Friday, April 26, 2024

చిరస్మరణీయుడు శేషేంద్రశర్మ

  • ఒకే ఒక సినిమా పాట ముత్యాలముగ్గులో
  • జర్నలిజం, లాయర్ కాలేక కవిగా ఎదిగిన శిఖరం
  • కవిసేన నిర్మాత, మేనిఫెస్టో రచయిత
Seshendra Sharma, an unforgettable poet
మాశర్మ,
సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్

శేషేన్, శేషేంద్ర… అంటూ ఆత్మీయులు పిలుచుకుంటారు.శేషేన్.. బాగ రాసేన్ అని శ్రీశ్రీ అనేవాడు. గుంటూరు శేషేంద్రశర్మ అని ఎందరో కొలుచుకుంటారు. జ్ఞానపీఠ్ పురస్కారం అనగానే ఆయన్ని అందరూ తలచుకుంటారు. నోబెల్ నామినేషన్ ,జ్ఞాన్ పీఠ్ పురస్కారాలు త్రుటిలో తప్పిపోయాయి. ఆ బాధ ఆయనకు ఎంత ఉండేదో తెలియదు కానీ, ఆయన ప్రతిభ గురించి తెలిసినవారు ఎందరో ఇప్పటికీ ఎంతో బాధపడుతూ ఉంటారు. బాపు రూపొందించిన దృశ్యకావ్యం ముత్యాలముగ్గు. ఈ సినిమాకు  “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అనే అద్భుతమైన పాట శేషేంద్రశర్మ రాశారు. అదే ఆయన రాసిన తొలిపాట, చివరి సినిమా పాట. ఇంకా రాద్దామనుకున్నారు. ఆయన మనకు అందడు, అయనతో పాట రాయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుందంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. అలా,   తెలుగుసినిమా ఆ కలం నుండి ఎన్నో పాటలను పోగొట్టుకుంది.

జర్నలిజంలో మజిలీ

 శేషేంద్రశర్మ జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. అది తనకు చాలా ఇష్టమైన వృత్తి. మద్రాస్ లో లా చదివే సమయంలో, పార్ట్ టైమ్ గా కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేశాడు. తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చే “జనవాణి” పత్రికలో ఏరీకోరీ మరీ చేరాడు. తాను అప్పటికే రాసిన ‘సొరాబు’ అనే కావ్యం ఈ అవకాశాన్ని అందించింది. తాపీ ధర్మారావు శేషేంద్రకు వేసిన మొట్టమొదటి ప్రశ్న: సొరాబు రాసింది మీరేనా?. అవును అని చెప్పడంతో ఎంతో గౌరవించి కోరుకున్నట్లుగా 73రూపాయల జీతంతో జర్నలిస్ట్ గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ కావాల్సిందే అంటూ అప్పటి ఎం.పి. కోందండరామిరెడ్డి అప్పాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి శేషేంద్ర చేతిలో పెట్టేశాడు. దాంతో జర్నలిజం జీవితం అంతటితోనే ఆగిపోయింది. డాక్టర్ కావాలన్నది వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక. తను చదువుకున్న కాంబినేషన్ కుదరక అదీ తప్పిపోయింది. ఇలా… డాక్టర్, జర్నలిస్ట్, లాయర్ కాకుండా కవిగా మిగిలిపోయాడు. మహాకవిగా ఎదిగిపోయాడు. అక్టోబర్ 20 శేషేంద్రశర్మ పుట్టినరోజు. 1927 లో జన్మించిన ఈ మహనీయుడు 2007 లో 80వ ఏట ఈలోకం వీడి వెళ్ళిపోయాడు. ఎన్ టి రామారావు, శేషేంద్రశర్మ గుంటూరు ఏసీ కాలేజీలో సహాధ్యాయులు, బెంచ్ మేట్స్ కూడా. ఇంటిపేరు గుంటూరు.

కశ్మీరీ పండితుల వంశం

వీరు అసలు తెలుగువారే కారు. వీరి పూర్వీకులు కశ్మీర్ పండితులు. చాలా ఏళ్ళ క్రితం వీరి కుటుంబం తెలుగు ప్రాంతాలకు వలస వచ్చింది. అలా తెలుగులో కలిసిపోయారు. సంప్రదాయవాదులు, ఆధునికులు అందరూ ఆయన్ను ప్రేమిస్తారు. పద్య కవిత్వం-వచన రచనలోనూ సమప్రజ్ఞ కలిగినవాడు. బహుకవితా వల్లభుడే కాదు, బహుభాషా కోవిదుడు కూడా. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగులో గొప్ప పండితుడు. ఈయన కవితలు అనేక భారతీయ భాషల్లోకీ అనువాదమయ్యాయి. “నా దేశం -నా ప్రజలు” 2004లో నోబెల్ సాహిత్య పురస్కారం నామినేషన్ దాకా వెళ్ళింది. అందరూ బాగుండాలనే విశ్వమానవ దృష్టితో కవితా సృష్టి చేసిన విలక్షణ కవితామూర్తి. “విశ్వశ్రేయః కావ్యం” అనే ఆర్యోక్తిని ఆచరణలో పెట్టిన ఆదర్శప్రాయుడు శేషేంద్ర. విశ్వనాథ సత్యనారాయణ అంటే ఇష్టం.

రాయప్రోలు ప్రభావం

కానీ, రాయలప్రోలు సుబ్బారావు ప్రభావం తనపై చాలా ఎక్కువని చెప్పుకున్నాడు.కవిత్వంలో  అత్యద్భుతంగా శిఖర స్థానం అందుకొని అక్కడ కూర్చొని కవితా సామ్రాజ్యాన్ని ఏలినవాడు రాయప్రోలు సుబ్బారావు, తదనంతర కవులపై రాయప్రోలు ప్రభావం చాలా ఎక్కువ అని, ఒక ఇంటర్వ్యూలో శేషేంద్ర వివరించారు. భవ్యపద్య కవితావేశంలో కొప్పరపు కవుల పట్ల తనకు మక్కువ ఎక్కువని, వారి పద్యాలు కొన్ని వందలు తన నోటికి వచ్చని, ఒక సందర్భంలో గుంటూరు శేషేంద్రశర్మ తెలిపారు. శ్రీశ్రీని ఇష్టపడుతూనే, శ్రీరంగం నారాయణబాబు వైపు ఒకింత మొగ్గు చూపించాడు. నారాయణబాబు కవిత్వంలో చిక్కదనం ఎక్కువని “రుధిరజ్యోతి” కావ్యం దానికి ఉదాహరణగా నిలుస్తుందనే భావనలు శేషేంద్రకు ఉండేవి. వాల్మీకి, హర్షుడు, కాళిదాసుల కవిత్వాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన సాహిత్య స్ఫురణ్ మూర్తిత్వం శేషేన్ సొత్తు. వాల్మీకి రామాయణంలోని సుందరకాండకు, శ్రీహర్షుని నైషధానికి అద్భుతమైన వ్యాఖ్య కూడా రాశారు. “నైషధం విద్వదౌషధం”అంటారు. ఆ మర్మాలు తెలిసిన కవి శేషేంద్ర. జర్మనీ ఇండోలాజికల్  రీసెర్చ్ యూనివర్సిటీలో కాళిదాసు మేఘదూతానికి-వాల్మీకి రామాయణానికి ఉన్న సంబంధంపై ఒక వ్యాసం సమర్పించారు. “ఇద్దరు ఋషులు-ఒక కవి” అనే శీర్షికతో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసుల కవిత్వాను బంధాలపై మరో సందర్భంలో గొప్ప వ్యాసం రాశారు. ఉద్యోగంలో చేరిన తర్వాత జర్నలిజం పక్కకు వెళ్లినా, పత్రికలతో అనుబంధం కొనసాగింది.

తొలిరచన విశాలాంధ్రలో ప్రచురణ

విశాలాంధ్ర పత్రిక అప్పుడప్పుడే ప్రారంభం అవుతున్న తొలినాళ్ళల్లో శేషేంద్రశర్మ మొదటి రచన అచ్చయింది. అది ఒక పాట. అలా,  తొలి ముద్రణకు నోచుకున్నది ఒక పాట కావడం విశేషం. ఈ పాటలోని పంక్తులను తర్వాత, ఆధునిక మహాభారతంలోని ఆదిపర్వంలో చేర్చారు. తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్న సందర్బంగా రాసిన మరో పాట కూడా విశాలాంధ్రలోనే అచ్చయింది. కవితలు, పాటలు, పద్యాలు, వచన కవిత్వం, విమర్శలు, వ్యాసాలు మొదలు బహుముఖంగా సాహిత్య సృష్టి చేశారు. ఆయన రాసిన ఫ్రీవెర్స్ బాగా ప్రసిద్ధం. పద్యం నుండి మెల్లగా వచన కవిత్వంలోకి వచ్చినా సంప్రదాయ కవిత్వంపై రవ్వంత వ్యతిరేకతను ఎప్పుడూ పెంచుకోలేదు. తన భావాలను శక్తిమంతంగా మలచి చెప్పడానికి అనువుగా,  సందర్భోచితంగా రచనా ప్రక్రియ, శిల్పం మార్చుకున్నాడు. బాణుడు రాసిన కాదంబరిలో అద్భుతమైన కవిత్వాన్ని దర్శనం చేసుకున్నాడు. దండి వచన కవిత్వం పట్ల దండిగా ప్రేమను పెంచుకున్నాడు.

ఫ్రెంచ్ కవుల ప్రభావం

ఫ్రెంచ్ కవుల ప్రభావం కూడా శేషేంద్రపై ఉంది. సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్చవచ్చు.. అనే బలమైన నమ్మకం శేషేంద్రకు ఉంది. గుంటూరు శేషేంద్రశర్మ సృష్టించిన “కవి సేన మ్యానిఫెస్టో” చాలా ప్రసిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కు గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వం అంటే చాలా ఇష్టం. అందులో ఆధునిక మహాభారతం మరీ ఇష్టం. తను స్థాపించిన రాజకీయపార్టీకి “జనసేన” అని పేరు పెట్టుకోవడంలో, బహుశా శేషేంద్రశర్మ ” కవిసేన” ప్రభావం ఉందేమో అనిపిస్తోంది. భారతీయ కావ్యశాస్త్ర పరంపర, గ్రీకు, రోమన్ సాహిత్య పద్దతులు, పశ్చిమ దేశాల నుండి దిగుమతైన ఆధునిక సాహిత్య విమర్శ, మార్క్సిస్ట్ దృక్పథం -ఈ నాలుగింటి కలయికే ” కవి సేన మ్యానిఫెస్టో ” అని ఒక సందర్బంగా శేషేంద్రశర్మ వివరించారు. గజల్స్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. “చమత్కారికలు” అనే పేరుతో తెలుగులో రాశారు. “శేషేంద్రజాలం” శీర్షికలోఅవి ప్రచారమయ్యాయి.

పీడితుల పక్షాన నిలిచిన కవి

పద్యకవిత్వం రాసినా, ఋతుఘోష వంటి కవిత్వం రాసినా, పీడితుల పట్లనే నిల్చోవడం తన బాధ్యతగా భావించిన కవి శేషేంద్ర. మండే సూర్యుడు, గొరిల్లా, ప్రేమలేఖలు, సముద్రం నా పేరు  వంటి రచనలు ఎన్నో  చేశాడు. షోడశి-రామాయణం రహస్యాలు, కాలరేఖ, మబ్బుల్లో దర్బార్, సాహిత్య కౌముది.. ఇలా అసంఖ్యాకంగా సాహిత్య సృష్టి చేశాడు. భారత ప్రభుత్వం ” రాష్ట్రేంద్రు” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఘన గౌరవ సత్కారాలు పొందారు. సత్కావ్యాలు రచించారు. తన కవితా ప్రతిభతో నింగిని నేలను ఏకం చేశారు. కవిగా, సాహిత్యవేత్తగా ఆకాశమంత ఎత్తు ఎదిగారు. తన హృదయాన్ని భూమిపైనే నిలుపుకొని, భౌతికంగా ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ మనకు గొప్ప సాహిత్య సంపదను ఇచ్చి వెళ్లిపోయారు. గుంటూరు శేషేంద్రశర్మ స్థానం ఆధునిక సాహిత్య చరిత్రలో చిరస్మరణీయం. జరామరణాలకు  అతీతుడైన రససిద్ధుడు శేషేంద్రశర్మ.

శేషేంద్రశర్మపై శ్రీశ్రీ కవిత:

‘‘శేషేన్‌ శేషేన్‌

నీ పొయెమ్సు చూసేన్‌

పసందు చేసేన్‌

నీ ఋతు ఘోష నీ

ఛందస్సుల రోష్‌ణీ

మధుర మంజుల భాషిణి.

ఇంద్రా ఇందిరా!

ఎంచక్కని విందురా

ఇంకెక్కడ కందురా.

భేషైనా తర్జుమా

తేలికైన కర్జమా

నీది మంచి పద్యమా

లేక ఫ్రెంచి మద్యమా

కవిరేవ విజనాతి

కవిదేవ సుధాగీతి

శ్రీనాథుడి క్రీడల్లో

అల్లసాని వాడల్లో

కూడా దొరకని పదచిత్రం

ధుమాగా ఉంది ఇమేజి రమారమి కవుల సమాధి —

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles