Thursday, May 2, 2024

నాస్తికోద్యమ విప్లవ వీరుడు-పెరియార్

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడ శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరానివారు నడవగూడదని, ఆ చుట్టుపక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయడాలని అక్కడ సామాజిక కార్యకర్తలు కొందరు సత్యాగ్రహం చేశారు. ప్రభుత్వం వారినందరినీ జైల్లో పెట్టింది. మరికొంతమంది కార్యకర్తలు పెరియార్ దగ్గరికి వెళ్ళి విషయం వివరించారు. కేరళకు వచ్చి, తమ సత్యాగ్రహాన్ని కొనసాగించడమని అభ్యర్థించారు. విషయం గ్రహించిన పెరియార్ అక్కడికి వెళ్ళి సత్యాగ్రహం కొనసాగించారు. అప్పుడు ఆయన సత్యాగ్రహానికి దేశవ్యాప్తంగా గుర్తింపూ, పెద్దఎత్తున మద్దతూ లభించాయి. పైగా విరాళాలు కూడా వచ్చాయి. పెరియార్ సత్యాగ్రహానికి వస్తున్న స్పందన చూసి, అక్కడి పాలకులు తట్టుకోలేకపోయారు. వారు వెళ్ళి గాంధీజీని అభ్యర్థించారు. ఎలాగైనా సత్యాగ్రహాన్ని ఆపించమని కోరారు. వారి కోరిక మేరకు గాంధీజీ 9 మార్చి 1925న వైక్కోమ్ చేరుకుని, పెరియార్ ని కలిశారు. సత్యాగ్రహం విడిచి వెళ్ళాలని కోరారు. దానికి పెరియార్ గాంధీజీని ఈ విధంగా ప్రశ్నించారు: ‘‘గాంధీగారూ! సత్యాగ్రహం వదిలి వెళ్ళమంటున్నారు సరే – నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ వైక్కోమ్ వీధుల్లో కుక్కలు వెళుతున్నాయి. పందులు, పశువులూ వెళుతున్నాయి. గాడిదలూ వెళుతున్నాయి. ఇవేవీ సత్యాగ్రహం చేసే వాటి హక్కుల్ని పరిరక్షించుకోలేదే? కానీ మన సాటి మనుషులు మాత్రం వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేయాలా? పైగా సత్యాగ్రహం వదిలేసి వెళ్ళమని మీలాంటివారు చెప్పాలా? ఇదేమైనా బావుందా? కొంచెం ఆలోచించండి!’’-జవాబు చెప్పలేని గాంధీజీ కొంతసేపు మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ అన్నారు, ‘‘ఇవ్వాళ వీధుల్లో తిరగనిస్తే, రేపు గుళ్ళకే వస్తానంటారేమో – అప్పుడెలా?’’అని! మహాత్ముడిగా పిలవబడుతున్న గాంధీజీ ఖచ్చితంగా దళితవ్యతిరేకి అనే విషయం పెరియార్ కి స్పష్టమైంది. ఇదే విషయం బహిరంగంగా కూడా ప్రకటించారు. చివరికి ఎలాగైతేనేం వైక్కోమ్ వీధుల్లో శూద్రులూ, దళితులూ స్వేచ్ఛగా తిరిగే హక్కును పెరియార్ సాధించిపెట్టారు. అది దక్షిణ భారత దేశంలో – తొలి మానవహక్కుల విజయంగా చరిత్ర పుటలకెక్కింది.

పెరియార్, గాంధీ

దేశంలో అధిక సంఖ్యాకులైన బహుజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి సరైన విధానమేదీ లేదని, దానితో విభేదించి పెరియార్ బయటికి వచ్చారు. ‘ద్రవిడ కజగం’ స్థాపించారు. ద్రవిడ ఉద్యమానికి బీజం వేశారు. అది ‘స్వాభిమాన ఉద్యమ’మని (SELF RESPECT MOVEMENT)ప్రకటించారు. అందువల్ల ఆయనకు ద్రవిడ ఉద్యమ పితామహుడిగా గుర్తింపు లభించింది. స్వాభిమాన ఉద్యమంలో భాగంగా కొన్ని వేల కులవ్యతిరేక వివాహాలు జరిపించారు. ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే మహిళల తోడ్పాటు చాలా అవసరమని పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగమైన మహిళలకు పురుషులతో సమానమైన స్థాయిలో అవకాశాలుండాలన్నారు. స్త్రీలు స్వేచ్ఛకోల్పవడం, అణచివేతకు గురికావడం – వంటి వాటికి ముఖ్యకారణం మతవిశ్వాసాలు, దైవభక్తి అనీ, వాటిని వారు వదులుకుంటే భర్తలు దైవస్వరూపులుగా కాక, తోటి మనుషులుగా కనపడతారనీ అన్నారు. బానిస మనస్తత్వం వదిలినప్పుడే  పురుషాహంకారాన్ని ఎదుర్కోగలరని – పెరియార్ కుటుంబ సభ్యులతో ఆచరణాత్మకంగా ఉద్యమం సాగించారు. అందుకాయన ఒక సులభమైన వివరణ చ్చారు. అది ఇలా ఉంది: ‘‘పిల్లి నుండి ఎలుకకు స్వాతంత్ర్యం దొరుకుతుందా? యజమాని నుండి పనివాడికి – బ్రాహ్మణుల నుంచి బ్రాహ్మనేతరులకు ఎక్కడైనా మానవత్వం దొరుకుతుందా? అలాగే – పురుషుల నుండి స్త్రీలకు ఎప్పటికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు దొరకవు. అవి సంఘర్షించి సాధించుకోవలసిందే! తన పురుషుడు లేకుండా తను బతక లేనని – తను లేకుండా అతను బతకగలడని – ప్రతిస్త్రీ అనుకున్నంత కాలం స్త్రీపురుష సమానత్వం సాధ్యం కాదు’- అని అన్నారు పెరియార్. బ్రహ్మణులను దైవాంశసంభూతులుగా భావించకుండా, మామూలు మనుషులుగా భావిస్తే మనుషులంతా ఒక్కటే అనే భావనకు బలం చేకూరుతుంది. అటు బ్రాహ్మణేతరులు, ఇటు స్త్రీలు తమ తమ బానిస మనస్తత్వం విడనాడినప్పుడే సమాజంలో సమానత్వం సాధించగలం అని తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ఉద్బోధించారు – పెరియార్!  స్త్రీసమానత్వంకోసం ఇ.వి. రామసామి చేసిన పోరాటానికి 12 నవంబర్ 1938న ఏడువేల మంది మహిళలు మదరాసు (చెన్నై)లో పెద్ద ఊరేగింపుగా ఆయనను తీసుకువెళ్ళి, ఒక మహాసభలో ‘పెరియార్’ అనే బిరుదు ప్రదానం చేశారు. ‘పెరియార్ వర్థిల్లాలి’- అని నినాదాలు ఇచ్చారు. అప్పటి నుండి అందరూ రామసామిని ‘పెరియార్ గా వ్యవహరించాలని తీర్మానించారు. పెరియార్ అంటే ఎండిపోకుండా నిరంతరం సజీవంగా పారుతూ ఉండేనదీప్రవాహం – అని అర్థం. మహాత్ముడనే భావన కూడా అందులో ఉంది. ఇరోడ్ వెంకటప్పరామసామి నాయకర్ గా పుట్టిపెరిగిన వ్యక్తి-కులనిర్మూలనలో భాగంగా ‘నాయకర్’ అనే కులసూచికను ఆయనే వదిలేశారు. మిగిలిన ఇ.వి. రామసామిని ప్రజలు పెరియార్ గా గుర్తించుకున్నారు. గుర్తు-ఉంచుకున్నారు.

Also read: దేశాన్నిఅబద్ధాల ప్రచార కేంద్రంగా మార్చకండి!

‘‘వైజ్ఞానికి అవగాహన తప్పనిసరి’’-అని ఉద్బోధించిన పెరియార్, యూరప్, రష్యా, మలేసియా దేశాలు పర్యటించి తన భావజాలాన్ని ప్రచారం చేశారు. 1938లో హిందీ వ్యతిరేకోద్యమం నడిపారు. 1939-44 మధ్య కాలంలో జస్టిస్ పార్టీ అధినేతగా ఉన్నారు. పలురంగాలలో పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను ఐక్యరాజ్య సమితి(UNESCO) గుర్తించి భారతప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసాపత్రాన్ని అందించింది. అది చాలా విలువైనది. ఎందుకంటే అందులో ఉన్న విశేషణాలు చాలా గొప్పవి. ‘‘ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్ అనీ,నూతన యుగానికి ప్రవక్త అని, సంఘసంస్కరణోద్యమానికి పితామహుడని, మూఢనమ్మకాలకీ, అర్థరహిత సంప్రదాయాలకీ బద్ధశత్రువనీ, అజ్ఞాన విచ్ఛేదకుడని’’-ఆ ప్రశంసా పత్రంలో యునెస్కో కీర్తించింది.  అంటే ఆయన నడిపిన ఉద్యమాల ప్రభావం ప్రపంచ వ్యాప్తమైంది. ఈ దేశంలో సమానత్వం రావాలంటే దోపిడీవర్గ నిర్మూలన జరగాలి.అది జరగాలలంటే కులనిర్మూలన జరగాలి. సాంస్కృతిక విప్లవం విజయవంతమైతే కులనిర్మూలన సాధ్యమౌతుంది. అందుకోసం సామాజిక ఉద్యమకారులు పెరియార్ ని ఆదర్శాం తీసుకుని, నాస్తికత్వాన్ని ఆయుధంగా వాడుకుంటూ వైజ్ఞానిక అవగాహనతో ఉద్యమాలు చేయాల్సి ఉంది. మొదటిసారి రాజ్యాంగ సవరణచేయించి రిజర్వేషన్లు కొనసాగే విధంగా పెరియార్ చేసిన కృషి ఈ దేశంలోని బహుజనులకు స్ఫూర్తిదాయకం. నవంబర్ 26ను ‘‘కులనిర్మూలన దినం’గా ప్రకటించి బ్రాహ్మణ హోటళ్ళ బోర్డులపైనుండి ‘బ్రాహ్మణ’ అనే పేరును తొలగించే ఉద్యమం చేసి మానవత్వ భావనను తీసుకొచ్చారు. కులవ్యవస్థను, అంటరానితనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి ప్రతులను తగులబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల చేత రాముని చిత్ర పటాలను దగ్ధం చేయించారు. రాముడు, సీత, లక్ష్మణుల దిష్టిబొమ్మల్ని తగులబెట్టించారు. వినాయక విగ్రహాలు పగులగొట్టించారు. వినాయక విగ్రహాల విషయమై ఒకరు కోర్టుకెక్కారు. న్యాయమూర్తి ముందు పెరియార్ ధైర్యంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. నిమజ్జనం పేర వినాయకుడి విగ్రహాల్ని మంచినీటి సరస్సుల్లో వేసి జనం కాలుష్యం పెంచుతున్నారని, అందుకు విరుద్ధంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా తాను విగ్రహాల పగులకొట్టిస్తున్నాననీ-నీటిలో వేసినా, పగులగొట్టినా  ఫలితం ఒకటేనని చెప్పారు. సంతృప్తి చెందిన న్యాయమూర్తి కేసు కొట్టేశాడు. ప్రజలు తాకితేనే విగ్రహాలు మైలపడితే అలాంటి దేవుళ్ళు మనకెందుకూ? అని ప్రశ్నించిన పెరియార్, అలాంటి విగ్రహాల్ని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలి. లేదా చెరువుగట్టున పడేస్తే అది బట్టలు ఉతుక్కోవడానికైనా పనికొస్తుంది – అనే సూచన చేశారు.

అన్నాదురై, పెరియార్

పెరియార్ ఉద్యమ కృషి ఫలితంగా 1967లో తమిళనాడులో బహుజనులరాజ్యం ఏర్పడింది. ‘దేవుడులేడు – లేనేలేడు’ అనే నినాదాలు సభల్లో తమిళనాడు అంతటా విరివిగా వినిపించేవి. ఆ విషయం మీద ధైర్యంగా మాట్లాడగలిగేవారు-అంటే పెరియార్ బోధనల ప్రభావం ఎంత బలంగా పడిందో అర్థం చేసుకోవాలి. తర్వాత కాలంలో వచ్చినవారు పెరియార్ విధానాలను కొనసాగించకపోవడం వల్ల మళ్ళీ అక్కడ మనువాదులు బలబడ్డారు. పెరియార్ కాలంలోనే స్వాభిమాన్ పెళ్ళి చట్టం అమలయింది. నాస్తిక, హేతువాద వైజ్ఞానిక ఉద్యమాల స్ఫూర్తితో పెరియార్, ఫూలే, అంబేడ్కర్  ల బోధనల ప్రభావంతో జీవిస్తున్న నేటితరం, ఇప్పటికీ సామాజిక న్యాయం కోసం తల్లిడిల్లిపోతోంది. అయితే నిరాశపడకుండా మరో ముందుడుగు వేసి తన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం లభించి ఏడు దశాబ్దాలు దాటినా, ఇంకా మనువాదు వారసులు పరిపాలనా యంత్రాగాన్ని తమగుప్పిటలో ఉంచుకొని, వ్యవస్థల్ని, మానవీయ విలువల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు – పెరియార్ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, సమసమాజ స్థాపనకోసం ఉద్యమిస్తూనే ఉండాలి. సంఘర్షణ ఆగిపోకూడదు. యుద్ధం ఆగిపోకూడదు. మనువాద అనాలోచిత, అహంకారపూరిత అసమర్థ ప్రభుత్వాల నుండి ప్రజలకు తమని తామే రక్షించుకుంటూ ఉండాలి. మానవీయ విలువల్ని పరిరక్షించే, వైజ్ఞానిక దృక్పథంగల ప్రభుత్వాలకోసం ప్రజలు కృషి చేస్తూనే ఉండాలి!

Also read: ప్రపంచ నాస్తిక సభలు జరిపిన – గోరా

(సెప్టెంబర్ 17 పెరియార్ జన్మదినం)

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles