాలంటే ప్రేమ. సతీమణి అనే మాట ఒప్పుకునే వాడు కాదు. భార్యల్లో ఒకరు ఉంటే ఆవిడను సతీమణి అనాలి. అంతేకాని ఒకరే ఉంటే భార్య అని మాత్రమే అనాలి. సతీమణి అనకూడదనేవాడు. భాషపైన ఆయనకు ఉన్న పట్టింపునకు ఇదొక ఉదాహరణ.

నల్లగొండ జిల్లా పరసరాయిపల్లెలో 92 సంవత్సరాల కిందట పుట్టిన కంచర్ల లక్ష్మారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1955 బిఎ చదువుకున్నాడు. సూర్యదేవరరాజ్యలక్ష్మీదేవి హైదరాబాద్ రాజకీయపత్రిక  ‘తెలుగుదేశం’లో వార్తా రచయితగా ఉండేవారు.  ఆ తరువాత ‘ఈనాడు’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రభూమి’ పత్రికల్లో కూడా పనిచేశారు. ఠాకూర్ హరిప్రసాద్ హైదరాబాద్ లో ఇంగ్లీషు పత్రిక ‘ఇండియన్ హెరాల్డ్’లో పని చేశారు. వయోధిక పాత్రికేయుడు వి. హనుమంతరావు నడిపించిన వార పత్రికలోనూ, జి. రామారావు తెచ్చిన వారపత్రిక ‘వారంవారం’లోనూ పని చేశారు. బైసా దేవదాసునడిపిన ‘నేటినిజం’లోనూ, పాంచజన్య నిర్వహించిన ‘మహానగర్’లోకూడా అక్షరార్చన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి నడిపిన  ‘తెలంగాణప్రభ’లో కూడా చేశారు.  నేను ‘ఉదయం’ దిన పత్రికలో పని చేస్తూ వారంలో అప్పుడప్పుడు లాల్ బహద్దూర్ స్టేడియం పక్కన ఫతేమైదాన్ క్లబ్ లో ఒక గదిలో చాలా కాలం కెఎల్ ఉండేవారు. ఆయన గురించి ఎంత రాసినా సరిపోదు.

నాబాధ

అంతకు ముందు ఏప్రిల్ 2022 లో నాకు మెదడుకు స్ట్రోక్ వచ్చింది. దాదాపు ఆరు వారాలు గడిచాయి. దాదాపు అన్నీమరిచి పోయాను. అంతకు ముందు కెఎల్ ను వరంగల్లో ఆశ్రయంలో ఈటెల సమ్మన్న ఆయనను  చేర్పించారు. అక్కడ మంచి స్వచ్ఛమైన గాలి, నీరు కలిగించే హాయిని  పొందే విధంగా ఉంచారు.  కెఎల్ ఎందుకో కోప్పడేవాడు.  కొన్ని నచ్చేవి కాదు. ఇంకా ఏదో కావాలని అడిగేవాడు. కొన్ని రోజుల తరువాత ఉన్నట్టుండి వరంగల్ ఆశ్రమం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. నన్నుకూడా కోప్పడ్డాడు. ‘‘నేనుఒప్పుకోను. నీకేమీచెప్పను’’ అనివెళ్లిపోయారు. ఏంచేస్తాను? తరువాత కొన్నాళ్లకు చాలామంది పెద్దలు ఆయనకు సాయం చేశారు. ఎన్నిఇబ్బందులున్నా, ఆయన కోప్పడినా సరే, సాయం చేశారు. కాని ఈ మధ్య ఆరోగ్యం దెబ్బ తిన్నది. తరువాత ఓ రోజు నాకుఫోన్ చేశారు. నాతోమాట్లాడుతూనన్ను‘నీవు’ అనేవారు. ఓ రోజు అదే కెఎల్ రెడ్డి ‘‘మీరు నాకు సాయం చేయండి. వరంగల్ ఆశ్రయంలో చేర్పంచండి’’ అనికోరారు. ‘‘సార్ నన్ను మీరు అనకండి’’ అని చెప్పుకున్నాను.  కాని రెడ్డిగారు మళ్లీ వేరే నిర్ణయించుకునారు.

కాని ఆ తరువాత కొన్నాళ్లకు నా పరిస్థితి దెబ్బ తిన్నది. అతి కష్టంగా ఎన్ని సమస్యలున్నా నేను ఈ నాలుగు అక్షరాలూ రాయగలుగుతున్నాను. మళ్లీ ఈటల సమ్మన్ననే అడగాలి.  ఎప్పుడైనా ఆయన్నేఅడగక తప్పలేదు. అప్పటికీ నాకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా పూర్తిగా చదవలేను. రాయలేను. తెలుగు కూడా కష్టమే. ఒక్కొక్క పదం కోసం పోరాడుతున్నాను. నా భార్య కల్యాణి సాయం చేస్తుంటే కొన్ని అక్షరాలు తెలుస్తున్నాయి.

No photo description available.ఇంకో సారి మళ్లీ రెడ్డిగారు వరంగల్ కు వెళ్లమన్నారు. తప్పకుండా అని ఆశ్రయం తీసుకువెళ్లారు. రెండు రోజులకో సారి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. నాకు మందులతో అవసరం. ఎక్కడికీ వెళ్లేస్థితి లేదు. అయినా మాట్లాడుతునే ఉండేవాడిని. నవంబర్ 2 రాత్రి ఆయన కాలధర్మం చెందారు.  ఎవరుమాత్రం ఏ చేయగలరు? ఆయనకు ఇదే నా అక్షరాంజలి.

-మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles