Wednesday, May 1, 2024

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీఆర్

  • డాక్టర్ ఎంవి రమణారెడ్డి సాహిత్య సదస్సులో విశ్వరూపదర్శనం

ఏడుపదులు మించిన నా జీవితంలో ఎందరో వ్యక్తులు తారసపడ్డారు. కవులూ, రచయితలూ, పాత్రికేయులూ, సంపాదకులూ, రాజకీయ నాయకులూ, కార్మిక నాయకులూ, వైద్యులూ, న్యాయవాదులూ చాలా మందితో నాకు పరిచయం. వారితో మాట్లాడి వారి గురించి రాసే అవకాశం లభించింది. ఇంతమందినీ ఒకే వ్యక్తిలో చూడటం డాక్టర్ ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్ )ని కలుసుకున్నప్పుడే సంభవించింది. ఇన్ని అవతారాలూ ఒకే వ్యక్తిలో సహజీవనం చేయడం సాధ్యమా అని ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి మరో వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అని అన్వేషిస్తే లేనేలేరని సమాధానం వచ్చింది.  తిరుపతి శాసనసభ్యులూ, చిరకాల మిత్రులూ భూమన కరుణాకరరెడ్డి ఒక రోజు ‘సాక్షి మీడియా గ్రూప్’ ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న నాకు ఫోన్ చేసి  డాక్టర్ ఎంవీఆర్ ని పరోక్షంగా పరిచయం చేశారు. ఆయన నన్ను కలుసుకుంటారని చెప్పారు. అంతకంటే ఆసక్తికరమైన అంశం ఏముంటుందని అనుకున్నాను. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ మొదటి భాగం ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ధారావాహికంగా ప్రచురించడానికి ఆయనతో సమావేశం దారితీసింది. అంతకంటే ముఖ్యంగా ఒక అరుదైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కల్పించింది.

సాహిత్య సదస్సు

డాక్టర్ ఎం. వి. రమణారెడ్డి సాహిత్య సదస్సు ఆదివారం (10 జనవరి 2021) ఉదయం నుంచి సాయంత్రం వరకూ అంతర్జాల (జూమ్) సభ రూపంలో జరిగింది. చికాగో సాహితీ మిత్రులు, వేమన అధ్యయన, అభివృద్ధి కేంద్రం సంయుక్తంగా ఈ సభ నిర్వహించాయి. నన్ను ముఖ్య అతిధిగా, భూమన కరుణాకరరెడ్డిని ప్రధాన అతిధిగా ఆహ్వానించారు వేమన కేంద్రం నిర్ర్వాహకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరనాథ్ రెడ్డి. మెట్టుపల్లి జయదేవ్ ప్రారంభస భను సమన్వయం చేశారు. చికాగో సాహితీ మిత్రుల తరఫున ప్రకాశ్ స్వాగతం చెప్పగా, వాసంతి వందన సమర్పణ చేశారు. ఎంవీఆర్ రచించిన 13 పుస్తకాలపైన సమీక్షకులతో హరినాథరెడ్డి మాట్లాడించారు.

dr mv ramana reddy who has intelligence with versatility

అసాధారణ వ్యక్తిత్వం : కరుణాకరరెడ్డి

కరుణాకరరెడ్డి ఎంవీఆర్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. ‘పాపియాన్’ ను ఎంవీఆర్ తెలుగులోకి ‘రెక్కలు చాచిన పంజరం’ పేరుతో అనువదించిన విషయం ప్రస్తావించి, ఆ నవల తనను ఎంతగా ప్రభావితం చేసిందో వివరించారు. రాత్రిపొద్దుపోయేవరకూ చదవుతూ  ఉండటం ఎంవీఆర్ ని చూసే నేర్చుకున్నాననీ, ఎమర్జెన్సీ కాలంలో జైలులో ఉన్నప్పుడు అర్ధరాత్రి లైట్లు వేసి చదువుతూ ఉండటం తనతో జైలులో ఉన్ కె.వి. రమణారెడ్డి వంటి వారికి ఇబ్బంది కలిగించేదనీ గుర్తు చేసుకున్నారు. ఎంవీఆర్ ను అసాధారణమైన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా, ఉద్యమకారుడిగా, కవిగా, రచయితగా అభివర్ణించి అభినందించారు. ప్రారంభ సభలో నేనూ మాట్లాడాను కానీ చెప్పదలుచుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పలేకపోయాననే అసంతృప్తి మిగిలిపోయింది. అందుకే ఈ వ్యాసం.

dr mv ramana reddy who has intelligence with versatility

సంఘర్షణాత్మకమైన జీవితం

ఎంవీఆర్ ది వైవిధ్యభరితమైన, సంఘర్షణాత్మకమైన జీవితం. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి, పుట్టిపెరిగిన ప్రొద్దుటూరులో క్లినిక్ పెట్టుకొని పేదల వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే అన్ని రకాల పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారింది. చదవడమే కాకుండా ఆలోచించడం, విభిన్నంగా తర్కించడం, వ్యాఖ్యానించడం అలవడింది. చిన్నతనం నుంచి తన విశ్వాసాలకు కట్టుబడి, ఏ పార్టీకి కానీ, నాయకుడికి కానీ గొడుగుపట్టకుండా, తలవంచకుండా సర్వస్వతంత్రంగా ఉంటూ చైతన్యశీలమైన నాయకుడిగా కొనసాగడం విశేషం. ఒక వైపు వైద్యం, కార్మికోద్యమం, రాయలసీమ ఉద్యమం, హత్యానేరంపైన అత్యున్నత న్యాయస్థానం వరకూ విచారణ, చీటికీమాటికీ అరెస్టులు, జైలు జీవితం, ఎన్నికలలో పోరాటం- ఇవన్నీ చేస్తూనే నిరవధికంగా సాహిత్య వ్యాసంగం కొనసాగించడం ఎంవీఆర్ ని ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ఆయన జీవితంలో మొదటి నుంచి ఇప్పటిదాకా సమాంతరంగా సాగిన స్రవంతులు రాయలసీమ ఉద్యమం, రచనా వ్యాసంగం. ఈ రెండింటినీ ఆయన ఎన్నడూ విస్మరించలేదు. విరమించలేదు.

ఎన్ టి ఆర్ తో విభేదాలు

వైద్యుడిగా, కార్మికనాయకుడిగా ఉండగానే ఎన్. టి. రామారావు ఆహ్వానాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి నుంచి గెలుపొందారు. ఎంఎల్ఏగా గెలిచిన ఏ రాజకీయ నాయకుడైనా సర్వసాధారణంగా మంత్రి పదవికోసం ప్రయత్నిస్తాడు. కానీ రాయలసీమ ప్రయోజనాలకోసం ఎన్ టిఆర్ వంటి కొండంత నాయకుడితో ఎంవీఆర్ విభేదించారు. ఆ ధిషణాహంకారినే ధిక్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 800 టీఎంసీల కృష్ణాజలాలు కేటాయిస్తే అందులో 350 టీఎంసీలు రాయలసీమకు ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రాయలసీమవాసులకు ఇవ్వాలనీ కోరుతూ ఎన్టీఆర్ కి ఎంవీఆర్ లేఖ రాశారు. 

రాయలసీమకు నీటికోసం డిమాండ్

తెలుగుగంగ కాలువ ద్వారా నీటిని మద్రాసు నగరానికి తీసుకొని వెళ్ళే ముందు రాయలసీమకు సాగునీరు ఇవ్వాలన్నది ఆయన వాదన. రాయలసీమ ప్రయోజనాల విషయంలో ఆయన ఎన్టీఆర్ నే కాదు ఎవరినైనా ధిక్కరించడానికి వెనకాడరు. రాయలసీమలో కరువు, దారిద్ర్యం శాశ్వతంగా నివారించాలని కోరుతూ 1 జనవరి 1985న నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఇరవై రెండు రోజుల దీక్షాకాలంలో రాయలసీమలో పర్యటించి సభలు నిర్వహించి వాటిలో ప్రసంగించారు. నిరాహారదీక్షలో ‘కూర్చున్న’ నాయకుడి దగ్గరికే ఇతర నాయకులూ, ప్రజలూ రావడం ఆనవాయితీ. కానీ నిరశన దీక్ష చేస్తున్న నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రసంగాలు చేయడం అరుదైన విషయం. చివరికి ఎన్ టి రామారావు దిగివచ్చారు. ఆయన పనుపున నాటి సహకార మంత్రి కరణం రామచంద్రరావు ఆరు అంశాలకు అంగీకరిస్తూ ఒక అంగీరాన పత్రం రాసి, దాన్ని స్వయంగా ఎంవీఆర్ కు అందజేసి, ఆయన దీక్షను విరమింపజేశారు. ఆ లేఖలోని ఆరు అంశాలూ ఇవి:  1) కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాలలోని దుర్భిక్ష ప్రాంతాలకు తరలించి అవసరమైన నీటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది (అప్పటికి జరగలేదు). 2)రాయలసీమకు అదనంగా రాష్ట్ర బడ్జెట్ లో 22.4 శాతం కేటాయించబడుతుంది(ఇది ఎన్నడూ జరగలేదు). 3) సుందరేశన్ ఏకసభ్య కమిటీ రిపోర్టును 6 నెలల లోపలగానీ, వీలైతే అంతకంటే ముందుకానీ ప్రభుత్వ ఆమోదం పొంది, ఆరు సూత్రాల అమలులో అవకతవకలను ఆరు మాసాలలోగా సరిచేయగలము (సరికాలేదు). 4) రాయలసీమలో తగిన ప్రాంతంలో 250 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పుతాము (ముద్దనూరులో థర్మల్ స్టేషన్ నెలకొల్పారు). 5) క్షామపీడిత ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో కార్పస్ ఫండ్ చెల్లింపు అవసరం లేకుండా జూనియర్, డిగ్రీ కళాశాలలను నెలకొల్పడాన్ని అనుమతిస్తాము. 6)వెనుకబడిన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి అన్ని కార్యక్రమాల రూపకల్పన, అమలు బాధ్యతను ప్లానింగ్ బోర్డుకు అప్పగిస్తాము.

టీడీపీకి 1985లో రాజీనామా చేసిన తర్వాత ఇండిపెండెంటుగా ఎంవీఆర్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తూ, ఓడిపోతూనే వచ్చారు. ఆయనకు వచ్చే 20-25 వేల ఓట్లు మాత్రం ఇతరులకు పడేవి కావు. తనను అభిమానించే  ఆ పాతిక వేల మందికోసం పోటీ చేసేవారు. స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలో ఉండేవారు. స్వతంత్ర రాజకీయాలనే ఆచరించేవారు.

పుట్టపర్తికి ఏకలవ్య శిష్యుడు

డెబ్బయ్ ఎనిమిదేళ్ళ కిందట ప్రొద్దుటూరులో వ్యాపార కుటుంబంలో జన్మించిన రమణారెడ్డిపైన గడియారం రామకృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్య ప్రభావం బలంగా ఉన్నది. ‘ఈ ఏకలవ్య శిష్యుడికి పుట్టపర్తివారు ద్రోణాచార్యుడు’ అని ‘శ్రీశ్రీతో ఒక రోజు’ అనే శీర్షికతో రాసిన  వ్యాసంలో ఎంవీఆర్ రాసుకున్నారు. చదువులో బాగా రాణించారు.  చిన్నతనంలోనే ప్రతిభావంతుడైన నాయకుడు కావడంతో ఆయన పట్ల ఈర్ష్యాద్వేషాలతో ప్రత్యర్థులు  రగిలిపోయేవారు. ఆయన పైకి రాకుండా గిట్టనివాళ్లు అడ్డుకున్నారని సోదాహరణంగా చెప్పవచ్చు. అయినప్పటికీ ఆయన పోరాటం విరమించలేదు. జోహుకుం అని చేతులు కట్టుకోలేదు. శిరస్సు వంచకుండా, కత్తి దించకుండా స్వతంత్రంగా తనదైన శైలిలో కవాతు చేస్తూనే ఉన్నారు. చాలా  సంవత్సరాల ఖడ్గవిన్యాసం తర్వాత కత్తి ఒరలో పెట్టి కలానికి పని చెప్పి సాహిత్యానికే పూర్తిగా అంకిమైపోయారు.

రాయలసీమ హక్కులే పరమావధి

ఎంవీఆర్ మౌలికంగా మనిషులను ప్రేమించారు. ఎవరు అన్యాయానికీ. పీడనకూ గురి అవుతే వారి పక్షాన నిలిచారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. అక్షరయానం సాగించారు. సున్నిత మనస్కుడు. సంస్కారవంతుడు. నిజాయతీపరుడు. అటువంటి మానవీయ విలువలు ఉన్న వ్యక్తి ప్రత్యర్థులను హత్య చేయిస్తారని కానీ హత్యారాజకీయాలు సాగిస్తారని కానీ చాలామంది లాగే నేనూ నమ్మడం లేదు. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోగల నైపుణ్యం కలిగిన వ్యక్తులు రాజకీయాలలో దండిగా ఉన్నారు. వారు నిరపరాధులను దోషులుగా నిరూపించగలరు. దోషులను నిరపరాధులుగా విడిపించగలరు. రాజకీయంలో పైచేయి సాధించడం కోసం ఏమి చేసినా తప్పులేదన్నది వారి సిద్ధాంతం. న్యాయస్థానాలు తమకు అందుబాటులోకి వచ్చిన సాక్ష్యాధారాలు అనుసరించి తీర్పులు ఇస్తాయి కానీ సమస్త సాక్ష్యాధారాలనూ సేకరించవు. ఆ పరిమితులకు లోబడే న్యాయస్థానాలు వెలువరించే తీర్పులు ఉంటాయి.

అక్షరయానం

ఎంవీఆర్  రాజకీయాలు ఈ సదస్సులో చర్చనీయాంశం కాదు. ఆయన అక్షరయాత్రపైనే సమీక్ష. ఎంవీఆర్ సాహిత్య వ్యక్తిత్వంలోని వైవిధ్యం గురించి పరిశీలించే ముందు  ఎంబీబీఎస్ చదవుకొని పేదల వైద్యుడిగా కుదురుకున్న  యువకుడు కార్మికోద్యమంలో నిలదొక్కుకోవడం కోసం ఎల్ఎల్ బీ చదవడం చెప్పుకోదగిన అంశం.  లెక్కలలో పరిశోధన చేసి, పీహెచ్ డీ పట్టా పొంది,  కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసిన బాలగోపాల్ పౌరహక్కుల నేతగా పరిణామం చెందిన తర్వాత చట్టంతో పనిపడి ఎల్ ఎల్ బీ చదివి కోర్టులో ప్రాక్టీసు చేయడానికి ముందే ఎంవీఆర్ అటువంటి  పనే చేశారు. ఇద్దరికీ మరో పోలిక కూడా ఉంది. వ్యక్తి హననం సిద్ధాంతంతో విభేదించి మావోయిస్టు ఉద్యమానికి బాలగోపాల్ దూరం కావడానికి చాలా కాలం ముందే నక్సైలైట్ సిద్ధాంతానికి ఎంవీఆర్ దూరమైనారు.

శ్రీశ్రీతో వింత అనుభవం

మహాకవి శ్రీశ్రీని అభిమానించిన ఎంవీఆర్ కి శ్రీశ్రీతో వింత అనుభవం ఉంది.  1970 ప్రారంభంలో ‘రచయితలకు సవాల్ ’ అంటూ విశాఖపట్నంలో ఒక కరపత్రం వెలువడింది. అది సరిగ్గా శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంలో అక్కడ తలపెట్టిన సన్మానాన్ని ప్రస్తావిస్తూ రాసింది. ఆ కరపత్రానికి ప్రేరణ అప్పుడు సాగుతున్న శ్రీకాకుళం సాయుధ పోరాటమేనని నాటి ప్రభుత్వం భావించింది. అది నిజమే. మహకవిని  విశాఖపట్టణం వెళ్ళనీయకుండా, షష్టిపూర్తి ఉత్సవాలలో పాల్గొనకుండా నిరోధించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నించింది. హైదరాబాద్ లోనే శ్రీశ్రీకి ఒక సన్మానం చేస్తున్నట్టు ప్రకటించింది. దాన్ని అడ్డుకోవడానికి ఎంవీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. అజ్ఞాతవాసంలో ఉన్న దశలో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లు హైదరాబాద్ మైసూర్ కేఫ్ లో బస చేసిన ఎంవీఆర్ గదిలో శ్రీశ్రీని వదిలిపెట్టి ఎవరో తరుముతున్నట్టు వెళ్ళిపోయారు. అది 3 జులై 1970. మరుసటి రోజు విప్లవ రచయతల సంఘం ఆవిర్భావాన్ని ప్రకటించేవరకూ యుగకర్తతో ఎంవీఆర్ ఉన్నారు. దాదాపు పది గంటలు శ్రీశ్రీని వింటూ, ఆయన సాహితీవిశ్వరూపం కంటూ గడిపిన ఎంవీఆర్ ఆ నాటి అనుభవాలను వ్యాసంగా రాశారు.

విప్లవ రచయితల సంఘం

ఎంవీఆర్ విప్లవరచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. తన వ్యక్తిత్వం పట్ల తనకు అమితమైన గౌరవం ఉన్న వ్యక్తి విరసం వంటి సంస్థలలో కొనసాగడం కష్టం అని భావించారు. వరవరరావుతో విభేదాలు వచ్చాయి. ఉద్యమంలో ప్రమేయం (ఇన్వాల్వ్ మెంట్) ఉండాలని వరవరరావు వాదన. సిద్ధాంతంపట్ల అంకితభావం (కమిట్ మెంట్) ఉంటే సరిపోతుందని ఎంవీఆర్ భావన.  పదేళ్ళపాటు క్రియాశీలకంగా ఉండి తర్వాత పైగంబర కవులతో పాటు తాను కూడా విరసం నుంచి తప్పుకున్నారు. కొడవటికంటి కుటుంబరావు సైతం ఎంవీఆర్ లైన్ తోనే ఏకీభవించారు.

ఖమ్మం విరసం సభలు

అన్నట్టు ఖమ్మంలో జరిగిన విరసం మహాసభల నిర్వాహకులలో నేనూ ఒకడిని. అప్పటికే మా స్వగ్రామం తల్లాడలో మావో లైబ్రరీ ఒకటి పెట్టాం. గతితార్కికభౌతికవాదంపైన క్లాసులు నడిపాం. సొంత ఊరిలోనే, చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా కొంతకాలం పని చేశాను. ఆ రోజుల్లోనే విరసం సభలు జరిగాయి. ఆ సభలకు ఎంవీఆర్ హాజరైనారు. మా దృష్టి అంతా శ్రీశ్రీ, కొడవటికంటి, రాచకొండ, కె. వి. రమణారెడ్డి, చలసాని ప్రసాద్, కృష్ణాబాయి, వేదికపైన ఉన్న ఇతరులపైనే ఉండేది. జల్లుపడుతుంటే ప్లకార్డు పట్టుకొని ప్రదర్శనలో శ్రీశ్రీ వెనకే నడవడం మరచిపోలేని జ్ఞాపకం. విరసంలో సభ్యత్వం తీసుకోకపోయినా శ్రీశ్రీ అంటే విపరీతమైన అభిమానం. మిత్రులతో కలసి సభలను జయప్రదంగా నిర్వహించాం. ఆ తర్వాత ఎవరి దారి వారిది.

బహుముఖీనుడు

కరపత్రరచయితగా (బసిరెడ్డిపై శరసంధానం), కవిగా, నవలా రాచయితగా, అనువాదకుడిగా, వ్యాకరణ రచయితగా, సంపాదకుడిగా, వ్యాసకర్తగా బహుముఖీనంగా సాగింది ఎవీఆర్ సాహితీప్రస్థానం. జాను తెలుగు, సులభగ్రాహ్యమైన శైలి ఆయన ప్రత్యేకత. ‘అధ్యాయం’ బదులు ‘గనుపు’ అని రాయడం తెలుగు నుడికారం పట్ల ఆయనకున్నప్రేమ, పట్టింపునకు నిదర్శనం. మేధావులకోసం తాను రచనలు చేయలేదనీ, సామాన్యులకు అర్థం కావాలన్నదే తన ఆరాటమనీ చెప్పారు. పాత్రికేయుల విధి సైతం అదే.

Also Read : డా. ఎం.వి. రమణారెడ్డి సాహిత్య సదస్సు

రాయలసీమతో సాన్నిహిత్యం

రాయలసీమ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి నాకూ ఒక అవకాశం వచ్చింది. 1975 నుంచీ 1979 వరకూ నేను బెంగళూరులోని ఇండియన్ ఎక్సెప్రెస్ గ్రూపులో ఆంధ్రప్రభ ఉపసంపాదకుడిగా పని చేశాను. రాయలసీమ ప్రాంతానికి ‘ఆంధ్రప్రభ’ను బెంగళూరులోనే ముద్రించి పంపిణీ చేసేవారు. నాగరాజు తర్వాత పొత్తూరి పుల్లయ్య వార్తా సంపాదకులుగా బెంగళూరులో చేరిన తర్వాత  నన్ను తరచుగా రిపోర్టింగ్ కి పంపించేవారు. చిక్కమగళూరు ఉపఎన్నిక సందర్భంగా ఆ ప్రాంతంలో పర్యటించి, ఇందిరాగాంధీ, వీరేంద్రపాటిల్ విజయావకాశాలపైన రిపోర్ట్ చేశాను. నాటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ ను ఇంటర్వ్యూ చేశాను. రాయలసీమ జిల్లాలలో విస్తృతంగా పర్యటించేవాడిని. ముఖ్యంగా అనంతపురం, కడప జిల్లాలలకు అనేక సార్లు వెళ్ళాను. రాయలసీమ సమస్యలపై రాజకీయ నాయకులతో చర్చించాను. ఎంవీఆర్ అప్పట్లో ఇంకా రాజకీయాలలోకి పూర్తిగా రాలేదు. శ్రీబాగ్ ఒప్పంద పత్రం విడుదలైన 48 ఏళ్ళ తర్వాత వచ్చిన  ‘రాయలసీమ కన్నీటిగాథ‘ ఒక ప్రామాణిక రచన. బెంగళూరు వదిలిన తర్వాత ముప్పయ్  ఏళ్ళకు హెచ్ ఎం టీవీ ప్రధాన సంపాదకుడిగా 2009-10 లో ‘ఆంధ్రప్రదేశ్ దశ-దిశ’ చర్చాగోష్ఠిని రాయలసీమ నాలుగు జిల్లా కేంద్రాలలో (చిత్తూరు సభ మాత్రం తిరుపతిలో) నిర్వహించినప్పుడు కూడా రాయలసీత వెతల గురించి అనేకమంది వక్తలు మాట్లాడారు. రాయలసీమకు జరిగిన అన్యాయం దేశంలో ఏ ప్రాంతానికీ జరగలేదనే ఎంవీఆర్ వాదనతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను.

తెలంగాణకూ, రాయలసీమకూ దగ్గరి పోలికలు ఉన్నాయి. రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడే సమయంలో ఎంవీఆర్ ‘ ఆ నాలుగు జిల్లాలు’ అంటూ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నాయకులను తప్పుపడతారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆ నాలుగు జిల్లాల ప్రస్తావనే ఎక్కువగా వచ్చేది.

కవిత్వం రాయమంటూ మల్లారెడ్డి ప్రోత్సాహం

ఎంవీఆర్ కవిత్వం రాశారు. ‘కవిత’  పత్రికలో కవర్ పేజీలో అచ్చయిన కవిత్వాన్ని గజ్జెల మల్లారెడ్డి మెచ్చుకొని కవితలు రాయమంటూ ప్రోత్సహించారు. పూర్తి వాస్తవికవాది కావడం వల్ల కాబోలు కవిత్వం కంటే వ్యాసాలకే ఎంవీఆర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఖమ్మం జిల్లాలో ఉన్న రోజులలో ‘ప్రభంజనం’ పక్షపత్రికను చదివేవాడిని. ఈ పత్రిక తొలిప్రతిని చూసి ముగ్ధుడై శ్రీశ్రీ ఎంవీఆర్ కి లేఖ రాశారు. ‘‘పాలు తెల్లగా ఉంటాయంటే అబ్బో ఇంత కటిక సత్యమే’’ అంటూ బెంబేలు పడే సమాజానికి ఘాటైన చికిత్స అవసరమే’’ అంటూ ఎంవీఆర్ సంపాదకీయాన్ని మహాకవి సమర్థించారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం  

తిరుపతి ఆకాశవాణి కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పూనికతో  ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ మొదటి భాగంలోని నలభై అధ్యాయాలనూ నలభై వారాలపాటు ధారావాహికగా ప్రసారం చేశారు. సుధాకర్ మోహన్ అద్భుతంగా చదివారు. ‘సైన్స్ సాగిన దారి’ శీర్షికతో కొన్ని, ‘చరిత్ర సాగిన దారి’ శీర్షికతో మరికొన్ని అధ్యాయాలు వినిపించారు. మొదటి భాగంలో యాంత్రపాలజీ ఎక్కువ. వైద్య విద్యార్థిగా ఉండగానే చదివిన హెచ్.జి. వెల్స్ ‘అవుట్ లైన్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ’ ఎంవీఆర్ ని విశేషంగా ప్రభావితం చేసింది. ఎవరైనా తెలుగులోకి అనువాదం చేస్తారేమోనని కొంతకాలం ఎదురు చూశారు. చివరికి తానే ఆ పని చేశారు. ‘ఆ కాగడా చూపించిన వెలుగులోనే నడుస్తున్నా’ అన్నారు ఎంవీఆర్.

తిక్కన పట్ల మక్కువ

ఎంవీఆర్ కి కవిత్రయం అన్నా, భారతం అన్నా చాలా ఇష్టం. కవిత్రయంలో తిక్కన పట్ల  మక్కువ ఎక్కువ.  తిక్కన తెలుగు నుడికారాన్ని ప్రతిభావంతంగా వినియోగించి తెలుగుభాష చిక్కదనానికి దోహదం చేశారని అంటారు. శ్రీశ్రీకి కూడా తిక్కన అంటే ఇష్టం. నాకూ ఇష్టమే. తిక్కనను అభిమానించని తెలుగువారు ఉండరు. తిక్కన ప్రభావంతోనే ‘మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది’ అనే పరిశోధనా గ్రంథం రాశారు. ‘తిక్కన పోకడలో కినిపించేది ఉత్తరాది అంత:పురకాంత కాదు. అచ్చం తెలుగింటి ఇల్లాలు. ఆయన గ్రంథస్థం చేసింది అన్నదమ్ముల మధ్య తలెత్తే తగాదాల్లో తెలుగునాట ఏ ఇంటిలోనైనా ఆడవాళ్ళు ప్రదర్శించే ఆవేశకావేషాలు,’’ అని రాశారు. ‘కక్షలు దండిగా ఉన్న గ్రామాలలో కుటుంబస్త్రీలు మాట్లాడే తీరు తెలిసిన అనుభవం రమణారెడ్డిగారిచేత ఈ వాక్యాలను పలికించి ఉంటుంది,’ అని ‘ద్రౌపది’ పుస్తకానికి ‘మన్నన’ శీర్షికతో ముందుమాట రాసిన సుప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ‘‘అచ్చం తెలుగు ద్రౌపది మళ్ళీ ప్రవేశించింది. సూటిపోటి మాటలతో వాదన మొదలుపెట్టింది.  స్వచ్ఛమైన దేశీయపదాలతో రెచ్చిపోయింది. ఉద్వేగ పరంపరను అలలు అలలుగా పాఠకుని అంతరంగానికి తాకించడం ఆ తిక్కన సోమయాజికే చెల్లు,’’ అంటూ ఎంవీఆర్ ప్రశంసించారు. విరాటపర్వం ఒక్కటే ఒక ప్రబంధం అని ఆయన తీర్మానం. కాదనడం, విభేదించడం అసాధ్యం.

కురుపాండవ సంగ్రామం ఉత్తరాదిలోని యమునానదీ తీరంలో కురుక్షేత్రంలో జరిగినా పెన్నానదీ తీరంలో జరిగినట్టే అనిపిస్తుందని ఎంవీఆర్ అన్నారు. గోదావరీ తీరంలోనో, కృష్ణానదీ తీరంలోనో జరిగింది ఆ నదుల డెల్టా ప్రాంతంలో నివసించేవారు అనుకుంటారు. అది వ్యాసుడి గొప్పదనం. మానవ స్వభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సార్వజనికంగా నిగ్గుతేల్చిన ఆయన అసమాన ప్రతిభావిశేషం. వ్యాసుడి పాత్రల లక్షణాలకు స్వీయసృజనతో, అద్భుతమైన జోడింపులతో మెరుగులు దిద్దిన తిక్కన గొప్పదనం. ‘‘కవిత్రయానిది ఒకటే భాష, ఒకటే భావం. కానీ తిక్కన ద్రౌపదిలో తెలుగుదనం గుబాళిస్తుంది. తిక్కన పాత్రలు ఆలోచనలకు పరిమితమయ్యేవి కావు. కళ్ళ ముందుకొచ్చి అభినయించేవి,’’ అన్నారు. మాటలను తూకం వేయడం తిక్కనకు తెలుసునంటారు.  ఎంవీఆర్ రచనలలోనూ ఈ ప్రయత్నం కనిపిస్తుంది.

పుస్తక సమీక్షలు

సమీక్షా సమావేశాన్ని హరినాథ్ రెడ్డి నిర్వహించారు. డాక్టర్ ఎం వి రమణారెడ్డి జీవన రేఖలు అనే అంశంపైన ప్రసంగించారు. ఎంవీఆర్ జీవితంలోని అన్ని పార్శ్వాలనూ స్పృశిస్తూ సమగ్రంగా రచయిత వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టారు. ముఖ్యంగా సాహిత్యరంగంలో ఆయన చేసిన కృషిని సాకల్యంగా వివరించారు.

తెలుగు సినిమా-స్వర్ణయుగం

కటిక వాస్తవాలతో నిత్యం వేగుతూనే తెలుగు సినిమాపైన ‘తెలుగు సినిమా-స్వర్ణయుగం’  పేరుతో ఒక స్వతంత్ర  రచన చేయడం రచయితగా ఎంవీఆర్ వైవిధ్యాన్ని వెల్లడిస్తుంది. ఈ పుస్తకాన్ని నాగసూరి వేణుగోపాల్ సమీక్షించారు. ప్రశంస అయినా విమర్శ అయినా హేతుబద్ధంగా రాశారు. కన్నడరాగం గురించి పొరబాటు రాసి విఏకె రంగారావు సూచన మేరకు రెండో ఎడిషన్ లో సవరించుకున్నారు. బాహుబలి వచ్చిన తర్వాత ప్రచారమే ప్రధానమైందనీ, ఎంవీఆర్ పుస్తకం రాసిన రోజుల్లో సినిమాలపై విమర్శ ఎంతోకొంత ఉండేదని వేణుగోపాల్ అన్నారు. మనిషి ఆవేశానికి లోనైతే మనిషి ముఖకవళికలలో ఎటువంటి మార్పులు వస్తాయో కెవి రెడ్డి ఎట్లా గ్రహించారోనని చెబుతూ వైద్యం గురించి వివరిస్తారు. సినిమాకు సంబంధించిన చారిత్రక విషయాలు శోధించి రాశారు. విమర్శ సాధికారంగానే, సున్నితంగానే ఉంటుందని ఆయన చెప్పారు. కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి అంటే గౌరవం ఉన్నప్పటికీ వారు చేసిన పొరపాట్లను సైతం ఎత్తి చూపడానికి వెనుకాడలేదు.

తెలుగింటి వ్యాకరణం

‘తెలుగింటి వ్యాకరణం’ గురించి బి. భుజంగరెడ్డి ప్రసంగించారు. తెలుగు వ్యాకరణాన్ని సులభగ్రాహ్యంగా చేయడం ఈ రచన వెనుక ఉద్దేశం. ఉత్తరాలు ఎట్లా రాయాలి, వ్యాసరచన ఎట్లా చేయాలి, అనువాదం ఏమిటి అనే విషయాలు కూడా చెప్పారు. విద్యార్థులకు అవసరమైన విషయాలను క్లుప్తంగా చెప్పారు. పంక్చువేషన్ మార్క్ లు ఎట్లా ఉపయోగించాలో కూడా ఈ పుస్తకంలో వివరించారు. ఇది ఏ వ్యాకరణంలోనూ చెప్పరు. ఛందస్సులో కూడా ముఖ్యమైన అంశాలను మాత్రమే రాశారు. భాషాభాగాలూ, అలంకారాలను ఆయన విద్యార్థులకు అవసరమని ఆయన అనుకున్నంత మేరకే రాశారు. పది అర్థాలంకారాలు, ఆరు శబ్దాలంకారాలు ఉన్నాయి. భాషా నడిచే విధానం చెప్పేది వ్యాకరణం అని ఆయన అభిప్రాయం. భాషను శాశించేది వ్యాకరణం కాదని ఆయన అంటారు. సున్నాకు ఆరు రకాల ఉచ్ఛారణ ఉంది అంటూ సోదాహరణంగా వివరించారు.

పరిష్కారం

ఎంవీఆర్ రాసిన కథలలో కొన్నిటిని ‘పరిష్కారం’ పేరుతో సంకలించారు. దీనిపైన సీనియర్ జర్నలిస్టు,  ‘ఆంధ్రజ్యోతి’ రాయలసీమ బాధ్యులు ఆర్ ఎం ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. కథారచనలో కాళీపట్నం రామారావు సూచనలు ఎంవీఆర్ తీసుకున్నారని చెప్పారు. రాయలసీమ మాండలిక సౌదర్యం ఒకటి, రెండు కథలలో మాత్రమే కనిపిస్తుందనీ, కోస్తాంధ్ర కథారచయితల ప్రభావం ఎక్కువగా  కనిపిస్తుందనీ ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. కొడవటిగంటి కుటుంబరావుకు కొనసాగింపుగానే ఎంవీఆర్ కథలు కనిపిస్తాయని అన్నారు.

పురోగమనం

కళ్యాణదుర్గం గురజాడ అధ్యయన కేంద్రం నిర్వాహకులు డాక్టర్ దేశం శ్రీనివాసరెడ్డి ‘పురోగమనం’ పైన మాట్లాడారు. మావో హయాంలో చైనా సమాజం, వైద్య, ఆరోగ్య పరిస్థితులను వివరించిన  బ్రిటిష్ రచయిత డాక్టర్ జాషువా హర్ష్ రచించిన పుస్తకం ‘అవే ఫ్రం పెస్ట్స్’ కు అనువాదం ‘పురోగమనం.’ ఆ పుస్తకానికి ఈ రోజుల్లో ప్రాసంగికత ఉన్నదా అని ప్రశ్నిస్తూ నాటి చైనా, నేటి చైనా మధ్య పోలికలనూ, తేడాలనూ చూపించారు. కమ్యూనిస్టు ఎగాలిటేరియన్ సొసైనీ మావో స్వప్నం అయితే కేపిటలిస్ట్ డ్రివెన్ సొసైటీ గత నలభై ఏళ్ళుగా, డెంగ్ సంస్కరణల తర్వాత, మనం చూస్తున్నామని చెప్పారు. చైనా లో ఉన్నది నియంతృత్వమే కానీ ప్రజాస్వామ్యం కాదని గుర్తు చేశారు. ‘ఐడియాలజీ’ కంటే ‘అవుట్ కం’ ప్రధానం అనే వాదన ప్రస్తుత చైనా పాలకుల సిద్ధాంతమని చెప్పారు.  

తెలుగింటికొచ్చిన ద్రౌపది

‘ద్రౌపది’ ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం డిప్యూటీ సెక్రటరీ యద్దనపూడి కామేశ్వరి సమీక్షించారు. ద్రౌపది వ్యక్తిత్వం గురించీ, సినిమాలలో ఆమో గురించి చేసిన చేర్పులూ, మార్పుల గురించి ప్రస్తావించారు. దుశ్శానుడిని చంపి, అతని రొమ్ము చీల్చి రక్తం తాగి, రక్తంతో తడిసిన చేతులతో భీముడు వచ్చి ద్రౌపది కురులను ముడుస్తాడంటూ  సినిమాలలో విస్తృతంగా చేసిన ప్రచారం అవాస్తవమనీ, ద్రౌపది జడవిరబోసుకొని ఉన్నదంటూ భారతంలో ఎక్కడా ప్రస్తావన లేదనీ, పైగా జడవేసుకొని, ముడివేసుకొని ఉన్నట్టు చాలాచోట్ల ఉన్నదనీ, ముఖ్యంగా అజ్ఞాతవాసంలో జడవిరబోసుకొని ఉంటే ద్రౌపది దొరికిపోయేదనీ ఎంవీఆర్ చేసిన హేతుబద్ధమైన వాదనను ఆమె ప్రస్తావించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు ‘మన్నన’లో ‘ద్రౌపది’ పేరుతో వచ్చిన డాక్టర్ యార్లగడ్డ లక్మీప్రసాద్ నవలను పరోక్షంగా ప్రస్తావించిన సంగతి కామేశ్శరి వెల్లడించారు. ఒకే పదాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన ఎట్లా ప్రయోగించారో విశదీకరించారు. తిక్కన ఒక మహార్ణవం అంటూ అభివర్ణించే ఎంవీఆర్ రచన చందమామ కథల శైలిని పోలి ఉంటుందని కామేశ్వరి చెప్పారు. ఎంవీఆర్ భారతం మొత్తాన్ని ఔపోసన పట్టారనడానికి ఈ పుస్తకంలో నిదర్శనాలు ఉన్నాయంటూ ఆమె చాలా ప్రతిభావంతంగా వివరించారు. తాను ఉద్యోగంలో భాగంగా ఒక సారి ఎంవీ రమణారెడ్డికి ఫోన్ చేయవలసి వచ్చిందనీ, శాసనసభ్యులు అందరూ తీసుకొని పింఛన్ ను ఆయన తీసుకోకపోవడం వల్ల ఆయనకు ఈ పింఛన్ సదుపాయం గురించి తెలియదేమోనని చెప్పడానికి ప్రయత్నించాననీ ఆమె ప్రసంగం ప్రారంభంలోనే చెప్పారు. అప్పుడు ఎంవీఆర్ సమాధానం : ‘‘అమ్మా. నాకు తెలుసు పింఛను సదుపాయం ఉన్నదని. నేను పదిమందికి పెట్టే స్తోమత ఉన్నవాడిని. నాకు ఎందుకమ్మా పింఛను.’’

రెక్కలు చాచిన పంజరం

హెన్రీ షారియర్ రాసిన ‘పాపియాన్’ అనువాదం ‘రెక్కలు చాచిన పంజరం‘ గ్రంధాన్ని ప్రముఖ జర్నలిస్టు, హోమియో వైద్యుడు అంబటి సురేంద్రరాజు సమీక్షించారు. ఆత్యయిక పరిస్థితి సమయంలో ‘పాపియాన్’ సినిమా చూశానని చెప్పారు. ఈ నవలను ఏ దేశానికి చెందిన మనిషి చదివినా తానే పాపియాన్ గా ఊహించుకుంటారని ఆయన అన్నారు. స్వేచ్ఛా పిపాసి అయిన ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించిందీ, ఖైదీలను జైలర్లు పెట్టిన హింసా, ఖైదీల కష్టాలూ కళ్ళకు  కట్టినట్టు  రచయిత వివరించారనీ సురేంద్రరాజు వివరించారు. అతడిని లోబరుచుకోవడానికి వ్యవస్థ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఈ పుస్తకం చెబుతుంది. ఎంవీఆర్ వ్యక్తిత్వాన్నీ. పుస్తకాన్నీ పోల్చుతూ ప్రసంగించారు. స్వేచ్చకోసం పరితపించే మనిషి మానసిక స్థితికి ఈ పుస్తకం అద్దంపడుతుందని చెప్పారు.

శంఖారావం

వ్యాసాల సంపుటి  ‘శంఖారావం’ పైన ఉపాధ్యాయులు విజయకృష్ణ ప్రసంగించారు. ప్రజలను శంఖం ఊది మేలుకొల్పినట్టు తన వ్యాసాలు ఉండాలనే, ఉన్నాయనే భావనతో ఈ సంకలనానికి ఆ పేరు పెట్టినట్టు ఎంవీఆర్ ముందుమాటలో చెప్పారు. పురుషులతో సమానంగా స్త్రీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనే అభిలాషను రచయిత అభిలాష ‘మగవాళ్ళ పార్లమెంటులో మగువల బిల్లు’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో ఎంవీఆర్ వెలిబుచ్చారు. దేశాన్ని జర్నలిజమే కాపాడుతుందనే విశ్వాసాన్ని ఒక వ్యాసంలో రచయిత వ్యక్తం చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ మొత్తం ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పై రాద్ధాంతం పై రాసిన వ్యాసంలో కూడా రాయలసీమకు అనుకూలంగా స్పందిస్తారు. రాయలసీమవారిని నరహతకులుగా అభివర్ణిస్తూ సినిమాలు తీస్తున్నవారిపైన దాడి చేశారు. ‘అరవింద సమేత…’ అనే పేరుతో వచ్చిన సినిమాను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తరిమల నాగిరెడ్డి, చలసాని ప్రసాద్ గురించి ప్రేమతో రాశారు.

రాయలసీమ కన్నీటిగాథ

రాయలసీమ కన్నీటిగాథ గురించి డాక్టర్ జూపల్లి ప్రేమ్ నాథ్ సమీక్షించారు. రాయలనాటి వైభవంతో రతనాలసీమగా ఖ్యాతిపొందిన రాయలసీమ జిల్లాలు ఈనాడు కటిక దారిద్ర్యానికి ఆలవాలమైనాయి అంటూ పుస్తకం ప్రారంభం అవుతుంది.  ‘రాయలసీమ కన్నీటిగాథ’ ఎంవీఆర్ మొదటి పుస్తకం. రాయలసీమ సమస్యల గురించీ, పరిష్కారాల గురించీ వచ్చిన ప్రమాణాత్మకమైన రచన ఇది. ఆ పుస్తకమే ఆయనను నడిపించింది. అందులోని అంశాలకే ఆయన ఇప్పటి వరకూ కట్టుబడి ఉన్నారు. ‘రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి, ముఖ్యంగా రైతుకు జరిగిన ద్రోహం గురించి, పుడమితల్లికి జరిగిన దారుణం గురించి … ప్రజాహృదయం ఇప్పటికీ క్షోభిస్తూనే ఉన్నది,’ అన్నారు ప్రముఖ కవి సింగమనేని నారాయణ. ‘తరతరాలుగా అన్యాయానికీ, అసమానత్వానికీ, రాజకీయ దళారీతనానికీ దగాపడుతున్న సీమలో పీడితుల తరఫున నిలబడి, ఉద్యమస్వరాన్ని వినిపించిన మాగ్నాకార్టా ఇది, ’’ అంటూ కవి అఫ్సర్ కితాబు ఇచ్చారు. రాయలసీమ ఆక్రోశాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ ఈ చిన్ని పుస్తకం చాలా విలువైనది. ‘కోటిగొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, వినిపింతునింక రాయలసీమ కన్నీటిపాట’ అన్న విద్యాన్ విశ్వం కవిహృదయాన్ని ఇది వచనరూపంలో ఆవిష్కరించింది. శ్రీబాగ్ ఒప్పందం గురించీ, తుంగభద్ర, పెన్నానదీ జలాల విషయంలో మొట్టమొదటి ప్రాధాన్యం రాయలసీమకు ప్రధాన్యం ఇవ్వాలని కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఇల్లు శ్రీబాగ్ లో సమావేశమైన తెలుగు పెద్దలు తీర్మానించిన విషయం గుర్తు చేశారు. శ్రీబాగ్ ఒప్పందంలో అంగీకరించిన అంశాలు ఏవీ అమలుకు నోచుకోలేదని నిరూపించారు.

టూకీగా ప్రపంచ చరిత్ర

‘టూకీగా ప్రపంచ చరిత్ర’ మూడు భాగాలనూ డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. రాయలసీమలో జన్మించిన మరో వేమన అంటూ ఎంవీఆర్ ను సమీక్షకులు అభినందించారు. ముక్తవరపు పార్థసారధి ‘లోకజ్ఞానం’ అనే శీర్షికతో ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. అనేక పుస్తకాలు అధ్యయనం చేసి ఎంవీఆర్  యాక్షన్ ఓరియెంటెడ్ హిస్టరీ బుక్ గా ఈ పుస్తకాన్ని రాశారని పార్థసారధి వర్ణించారు. డార్విన్ సిద్ధాంతం జీవరాసుల పరిణామం గురించీ, వివిధ యుగాలలో వచ్చిన  పర్యావరణ పరిణామాలను మానవుడు ఎట్లా అధిగమించడం గురించీ, మనుషులకూ, జంతువులకూ తేడా గురించీ వివరించారు. ఖగోళశాస్త్రం స్పృశించారు. ఈ పుస్తకం చదివినవారు శాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటారని సమీక్షకులు చెప్పారు. లిపుల గురించి కూడా చర్చించారు. ఎంవీఆర్ ను ప్రాంతీయవాదిగా, ఫ్యాక్షనిస్ట్ గా అభివర్ణించడం సముచితం కాదని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ రాసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీతో పోల్చదగిన పుస్తకంగా ‘టూకీగా ప్రపంచం’ పుస్తకాన్ని అభివర్ణించారు.

ఆయుధం పట్టని వీరుడు

‘ఆయుధం పట్టని వీరుడు’ పేరుతో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూదర్ కింగ్ (జూనియర్) జీవిత చరిత్రను ఎంవీఆర్ రాశారు. దాన్ని వరంగల్లుకు చెందిన డాక్టర్ పసునూరు రవీందర్ సమీక్షిస్తూ అమెరికాలో పౌరహక్కుల పోరాటానికీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సామ్యం గురించి మాట్లాడారు. 50 లక్షల మంది హాజరైన సభలో మార్టిన్ లూథర్ కింగ్ ప్రసంగించారని గుర్తు చేశారు. ఇంతపెద్ద సమావేశం మరొకటి ఈ భూమిపైన జరగలేదని అన్నారు. మార్టిన్ లూదర్ కింగ్ అనేక విడతల జైలుకు వెళ్ళారు. ఆయన పైన శ్వేతజాతి దురహంకారులు పలుమార్లు హత్యాయత్నం చేశారు. చివరికి వారి చేతుల్లోనే మరణించారు.  చదువు ద్వారానే నిమ్నజాతులు అభివృద్ది చెందుతాయని నెల్సన్ మండేలా తీర్మానిస్తే,  పేదరికం పోతేనే సమాజంలో గౌరవంగా బతుకుతామని మార్టిన్ లూదర్ కింగ్ అన్నారు. ’నువ్వు కమ్యూనిస్టువా?‘ అని విమర్శకులు ప్రశ్నించినప్పుడు తాను దాస్ కాపిటల్ చదివినప్పటికీ బైబిలే తనని ఎక్కువగా ప్రభావితం చేసిందని కింగ్ చెప్పారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అనేది కార్ల్ మార్క్స కంటే ముందే గౌతమ బుద్ధుడు ప్రవచించాడని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన విషయం రవీందర్ గుర్తు చేశారు. మార్జిన్ లూదర్ కింగ్ మహాత్మాగాంధీని ఆదర్శంగా చేసుకొని కార్యాచరణను రూపొందించుకున్నారని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని కొందరు సూచిస్తే అందుకు నిరాకరిస్తూ తన జాతి ప్రజల అభ్యున్నతి కోసం చర్చి కేంద్రంగా పోరాడటమే తన ధ్యేయమని స్పష్టం చేశారని సమీక్షకులు తెలియజేశారు. నెహ్రూ ఆహ్వానంపైన 1959లో ఇండియాకు వచ్చిన మార్టిన్ లూదర్ కింగ్ గాంధీ సమాధిని సందర్శించారు. తిరువనతంపురంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,  ‘ఐ యామ్ ఎన్ అన్ టచబుల్ ఫ్రమ్ అమెరికా’ అని అంటారు. అంబేడ్కర్ గురించి మార్జిన్ లూదర్ కింగ్ ఏమన్నారో ఎంవీఆర్ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చునని అంటూ అంబేడ్కర్ ప్రస్తావన ఉంటే బాగుండేదని రవీందర్ అన్నారు. మార్క్సిస్టు దృక్పథంతో రష్యా, చైనా గురించి తెలుగులో పుస్తకాలు వచ్చాయి కానీ ఒక నల్లవీరుడి గురించి తెలుగులో ఒక పుస్తకం రాయడం గొప్ప ఆలోచన అని ప్రశంసించారు.

పెద్దపులి ఆత్మకథ

ఆర్ కె నారాయణ్ రాసిన ‘ఏ టైగర్ ఫర్ మాల్గుడి’ నవలను ఎంవీఆర్ ‘పెద్దపులి ఆత్మకథ’ గా అనువదించారు. ఈ నవలను  డాక్టర్ హరిత భట్ల పెనుమర్తి సమీక్షించారు. బిట్స్ పిలానీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకొని, సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తూ, తెలుగులో ఎంఏ చదివి, పిహెచ్ డీ  చేశారు. ఆమె ఆర్ కె నారాయణ్ ను భారతీయ సాహిత్యాన్ని ఆంగ్లంలో రచించిన మొదటి తరం రచయితగా అభివర్ణించారు. మనిషికి బందీ అయిన పులి మనిషి భాష అర్థం కాక ఎట్లా అవస్థలు పడుతుందో ఈ పుస్తకం వర్ణిస్తుంది. సర్కస్ లో పులి చేసిన విన్యాసాలు చూసి ముచ్చటపడి సినిమాలో విన్యాసాలు చేయించడానికి ఒక నిర్మాత ప్రయత్నించినప్పుడు పులి అక్కడి నుంచి తప్పించుకొని జనం మధ్యకు వస్తుంది. తనను కాల్చివేయాలని ప్రయత్నించిన ప్రజల నుంచి పులిని ఒక సన్యాసి రక్షిస్తాడు. పులితో సన్యాసి మాట్లాడుతాడు. చివరికి పులిని ఒక జంతురక్షణశాల(జూ)కి అప్పగించాడు సన్యాసి. బలం, కూరత్వం, ఆధిపత్యం శాశ్వతం కాదని ఈ పుస్తకం చెప్పే నీతి. వన్యప్రాణి సంరక్షణ అవసరాన్ని ఈ నవల చాటింది. ప్రభుత్వాలు వన్యప్రాణి రక్షణ చట్టాలు తెచ్చాయి. జంతువుల చేత సర్కస్ ఫీట్లు చేయించే సంప్రదాయానికి క్రమంగా స్వస్తి చెప్పడం ఇటువంటి నవలల కారణంగానే. ఆంగ్లపదబంధాలకు తెలుగులో జాతీయాలను ఉపయోగించడం చాలా బాగుందని ఎంవీఆర్ ని సమీక్షకురాలు అభినందించారు. ఈ రచనలో తనకు తోచిన అభ్యంతరాలను హరిత నిష్కర్షగా చెప్పడం మెచ్చుకోదగిన అంశం.

చివరికి మిగిలింది?

మార్గరెట్ మిషెల్ రాసిన  గొప్ప ఇంగ్లీషు నవల ‘గాన్ విత్ ది విండ్ ‘ ను ఎంవీఆర్ ‘చివరికి మిగిలేది?’ అని తెలుగులోకి అనువాదం చేశారు. డాక్టర్ ఏవివికే చైతన్య  సైన్స్ చదువుకొని ఉద్యోగం చేస్తూ తెలుగులో పిహెచ్ డి చేశారు. ఈ నవలను తన పీహెచ్ డిలో భాగంగా ఎంచుకున్నట్టు చైతన్య వివరించారు. అమెరికా చరిత్ర కొంత తెలిసినవారికే ఈ నవల పూర్తిగా అర్థం అవుతుంది. తెలియనివారికి కాదు. అమెరికా చరిత్రను అనువాదకుడు టూకీగా చెప్పారు కానీ ఆ పరిజ్ఞానం నవలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సరిపోదని సమీక్షకుని అభిప్రాయం. బానిసల కష్టాల గురించీ, వారిపైన జరుగుతున్న దాడుల గురించీ,  అత్యాచారాల గురించీ ఈ నవల ప్రస్తావించదు. దక్షిణ అమెరికాలో భూస్వాముల పక్షం వహిస్తుంది రచయిత్రి. అబ్రహాం లింకన్ తొందరపాటు కారణంగానే అమెరికా అంతర్యుద్ధం జరిగినట్టు రాశారు. ఒక పక్షం వైపు నుంచి ఆమె చరిత్ర చెబుతారు. రెండో పక్షం వైపు చెప్పే హారియట్ బీచర్ స్టోవ్ రాసిన ‘అంకుల్ టామ్ కేబిన్‘ నవలను మార్గరెట్ మిషెల్ అవహేళన చేస్తారు. అనేక చారిత్రక, ఆర్థిక, మానసిక కోణాలు ప్రధాన పాత్ర స్కార్లెట్ లో కనిపిస్తాయి. యుద్దంలో నాశనమైన భూస్వాముల ప్రతినిధి స్కార్లెట్. ఆమె సమర్థంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకొని నాశనమైన సామ్రాజ్యాన్ని పునర్నిర్మిస్తుంది. అంతర్యుద్ధం నవలలో ఆఃద్యంతం చివరంటా కొనసాగుతుంది. అమెరికా దక్షిణాది రాష్ట్రాలలో జరిగిన చరిత్ర ఈ గ్రంధం ఇతివృత్తం. పురుషుల పాత్రల కంటే స్త్రీ పాత్రలు ఎక్కువ. వాటికి ప్రాధాన్యం అధికం. అంతర్యుద్ధంలో భూస్వామ్య కుంటుంబాలు ఎట్లా చితికిపోయాయో, ఆ కుటుంబాలలో స్త్రీలు ఎట్లా దైర్యంగా ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలిచారో రచయిత్రి తెలియజేశారు. ఇంగ్లీషు సామెతలకు అనువాదంలో తెలుగు జాతీయాలను ఉపయోగించడం సముచితంగా ఉన్నదని చైతన్య అన్నారు. పాత్రల మధ్య జరిగిన సంభాషణలను రాయలసీమ పల్లె భాషలో రాయడాన్ని సమీక్షకుడు సమర్థించారు. తిరుమల రామచంద్ర, సహవాసి, దిగవల్లి వంటి అనువాదకులు తెలుగు మాండలికాలు ఉపయోగించారు. కానీ అనువాదంలో మాండలికాలు వాడినవారి సంఖ్య తక్కువ. ఎంవీఆర్ మాండలికాలతో పాటు కొత్త పదాలు కూడా వాడారనీ, ఇది అభినందనీయమనీ చైతన్య వ్యాఖ్యానించారు. మూలాన్ని కొద్దిగా కుదించడం వల్ల స్కార్లెట్ పాత్రకు జరగవలిసిన న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని సమీక్షకుడు అభిప్రాయపడ్డారు. అమెరికాలో ‘గాన్ విత్ ది విండ్’ రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలకు తావిచ్చింది. అంతర్యుద్ధంలో బానిస బతుకుల గురించి ఈ నవల పట్టించుకోలేదనే విమర్శ ఉంది.. తులనాత్మక అధ్యయనానికి అనువైన అనువాదం ఎంవీఆర్ అందించారని అన్నారు.

మాటకారి

చివరి సమీక్ష ఆర్ . కె. నారాయణ్ రాసిన ‘టాకెటీవ్ మ్యాన్’కు ఎంవీఆర్ అనువాదం ‘మాటకారి’ మీద విశ్రాంత ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ మల్లికార్జున చేశారు.  కాల్పనిక రచనలో ఆర్.కె. నారాయణ్ చాలా ప్రయాగాలు చేశారు. ఆయన జీవితంలో మొత్తం 34 నవలలు రాశారు. తన కాల్పనిక సాహిత్యానికి మూలం మనిషి మానసిక స్థితిగతులూ, కాలమాన పరిస్థితులూ అని రచయిత చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనుషుల స్వభావం ఎట్లా మారుతూ వచ్చిందో ఆర్. కె. నారాయణ్ నవలలు చర్చిస్తాయి. భారతీయ గ్రామీణ వాతావరణం ఆయన నవలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్. కె. నారాయణ్ రాసిన రెండు నవలలో – మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, టాకెటీవ్ మ్యాన్- ముఖ్యపాత్రలు అతిపోకడలు పోతాయి. స్వయం ప్రకటిత పాత్రికేయుడు ఆర్.కె. నారాయణ్ సృష్టించుకున్న కాల్పనిక గ్రామంలో ఉంటాడు. తాను సేకరించిన విషయాలు అందరికీ తెలియజేయాలనే తాపత్రయం ఉన్నవాడు. అతడికి ఒక పత్రికంటూ లేదు. ఊరంతా తనను వసపిట్ట అని పిలిచి గేలిచేసినా బాధపడేవాడు కాదు. మంచికీ, చెడుకీ మధ్య జరుగుతున్న సంఘర్షణను చిత్రించడం ఆర్.కె. నారాయణ్ ప్రత్యేకత. అనువాదంలో ఈ వాతావరణాన్ని  ఏ మాత్రం గాడితప్పకుండా ఎంవీఆర్ చిత్రించారని సమీక్షకుడు అభినందించారు. నాటి సమాజంలోని అనుబంధాలూ, అప్యాయతలూ, అమాయకత్వం కళ్ళకు కట్టేటట్టు చూపిస్తారు. ఇది అనువాదమని తనకు అనిపించలేదనీ, సొంత రచనగానే కనిపించిందనీ మల్లికార్జున్ అన్నారు. ఎంవీఆర్ రచనలోని మాండలికాలు అనువాదాన్ని రక్తికట్టించాయని సమీక్షకులు అన్నారు.

ఎంవీఆర్ సమాధానం

చర్చకు సమాధానం ఇస్తూ రచయిత ఎంవీ రమణారెడ్డి రెండు అంశాలపై వివరణ ఇచ్చారు. ఒకటి, తెలుగింటి వ్యాకరణం అన్నది సమగ్రమైనది కాదనీ, పునాది మాత్రమేననీ, వ్యాకారణాన్ని సరళీకరించే ప్రయత్నాలు ఇంకా జరగాలని రచయిత అన్నారు. రాయలసీమ  మాండలికంలోఎంవీఆర్ రచనలు ఎక్కువగా చేయలందంటూ ఉమామహేశ్వరరావు చేసిన విమర్శకు స్పందిస్తూ, ఒక మాండలికంలో రచయ యావత్తూ చేయడం వల్ల ఆ మాండలికానికే పరిమితం అవుతామనీ, ప్రామాణిక భాషలో రాస్తే విస్తృతి పెరుగుతుందనీ చెప్పారు. యాస వేరు మాండలికం వేరు అని బెబుతూ, తన రచనలలో మాండలికాలు చాలా విరివిగా ఉపయోగించాననీ, నింఘంటువులో దొరకని పది, పదకొండు మాండలికాలు ఉండవచ్చునేమో కానీ తక్కినవన్నీ వాడుకలో ఉన్న మాండలికాలనే రాశాననీ ఎంవీఆర్ వివరించారు. తన పుస్తకాలను ఆసాంతం చదివి, శ్రద్ధగా సమీక్షించినందుకు సమీక్షకులందరికీ ఎంవీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) జీవిత చరిత్ర ‘ఆయుధం పట్టని యోధుడు’ మరో రచన. దీనిపట్ల ఎంవీఆర్ కి ప్రత్యేకమైన అభిమానం. సదస్సు ప్రారంభ సమావేశంలో మితంగా మాట్లాడినప్పుడు ఈ  పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురిస్తే బాగుంటుందని చికాగో మిత్రులకు ఎంవీఆర్ సూచించారు. ‘ఐ హావ్ ఏ డ్రీమ్ ట్రూ’ అని ప్రకటించిన స్వాప్నికుడిని ఒక భారతీయ రచయిత ఎట్లా చూశారో, ఆయన వ్యక్తిత్వాన్ని ఎట్లా విశ్లేషించారో తెలుసుకోవలసిన అవసరం అమెరికా సమాజానికి ఉన్నదనేది ఎంవీఆర్ అభిప్రాయం. ‘ఆయుధం పట్టని యోధుడు’ అనే పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించే ప్రావీణ్యం కలిగిన వారు తనకు తెలుసునని, ఈ విషయం ప్రయత్నిస్తామని సభ చివరలో వందన సమర్పణ ముందు చికాగో సాహితీ మిత్రుల తరఫున తిమ్మాపురం ప్రకాశ్ హామీ ఇచ్చారు. వసంత వందన సమర్పణతో సుదీర్ఘమైన సమీక్షాసమావేశం ముగిసింది.

సమీక్షకులందరూ తాము సమీక్షించే గ్రంధాలను ఆమూలాగ్రం క్షుణ్ణంగా చదివారు. చక్కగా విశ్లేషించారు. సమీక్షకులలో ఎక్కువ మంది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేసినవారు కావడం విశేషం. ఇంతమందిని సమకూర్చడం, అందరితో వివరంగా మాట్లాడించడం డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ చేసిన గొప్ప పని. అందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించాలి.  కోవిద్ కారణంగా అంతర్జాల సమావేశాలు అనివార్యమైనాయి. మామూలు భౌతిక సమావేశాల కంటే ఈ జూమ్ సమావేశంలో అందరికీ విషయం స్సష్టంగా అర్థమైంది. సమావేశం ఫలప్రదంగా, జయప్రదంగా జరిగింది.

పప్పూరి రామాచార్యులు

ఎంవీఆర్  కు ముందు రాయలసీమ అభివృద్దికోసం అహరహం పని చేసిన వ్యక్తి పప్పూరి రామాచార్యులు. అనంతపురం జిల్లాలో పుట్టిపెరిగిన రామాచార్యులు తాడిపర్తిలో 1921లో గాంధీజీని కలుసుకున్నారు. 1928లో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలో దత్తమండలాలని పిలిచే రాయలసిమ ప్రాంతాన్ని రాయలసీమగా పిలవాలంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఇల్లూరులో నీలం సంజీవరెడ్డికీ, ఇతరులకూ ప్రైవేటు పాఠాలు చెప్పారు. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయనను రాయలసీమ అభివృద్ది కాంక్షతో ముందుకు సాగిన సాహితీవేత్తగా, చైతన్యదీప్తిగా, రచయితగా, పాత్రికేయ బృహస్పతిగా ప్రస్తుతించేవారు. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు నివాసం శ్రీబాగ్ లో జరిగిన ఒప్పందంపైన సంతకాలు చేసిన పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, ఆర్. వెంకటప్ప నాయుడు, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, హెచ్. సీతారామిరెడ్డి,  వంటి ప్రముఖులలో రామాచార్యులు కూడా ఉన్నారు. రామాచార్యులు కూడా రెండు పత్రికలు పెట్టారు. మొదటిది ‘పినాకిని.’ రెండవది ‘శ్రీసాధన.’ రెండో పత్రకనే ఆయనా, ఆయన వారసులూ 1970ల వరకూ నడిపించారు. రామాచార్యులు కూడా రాయలసీమలో పర్యటించి ఉపాన్యాసాలు ఇస్తూ ప్రజలను జాగృతం చేశారు. రామాచార్యులు తర్వాత రాయలసీమను అంతగా పట్టించుకున్న వ్యక్తి, ఆయనలాగే బహుముఖీనంగా ముందుకు సాగిన నాయకుడు ఎంవీఆర్. మైసూరారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి నాయకులు కూడా పాదయాత్రలూ, ఉద్యమాలూ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో రాయలసీమ పక్షపాతిగానే వ్యవహరించారు. రాయలసీమ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని ఉపకారం వైఎస్ చేశారు. కానీ ఎంవీఆర్ లాగా నిరంతరంగా, నిరవధికంగా రాయలసీమ ప్రగతి గురించి ఆలోచించి, క్రియాశీలంగా వ్యవహరించి, తపనపడినవారు మాత్రం మరొకరు లేరు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర

ఇప్పుడు రాయలసేన అనే సంస్థ ఒకటి సందడి చేస్తోంది. ‘అమరావతి కాదు, విశాఖను కూడా వ్యతిరేకించాల్సిందే, గ్రేటర్ రాయలసీమను సాధించాల్సిందే’ అంటూ నినాదానాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాయలసీమకు చెందిన నాయకులే ముఖ్యమంత్రులుగా ఎక్కువకాలం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకూ రాయలసీమకు చెందిన నారాచంద్రబాబునాయుడూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు. రాయలసీమ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారాలు కనుగొనేందుకు విస్తృత ప్రాతిపదికపైన సమాలోచనలు జరిపి, ఒక విధానాన్ని నిర్ణయించుకొని, దానిని నిజాయతీగా అమలు పరచడానికి ప్రయత్నించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా, అధికార రాజకీయాలకూ దూరంగా జరగవలసిన ప్రక్రియ.  రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రగతి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే సమైక్యతా భావన బలహీనపడుతుంది. అది ప్రమాదహేతువు.  

Related Articles

3 COMMENTS

  1. ఫోనులో సదసు విశేషాలు చూసి చాలా విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.

  2. Mvr గారి మీద మంచి వ్యాసం వ్రాసారు మీకు ధన్యవాదాలు.
    అన్ని రంగాలలో mvr గారి ప్రావీణ్యం ఈ వ్యాసం లో మాకు కనపడింది..కొలనుకొండ శివాజీ,విజయవాడ

  3. మూర్తి గారి వ్యాసం సాహితీ సదస్సును సమగ్రంగా వివరించింది. అనేక కొత్త విషయాలు తెలిసాయి. చదవటం పూర్తయ్యాక చాలా ఉల్లాసంగా అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles