Friday, April 26, 2024

యాసంగిలో ధాన్యం ఎంత వచ్చినా మేమే కొంటాం : సీఎం కేసీఆర్‌

  • తెలంగాన క్యాబినేట్ లో సమావేశంలో సంచలన నిర్ణయాలు
  • ధాన్యం కొనుగొలుపై తెరదించిన  కేసీఆర్
  • ధాన్యం నూక  నష్టన్ని తామే భారిస్తామని నిర్ణయం.
  • జీవో నెంబర్ 111 ఎత్తివేతకు  కేబినేట్ ఆమోదం
  • కేంద్రంలో వున్నది పూర్తి రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మే
  • పీయూశ్ గోయ‌ల్‌కు బుద్ధి, జ్ఞానం వుందా? సీఎం కేసీఆర్ ఫైర్
  • ప్రత్యేక వ్యవసాయ విధానం తాయారు చేస్తూన్నాం
  • విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకనికి క్యాబినేట్  అమోదం
  • మరో 6 ప్రైవేట్ యూనివర్సీటీలకు క్యాబినేట్  ఆమోదం

ఎట్టకేలకు  యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటించారు.  రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్వింటాల్‌ ధాన్యానికి  కనీస మద్దతూ ధర1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశమైన రాష్ట్ర కేబినేట్  పలు నిర్ణయాలు తీసుకున్నది.

కేబినేట్ నిర్ణయాలు

ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం

ఇక నుండి విశ్వవిద్యాలయాల సిబ్బంది  నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ద్వారా జరపాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి అమలవుతున్నది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,500 పై చిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.

ప్రైవేట్ యూనివర్సీటీలకు ఆమోదం

రాష్రంరైలో మరో 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినేట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చట్టం ప్రకారం సంబంధింత నియమనిబంధనలకు లోబడి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించాలని ఇందుకు సంబంధించి విద్యాశాఖ, వ్యవసాయశాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేబినేట్ అనుమతించిన కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు: CII, AMITY, MNR, GURUNANAK, NICMAR తో పాటు కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం. రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీలను స్థాపించాల్సిన అవసరం ఎంతైనా  ఉందనీ, ఇవి త్వరగా ఏర్పాటయ్యేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటును కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలని ముఖ్యమంత్రిగారు సూచించారు. దీనివల్ల హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గడంతో పాటు, ఇతర నగరాలు అభివృద్ది చెందుతాయని ఆయన అన్నారు.  ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కేబినేట్ ఆదేశించింది. గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచింది. తాజాగా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా నియమించడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది.

వయోపరిమితి పెంపు, గ్రూప్ 1 కు ఇంటర్వూలు లేవు

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న విషయం తెలిసిందే. పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో మూడు సంవత్సరాలు సడలించాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇక నుంచి కేవలం లిఖిత పరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలనీ, ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.  ఐటి తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్  ప్రాంతాలకే పరిమితం కాకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిపంజేయాలని తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినేట్ ఆమోదం

సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్  ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని కేబినేట్ అభిప్రాయ పడింది.  హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర త్రాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో అవసరం కోల్పోయింది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా  ఉండాలని కేబినేట్ నిర్ణయించింది.  ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ జలాశయాల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంద.  11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమనిబంధనలను ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి

వచ్చే మే నెల 20 నుండి 5 జూన్ వరకు  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని కేబినేట్ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పై నిరంతర సమీక్ష నిర్వహించాలని, ఆశించిన లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరేవరకు అలసత్వం పనికిరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు సూచించారు.

చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం

చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించే, ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’  కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు చేసింది. 10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టునుండి ఈ పథకానికి వినియోగించనున్నారు. పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు.. సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు… లక్ష్మీబారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు… మొత్తంగా 90,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనున్నది.

యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండిన యాసంగి పంటను సేకరించకుండా సంకుచితంగా వ్యవహరిస్తున్న తీరును కేబినేట్ తీవ్రంగా నిరసించింది. సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నదని కేబినేట్ విమర్శించింది. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది. ఐతే ప్రజలతో, రైతులతో నిత్యం ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పట్ల నిబద్ధతను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి అన్నారు. వద్దన్నా రాష్ట్రంలో కొంతమంది రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడా వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై పెనుభారంగా మారింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినేట్ కన్న బిడ్డలను కాపాడుకునే తండ్రి మనస్తత్వంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. సివిల్ సప్లైస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించాలనీ, కలెక్టర్లతో, సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించుకొని, గోను సంచుల సరఫరా, తదితర సమస్యలు లేకుండా సమర్థవంతంగా కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గతంలో మాదిరిగానే కనీస మద్దతు ధర చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక రాష్ట్రంలోని రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం ఇతరులకు అమ్మి, నష్టపోవద్దని ముఖ్యమంత్రిగారు సూచించారు. కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా పై పడే అధిక భారాన్ని భరిస్తూ, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందనీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటి వేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్ళు, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

కేంద్రంలో వున్నది పూర్తి రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మే : సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన రైతు సంక్షేమ చ‌ర్య‌ల వ‌ల్ల తెలంగాణ‌లో స‌మృద్ధిగా పంటలు పండాయ‌ని, రైతాంగం సుఖంగా వుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. త‌మ చ‌ర్య‌ల వ‌ల్ల ఒక కోటి ఎక‌రాల పంట విస్తీర్ణం పెరిగింద‌ని, అందుకే పంట‌లు బాగా పండాయ‌ని వివ‌రించారు. అయితే కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం వుంద‌ని, ఇది భార‌త రైతాంగ దుర‌దృష్ట‌మ‌ని విరుచుకుప‌డ్డారు. 13 నెల‌ల పాటు రైతాంగం ఢిల్లీలో ధ‌ర్నాకు దిగారని, చివ‌రికి కేంద్రం దిగివ‌చ్చి, ప్ర‌ధాని మోదీ ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశార‌ని గుర్తు చేశారు. ఎంత దిక్కుమాలిన‌, ద‌రిద్ర‌పుగొట్టు ప్ర‌భుత్వం కేంద్రంలో వుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తెలంగాణ కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశం త‌ర్వాత సీఎం కేసీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ ఘ‌ట్టాల‌న్నింటికీ దేశ ప్ర‌జ‌లే ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల‌ని, అదంతా ఓ చ‌రిత్ర అన్నారు. ఉద్య‌మాలు చేస్తున్న స‌మ‌యంలో రైతుల‌ను మోదీ ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా తూల‌నాడార‌ని, ఉగ్ర‌వాదులుగా అభివ‌ర్ణించార‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.దేశంలోని వ్య‌వ‌సాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ల‌కు అప్ప‌గించాల‌ని ఓ బ‌ల‌మైన కుట్ర కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంద‌ని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్య‌వ‌సాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేస్తోంద‌ని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయానికి అనుబంధం చేస్తామ‌ని బీజేపీ ఎన్నిక‌ల హామీలో పెట్టార‌ని, అయినా దానిని అమ‌లు చేయ‌ర‌ని ఎద్దేవా చేశారు. వీట‌న్నింటితో పాటు ఎరువుల ధ‌ర‌లు కూడా పెంచార‌ని మండిప‌డ్డారు. తాజా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన బిల్లుల‌ను పాస్ చేయించుకున్నారే త‌ప్పించి, రైతుల‌కు అవ‌స‌ర‌మైన వాటిని మాత్రం ముట్టుకోలేద‌ని మండిప‌డ్డారు.

పీయూశ్ గోయ‌ల్‌కు బుద్ధి, జ్ఞానం వుందా? సీఎం కేసీఆర్ ఫైర్

కేంద్ర‌మంత్రి పీయూశ్ గోయ‌ల్ పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ తీవ్రంగా మండిప‌డ్డారు. కేంద్ర‌మంత్రి పీయూశ్‌ కు మెద‌డు, జ్ఞానం, బుద్ధి వుందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ధాన్యం కొన‌డం చేత‌గాక‌.. నూక‌లు తిన‌మ‌ని అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తెలంగాణ కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ భేటీ త‌ర్వాత ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. పీయూశ్ గోయ‌ల్‌కు విప‌రీత‌మైన గ‌ర్వం, అహంకారం వుంద‌న్నారు. అన్నం అందించే వారికి నూక‌లు తిన‌మ‌ని చెప్ప‌డం ఆయ‌న‌ అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. నూక‌లు తిన‌మ‌ని చెప్పి, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించార‌ని కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. కేంద్రానికి ప‌రిపాల‌న చేత‌కావ‌డం లేద‌ని, త‌మ ప్ర‌భుత్వం సాధిస్తున్న విజ‌యాల‌ను కేంద్రం జీర్ణించుకోలేక‌పోతోంద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో క్యా చ‌మ‌త్కార్ హై రావ్ సాబ్ అంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయ‌ల్ త‌న‌తో అన్నార‌ని సీఎం ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఒక్క యాసంగిలోనే తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో వ‌రి సాగైంద‌ని, దేశంలో ఎక్క‌డా లేని స్థాయిలో తెలంగాణ‌లోనే వ‌రి సాగైంద‌ని తెలిపారు. ఇదే తెలంగాణ చ‌మ‌త్కార్ అని కేసీఆర్ పీయూశ్ గోయ‌ల్‌కు ఈ సంద‌ర్భంగా దీటైన స‌మాధాన‌మిచ్చారు. తాము ద‌ద్ద‌మ్మ‌ల‌ని, ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం త‌మ‌తో చేత‌కాద‌ని కేంద్రం చెప్పేస్తే స‌రిపోతుంద‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధాన్యం కొన‌డం కేంద్రానికి చేత‌కావ‌డం లేద‌ని, చేతులెత్తేసింద‌ని విమ‌ర్శించారు. ప్ర‌తి సారీ ఓ మెలిక పెట్టి,  కేంద్ర ఆహార‌భ‌ద్ర‌త చ‌ట్టం కింద ఉన్న బాధ్య‌త‌ను కేంద్రం విస్మ‌రించి, నాట‌కాలు ఆడుతోంద‌ని సీఎం విరుచుకుప‌డ్డారు. గ‌త మూడు నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్రం అనేక వేల ట‌న్నుల బాయిల్డ్ రైస్ ఎగుమ‌తి చేశార‌ని, అయినా అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని సీఎం కేసీఆర్‌ ఫైర్ అయ్యారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles