Saturday, May 4, 2024

ఉత్సాహం కలిగించని ఉద్యోగపర్వం

  • పెరుగుతున్న నిరుద్యోగిత
  • అన్ని రంగాలలో వైఫల్యం

దేశంలో నిరుద్యోగిత పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి.పోయిన ఏడాది (2022) డిసెంబర్ నాటికి ఈ రేటు 8.3శాతానికి ఎగబాకిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ (సీఎంఐఈ) అందించిన నివేదిక ద్వారా అర్థమవుతోంది. ఈ నివేదిక వచ్చి కూడా నేటికి సరిగ్గా సంవత్సర కాలం పూర్తయింది. ఉపాధిలో సమగ్రత, సమతుల్యత ఇంకా ప్రశ్నార్ధకంగానే వున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగం మరింత ప్రబలుతున్నట్లు సంఖ్యలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఇదే అధికమని చెబుతున్నారు. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. కరోనా సృష్టించిన ఆర్థిక మందగమనం, ప్రపంచంలో వచ్చిన మార్పులు, ఉక్రెయిన్ -రష్యా యుద్ధం మొదలైనవి ఈ దుస్థితికి ప్రధానమైన కారణమని భావించాలి. కరోనా మళ్ళీ జూలు దులుపుతోందనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినపడుతున్నాయి. పెరుగుతున్న ధరలు, డిమాండ్ మందగించడం, ఆర్ధిక రికవరీ నెమ్మదించడం మొదలైన కారణాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. నిరుద్యోగపర్వంలో రాజస్థాన్, హరియాణా,ఝార్ఖండ్, బీహార్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే వార్త కాస్త ధైర్యాన్నిస్తోంది. నిన్నటి తీష్ణ కరోనా కాలంలో లక్షలాదిమంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. సాధారణ పరిస్థితులు రావాలంటే ఇంకాస్త సమయం పట్టవచ్చునని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also read: వైభవంగా సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి జయంతి

అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టిన వేళ

ఉపాధి, ఉద్యోగకల్పనలో ప్రయాణం మందకొడిగా సాగడమేకాక, వినిమయం కూడా గణనీయంగా పడిపోయింది. తయారీ రంగం కూడా ఇంకా కోలుకోవాల్సి వుంది. ద్రవ్యోల్బణ భయాలు, సరఫరా చైన్ లోని ఇబ్బందులు తయారీ రంగంపై దుష్ప్రభావాన్ని చూపించాయి. ముడిపదార్ధాల ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు చేయిదాటిపోవడం తయారీ రంగాన్ని కుదిపేశాయి.  తయారీ కార్యకలాపాలు కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఉత్పత్తి పెరుగుతోందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇది కాస్త ఊరటనిచ్చే మాట. ఇది ఇలా ఉండగా, మన దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండదని మన ప్రధాని నరేంద్రమోదీ బలంగా చెబుతున్నారు. స్వావలంబన సాధించేందుకు ఆత్మనిర్భర్ వైపు దేశం అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి అంటున్నారు. ప్రజలంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తే దేశంలోని నిరుద్యోగ సమస్య తీరుతుందని జాతికి నరేంద్రమోదీ సూచిస్తున్నారు. కాకపోతే, నిరుద్యోగం పూర్తిగా సమసిపోవాలంటే మరో పాతికేళ్ళు ఆగాలని ప్రధాని అంటున్న మాటలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలు మాత్రం ‘మేక్ ఐన్ ఇండియా’ పై మండిపడుతున్నాయి.

Also read: ప్రపంచాన్ని వణికిస్తున్న సవాళ్లు!

పల్లెలను ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలి

దేశం నుంచి పలు అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు నిష్క్రమించాయని, అందుకు కేంద్ర ప్రభుత్వం తీరే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత ఐదేళ్లలో దాదాపు రెండుకోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారని మీడియాలో వచ్చిన కథనాలే ప్రబలిన నిరుద్యోగితకు ప్రత్యక్ష సాక్ష్యమని విపక్షనేతలు వాపోతున్నారు. ఉపాధిలేమితో ఉత్పాతం రాకుండా చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. సారవంతమైన పంటభూములు, అపారమైన ఖనిజసంపద, సహజవనరులు అనేకం మనకున్నాయి. వాటిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంలో మనం ఎంతో వెనకబడి ఉన్నామన్నది పచ్చినిజం. పల్లెలను ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి, పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షిస్తే గ్రామీణభారతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా చురుకుగా ముందుకు సాగాలి. కష్టాలను అధిగమిస్తూ కొత్త అవకాశాలను సృష్టించుకుంటూ, స్పృశించని రంగాల వైపు దృష్టి సారించడం, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఎంచుకోవడం మొదలైనవి పరిష్కార మార్గాలు. నిరుద్యోగం శాపం కారాదు. ప్రతిభకు సానబడుతూ, అవసరాలను, ఎక్కువ డిమాండ్ ఉన్న రంగాలను గుర్తిస్తూ ముందుకు సాగడం శ్రేయస్కరం. ఉద్యోగిత, ఉపాధి పెరుగుదలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు,వ్యక్తులు కూడా భాగస్వామ్యం కావాలి.

Also read: భద్రతా వైఫల్యం

ఆంధ్రప్రదేశ్ వైపు శ్రద్ధాసక్తులు చూపాలి

ఏలికలు హృదయపూర్వకంగా దృష్టిపెడితే,నిరుద్యోగిత దూరమవుతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ మరింత అప్రమత్తం అవ్వాలి. యువతలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి.ఉత్పాదకతను పెంచడం ముఖ్యం.జాతి నిర్మాణంలో వారిని భాగస్వామ్యులను చేయాలి. అభివృద్ధిలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు కూడా కీలకం. రాజకీయాలకు రాష్ట్రాలను తద్వారా యువతను బలిచేయడం ధర్మం కాదు.కొత్త పరిశ్రమలు, సంస్థలు, వ్యవస్థలు నిర్మాణమయ్యే క్రమంలో రాష్ట్రాలాన్నింటికి సరియైన వాటాలు దక్కాలి. వెనుకబడిన రాష్ట్రాలకు, కష్టాల్లో ఉన్న రాష్ట్రాలకు వాటాలు పెరగాలి.కొత్తరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్రం మరింతగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

Also read: మారవోయి మనిషీ!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles