Saturday, April 27, 2024

నీ తామర రేకు కన్ను తెరవవా?

గోదాగీతం-బాపు గీత ‌-13

ఆమె మనసంతా మాధవుడినే కోరుతున్నది. పైకి మాత్రం నిద్ర నటిస్తున్నది. గోపిక ప్రేమను శ్రీకృష్ణుని నయన సౌందర్యాన్ని ప్రస్తావించే ఈ పాశురానికి ఈ శృంగార భంగిమను తన చిత్రం కోసం బాపు ఎంచుకున్నారు. మూసిన కన్నులలో తన్మయత్వాన్ని గోపిక చాటుతూ ఉంటే, చేపవంటి కన్నుతో కృష్ణుడు తదేక దృష్టితో పరిశీలిస్తున్నాడు మాధవుడు. తామర పుష్పంలోని తుమ్మెదల వంటి కన్నులున్నదానా అని గోద ఈ పాశురంలో పాన్పుపై పడుకున్న సుకుమారిని  పిలుస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నేత్రాన్ని కలువరేకుతో తీర్చిదిద్దారు బాపు, గోపిక వాలుజడ, గోపాలుని తేజోపుంజం బాపు మార్కుతో గోద పాశురంలోని ఒక్క మాటకు అందమైన చిత్రణ ఇది.

Also read: అందరినీ వర్షంతో కరుణించే కరిమబ్బు- క్రిష్ణయ్య

మనసెల్ల మాధవున్ గోరి పైపైన నిద్రానటనయేల?

పుళ్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై
క్కిళ్లిక్కళైందాననై కీర్తిమై ప్పాడిప్పోయ్
పిళ్లైగళ్ ఎల్లారుమ్ పావై క్కళం పుక్కార్
వెళ్లి ఎఝుంద్ వియాజమ్ ఉరంగిట్రు
పుళ్లుం శిలంబిన్ కాణ్ పోదరి కణ్ణినాయ్
కుళ్ల క్కుళిర కుడైందు నీరాడాదే
పళ్లికిడత్తియో పావాయ్ నీనన్నాళాల్
కళ్లమ్ తవిర్ న్దు కలందేలో రెంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

రాకాసికొంగ ముక్కుచీల్చివేసె రాజగోపాల కృష్ణమూర్తి

రాక్షసరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి

రామకథలు రాసలీలలు భజించు కన్నెపడుచులెల్ల

గగనాన గురుడు క్రుంగి శుక్రుడుదయించు శుభవేళ

పక్షులకలరవములు వినవేల, పంకజాక్షి పలుకవేల

మనసెల్ల మాధవున్ గోరి పైపైన నిద్రానటన యేల

మేను జిల్లనగ యమున జలాలనీవు మునగవేల

నటనజాలించి నళినాక్షి రావమ్మవ్రతము జేయ

అర్థం

పుళ్లిన్ వాయ్= కొంగ (బకాసురుని) నోటిని, కీన్దానై =చీల్చిన శ్రీకృష్ణుని, పొల్లా=దుష్టుడైన: అరక్కనై = రావణాసురుడి తలలను, క్కిల్లి = త్రుంచి, క్కళన్దానై= పారవేసినశ్రీరాముని, కీర్తిమై= కీర్తిని, పిళ్లెగళ్ = పిల్లలు, ఎల్లారుమ్= ఎల్లరును, ప్పాడి=గానం చేసి, ప్పోయ్= వెళ్తూ, పావైక్కళం = వ్రతం చేసే ప్రదేశాన్ని, పుక్కార్ =ప్రవేశించారు. వెళ్లి=శుక్రుడు, ఎజుందు=ఉదయించి, వియాజమ్ గురు(వారం) అస్తమించాడు, పుళ్లుమ్ =పక్షులును, శిలంబినకాణ్= కిలకిలరావములు చేస్తున్నాయి, పోదు= తామరపుష్పంలోని, అరి= తుమ్మెదల వంటి, కణ్ణినాయ్=కన్నులున్నదానా, పావాయ్= ఓ సుకుమారి, నీ= నీవు, నన్నాళాళ్= ఈ మంచి రోజున, కుళ్లక్కుళిర = చల్లచల్లగా, కుడైందు= అవగాహనం చేసి, నీరాడాదే= స్నానం చేయకుండా, పళ్లిక్కిడత్తియో=పాన్పుపై పడుకొని ఉన్నావా? కళ్లమ్= కపట స్వభావాన్ని, తవిర్ న్దు= వదిలి, కలన్దు =మా తో చేరు.

Also read: భగవంతుడిని తెలుసుకుంటే అన్ని నోములు నోచినట్టే

కొంగరూపులో వచ్చిన రాక్షసుడు బకాసురుని నోటిని శ్రీకృష్ణుడు చీల్చివేస్తే, లంకపై దండెత్తి రావణుని తలలు గిల్లిపారేస్తాడు శ్రీరాముడు. ఈ ఇరువురినీ కీర్తిస్తూ గోపికలందరూ వ్రతస్థలికి చేరుకున్నారు. గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నవేళ, పక్షులు గలగలా ఆహారపు వేటకు వెళ్తున్నాయి. తుమ్మెద దూరిన తామెరపూవు వంటి కన్నుల దానా సుకుమారీ, శ్రీకృష్ణుని గుణానుభవాన్ని నీవొక్కదానివే అనుభవించాలనే కపట స్వభావాన్ని వదిలి మా అందరితో చేరి చల్లని యమున నీటిలో స్నానం చేయకుండా ఇంకా పాన్పుపై పడుకోవడం ఎందుకు? అనిప్రశ్నిస్తున్నారు గోపికలు.

Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles