Monday, April 29, 2024

‘వై… ఏ.పి. నీడ్స్ దిస్ గవర్నెన్స్?’   

‘వై ఏ. పి. నీడ్స్ జగన్’ అంటున్నారు గానీ నిజానికి ఇటువంటి చర్చ ప్రభుత్వానికి బయట మన పౌరసమాజంలో జరగాలి. కానీ మన వద్ద అటువంటి వాతావరణం లేదు. మొదటి నుంచి దీనిది మధ్యస్థాయి మించని ‘మిడియోకర్’ తీరు. ఉండవని కాదు, ‘ఎమోషన్స్’, ‘ఫీలింగ్స్’ ఉన్నప్పటికీ; వాటిని గుంపుగా వ్యక్తీకరించే నైజం తక్కువ. దేన్ని అయినా చూసీచూడనట్లుగా నిర్లిప్తంగా వ్యవహరించే తీరు మనది. ఇది అటువంటిది కనుకే ఇక్కడ సామాజిక శాస్త్రాల చదువుల్ని ఇక్కడి నాయకులు అంత తేలిగ్గా అటకెక్కించారు.

ప్రస్తుత ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఎన్నికల కోసం ప్రజల ముందుకు వెళుతూ- ‘వై అంటూ…’ ఇటువంటి చర్చ ప్రజల్లో తీసుకురావడం వరకు బాగానే ఉంది కానీ, అందుకోసం వై.సి.పి. ప్రభుత్వం అనకుండా… మళ్ళీ ‘జగన్’ అంటూ దానికి   ముఖ్యమంత్రి పేరుతో ‘క్యాంపెయిన్’ అనేసరికి, మళ్ళీ అదొక మీమాంస. ఇంత జరిగాక కూడా, మళ్ళీ వీరు కూడా రాష్ట్ర ప్రజలను- ‘మిడియోకర్’ గానే చూస్తున్నారా? అని.

Also read: సర్కారు తలనెరిసిన తనానికి సలాములు

‘పబ్లిక్ పాలసీ’తో

ఒక ‘టర్మ్’ విజయవంతమైన పరిపాలన అందించిన ప్రభుత్వంగా ఇది మంచి పేరు తెచ్చుకోవడం ఒకపక్క అందరికీ కనిపిస్తూనే ఉంది. గణాంకాలు అన్నీ అదే విషయం మాట్లాడుతున్నాయి. అయినా మళ్ళీ ‘వై… అంటూ’ చేస్తున్న ‘కేంపెయిన్’తో వ్యక్తి కేంద్రిత- ‘ప్రొజెక్షన్’ ఇవ్వడం అవుతున్నది.

రైతుగా రైతులతో జగన్ మోహన్ రెడ్డి

దాని బదులు ఒక ‘పబ్లిక్ పాలసీ’తో జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఎలా పనిచేసింది చెబుతూ ప్రజల అవగాహన స్థాయిని పెంచితే చాలు. అది ఎవరి విషయంలో అయినా పరిమితి మించి జరుగుతున్న ‘ఫోకస్’ ఆగాల్సిన ‘రెడ్ లైన్’ ఒకటి ఉంటుంది. దానికి ఇవతలే ఆ వేగాన్ని నిమ్మళం చేసే ‘బ్రేక్స్’ కంట్రోల్ ఇప్పటి నుంచే అవసరం.

 ‘డైవర్సిఫై’  

అవసరం- అన్నప్పుడు ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. దాన్ని కాదనేందుకు ఏమీలేదు. కానీ ‘ఫోకస్’ కేవలం ఒకరిమీద వేసుకోనక్కర లేదు. దాన్ని ‘డైవర్సిఫై’ చేయాలి. అలా కనుక చేయకపోతే ఎలా ఉంటుంది అంటే- షడ్రషోపేతమైన భోజనం ఆకులో వడ్డించాక, దాన్ని తినడానికి ముందు చేతికి ‘స్పూన్’ ఇచ్చినట్టు ఉంటుంది. తినేప్పుడు మన దృష్టి ఆకులో ఉన్న వేర్వేరు ‘ఐటమ్స్’పైన ఉండాలి. నచ్చినవాటిని గుర్తించి చేత్తో వాటిని తడుముతూ మనదైన ‘టచ్’తో భోజనాన్ని ఆస్వాదించాలి. ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది? అని దీని అన్ని పార్స్వాల్ని తడిమే అవకాశం మనకు ఇవ్వాలి.

Also read: ఏ.పి. కొత్త ‘గ్రోత్ మోడల్’ తో కమ్మలు త్వరలోనే కలిసిపోతారు…

బండగా

అప్పటి వరకు కేవలం ‘పబ్లిసిటీ’ మాత్రమే ఉంటే, నలభై ఏళ్ల క్రితం ఎన్ఠీఆర్ ప్రవేశంతో ‘రెండు రూపాయల కిలో బియ్యం – అన్నవరం’ శైలిలో ‘ప్రాపగాండా’ మొదలయింది. అలా ప్రభుత్వం వెనక్కి వెళ్లి, దాని నాయకుడు ముందుకొచ్చాడు. చివరికి అదే ప్రామాణికం కావడంతో ఇప్పుడు దాన్నించి ఎవ్వరూ అంత తేలిగ్గా బయట పడలేక పోతున్నారు.

ఈ ధోరణి మొదలయ్యాక, ‘అన్నవరమేనా – సింహాచలం కాదా…’ తరహా ఎత్తిపొడుపులు కొన్ని వచ్చినా బండగా ముందుకు వెళ్లడం అలవాటుగా మారిపోయింది. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. శాస్త్రం ప్రకారం ప్రభుత్వానిది- ‘పబ్లిసిటీ’, ప్రయివేట్ ది ‘ప్రాపగాండా’.  

‘సిగ్నేచర్ ట్యూన్’

మా ‘పబ్లిక్ పాలసీ’ ఇది అని ప్రభుత్వం చెప్పగలగాలి. అందుకు మనమిచ్చే ‘కంటెంట్’ ద్వారా ఇది- ‘వై.సి.పి’ది అనేట్టుగా ఒక ‘సిగ్నేచర్ ట్యూన్’ వంటిది, ప్రజల జ్ఞాపకాల్లో రిజిస్టర్ కావాలి. అయితే ప్రభుత్వాలకు పనిచేస్తున్న సమాచార ప్రసార వ్యవస్థ ఆ ప్రమాణాల స్థాయికి ఎదగలేక పోతున్నాయి.

రతు మహిళతో జగన్ మాటామంతీ

అలా జరిగితే, నిజానికి అది అందరికీ ప్రయోజనం, అందుకు తగ్గట్టుగా అధికారులు, ప్రజలు కూడా ‘ట్యూన్’ అయిపోతారు. కొత్త రాష్ట్రంలో ఇప్పటికే ఈ ప్రభుత్వం పలు పరిపాలన సంస్కరణలు అమలులోకి తెచ్చింది కనుక, ఈ ఎన్నికలు తర్వాత వచ్చే ‘టర్మ్’లో అయినా దానిపై అది దృష్టి పెట్టాలి. పౌరుల అవగాహనా స్థాయి ఇప్పటికే ఎంతో పెరిగింది. అది, ఈ ప్రభుత్వంలో స్పష్టంగా అర్ధమవుతున్నది.

Also read: మొదలయిన చోటే తప్పటడుగుల గుర్తులు చెరిగిపోతాయి… 

‘బ్యూరోక్రసీ’లో …

అయినా ప్రభుత్వం ప్రజల్ని ఇలా ‘వై… ‘ అంటూ ప్రశ్నలు వేయకూడదు. నిజానికి ప్రజలు వేసే ప్రశ్నలకు అది సమాధానం చెప్పాలి. కనుక, మాది నాలుగు పేజీల ‘మ్యానిఫెస్టో’ అని గతంలో చెప్పుకున్నట్టుగానే, ‘పబ్లిక్ పాలసీ’ విషయంగా కూడా అది స్పష్టతతో ప్రజల ముందుకు రావాలి.

అలా వస్తే, ‘బ్యూరోక్రసీ’లో కూడా తగిన సర్దుబాటు కుదురుతుంది. అప్పుడు- ‘వై, ఏ.పి. నీడ్స్ జగన్?’ వంటివి పెద్దగా అవసరం ఉండదు. అయినా ఈ ప్రశ్నకు ‘పబ్లిక్’కు  సమాధానం బాగా తెలుసు, 2014 లో వాళ్లకు స్పష్టంగా తెలియలేదు. కానీ 2019 లో అది తెలిసింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్లకు ఇక ఎవ్వరూ చెప్పక్కరలేదు.

పొలంలో వ్యవసాయ కూలీలతో రాహుల్ గాంధీ

 

ముందు వెనుకలు

దీన్నే జాతీయ దృక్పథంతో చూసినప్పుడు, రాహుల్ గాంధీ విషయంలో అయినా ఆయన దక్షిణాదిన కేరళ ఎం. పి. అయ్యాక గాని, ఆయనకు ఇటువంటి పొలం ఫోటోల  అవసరం తెల్సింది కాదు. కానీ జగన్ మోహన్ రెడ్డి 2017 నవంబర్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ నాటికే ఆ సెషన్ పూర్తి చేసి- ‘విజన్ 2047’ లక్ష్యం చేరాల్సిన ‘లీడర్స్’ కోసం ఆయన కొత్త ‘సిలబస్’ రాయడం మొదలుపెట్టాడు. అందుకే ఇక్కడ అటువంటి- ‘ల్యాబ్స్’ను పరిశీలించడానికి ఇతర రాష్ట్రాలు ‘క్యూ’ కడుతున్నాయి.

కానీ అదే దశాబ్దాల రాజకీయ అనుభవమున్న సీనియర్ల విషయానికొస్తే, వారు 2018 నవంబర్ లో కూడా- బ్రిటిష్ హైటెక్ ఆర్కిటెక్చర్ కంపెని ‘నార్మన్ ఫోస్టర్’ ఇచ్చిన డిజైన్లు అమరావతి రాజధానికి సరిపెట్టడం ఎలా అని అని ఆలోచిస్తున్నట్టుగా,  బయటకు ‘మీడియా’కు వార్తలు వొదులుతూ ఐదేళ్లు పూర్తి అయ్యేంతవరకు కాలం వెళ్లబుచ్చారు.

Also read: మోడీ అంబుల పొదిలో కొత్త బాణమైన ఏ.పి. జి.ఎస్. టి. కేస్! 

‘పబ్లిక్ లైఫ్’లో

కుటుంబాల్లో కొత్తతరం నిర్ణయాత్మక శక్తిగా మారటాన్ని పాతతరం వేగిరం గ్రహించాలి. అదే ‘పబ్లిక్ లైఫ్’లో ఉండే కుటుంబాల్లో అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించడానికి అందుకు మరింత ముందుచూపు ఉండాలి. నిజానికి రాహుల్ గాంధీకి తన దక్షిణాది పర్యటన సందర్భంగా అటువంటి అవకాశం జులై 2008లో దొరికింది. ఆయన ఇడుపులపాయలో లంచ్ లో వై.ఎస్.ఆర్. తో కలిసి రాగిసంకటి తిన్నప్పుటి నుంచి ఆ ‘ఈక్వేషన్’ అలాగే కొనసాగివుంటే, ఈపాటికి రాహుల్ నైపుణ్య స్థాయి వేరుగా ఉండేది.

అయినా కాలక్రమంలో స్పర్ధ, ఘర్షణ లోనుంచి పుట్టే నాయకులు కాలపరీక్షలో ధృడంగా నిలబడగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే. ఆ ముందు చూపు వెనుక లక్ష్యాలు తెలియడానికి మనకు నిరంతర- ‘ఫాలోఅప్’ ఉంటే తప్ప అది అర్ధం కాదు.

‘కుల జనగణ’  

ఎప్పుడో 2021లో జరిగిన ఒక మంత్రిమండలి సమావేశంలో కడప జిల్లా రాయచోటి మున్సిపాల్టీ సేకరించిన వ్యర్ధాల ‘రీసైక్లింగ్ యూనిట్’ ఏర్పాటుకు మరికొన్నిటితో పాటుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు, ఇది అవసరమా? అనిపించింది. అయితే 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు, రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం అయ్యాక గానీ విషయం అర్ధం కాలేదు.

రాష్ట్రంలోని సహజ వనరుల్ని అన్ని ఆర్ధిక-సామాజిక స్థాయిలోని శ్రేణులకు చేరడం కోసం అవసరమైన- ‘డిస్ట్రిబ్యూషన్ మెకానిజం’ ఏర్పాటును, ఈ ఐదేళ్ళలో ప్రభుత్వం పూర్తిచేసింది. అయితే ఇప్పుడు జరగవలసిన ఈ పంపిణీకి శాస్త్రీయమైన ప్రాతిపదిక అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కుల జనగణ’ను ఈ నెల 15 నుంచి మొదలు పెడుతున్నది. దీన్ని 2024 జనవరిలో ప్రకటిస్తారు. ఆ తర్వాత, ఆయా వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికగా, అవి ఎటువంటి కేటాయింపులు అయినా ఇకముందు జరుగుతాయి. కనుక రాష్ట్రానికి ఈ ప్రభుత్వం అవసరం ఉంది.

Also read: తన పుస్తకంతో మనకు తూర్పు దారులు తెరిచిన సంజయ్ బారు

రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యత. 

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles