Friday, April 26, 2024

భారతీయ సమాజం-అంబేద్కర్ దృక్పథం

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో  ఎస్ ఆర్ శంకరన్ పదవ స్మారక ఉపన్యాసం. ఇది నవంబర్ ఒకటో తేదీ (01 నవంబర్ 2020), ఆదివారం ఉదయం, వెబినార్ ద్వారా జరిగింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ శాఖకు చెందిన ప్రొఫెసర్ పెరికల కేశవకుమార్ శంకరన్ స్మారకోపన్యాసం చేశారు. సమకాలీన భారత తత్వశాస్త్రం, సామాజిక, రాజకీయ తత్వశాస్త్రం, కాంటినెంటల్ ఫిలాసఫీ, అప్లయిడ్ ఎథిక్స్, ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ  ఆయన ప్రత్యేక అధ్యయన అంశాలు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక అతిథిగా హరియాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, అంబేడ్కర్ తత్వవేత్త డాక్టర్ రాజశేఖర్ వుండ్రు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, హైదరాబాద్ విశ్వవిద్యాయలం ఆచార్యుడు ప్రొఫెసర్ వి. కృష్ణ, దళిత్ బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, చేంజ్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ఆనంద్ కుమార్ బొలిమెర, సకలం సంపాదకుడు కె. రామచంద్రమూర్తి  ఈ వెబినార్ లో పాల్గొన్నారు. భారతీయ సమాజాన్ని అంబేడ్కర్ ఎట్లా అర్థం చేసుకున్నారో, ఎట్లా అధ్యయనం చేశారో, ఎటువంటి నిర్ధారణలకు వచ్చారో ప్రొఫెసర్ కేశవకుమార్ ప్రతిభావంతంగా వివరించారు – ఎడిటర్.

ప్రొఫెసర్ పెరికల కేశవ కుమార్, ఢిల్లీ విశ్వవిద్యాలయం

ఎస్. ఆర్. శంకరన్ స్మారక ఉపన్యాసానికి వక్తగా నన్ను ఆహ్వానించడం ఎంతో గౌరవంగానూ, బాధ్యతగాను భావిస్తున్నాను. అందుకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శంకరన్ ఈ దేశం గర్విచదగ్గ సివిల్ సర్వెంట్. ప్రజా సంక్షేమం గురించి చివరిదాకా తపన పడిన మనిషి. అణగారిన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం ప్రభుత్వం బాధ్యత అని గుర్తించిన అధికారి. ఆ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఘనత ఆయనకు దక్కుతుంది. ప్రజలకీ, ప్రభుత్వాలకీ మధ్య వారధిగా సమర్థవంతంగా, నిస్వార్థంగా పనిచేశారు. అందుకే ఈ రోజు సామాజిక దోపిడీకి గురికాబడినవాళ్లు ఆయనను గుండెలకు హత్తుకున్నారు. ఒక ప్రభుత్వ అధికారి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం, ఆయన పేరు కాలనీలకు పెట్టుకోవడం క్రమం తప్పకుండా ఆయన జయంతినీ, వర్థంతినీ జరుపుకోవడం అందుకు నిదర్శనం. అన్నిటికీ మించి ఆయన నిజాయితీ, నిరాడంబరత, సామాన్య జీవితం ఆయనను మరింత ఉన్నతుడిని చేసింది.

sr sankaran 10th memorial lecture

ప్రభుత్వాధికారులకు పరిమితులు

ప్రభుత్వ అధికారులు సహజంగానే ప్రభుత్వ విధానాలకీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ఆలోచనా ధోరణులకు లోబడి పనిచేయాల్సి వస్తంది. చాలామంది అధికారులు ఏ ఎండకాగొడుగు పట్టడమో, లేక సర్దుకొని పోతూ ఉండటమో చూస్తాం. అందుకు శంకరన్ గారి పద్దతి భిన్నం. తనకున్న సామాజిక బాధ్యతతో కూడిన ఆలోచనా విధానం వల్ల, అవినీతి రహితుడవటం వల్ల ఆయనపట్ల గౌరవం ఏర్పడటమే గాక, ఆయనని పక్కకి పెట్టడం కుదిరేపనికాదు అనిపిస్తుంది ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు. ఆయన ప్రజల ఆకాంక్షలని ప్రభుత్వాలకి చెప్పడంలో, ఆ విధంగా ప్రభుత్వ విధానాలను తయారు చేయడంలో సఫలీకృతుడైనట్టు కనిపిస్తుంది. దళితులకూ, పేదలకూ ఉపాధి కల్పించడంలో, పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో, ఎటువంటి ఆర్థిక వనరులూ, ఏ విధమైన ఆసరాలేని ప్రజలకు అండగా ఉండటంలో, పేద, దళిత విద్యార్థులకు విద్య ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించడంలో, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో శంకరన్ గారి కృషి మరువలేనిది. అంబేడ్కర్ కోరుకున్న సంక్షేమ రాజ్యంలో శంకరన్ గారు అసలైన ప్రభుత్వ  ఉద్యోగ ప్రతినిధిగా మనకు కన్పిస్తారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో, ప్రజలవైపు నిలబడటంలో ఆయనకున్న అంకిత భావానికి గుర్తుగా నా ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను.

అంబేడ్కర్ రచనలకూ, వాదనాలనూ సామాజికతే కేంద్రం

నేను ఈ రోజు భారతీయ సమాజంపైన అంబేడ్కర్ దృక్పథం గురించి మాట్లాడదామనుకుంటున్నారు. భారతీయ సమాజమంటే అసమానతల కుల సమాజం. బ్రాహ్మణీయ వర్గాల ప్రయోజనాలు ప్రధానంగా ఉన్న బ్రాహ్మణీయ సమాజం. అసమాన, అమానవీయ  విలువలను దైవనిర్దేశంగా చెప్పి మెజారిటీ ప్రజల్ని అణిచివేస్తూ దోడిడీ చేస్తున్న హిందూ సమాజం. హిందూ సమాజానికి అధికారాలను కల్పించిన శాస్త్రపాలిత సమాజం. బ్రాహ్మణీయ, రాజకీయ వర్గాల అవసరాల కోసం సృష్టించబడ్డ మార్పులేని సమాజం. మారిన సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో కూడా బ్రాహ్మణీయ భావజాల ఉనికిని పోగొట్టుకోని సమకాలీన సమాజం. భారతీయ సమాజంతో ఘర్షణ అంటే ఇటువంటి దుర్మార్గమైన, అహేతుకమైన, అనైతికమైన బ్రాహ్మణీయ హిందూ సమాజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక సమాజం కోసం జరిగే పోరాటం. అసమానతలు, అణచివేతలు లేని సమాజపు ఊహలు  కూడా భారతీయ సమాజంలో భాగమే. అంబేడ్కర్ ఈ భారతీయ సమాజాన్ని సిద్ధాంతీకరించడమే కాక ఒక అందమైన, న్యాయమైన, నైతికమైన, మానవీయమైన ప్రజాస్వామ్యాన్ని కలగన్నాడు. అంబేడ్కర్ తన రచనల ద్వారా, పోరాటాల ద్వారా రాజ్యాంగ రచనల ద్వారా భారతీయ సమాజానికున్న  అనేక పార్శ్వాలను విశ్లేషించడం కనిపిస్తుంది.  అంబేడ్కర్ కులం గురించి మాట్లాడినా, మతం గురించి విశ్లేషించినా, రాజకీయాల గురించి మాట్లాడినా, వలసవాద పాలన గురించి ప్రస్తావించినా జాతీయ వాద చట్టాల గురించి పోరాడినా, ప్రజాస్వామ్యం అవసరం గురించి గొంతెత్తినా అన్నిటా సామాజికత కేంద్రకంగా ఉంటుంది. వలసపాలనకి వ్యతిరేకంగా, ప్రధాన జాతీయవాద ఉద్యమకారులు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడితే, ముందు సామాజిక స్వేచ్ఛ మన ఉద్యమాలకి ప్రధాన ఎజెండా కావాలన్నాడు అంబేడ్కర్.

sr sankaran 10th memorial lecture

సామాజిక విప్లవం ప్రధాన అవసరం

ఈ అసమాన, కుల, హిందూ సమాజంలో మార్పులేకుండా ఎటువంటి ఉద్యమం మనజాలదన్నాడు. కమ్యూనిస్టులు ఆర్థిక అసమానతలు పోగొడితే సామాజిక సమస్యలతో సహా అన్ని  సమస్యలూ పరిష్కరించబడతాయి అంటే, ఆర్థిక అసమానతలతో బాటుగా  సామాజిక సంస్కరణలు జరగాలని సామాజిక విప్లవం ప్రధాన అవసరం గురించి గొంతెత్తాడు. రాజకీయ, ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంస్కరణలు జరగకుండా, అంటే భారతీయ సమాజం పునాదిగా ఉన్న కుల నిర్మూలన జరగకుండా, ఈ దేశ పుపురోగతిని సాధించలేమని తెగేసి చెప్పాడు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ప్రజాస్వామిక పాలన జయప్రదం కావాలంటే ప్రజాస్వామిక సమాజం ఉండాలి అని పదేపదే చెబుతాడు. ప్రజాస్వామిక సమాజం నైతికతమీద, న్యాయం మీద నిలబడి ఉండాలనీ, ప్రజాస్వామ్యం స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువల పునాది మీద నిర్మించాలనీ నమ్మాడు.

భారత సమాజ పరిణామం

భారతీయ సమాజం ఏకీకృతం కాదన్నది చారిత్రక సత్యం. అనేక జాతులూ, సంస్కృతులూ, సాంప్రదాయాల కూడలి. అనేక రాజ్యాలుగా, అనేకమంది పాలకుల చేతుల్లో ఉంటూ వచ్చింది. భారతదేశం మనం ఇప్పుడు అనుకుంటున్న మ్యాప్ రూపంలో కూడా వుంటూ వచ్చింది. అనేక జాతులు, సామాజిక సమూహాలు సంఘర్షించుకుంటూ, సర్దుబాట్లు  చేసుకుంటూ జీవనం సాగించేయి. సాంస్కృతికంగా ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకోవటాన్ని కూడా గమనించొచ్చు. ఏది ఏమైనా భారతీయ సమాజం చారిత్రకంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక మార్పులకు గురయింది. అయితే స్థూలంగా అర్థం చేసుకోవాలంటే, అంబేడ్కర్ చెప్పినట్టు భారతీయ చరిత్ర బ్రాహ్మణీయ హిందూ మతానికీ, బౌద్ధానికి మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకునేటప్పుడు దీన్ని కేవలం రెండు మతాల ఆధిపత్య పోరాటంగా అర్ధం చేసుకోకూడదు.

ఇది రెండు ప్రాపంచిక, సామాజిక దృక్పథాల మధ్య ఘర్షణగా గమనించాలి. ఇది భారతీయ సామాజిక గమనాన్ని కూడా సూచిస్తుంది. వైదిక బ్రాహ్మణీయ మతాన్ని, ఆ తర్వాత హిందూ మతాన్ని అసమాన దోపిడీ వ్యవస్థకు ప్రతీకగా సామాజిక మార్పుని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణీయ విలువలని కాపాడుతూ యథాస్థితిలోనే కొనసాగించేదిగా చూస్తే బౌద్ధాన్ని మార్పుని కోరుకుంటూ సమానత్వం మానవీయ సమాజం కోరుకునేదిగా చూడటం జరిగింది. మార్కిస్టు పరిభాషలో రివల్యూషనరీ, కౌంటర్ రివల్యూషన్ గా అర్ధం చేసుకోవచ్చు. చారిత్రక గమనంలో బ్రాహ్మణీయ భావజాలం భౌగోళికంగా ఇప్పుడున్న భారతీయ సమాజమంతా ఏదో మేరకు అల్లుకుపోయింది. అది ఒక పద్దతి ప్రకారం ప్రాచుర్యం పొంది హిందూ సమాజంగా అవతరించింది. ఆ హిందూ సమాజమే భారతీయ సమాజంగా చెలామణి అవుతోంది.

బౌద్ధం పతనం, హిందూమతం పునరుజ్జీవనం

జోహాన్స్ బ్రాంకొస్ట్ (Johans Bronkhorst) అనే అతను ‘హౌ ది బ్రాహ్మిణ్ వాన్ – ఫ్రం అలెగ్జాండర్ టు గుప్తాస్ (How the Brahmins won – from Alexander to Guptas)’ అనే గ్రంథంలో బ్రాహ్మనిజం భారతదేశమంతా ఎట్లా విస్తరించిందన్న చారిత్రక పరిణామాన్ని తాత్విక, మత గ్రంథాల సహాయంతో అంబేడ్కర్  వివరిస్తాడు.  ఆ తర్వాత కాలంలో బుద్ధిజం అండర్ ది షాడో ఆఫ్ బ్రాహ్మనిజం (Buddhism Under the Shadow of Brahminism) అనే గ్రంథంలో బౌద్ధం కూడా కాలక్రమేణా బ్రాహ్మణీయ  ప్రభావంలోకి ఎలా నెట్టబడిందో వివరిస్తాడు. అంబేడ్కర్ మరో సందర్భంలో డౌన్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం (Downfall of Buddhism) అనే వ్యాసంలో బౌద్ధం పతనానికీ, హిందూ పునరుజ్జీవనానికీ గల కారణాలని వెతుకుతాడు.

చారిత్రకంగా పరిశీలిస్తే క్రీ. పూ ఆరవ శతాబ్దం పూర్వమే వైదిక  బ్రాహ్మణీయ మతానికి, సాంప్రదాయానికి వ్యతిరేకంగా శ్రమణులు అంటే బౌద్ధులు, జైనులు, అజీవికులూ, చార్వాకులూ తమ ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకుంటూ పోరాటం చేశారు. మొదటి మిలీనియం చివరకొచ్చే సరికి మెల్లగా శ్రామణిక ఆలోచనలన్నీ పక్కకు నెట్టి బ్రాహ్మనిజం తన ప్రాథాన్యతను సంతరించుకుంది. అనేక హిందూ పురాణ మత సాంప్రదాయాలను వివిధ సామాజిక వర్గాలు అవలంబించాయి. అవి క్రమంగా విస్తృతమైనాయి. వైదిక దేవుళ్లు ఈ పురాణ మతానికి, కొత్త దేవుళ్లకి లోబడి ఉన్నారు. కొన్ని సార్లు వైదిక ఆరాధ్య దేవుళ్లు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయారు. విష్ణువు, శివుడు పూజలందుకోవడం మొదలైంది. పురాణికి హిందూమతం తనకు విభిన్నమైన మత సాంప్రదాయాలని తనలో కలిపేసుకోవడం లేక వాటికొ తమతో స్థానం కల్పించడంతో మరింత వృద్ధి చెందాయి. అంతే కాకుండా ఈ మత శాఖలు వివిధ సామాజిక వర్గాలతో గుర్తింపు పొందాయి. రెండో మిలీనియం మొదటికొచ్చేసరికి భక్తి మత సాంప్రదాయాలు ఊపందుకున్నాయి. శైవము, వైష్ణవం పురాణ మత సాంప్రదాయాలుగా అభివృద్ధి చెందడమేగాక శ్రామణ సాంప్రదాయం లోని కొన్ని విలువలను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత ఆమోదయోగ్యంగా ఉండే ప్రయత్నం చేసినవి. మధ్యయుగాల్లో ముస్లిం పాలనలో ఉన్నా, ఆ తర్వాత పాశ్చాత్య బ్రిటీష్ పాలనలోకి వచ్చినా బ్రాహ్మణీయ హిందూ సమాజానికి ఏమంత ఇబ్బంది రాలేదు. పైగా అన్యమత ఆచారాలకి వ్యతిరేకంగా హిందూ సమాజాం మరింత బలపడింది. కాకుంటే హిందూ సమాజంలో అణచివేయబడ్డ సామాజిక వర్గాలకూ, వృత్తి కులాలకూ కొంత వెసులుబాటు లభించింది. మరో విధంగా కింది వర్గాలు ఇతర మతాలవైపు మొగ్గు చూపుతున్న క్రమంలో హిందూ సమాజ సంస్కరణకు పూనుకున్నారు.

సంస్కృత గ్రంథాలలో పాశ్చాత్యుల మూలాల అన్వేషణ

ఆధునిక కాలంలో బ్రాహ్మణీయ హిందూ సమాజ నిర్మాణానికి, అది మరింత బలపడటానికి ఇండాలజిస్టులు, ఒరియంటలిస్టులు, మిషనరీలు, హిందూ సంస్కరణవాదులు, జాతీయవాదులు తోడ్పడినట్లు కనిపిస్తుంది. పాశ్చాత్య పారిశ్రామిక సమాజం తన మూలాలు ప్రాచీన సమాజాల్లో దొరుకుతాయోమోనని భావించి ఇండో యూరోపియన్ భాష అయిన సంస్కృతం గురించి పట్టించుకొని సంస్కృత గ్రంథాలను సేకరించడం మొదలెట్టింది. అలా ఫిలాసఫీ నుండి ఫిలాసఫీ గ్రంథాల వరకు వాళ్ల పయనం సాగింది.

వలసవాదులకు ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆచారాలు, సామాజిక నమ్మకాలు తెలుసుకునే అవసరం కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే హిందూ గ్రంథాలనీ, ధర్మశాస్త్రాలనీ సేకరించడం, పాశ్చాత్య భాషల్లో అనువాదాలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో బ్రాహ్మణ పండితులు ప్రధాన పాత్ర వహించారు. జాతీయవాద ఉద్యమంలో హిందూ సంస్కృతి భారతీయ సంస్కృతిగా గుర్తింపు పొందింది. ఒక విధంగా బ్రాహ్మణీయ సామాజిక జీవనం, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రాలు భారతీయ జ్ఞానంగా అందరిమీదా రుద్దబడ్డాయి. ఈ క్రమంలో మెజారిటీ ప్రజల, అంటే బ్రాహ్మణేతరల ప్రజల, జీవనం, విజ్ఞానం, సంస్కృతి, చరిత్ర మరుగున పడ్డాయి. అయితే, దీనికి బ్రాహ్మణీయ పండితులు తెలివిగా భిన్నత్వంలో ఏకత్వంగా భాష్యం చెప్పారు. అందులో భిన్నత్వాన్ని చూడటానికి ఎప్పుడూ నిరాకరిస్తూ వచ్చేవారు. చివరకు బ్రాహ్మణత్వం మిగిలింది.

భారతీయ సమాజం గురించి సమీక్షించేటప్పుడు బ్రాహ్మనిజం గురించి, దాని ఎదుగుదల, ఎత్తుగడల గురించి, దాని సాహిత్యం, తాత్విక ఆలోచనల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. బ్రాహ్మణీయ మేధావులు విమర్శనాత్మక  ధోరణిని ఏమాత్రం అలవరచుకోలేదన్నది సత్యం. విమర్శించే వాళ్లకుండే సదుపాయాలనూ, ప్రత్యేక హక్కులనూ పోగొట్టుకోదలచుకోలేదు. మౌనంగానైనా ఉన్నారు, లేకుంటే బ్రాహ్మణీయ వ్యవస్థను బలపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త తర్కాన్ని తీసుకొచ్చి దాని గొప్పతనాన్ని కీర్తించారు. నీచమైన కులవ్యవస్థను నిలిబెట్టేందుకు ఏ మాత్రం సిగ్గుపడలేదు. నైతికత, హేతుబద్థత, చారిత్రకతతో సంబంధం లేకుండా ఒక సనాతన య సాంప్రదాయ నిర్మాణం చేసి ప్రజల మీద రుద్దారు.

ఊహాత్మకమైన మత సమాజాలు (Imagined religious community)

రోమిల్లా థాపర్, “ఇమేజిన్డ్ రెలిజియస్ కమ్యూనిటీస్? ఏన్సియంట్ హిస్టరీ అండ్ ది మోడ్రన్ సెర్చ్ ఫర్ ఏ  హిందూ ఐడెంటిటీ” అనే వ్యాసంలో నేటి కాలంలో మెజారిటేరియన్ హిందూ కమ్యునల్ ఐడెంటిటీని నిర్మాణం చేసిన క్రమాన్ని ఏ అవసరాల కోసం ఎవరిని టార్గెట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చిందీ విశ్లేషించారు. తమ రాజకీయ, సామాజిక భావజాలానికి అనుగుణంగా ఉండే మత భావనను పెంపొందించడమే కమ్యునలిజం. కమ్యునిటీ గుర్తింపు మతంతో ముడిపడి ఉండటమే గాక, మతాన్ని, చరిత్రని తమకు అనుకూలంగా పునర్వచించుకోవడం జరుగుతుంది. వీలైనంత ఎక్కువమందిని తన మత పరిథిలోకి లాక్కుని బలహీనమైన మైనారిటీకి సవాలు విసరడం రాజకీయ ప్రయోజనంగా ఉంటుంది. ప్రజాస్వామిక పరిభాషలో మెజారిటీ కమ్యునిటీగానే గాక, మిగిలిన కమ్యునిటీల కన్నా ఉన్నతమైనదిగా వాటిపైన తనకు అధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తూ, మిగిలిన మైనారిటీలు తను చెప్పినట్టుగా నడుచుకోవాలని అనుకుంటుంది. ఈ కృత్రిమమైన మెజారిటీ కమ్యునిటీ అటువంటి మెజారిటీ మతం చారిత్రకంగా అంతర్గతంగా అనేక భేదాలు ఉన్నప్పటికీ అవేమీ లేనట్టుగా తనను తాను ఆవిష్కరించుకుంటుంది. అంతర్గతంగా ఉన్న భిన్న మత శాఖల సామాజిక ఐడెంటిటీనీ, చారిత్రక సంబంధాన్ని చూడటానికి ఇష్టపడదు. మత గ్రంథాల వెనక (text)  కాంటెక్ట్స్ (సందర్భం) ని చెరిపేసి ఒక రకమైన ఆరాధనా భావాన్ని మతంపట్ల ఏర్పరుచుంది. ఈ కృత్రిమ మెజారిటీ హిందూ మతం ఒక పద్దతిగా, టెక్నిక్ గా మెకానిజం ద్వారా ఏర్పర్చుతుంది. హిందూ మెజారిటీ కమ్యునిటీ హింసకు తావులేనిదిగా, ఎంతో సహనంగా ఉన్నట్టు ప్రచారం చేస్తుంది. వాస్తవానికి రాజకీయమైన ఈ కమ్యూనిటీ నిర్మాణం మైనారిటీలపట్ల హింసాభావంతోనే జరుగుతుంది.

అంబేడ్కర్  ‘క్యాస్ట్ ఇన్ ఇండియా (Caste in India -1917)’ వందేళ్ల క్రితం రాసిన పరిశోధక వ్యాసం.  కులం పుట్టుకని, అది బ్రాహ్మణుల నుండి మిగిలిన కులాలకు వ్యాప్తి చెందిన విధానాన్ని ఈ వ్యాసంలో వివరించారు. ఇది ఆంధ్రోపాలజిస్టులకీ ఎల్లోగ్రాఫర్స్ కులాన్ని వివరించిన దానికి భిన్నమైన ధృక్పథం.

Creation of caste is superimposition of endogamy on exogamy. Endogamy or closed door system, was a fashion in Hindu society, and as it had originated from the Brahmin caste, it was whole-heartedly imitated by all non-Brahmin subdivisions or classes, who in their turn, became endogamous castes. It is the infection of imitation that caught all these subdivisions on their onward march of differentiation and has turned them into castes.

కులం పుట్టుకలోనే పితృస్వామ్య మూలాలు

అంతే కాకుండా,  ఈ పరిశోధనా గ్రంథంలో పితృస్వామ్య మూలాలు కూడా కులం పుట్టుకలోనే ఉన్నాయని నిర్థారించాడు.  అంటే కుల నిర్మూలన జరగకుండా పితృస్వామ్యం అంతంకాదని స్త్రీవాదులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సతి, బాల్య వివాహాలు, బలవంతంగా వితంతువులుగా ఉండటం కులాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగానే ఉన్నాయని చెబుతాడు. అసలు కారణాలు చెప్పకుండా వీటిని బలపరుస్తూ సామాజిక ఆదర్శాలుగా కీర్తిస్తూ వచ్చారు.

 ఎన్హిలేషన్ ఆప్ క్యాస్ట్ (Annihilation of caste -1936) లో కులం స్వభావాన్ని మరింతగా విపులీకరించడమే గాక, కుల నిర్మూలన జరగకుండా మనం ఎటువంటి పురోగతినీ సాధించలేమని అంబేడ్కర్  చెబుతాడు. రాజకీయ, ఆర్థిక, మత సంస్కరణలు కుల నిర్మూలన జరగకుండా సాధ్యం కాదని తేల్చి చెబుతాడు. అంతేకాక ఆదర్శ సమాజం  లక్షణాలనీ, దాని అవసరాన్నీ మన ముందుంచుతాడు. కులానికీ, మతానికీ, శాస్త్రాలకీ,  పూజారీ పాలక వర్గాలకు ఉన్న సంబంధాన్ని కూడా వివరిచాడు. అంతేగాక సమాజమంటే మనుషులు ఒక చోట ఉండటం మాత్రమే కాదు. ఒకే నమ్మకాలు, పండగలు, సంస్కృతి కలిగి ఉండటం వల్ల సమాజం అనిపించుకోదని చెబుతాడు. సమాజమంటే పనిలో పాల్గొనడం, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, అన్నిటికీ మించి మనుషుల మధ్య మాటలుండటం.

చతుర్వర్ణాల వ్యవస్థ గురించి మరింతగా విపులీకరిస్తూ, శూద్ర వర్ణం ఎలా ఏర్పడింది, అస్మృశ్యులు ఎవరు అనే గ్రంథాల్లో పరిశోధాత్మకంగా వివరించే ‘untouchables or the children of India’s ghettos’ లో కులం పర్యవసానమైన అంటరానితనాన్ని, వివక్ష రూపాల్ని వివరించాడు.

మతాన్ని తాత్వికంగా ఎట్లా అర్థం చేసుకోవాలి?

జీవితంలో వివక్షత వెలివేతను ఎదుర్కొన్న బాధితుడిగా  కులాన్ని మరింతగా అర్ధం చేసుకునే క్రమంలో కులం ఏర్పరచిన సామాజిక సంబంధాలకీ, సామాజిక వ్యవహారాలకీ ఆమోదిత హిందూ మతం ద్వారా జరుగుతుందని గ్రహించి, మతం అంటే ఏమిటీ? అది ఎలా పుట్టింది? మతానికీ, సమాజానికీ ఉన్న విడదీయరాని సంబంధం ఎటువంటిది? అది మతం నుండి నాగరిక మతంగా పరిణామం చెందడంలో ఏ నైతిక సూత్రాలు పనిచేశాయి? మతాన్ని తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మతాన్ని అర్ధం చేసుకోవడానికి ఫిలాసఫీ  ఆఫ్ రెలిజియన్ అనే పద్దతిని సూచిస్తారు. ఆ ప్రకారం ఆదిమ సమాజాన్ని అర్థం చేసుకోటానికి ఉపయోగిత అనే సూత్రాన్ని, నాగరిక సమాజాన్ని అర్థం చేసుకోటానికి న్యాయసూత్రాన్ని పరీక్షకు పెడతాడు. న్యాయ సూత్రమంటే సమానత్వం, స్వేచ్ఛా, సౌభ్రాతృత్వంతో కూడినది. దీన్ని హిందూ మతాన్ని పరీక్షించటానికి ఉపయోగిస్తాడు. ‘Hinduism is neither qualified for the test of utility nor justice,’ అని నిర్థారిస్తాడు.

‘Hinduism is inimical to equality, antagonistic to liberty and opposed to fraternity,’ అని గుర్తు చేస్తాడు.

‘Revolution and counter revolution in ancient India’ లో, ‘Riddles of Hinduism’ లో హిందూమతాన్నీ, హిందూ మతానికి సంబంధించిన గ్రంథాలనీ చారిత్రకంగా  చూడటమే కాక, అవి ఎంత అనైతికమైనవో నిరూపించడానికి అనేక ఉదాహరణలను హిందూ మతగ్రంథాల నుంచీ, మనధర్మశాస్త్రం నుంచీ చూపిస్తాడు. అంతేగాక హిందూ సాహిత్యంలో ఒకదానికొకటి పొంతనలేని విషయాలనూ, హేతుబద్దతలేని విషయాలనూ ఎత్తి చూపిస్తాడు. ఇదంతా మారుతున్న సమాజంలో బ్రాహ్మణ వర్గాల ప్రయోజనాలను కాపాడుకునే దానిలో భాగంగానే చెబుతాడు. కులం ఇరుసుగా ఉన్న హిందూ మతాన్ని సమాజానికి వ్యతిరేకమైనదిగానూ, అంతిమంగా మత వ్యతికేకమైనదిగా భావిస్తాడు. ఆ క్రమంలో అసమానతలను ప్రబోధించని, నైతికమైన, మానవీయమైన, సామాజిక న్యాయమైన మతంగా బౌద్ధాన్ని ‘Buddha and his Dhamma’లో పరిచయం చేస్తాడు. అంతే గాకుండా ప్రజల పక్షం ఉన్న మార్కిజానికీ, బుద్ధిజానికీ మధ్య సారూప్యతను ‘బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్’ వ్యాసంలో చూపిస్తాడు

భారతీయ సమాజాన్ని విశ్లేషిస్తూ, కుల రహిత ప్రజాస్వామ్య సమాజాన్ని ఊహిస్తూ రచనలు చేయడం ఒక ఎత్తయితే, తను ఊహించిన సమాజం కోసం తను చేసిన పోరాటాలు మరో ఎత్తు. చెరువులో నీళ్లు తాగే పౌర హక్కుల పోరాటం నుండి, ఓటు హక్కు కోసం (సౌత్ బరో కమిటీ ) విజ్ఞాపనలు, దళితుల భవిష్యత్తు కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనటం, బహిష్కృత హితకారిక సభ, డిప్రెస్ డ్ క్లాసెస్ అసోసియేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీలు ఏర్పరచి ప్రజల ప్రాతినిథ్యం కోసం పోరాడటమూ, కమ్యునల్ మెజారిటీ పాలనలో మైనారిటీలు ఎదుర్కొనే సమస్యలు ఊహించి స్టేట్ అండ్ మైనారిటీస్ నివేదిక సమర్పించి  రాజ్యాంగంలో ఈ వర్గాల పరిరక్షణకు ప్రత్యేక హక్కులు సంపాదించడం, ఇవన్నీ అంబేడ్కర్ కోరుకున్న నూతన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి.

బ్రాహ్మణీయ సమాజం – అంబేడ్కర్ విశ్లేషణ

బ్రాహ్మణీయ హిందూ సమాజంలో బ్రాహ్మణులు ఉన్నతులుగా ఉంటూ సామాజిక వ్యవహారమంతా వాళ్లు కేంద్రంగా, వాళ్లకి ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రాహ్మణులకు పుట్టుకతో ఆధిపత్య హక్కులు ఉండటమే కాకుండా కర్మకాండలు, యజ్ఞాలు వాళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. బ్రాహ్మణీయ సమాజంలో బ్రాహ్మణులు తమను తాము ప్రత్యేక వర్గంగా, ఇతరులకు భిన్నమైన వాళ్లగా సృష్టించుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానంపైన పూర్తి హక్కులు కలిగి ఉన్నట్టుగా ఉంటారు. రాజ్యాన్ని, సమాజాన్ని  ఎలా నడపాలో తెలిసిన వాళ్లుగా, ఆ విధంగా సాంప్రదాయాలను పరిరక్షిస్తునారన్న బాధ్యత గల వాళ్లుగా, పాలకులకు సలహాలిచ్చేవాళ్లుగా అధికారానికి దగ్గరగా ఉంటారు. పాలకులు ఇచ్చిన అగ్రహార భూముల వల్ల అటు ఆర్థికంగానూ ఇటు సామాజిక ఉన్నతులుగా ఉండటంలో ప్రత్యేక హోదాతోనూ ఉంటారు. అంతేగాక వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా శాస్త్రాల ద్వారా సంస్కృతుల ద్వారా, తమ ఆధిపత్యాన్ని పదిలపరచుకుంటారు. మిగిలిన బ్రాహ్మణేతర సామాజిక వర్గాలు కూడా బ్రాహ్మణ వర్గాన్ని ఆదర్శంగా చూసుకోవడం వల్ల, ఆ బ్రాహ్మణీయ విలువలు సమాజంలో మిగిలిన వర్గాల్లోకి పాతుకుపోయి కుల సమాజం మరింత బలపడింది.

బ్రాహ్మనిజం ఒక కుల సమాజ నిర్మాణం. బ్రాహ్మనిజం ఒక మత సాంప్రదాయం. బ్రాహ్మనిజం ఒక సామాజిక రాజకీయ వ్యవస్థ. అంతిమంగా అది అసమాన, అమానవీయ, అనైతిక, అహేతుక అధికారిక భావన.

కులం అంటే మనుషులని సామాజిక సమూహాలుగా విడదీయడం, ఆ సామాజిక సమూహాల మధ్య హెచ్చు తగ్గులు సృష్టించడమే గాక, కొందరు ఉన్నతులుగా, మరికొందరిని అధములుగా చూస్తుంది. ఉన్నతులకు అన్ని హక్కులు అధికారాలు ఉండటమే గాక, అధమంగా ఉన్న వర్గాలు పై వర్గాల సేవ చేయడమే విధిగా చెప్పబడుతుంది. నిచ్చెనమెట్లు సమాజానికి బ్రాహ్మణ వర్గం కేంద్రంగా ఉంటుంది.

కులం అంటే మనుషుల వెలి. తోటి మునుషుల్ని మనుషులుగా గుర్తించక పోవడం, కులం అంటే సామాజిక వెలివేత, అదో సామాజిక వివక్షత, అవమానమూ. అదో సామాజిక అన్యాయం.

Isolation means social segregation, social humiliation, social discrimination.

Isolation means denial of protection, denial of justice, denial of opportunity.

మరో విధంగా చెప్పుకోవాలంటే…

Isolation means want of sympathy, want of fellowship and want of consideration.

కులం అంటే స్వేచ్ఛలేనితనం (unfreedom). పుట్టు బానిసత్వంలో కట్టిపడేస్తుంది. మనిషి ఎదుగుదలకు ఏ మాత్రం అవకాశంలేని బానిసత్వమది. Caste degrades man and demoralizes the society. కుల వ్యవస్థకి అంటరానితనం కొనసాగింపుగా ఉంటుంది. అంటరాని వాళ్లకు మనుషులుగా గుర్తింపు ఉండదు. వాళ్లకు ఎటువంటి హక్కులూ ఉండవు. వాళ్లు మానసికంగా నైతికంగా  ఎంత ఉన్నతంగా ఉన్నా, వాళ్లు తక్కువగానే చూడబడతారు. Evil carriers గా చూడబడతాడు. Untouchable is an outlaw.  కుల సమాజంలో lawless is lawful. అంతా దైవ నిర్ణయంగా నమ్మిస్తుంది. To the Hindus, caste is sacred and caste is eternal. హిందూ సామాజిక వ్యవస్థ ఉన్నంతకాలం ఈ అసమానతలు, వివక్షతలు ఉంటూనే ఉంటాయి. ఇది సామాజిక శ్రమని దోచుకునే ఎత్తుగడ. కులం అసహజమైనది. అసహజ సూత్రాల మీద నిర్మితమైనది. అది ఒక భావన కూడా.

Untouchability will vanish only when Hindus will change their mentality. The problem is how to make the Hindus unlearn their way of life.

కులం – ఆర్థిక కోణం

కులం సామాజిక అసమానతలు ఏర్పరచడమే గాక, ఆర్థిక అసమానతలని కూడా ఏర్పరుస్తుంది. సమాజ అభివృద్ధి కోసం శ్రమ విభజన అవసరమనీ, అది తప్పు పట్టాల్సినది కాదనీ కొందరు వాదిస్తారు. శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా ఉందని అంబేడ్కర్ చెబుతారు. కొన్ని పనులను కొన్ని సామాజిక వర్గాలకి నిర్థారించడమే గాక, వాళ్లు చేసే పనుల మూలంగా నీచంగానూ, అవహేళన చేస్తూ చూడటం జరుగుతోంది. శూద్రులు అంతకన్నా కింది వర్గాలు ఫలితం ఆశించకుండా తమ కన్నా పై వర్గాలకోసం పనిచేయడమే విధిగా నిర్ణయించబడింది. పై సామాజిక వర్గాలు శ్రామిక వర్గాల శ్రమను దోపిడీ చేయడమే గాక, శ్రమలో ఎప్పుడూ భాగస్వామ్యం కాలేదు.

Caste dissociates work from interest. Caste disconnects intelligence from manual labour. Caste devitalizes vital interest.

కులం సంపదనీ, సుఖాల్నీ కొంతమందికి పరిమితం చేసి పేదరికాన్నీ, బాధల్నీ, కష్టాల్నీ ఎక్కువమందికి పంచుతుంది. కులం వ్యక్తిగత యోగ్యతలకు గుర్తింపు ఇవ్వదు. తను ఉన్న దీన పరిస్థితి నుండి బయటపడే అవకాశాన్ని ఇవ్వదు. మనిషి ప్రతిభను గాక అతని పుట్టుకని చూస్తుంది.

బ్రాహ్మణీయ కుల సమాజంలో అసమానతలతో ఉన్న యథాస్థితిని కొనసాగించడమే గాక, శ్రమ దోపిడీనీ, అణిచివేతనూ సానుకూలంగా చేసే ఆలోచన ప్రజలమీద రుద్దుతూ ఉంటుంది. అందుకు మత భావనలని, పాలకవర్గ అధికారాన్ని కాపలాగా ఉంచుతుంది.

అంతేగాక అంబేడ్కర్ భారతీయ సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో మార్కిస్టులకి భిన్నమైన వైఖరి కల్గిఉంటాడు. మార్కిస్టులు సమాజాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తే, అంబేడ్కర్ అధికారం సంపదలోనేకాదు, సామాజిక హోదాలో, మతంలో కూడా ఉన్నదని చెబుతాడు. అందుకే ఆర్థిక విప్లవంతో బాటు సామాజిక విప్లవం ఆవశ్యకతని నొక్కి చెబుతాడు.

కులం – హిందూ మతం

భారతీయ సమాజంలో (బ్రాహ్మణీయ సమాజంలో) కులమూ, మతమూ పెనవేసుకునే ఉన్నాయి. కులం లేకుండా మతం లేదు. మతం లేకుండా కులం లేదు. Religion is a rock on which the Hindus have built their social structure.  అంబేడ్కర్ ఆలోచనలలో జాన్ డ్యూయి, ఎడ్మండ్ బర్క్ ప్రభావంతో మతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంబేడ్కర్ మతాన్ని సామాజిక శక్తిగా భావిస్తాడు, మన సామాజిక జీవితం, నమ్మకాలు, విలువలు, సాంప్రదాయాలు, చివరకు జ్ఞానం కూడా మతంలో భాగంగా ఎదిగినట్టు చూస్తాడు. మత ఆచారాలూ, నమ్మకాలు మనిషి జీవితాన్ని పొడిగించేవిగా, జీవితంలోని క్లిష్ట పరిస్థితులను అధిగమించడంలో భాగంగా వచ్చినట్లు భావిస్తాడు. మతాన్ని తాత్వికంగా, హేతుబద్ధంగా, నైతికంగా, న్యాయం కొలబద్దతో పరిశీలించి, హిందూ మతానికి మతంగా ఉండే అర్హత లేదని తేల్చేస్తాడు. హిందూ మతం, కులం సామాజిక తత్వానికి వ్యతిరేకమైనవిగా భావిస్తాడు. సామాజిక సంఘటితం గానీ, సామాజిక కదలికగానీ, జాతీయతా భావం గాని హిందూ మతం వల్ల కానిపనిగా చూస్తాడు. కులమే అన్నీ అయి కూర్చుంటుంది అంటాడు. హిందూ మతానికే చెందినప్పటికీ, కింది కులాలకి sense of belongingness  భావనను ఏర్పరచలేదని, పైగా ఒక repulsive attitude (వికర్షక వైఖరి) తో ఉంటుందని చెబుతాడు. అంతేగాక, హిందూ మతం కుల వ్యవస్థకి ఆమోదాన్ని దైవ నిర్ణయంగా చెబుతూ ఉంటుంది. అందుకు  కర్మ సిద్ధాంతాన్నీ, పునర్జన్మ ఆలోచనలనీ ఉపయోగించి ప్రజల్ని ప్రశ్నించకుండా చూసుకుంటుంది. అంబేడ్కర్ ఆనాడే హిందూ మతం గురించి చెబుతూ, “There were no rights in Hindu society which the moral sense of man could recognize. There were privileges for few and disabilities for a vast majority,” అంటాడు.

బ్రాహ్మణ సాహిత్య విశ్లేషణ

బ్రాహ్మణీయ భావజాలం బ్రాహ్మణీయ గ్రంధాల ద్వారా వ్యాప్తి చెందనట్లు అంబేడ్కర్ గమనిస్తాడు. బ్రాహ్మణీయ సాహిత్యమైన వేదాలనూ, ఉపనిషత్తులనూ, ధర్మ శాస్త్రాలనూ, భగవద్గీతనూ, పురాణాలనూ క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. ఇవి వేరు వేరు కాలాలకి చెందినప్పటికీ, వీటన్నిటిలో ఉన్న అంతర్గత భావజాలం బ్రాహ్మణ ఆధిక్యత, మెజారిటీ ప్రజలను ప్రశ్నించకుండా, అజ్ఞానంలో ఉంచి తమ ప్రయోజనాలనీ, ఆధిపత్యాన్నీ కాపాడుకోవడానికి తోడ్పడ్డాయని భావిస్తాడు. బ్రాహ్మణీయ వ్యవస్థకి ప్రధానమైన వేదాలు ప్రశ్నించకూడని సత్యాలెట్లా అవుతాయని ఆపౌరుషేయాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తాడు. అనేక మంది రచయితలు అనేక కాలాల్లో వాటిని రాసిఉండవచ్చుగానీ, అవి revealed truths (వెల్లడించిన సత్యాలు) ఎలా అవుతాయన్న తాత్విక ప్రశ్న వేస్తాడు. అంతేగాక, ఈ శాస్త్రాలని చారిత్రకంగా అర్ధం చేసుకోవాలనీ, అవి వచ్చిన సామాజిక సందర్భంలోంచి  అర్థం చేసుకోవాలనీ చెబుతాడు. హిందూ మతం అంటే అదో ధర్మంగా చెబుతారు. వాస్తవానికి యజ్ఞాలూ, కర్మకాండలూ చెయ్యడమే ధర్మం తప్ప మరేమీ కాదంటాడు. ధర్మ శాస్త్రాలు సామాజిక జీవితాన్ని నిర్దేశించాయనీ, ధర్మశాస్త్రాల్లో మనుధర్మ స్మృతి బ్రాహ్మణీయ నైతిక శాస్త్రంగా, న్యాయ శాస్త్రంగా వెలుగొందిందనీ అంటూ బ్రాహ్మణులు ఏర్పరచిన సామాజిక నియమాలను రాజ్య నిబంధనలుగా, వాటిని పరిరక్షించడం రాజధర్మంగా ప్రజల మీద ప్రయోగించింది. భగవద్గీత చాతుర్వర్ణ వ్యవస్థను పుట్టుకతో గాక మనిషి గుణం ద్వారా నిర్ణయించినప్పటికీ, అంతిమంగా దాన్ని దైవ నిర్ణయంగా చెబుతూ నిష్కామ కర్మను బోధించే counter revolutionary text (విప్లవ వ్యతిరేక రచన) గా చూస్తాడు. హిందూ దర్శనాలు కూడా బ్రాహ్మణీయ ఆలోచనలకి భిన్నంగా ఏమీ లేవని అంబేడ్కర్ అంటాడు. Untouchables have no life of their own, no right to develop their own personality. This has become the gospel of Hindu religion. Hindu philosophy, whether it is Vedanta, Sankhya,  Nyaya, Visitica, had moved in its own circle. It had never had courage to challenge this gospel. The Hindu philosophy that everything is Brahma remain only a matter of intellect. It never became social philosophy.  

అందుకే సామాజిక, నైతిక శాస్త్రం అభివృద్ధి చెందలేదు. తత్వశాస్త్రంగా చెలామణీ అయిందల్లా అసమాన కుల సమాజాన్ని ఉన్నదున్నట్లుగా ఉంచడమే.

Brahmins systematically preyed on society and profiteered in religion. Indeed, Brahmins were engaging in defending every wrong for simple reason that they lived on them. అందుకే అండ్కబేర్ అంటాడు బ్రాహ్మనిజం అబద్ధాలమీద నిలబడిందని.

The power of the privileged rests upon lies and propaganda among masses. These lies must be unmasked. Brahmin Philosophy has been surviving by propagating myths and creating fear among masses.

బ్రాహ్మణిజాన్ని చీల్చిచెండాడిన తత్వవేత్త అంబేడ్కర్

బ్రాహ్మనిజాన్ని చీల్చి చెండాడిన అంబేడ్కర్ అసలైన తత్వవేత్త. ఈ దేశంలో తత్వవేత్త అన్నది చాలా privileged status. అంబేడ్కర్ ని సంఘసంస్కర్తగానో, రాజ్యాంగవేత్తగానో, దళిత నాయకుడిగానో ఒప్పుకుంటారు గానీ తత్వవేత్త గా చెప్పడానికి ఇష్టపడరు. అందుకే ఈ రోజు దళిత ఉద్యమాలు ముందు కొచ్చేదాకా అంబేడ్కర్ కి  సమకాలీన తత్వవేత్తల వెంట అకడమిక్ పుస్తకాల్లో చోటులేదు. వాస్తవానికి అంబేడ్కర్ తాత్విక పద్దతి బ్రాహ్మణ మత తత్వ శాస్త్రానికి చెంపదెబ్బ. అన్యాయాన్నీ, అసమానతలనీ అనైతికంగానూ, అహేతుకంగానూ బలపరిచేది అసలు తత్వశాస్త్రమే కాదని అంబేడ్కర్ చెప్పకనే చెప్పాడు. అంబేడ్కర్ తాత్వికత దేవుడిలోనూ, శాస్త్రాల్లోనూ గాక ప్రజల జీవన విధానంలోనూ, సామాజికతలోనూ ఉంది. అంబేడ్కర్ తాత్వికతకూ, రాజకీయాలకూ, చివరకి మతానికి కూడా మూలం righteous social life లో ఉంది. అన్నిటికీ అదే ప్రామాణికమైనది. అందుకే, “Democratic form of government presupposes democratic form of society. The formal framework of democracy is of no value and would indeed be a misfit if there was no social democracy,” అంటాడు.

అంబేడ్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం

అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యమంటే అసమానతలు లేని సమాజం. మనుషులు స్వేచ్ఛగా జీవించే సమాజం. అదో సహజీవన సమాజం. ప్రజాస్వామ్యమంటే నైతిక సమాజాన్ని సృష్టించడం. అది హేతుబద్ధమైన సమాజం. దోపిడీ లేని సమాజం. బానిసత్వం లేని సమాజం. అణచివేయబడ్డవాళ్లు కూడా అధికారంలోకి వచ్చేటట్టు చూడటం. ప్రజాస్వామ్యమంటే communal majority (సామాజిక ఆధిక్య) పాలన కాదు. సమాజం చివర అంచున ఉన్నవాడు కూడా హక్కులని అందరితో సమానంగా అనుభవించడం. ప్రజాస్వామ్యమంటే ఒక మనిషి, ఒక విలువే కాదు. చట్టం ముందు అందరూ సమానులు మాత్రమేకాదు. మనిషితనాన్ని గుర్తించడం. ప్రతి మనిషిలో ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించడం. ప్రజాస్వామ్య మంటే మానవీయ మత సమాజం. ఒక గొప్ప సామాజిక సాంప్రదాయం. ప్రజ్ఞా, ప్రేమే కాదు. శత్రువుని కూడా ఆదరించే స్నేహతత్వం. అదో కుల రహిత సమాజం.

ప్రొఫెసర్ పెరికల కేశవ కుమార్
ప్రొఫెసర్ పెరికల కేశవ కుమార్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles