Tuesday, April 30, 2024

తెలుగుదేశంలో త్యాగరాజులు ఎవరు?

వోలేటి దివాకర్

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం… జన సేన పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. అధికార వై ఎస్సార్ సిపిని గద్దె దించాలంటే పొత్తులు తప్పవని పవన్ కల్యాణ్ ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభలో స్పష్టతనిచ్చారు. అయితే పొత్తులు కూడా గౌరవప్రదంగా ఉండాలన్నది తమ అభిమతమని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన సోదరుడు నాగబాబు పొత్తుల అంశాన్ని కొట్టిపారేయకుండా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సోదరుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈనేపథ్యంలో టిడిపి, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జన సేన 40-50 సీట్లను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన సీట్లు ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Also read: మహనటుడి వర్ధంతి అంటే…వెన్నుపోటు గుర్తుకు వస్తుంది!

 కానీ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గత ఎన్నికల ఫలితాలను సాకుగా చూపించి జనసేనకు 20-25 సీట్లకు మించి కేటాయించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బిఎస్పీ, వామపక్షాలతో కలిసి 25 సీట్లలో పోటీ చేశారు. పవన్ భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి, రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. ఆయన సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జన సేన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గెలుపు బోణీ కొట్టింది. అక్కడ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆ తరువాత ఆయన పార్టీ ఫిరాయించి అధికార పార్టీకి అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Also read: ఏకాదశ రుద్రుల సమావేశమే…ప్రభల తీర్థం!

 టిడిపికి సీట్ల త్యాగం తప్పదు

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించినట్లు జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకే అత్యవసరం. ఈపరిస్థితుల్లో జనసేనతో పొత్తు కుదిరితే కోస్తాలో టిడిపి నాయకులు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జన సేన ప్రభావం చూపించే అవకాశం ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, కొత్త పేట, రాజానగరం తదితర సీట్లు డిమాండ్ చే సే అవకాశం ఉంది.

Also read: బాబు పల్లకీని పవన్ మోస్తారా?….బాబు సీఎం పదవిని త్యాగం చేస్తారా?

 గోరంట్ల సీటు గోవిందా?

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం, రూరల్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేనతో పొత్తు కుదిరితే ఆయనకు సిటీలో పోటీ చేసే అవకాశం ఎలాగూ లేదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ సీటును కూడా జనసేన కీలకనేత, పార్టీ అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ కు త్యాగం చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాజమహేంద్రవరంలో చురుగ్గా తిరుగుతున్న జన సేన పార్టీ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ నిరాశగా టిడిపి గెలుపు కోసం  త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మాజీ టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అలక కారణంగా రాజానగరం నియోజకవర్గంలో టిడిపికి సరైన అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలో గోరంట్లను రాజానగరం నుంచి పోటీ చేయించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు రాజమహేంద్రవరం సిటీ సీటును ఆశిస్తున్న ఆదిరెడ్డి వాసును పార్లమెంటుకు పోటీ చేయించి, గోరంట్లను సిటీకి మారుస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే జనసేన అభ్యర్థిగా ఇప్పటి నుంచే కోట్లు కుమ్మరిస్తున్న బత్తుల బల రామకృష్ణ కు నిరాశ తప్పదు. ఎన్నికల నాటికి ఈపరిణామాల్లో ఏదైనా జరగవచ్చు. అయితే అభ్యర్థిత్వాలను కోల్పోయే టిడిపి నాయకులు త్యాగాలు చేస్తారో… అధిష్టానంపై ఆగ్రహంతో  తిరుగుబాటు చేస్తారో..వెన్నుపోట్లు పొడుస్తారో కూడా చెప్పలేము.

Also read: చిన్నారి చిరునవ్వు కోసం….

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles