Friday, April 26, 2024

సైబర్ మోసాలు సవాలక్ష రకాలు

  • ముక్కూమొహం తెలియనివారితో స్నేహం కూడదు
  • అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలి
  • డబ్బు పంపిన తర్వాత పోలీసులు చేయగలిగింది తక్కువే

సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా ఉంటోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు. కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఆ తీరుకు అద్దం పడుతోంది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పని చేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది. కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Also read: మాంద్యానికి చేరువలో…

బహుమతులు వచ్చాయనగానే ఎగిరి గెంతకూడదు

బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే ఆమె నష్టపోయేది కాదు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు. లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్ ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఇటీవలే బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100 కోట్లపైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్ కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు.

Also read: నిరంకుశుడైన అక్షరయోధుడు ముట్నూరి కృష్ణారావు

స్వయం నియంత్రణే శరణ్యం

మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ లు చూసి కొందరు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణే తరుణోపాయం.

Also read: మంచితనం మూర్తీభవించిన సూపర్ స్టార్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles