Saturday, April 27, 2024

గౌరీలంకేష్ హత్య జరిగి నాలుగేళ్ళు

  • ఇంతవరకూ కోర్టు విచారణ ప్రారంభం కాలేదు
  • కర్ణాటక పోలీసుల నిర్లప్తత, విచారణ జరగకుండా ఆటంకాలు
  • ఒక వ్యాఖ్యతో సరిపుచ్చిన సుప్రీంకోర్టు

సరిగ్గా నాలుగేళ్ళ కిందట ఇదే రోజున, సెప్టెంబర్ 5న, కన్నడ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేష్ ను దుండగులు ఆమె నివాసం దగ్గరే హత్య చేశారు. ఇద్దరు హంతకులు ఆమెను సమీపంలో నుంచి కాల్చి చంపారు. హిందూత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ల నోళ్ళు మూయించడానికి జరగుతున్న పెద్ద కుట్రలో భాగంగా ఆమె హత్య జరిగిందని అందరూ భావించారు. ఇంతవరకూ కర్ణాటక పోలీసుల పరిశోధన ఎంతవరకూ వచ్చిందో తెలియదు. గౌరీ లంకేష్, కన్నడ రచయిత ఎంఎం కుల్బుర్గీ, క్రియాశీలురు గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్ ల హత్యలు ఒకే కేసులో భాగాలని 2019లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఆదివారంనాడు సీనియర్ జర్నలిస్టు పమీలా ఫిలిపోస్ ఒక ట్వీట్ చేశారు. ‘‘భారత దేశంలోని క్రియాశీలి అయిన సంపాదకురాలు గౌరీ లంకేష్ ని ఆమె నివాసం వద్దే చంపి రేపటికి నాలుగేళ్ళు పూర్తి అవుతాయి. సనాతన సంస్థ ప్రత్యక్షంగా ఆమె హత్యలో భాగస్వామి అని అందరూ విశ్వసిస్తున్నప్పటికీ మొత్తం 17 మంది అనుమానితులని తేలిన ఈ కేసుపైన ఇంతవరకూ కోర్డులో విచారణ ప్రారంభం కాలేదు,’’అని ఆమె ఆవేదిన వెలిబుచ్చారు. విచారణను అడ్డుకోవడానికి ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించారో కేసును గమనిస్తున్నవారికి తెలుసు. పోలీసులు (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ – సిట్) చార్జిషీట్ దాఖలు చేశారు. కానీ నిందితులపైన కోర్టు అభియోగాలు మోపలేదు. విచారణ ప్రారంభం కాలేదు.  

జర్నలిస్టులపైన దాడులను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి 2013లో ఒక తీర్మానం ఆమోదించింది. జర్నలిస్టులపైన నేరాలను నిలుపుచేయడానికి నవంబర్ 2న జర్నలిస్టుల అంతర్జాతీయ దినోత్సవంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. కానీ జర్నలిస్టులపైన నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతిభద్రతల యంత్రాంగం జర్నలిస్టులను పరిరక్షించడంలో విఫలం అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదని ‘ద హిందూ‘ రీడర్స్ ఎడిటర్ ఏఎస్ పన్నీర్ సెల్వన్ సోమవారం ఓపెడ్ పేజీలో తన కాలమ్ లో వ్యాఖ్యానించారు. జర్నలిజాన్ని రక్షించాలంటే ముందు జర్నలిస్టులను రక్షించుకోవాలని ఆయన అన్నారు. జర్నలిస్టులకు భద్రత ఉంటేనే జర్నలిజంలో విలువలు ఉన్నత స్థాయిలో ఉంటాయని, జర్నలిజం తీరుతెన్నులు కూడా ఆదర్శంగా ఉంటాయనీ ఆయన రాశారు.

తన తండ్రి పి. లంకేష్ నెలకొల్పిన ‘లంకేష్ పత్రిక’ పేరుతో వెలువడుతున్న వారపత్రికకు సంపాదకురాలుగా గౌరి పనిచేసేవారు. బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర్ లో ఆమె నివాసం వద్దనే 05 సెప్టెంబర్ 2017న ఆమెను దుండగులు హత్య చేశారు. ‘‘అప్పటి కంటే ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణించాయి. ఎవ్వరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలేరు’’ అని గౌరి సోదరి, యాక్టివిస్టు కవితా లంకేష్ వ్యాఖ్యానించారు. ‘‘సత్యాన్వేషకులను అణచివేయడం కొత్త కాదు. ఇది కొనసాగుతూనే ఉన్నది. అంతమాత్రాన మేము ఊరుకునేది లేదు,’’ అంటూ రచయిత్రి బీటీ లలితా నాయక్ అన్నారు. గౌరి హత్యతో స్ఫూర్తి పొందిన ఎంతో మంది న్యాయకోసం పోరాటానిక ముందుకు వస్తున్నారని గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ కు చెందిన నూర్ శ్రీధర్ అన్నారు. కోవిద్ కారణంగా కేసు విచారణలో జాప్యం జరుగుతోందని ప్రాసిక్యూషన్ అంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles