Saturday, April 27, 2024

లలైసింగ్ జీవన సంఘర్షణ మనకు ఆదర్శం!

భీడ్ హమేషా తమాషా దేఖ్ తీ హై

క్రాంతి తో ఏక్ హీ వ్యక్తి లాతా హై

సమూహం ఎప్పుడైనా తమాషా చూస్తుంది. మార్ప, పరివర్తన, విప్లవం వంటివి తేవడం ఒకే ఒక్క వ్యక్తికి సాధ్యమవుతుంది! సత్యాన్వేషణలో ఎంతకైనా తెగించడం, దేశభక్తి కలిగి ఉండడం, తర్కబద్ధంగా ఆలోచిస్తూ అంధవిశ్వాసాల్ని అంతం చేయడం, మానవత్వానికి ఉదాహరణగా నిలవడం…లలైసింగ్ బౌద్ధ జీవన సంఘర్షణ మనకు తెలియజేస్తుంది.

మనుషుల్ని ముట్టుకుంటే అపవిత్రులవుతున్నారంటే – దేవుడు లేడని అర్థం- అని అన్నాడు లలైసింగ్ బౌద్ధ (1సెప్టెంబర్ 1911-7ఫ్రిబ్రవరి 1998). ఉత్తరభారత పెరియర్ గా ప్రసిద్ధుడైన ఆయన గురించి దక్షిణ భారత ప్రజలకు పెద్దగా తెలియదు. పెరియర్ ఇ.వి. రామసామి ఉత్తర భారత దేశంలో పర్యటిస్తున్నప్పుడు లలైసింగ్ రెండు, మూడు పర్యాయాలు ఆయనను కలిశాడు. ఆయన రచనలకు ప్రభావితుడై, ఆయనకు అనుయాయుడైపోయాడు. మరో వైపు మాహాత్మాఫూలే, సావిత్రీబాయి ఫూలే, డా. బి.ఆర్. అంబేడ్కర్ ల ఆలోచనా ధోరణిని, జీవన విధానాన్ని, సంఘర్షణల్ని ఆదర్శంగా తీసుకుని తను కూడా సామాజిక రంగంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం నిరంతరం సంఘర్షించాడు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలెదురైనా తన ధ్యేయం నుండి దృష్టి మరల్చలేదు. పెరియార్ ఇ.వి. రామసామి రచన ‘రామాయణ్ పాఠ్ థిరంగల్’ (రామాయణ-ఎ  ట్రూ రీడింగ్)ను హిందీలోకి తొలిసారి అనువదించి ప్రచురిస్తే – ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పుస్తకాల ప్రతుల్నిజప్తు చేసింది. లలైసింగ్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో రెండు చోట్లా రాష్ట్ర ప్రభుత్వంపై విజయం సాధించి, ఒక వైపు బహుజన నాయకుడిగా-మరోవైపు స్వాతంత్ర్య యోధుడిగా నిలిచాడు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం మొక్కవోని ధైర్యసాహసాలతో ఒంటరిగా పోరాడుతూ వచ్చాడు. ప్రచురణ కర్తలెవరూ ప్రచురించకపోవడంతో ‘సచ్ఛీ రామాయణ్’ ప్రచురణ కోసం తన 15 ఎకరాల భూమిని అమ్మి, తనే ఒక ప్రెస్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

Also read: దేశప్రేమికుల్ని ఎగతాళి చేస్తున్న దేశద్రోహులు

మారుమూల గ్రామమైన తన కఠారాలో కాకుండా అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న జిజక్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో వరుసగా మూడు గదులు కట్టించాడు. ఒక దాంట్లో ప్రెస్, మరో గదిలో పుస్తకాలషాపు, ఇంకోగది తను ఉండడానికి ఏర్పాడు చేసుకున్నాడు. ప్రెస్ పేరు ‘సస్తాప్రెస్,’ పుస్తకాల షాపు అశోకచక్రవర్తి పేరుతో ‘అశోకా పుస్తకాలయ్’- అని పెట్టాడు. ఈయన అచ్చేస్తున్న పుస్తకాలు, చెపుతున్న విషయాలు మనువాదులకు భరించలేనివిగా ఉండేవి. అనేక సార్లు దొంగచాటుగా దెబ్బతీయాలనీ, చంపాలనీ కుట్రలు పన్నారు. కుటుంబంలో తనకంటూ ఎవరూ లేకపోయినా, తనను, తన ఆలోచనలను బలపరిచేవారు సమాజంలో చాలామంది ఉన్నారన్న ఆత్మవిశ్వాసంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒంటరిగానే తిరిగేవాడు. ఎప్పుడూ భుజానికి ఒక సంచి ఉండేది. అందులో పుస్తకాలు, తెల్లకాగితాలు, పెన్ను ఉండేవి. వాటితో పాటుఆత్మరక్షణకోసం చిన్నపాటి గొడ్డలిని కూడా ఉంచుకునేవాడు. మూర్ఖులు ఎప్పుడు ఏ వైపు నుండి దాడి చేస్తారోనని అప్రమత్తంగా ఉండేవాడు. ‘అర్జక్ సంఘ్’ ప్రతినిధులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతుండేవాడు.  

పెరియార్ ఆలోచనా విధానంలో పడిపోయి ఆ ధోరణిలోనే లలైసింగ్ తన స్వీయ రచనలు కూడా వెలువరిస్తూ వచ్చాడు. శంభుకవధ, అంగుళీమాల, ఏకలవ్య, సిపాయీ కత బాహీ, ఆదివాసోంకి పహెచాన్, అర్యోంక నైతిక్ కుల్ ప్రకాశ్, సోశితోం పర్ ధార్మిక్ డికాయిటీ(అణగారిన వర్గాల మీద ధార్మిక దోపిడి), సోశితోం పర్ నైతిక్ డెకాయిటీ; సామాజిక్ విలంబిత్ కైసే సమాప్త్? (సామాజికన్యాయం కోసం జరిగే ఈ ఆలస్యం ఎలా సమాప్తపవుతుంది?), సచ్ఛీ రామయణ్  చాబి (వాస్తవ రామాయణాన్ని తెరవడానికి తాళంచెవి)- ఇవన్నీ నాటకాల రూపంలో, సంభాషణల రూపంలో ఉన్నాయి గనక గ్రామీణ ప్రజలకు బాగా నచ్చేవి. నవలలు, వ్యాసాలకన్నా నాటికల రూపంలో అయితే గ్రామీణుల్ని చైతన్యపరచడానికి బావుంటాయని ఈ రచయిత భావన. క్షేత్ర స్థాయిలో జనంతో ఉండి జీవితాంతం సంఘర్షించిన ఈ సామాజిక విప్లవకారుడి గురించి ప్రముఖ పత్రికలేవీ రాయలేదు. వికీపిడియాలోగాని, గూగుల్ లోగాని సమాచారం లేదు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడెమీలు ఈయన రచనల్ని పట్టించుకోలేదు. అయితే, లలైసింగ్ జీవన సంఘర్షణను ప్రజాగాయకులు గానం చేశారు. ప్రజాకళాకారులు కొంతవరకు ఆయనను పరిచయం చేస్తూ వచ్చారు. మొత్తానికి మొత్తంగా బ్రాహ్మణవాదానికి భజన చేసే రచయితలు, పత్రికలు, రాజకీయ నాయకులు ప్రబలిపోయిన కారణంగా, అందుకు విరుద్ధంగా పని చేసే లలైసింగ్ లాంటివారి గూర్చి ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారూ?

మాన్యవర్ కాన్షీరామ్ లలైసింగ్ గురించి తెలుసుకుని, అతని ఫొటోలు తన పోస్టర్ లో ముద్రించడం వల్ల, తన ప్రసంగాలలో తరచు అతని ప్రసక్తి తెస్తూ ఉండడం వల్ల కొంత ప్రచారం జరిగింది. ‘మిలే ములాయం కన్షీరాం/హవామే ఉడ్ గయే జైశ్రీరామ్’ అనే నినాదం ఉధృతమై బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందన్న ఆశాభావం బలపడింది. ఉత్తర ప్రదేశ్ లో యాదవులకు అధికారం కూడా దక్కింది కానీ, వారు వారి స్వార్థప్రయోజనాలు చూసుకున్నారే తప్ప, బహుజనుల ప్రయోజనాల్ని పట్టించుకోలేదు. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడనూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లలైసింగ్ జీవన సంఘర్షణను మొత్తానికి మొత్తంగా వెలుగులోకి తేవడానికి ఒక పరిశోధక విద్యార్థి పూనుకున్నాడు. అతని పేరు ధరమ్ వీర్ యాదవ్. పెరియార్ ఇ.వి. రామసామి, లలైసింగ్ ల అడుగుజాడల్లో నడిచే ఈ పరిశోధకుడు కులం గుర్తింపు యాదవ్ ను వదిలేసి తనకు తాను ధరమ్ వీర్ గగన్ అని పెట్టుకున్నాడు. ఢిల్లీలో పీజీ, హైదరాబాద్ యూనివర్సిటీలో యం.ఫిల్. చేసిన ఈ యువపరిశోధకుడు లలైసింగ్ పనిచేసిన సంస్థలన్నీ సందర్శించి, అతనితో కలసి పని చేసిన సహఉద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి, ఎందరో ప్రజాకళాకారుల ప్రదర్శనలు చూసి, సుదీర్ఘకాలం శోధించి, ఢిల్లీ జెఎన్ యూ నుండి పిహెచ్ డి సాధించాడు. ఆయన సేకరించిన సమాచారమంతా ఒక క్రమపద్ధతిలో పెట్టి ఐదు సంపుటాలుగా రెండు వేల పేజీల్లో నమోదు చేశాడు. ఆ సంపుటాలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. ‘ఉత్తర భారత పెరియార్’గా గుర్తింపు పొందిన లలైసింగ్ జీవిత సంఘర్షణ కాలగర్భంలో కలిసిపోకుండా డాక్టర్ ధరమ్ వీర్ గగన్ అడ్డుకున్నాడు.

Also read: టర్కీలో బౌద్ధం ఎందుకుందీ, ఎలా ఉంది?

లలైసింగ్ మానవత్వం గురించి చెప్పుకోవడానికి ఒక సంఘటన చూద్దాం. ఒక సారి ఆయన స్వగ్రామం  కఠారాలో నీటి ఎద్దడి ఏర్పడింది. లలైసింగ్ మిత్రుడు మంగల్ సింగ్ అని ఉండేవాడు. అతను వాల్మీకి, పైగా సఫాయి కర్మచారి. అతనంటే ఊరి పెద్దలకు చిన్నచూపు. అతణ్ణి ఒరేయ్ మంగలియా అని పిలిచేవారు. ఆ కరువు రోజుల్లో మంగలియా బావి ఎండిపోయింది. అతను నీటికోసం యాదవ్ ల బావి దగ్గరికి వెళ్ళాడు. యాదవులు చూసి ఈసడించుకున్నారు. తక్కువ జాతివాడు, అందులో సఫాయి కార్మికుడు మంగలియా గనక తమ బావిని ముట్టుకుంటే అది అపవిత్రమౌతుందనీ నానా మాటలని వెనక్కి పంపించారు. విషయం తెలుసుకొని లలైసింగ్ యాదవ్ తన వంతు నీరు తోడుకుని తెచ్చి తన ఇంట్లో పెట్టేవాడు. మళ్ళీ తన ఇంటి నుంచి మంగలియాకు ఇచ్చేవాడు. అలా ఆ కరువు రోజుల్లో వాల్మీకి జాతి కుటుంబాలను లలైసింగ్ ఆదుకున్నాడు. ఈ వివక్షను అంతం చేయాలని మనసులో దృఢంగా అనుకున్నాడు.  ఓ రోజు బ్లాక్ ఆఫీసుకు వెళ్ళి అధికారులతో మాట్లాడి వాల్మీకి కుటుంబాలకు నీరు లేదని, వెంటనే అక్కడ ఒక బావి తవ్వించాలని అప్లికేషన్ పెట్టాడు. ప్రభుత్వం పూనుకుంటే తాను కూడా వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సహాయం చేస్తానని కూడా చెప్పాడు. అధికారులు అందుకు సమ్మతించి మంగల్ సింగ్ వాల్మీకి ఇంటి దగ్గరలో ఎక్కువ లోతు బావి తవ్వించారు. కొద్ది కాలానికే పరిస్థితి తిరగబడింది. ఈ సారి యాదవుల బావి ఎండిపోయింది. దగ్గరలో మంగలియా కొత్త బావి తప్ప మరో బావి లేదు.  విధిలేక యాదవులు మంగలియా దగ్గరికి వెళతారని ముందే ఊహించి, లలైసింగ్ మంగలియాకు ఒక సూచన చేశాడు. యాదవులు అతని బావి ముట్టుకుంటే అపవిత్రమౌతుందనీ, వారిని బావి దగ్గరకు రానివ్వద్దనీ చెప్పాడు.  

‘‘అయ్యా! నేను చిన్న కులంవాణ్ణి! అలా అని నేనెలా చెప్పగలనూ?- అని మంగలియా కంగారు పడ్డాడు. ‘‘ఏం ఫరవాలేదు. అలాగే చెప్పు- ఊళ్ళో ఈ వివక్ష, అస్పృశ్యత సమసిపోవాలంటే మనం ఒక్కోసారి కఠినంగా ఉండాలి’’ అని ధైర్యం చెప్పాడు. అనుకున్నట్టుగానే యాదవులు బిందెలు, కుండలు తీసుకుని మంగలియా బావి దగ్గరికి వెళ్ళారు. మంగల్ సింగ్ అడ్డగించాడు.. ‘‘నేను ముట్టుకుంటే మీ బావి అపవిత్రమైపోతుందని అన్నారు కదా? మరి ఇప్పుడు మీరు ముట్టుకుంటే నా బావి అపవిత్రమైపోదా? – వెళ్ళండి! వెళ్ళండి!!’’- అని ఈసడించుకున్నాడు. యాదవులు అసలు విషయం గ్రహించారు. వీడికి ఇలా మాట్లాడే ధైర్యం లేదు. లలైసింగ్ వెనక ఉండి వీడితో ఇలా చెప్పిస్తున్నాడని గ్రహించి – అందరూ కలిసి లలైసింగ్ దగ్గరకు వెళ్ళారు.

Also read: డిగ్రీలు లేని ప్రిన్సిపాలూ, మరో పరిశోధకుడు

‘‘మంగల్ సింగ్ అన్నదాంట్లో న్యాయం ఉంది కదా?- అన్నాడు లలైసింగ్. ‘‘అతడు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వకుండా అప్పుడు అతణ్ణి తన్ని తగిలేశారు కదా? మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నీళ్ళకోసం అతని దగ్గరికి వెళ్ళారూ?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆ రోజుల్లో నేను బావి నుండి నీళ్ళు నా ఇంటికి మోసుకెళితే నా ఇంటికొచ్చి మంగల్ సింగ్ నీళ్ళు తీసుకుపోయేవాడు తెలుసా? అయినా అంటూ, ముట్టూ, అస్పృశ్యతా ఎక్కడ ఉన్నాయీ? మీ మెదళ్ళలో ఉన్నాయి. మీ మూర్ఖత్వంలో ఉన్నాయి. అవన్నీ ఆర్యబ్రాహ్మణులు కల్పించినవి. వాటిని అనుసరించడం మనకు అవసరమా? అందరం మనుషులమన్నది గ్రహిస్తే పరిష్కారం దొరుకుతుంది. –’ అని చెప్పాడు లలైసింగ్. ‘‘ఏదో ఒకటి చేసి మా అందరి ప్రాణాలు నిలుపు. మాకు నీరు కావాలి’’- అన్నారందరూ.

‘‘అందుకు ఒకటే షరతు – ఊళ్ళో అస్పృశ్యత పాటించకూడదు. అన్ని కులాల, అన్ని మతాలవారు కలిసిపోయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందరి ఇళ్ళకు అందరు వెళ్ళాలి. మనమంతా మనుషులం – ఒకే జాతి వాళ్ళమనేది అందరూ గ్రహించాలి!’’ అన్నాడు లలైసింగ్. విషయం అర్థమై కొందరు, విధిలేక మరికొందరు ‘‘అలాగే, అలాగే చేద్దాం’’- అని అన్నారందరూ. లలైసింగ్ వెళ్ళి మంగలియా బావి నుంచి యాదవులందరికీ నీళ్ళు ఇప్పించాడు. ఇలాంటి సంఘ సంస్కర్తలు ఎంతో మంది ఎన్నోరకాలుగా క్షేత్రస్థాయిలో ప్రయత్నిస్తూ ఉంటే కదా ఇప్పుడు మనం ఉంటున్న సమాజం ఏర్పడిందీ? దీన్ని మళ్ళీ వెనక్కి నడిపించే వారిని పసిగట్టి, వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చేసింది!

‘‘ఇతరులకు ఇవ్వడం వల్ల మనసులో ఒక రకమైన విశాలమైన భావన కలుగుతుంది. మనం జీవించే ప్రపంచాన్ని మన చర్యలే సృష్టిస్తాయి కాబట్టి, ఇవ్వడం అనే చర్య ద్వారా విశాలమైన ప్రపంచ సృష్టి జరుగుతుంది!’’- అని చెప్పింది బౌద్ధధమ్మం.

Also read: వేద గణితం అబద్ధం: సున్నాను కనుగొంది బౌద్ధులే!

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త. మెల్బోర్న్ నుంచి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles