Tuesday, May 7, 2024

వాలంటీర్లకు ఉగాది సత్కారాలు

  • వాలంటీర్ల సేవలను గుర్తుగా పురస్కారాలు
  • మూడు కేటగిరీలుగా వాలంటర్లు

ఆంధ్రప్రదేశ్ లోని వార్డు, గ్రామ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం వారిని సత్కరించాలని నిర్ణయించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను మూడు కేటగిరీలుగా విభజించి సత్కరించనున్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో అవార్డులిచ్చి వాలంటీర్లను గౌరవించనున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రం, మెడల్ తో పాటు బ్యాడ్జి, ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు   వాలంటీర్ల జాబితాను సీఎం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేటగిరీలకు గాను మొత్తం 2లక్షల 22వేల 900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రదానానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఉగాది నుంచి జిల్లాల్లో ప్రతిరోజూ ఒక నియోజకవర్గంలో వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


సేవా మిత్ర

జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ప్రతి రోజూ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు,ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉగాది రోజున సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొత్తం 2,22,900 మంది వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మొదటి కేటగిరీ కింద సేవా మిత్ర అవార్డుతో పాటు 10వేల నగదును  ప్రోత్సాహం కింద అందిచనున్నారు. విధి నిర్వహణలో ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా పనిచేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు.

Also Read: తీవ్ర ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఆందోళన


సేవారత్న

రెండో కేటగిరీ కింద ఎంపికయిన వాలంటీర్లను సేవారత్న అవార్డుతో సత్కరిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇంటింటి సర్వే, రేషన్ డోర్ డెలివరీ, రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ మంజూరులో సమర్ధవంతంగా పనిచేసిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వీరి ఎంపికను ప్రభుత్వం ప్రాంతాల వారిగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండలానికి ఐదుగురు, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున సేవా రత్న అవార్డుకు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డుకు ఎంపికైన వారికి మెడల్, శాలువ, బ్యాడ్జి, ప్రసంశాపత్రంతో పాటు 20వేల నగదు బహుమతి అందిస్తారు.

సేవా వజ్ర

మూడో కేటగిరీకి సంబంధించి సేవా వజ్ర అవార్డు అందజేస్తారు. వీరికి శాలువా, సర్టిఫికెట్, బ్యాడ్జి, మెడల్ తో పాటు 30వేల నగదు బహుమతి అందిస్తారు. అయితే ఏ ఏ కేటగిరీకి ఎంతమంది అనేదానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆమోద ముద్ర వేశాకే కేటగిరీలను బట్టి వాలంటీర్ల సంఖ్యను అధికారులు బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: అసత్య ప్రచారానికి అడ్డుకట్ట

అవార్డు ఎంపికకు ప్రామాణికాలు

వాలంటీర్లను అవార్డు ఎంపికచేసే క్రమంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సచ్ఛీలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో వాలంటీర్ల భాగస్వామ్యం, కోవిడ్‌ –19 సర్వే వంటి అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి.. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించి సత్కరించడంద్వారా మరింత సమర్దవంతంగా వారి సేవలను వినియోగించుకోవచ్చని జగన్ సర్కార్ భావిస్తోంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles