Thursday, May 2, 2024

నేపాల్ లో పార్లమెంటు రద్దు

  • భగ్గుమన్న ప్రతిపక్షం
  • రద్దు రాజ్యాంగ విరుద్ధమన్న ప్రచండ
  • ఓలి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

హిమాలయ దేశం నేపాల్ రాజకీయల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా పార్టీ అధ్యక్షుడు, ప్రధాని కేపీ శర్మ ఓలికి పార్టీ ఎగ్జిక్చూటిక్ ఛైర్మన్ ప్రచండకు మధ్య నెలకొన్న విభేదాలు తారాస్తాయికి చేరినట్లు తెలుస్తోంది.  ఓలి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పరిపాలనలో పూర్తిగా విఫలమైనందున పదవికి రాజీనామా చేయాలని ప్రచండ డిమాండ్ చేశారు. వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు వర్గాలు పలుమార్లు చర్చలు జరిపినా పలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో విభేదాలు ముదిరినట్లు సమాచారం. మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటును రద్దు చేయాలని తీర్మానించారు. మంత్రి మండలి సమావేశం, పార్లమెంటును రద్దుకు ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతిపాదన చేయడం, రాష్ట్రపతి విద్యాదేవి ఆమోద ముద్ర వేయడం ఒక్క రోజులు అత్యంత వేగంగా జరిగిపోయాయి. వచ్చేఏడాది ఏప్రిల్ 30న తొలిదశ,  మే 10న రెండో దశలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్రపతి విద్యాదేవి వెల్లడించారు. ఓలి ఎత్తుగడను ఊహించని ప్రచండ వర్గం, ప్రతిపక్షం ఒక్కసారిగా ఖంగుతిన్నాయి.

ఓలి నిర్ణయంపై వెల్లువెత్తిన విమర్శలు

ప్రధాని ఓలి నిర్ణయం అప్రజాస్వామికమని రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ కమ్యూనిస్తు పార్టీ అధికార ప్రతినిథి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నపుడు ప్రధాని పార్లమెంటును రద్దు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నిపుణులు చెబుతున్నారు.  

పదవినుంచి తప్పించేందుకు కుట్ర

పార్లమెంటు రద్దుకు పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.  పార్లమెంట్ స్పీకర్, ప్రతిపక్ష పార్టీ నాయకుడి అంగీకారంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సంస్థల అధిపతులను, సభ్యులను నియమించే అధికారం ప్రధానమంత్రికి కట్టబెడుతూ ఓలి ఆర్డినెన్సును తీసుకొచ్చారు. వివాదస్పద ఆర్డినెన్సును  ప్రచండ వ్యతిరేకించారు. అయితే ఆర్డినెన్సు ను రద్దుచేయడానికి ఓలి ఒప్పుకున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు రద్దుకు ఓలి సిఫారసు చేయడాన్ని ప్రతర్థి వర్గం జీర్ణించుకోలేకపోతోంది.

భారత్ పై ఓలి అక్కసు

చైనా అండతో నేపాల్ కవ్పింపులకు దిగుతోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ కయ్యానికి కాలుదువ్వుతోంది. సాక్షాత్తూ ప్రధాని ఓలి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో కెక్కుతున్నారు. ఇటీవలే రాముడు పుట్టింది నేపాల్లో అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అసలైన అయోధ్య నేపాల్లో ఉందన్నారు. ప్రధాని పదవినుంచి తనను తప్పించేందుకు భారత్ కుట్రలకు పాల్పడుతోందని ఓలి ఆరోపిస్తున్నారు. జమ్ము కశ్మీర్, లద్దాఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ భారత్ సరికొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మ్యాప్ లో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను భారత్ తన ప్రాంతాలుగా చూపించిందని అవి నేపాల్ కు చెందిన ప్రాంతాలని ఓలి అక్కసు వెళ్లగక్కారు. ఆ ప్రాంతాలను నేపాల్ లో చూపిస్తూ ప్రధాని ఓలి కొత్త మ్యాప్ ను విడుదల చేశారు. దీంతో భారత్ నేపాల్ ల మధ్య వివాదం మరింత రాజుకుంది. రాజకీయంగా తనకు ఎదురవుతున్న సవాళ్లను కప్పిపుచ్చుకునేందుకే ఓలి పార్లమెంటును రద్దు చేశారని ప్రచండ ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles