Monday, April 29, 2024

తెలంగాణలో ఉద్యోగ నియామకాలు సక్రమంగా సాగేనా?

తెలంగాణ రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని తీసుకున్న నిర్ణయం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సవరించిన జోనల్ వ్యవస్థ ఆమోదం లో జాప్యం సదరు సందేహాలకు కారణభూతం అవుతున్నది. తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా చోటుచేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమన్యాయం పాటించేందుకు కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ సత్ఫలితాన్ని అందించగా, సదరు ప్రభుత్వ కృషి తెలంగాణ వాసులకు అమితానందాన్ని కలుగ చేయగా,  ప్రస్తుత పరిస్థితులు చర్చలకు తావు నిస్తున్నాయి. గతంలో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల, పదోన్నతుల విషయంలో జరిగిన అన్యాయమే తెలంగాణ తొలి, మలి దశ ల ఉద్యమాలలో ప్రధాన పాత్ర వహించింది. దానిపై సంపూర్ణ అవగాహన ఉన్న ఉద్యమ పార్టీ అధినేత, కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో  అసమానత, పక్షపాతం ఉండరాదని జోనల్ వ్యవస్థ, సంబంధిత నిబంధనల మార్పు కోసం తీవ్ర కృషి చేసి సఫలీకృతలయ్యారు.

ముల్కీ నిబంధనలు

సదరు నేపధ్యంలోకి వెళితే…ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్ గ్లానీ నివేదికలు, తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని నిలువరించ లేక పోయాయి. నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కగా, చాలాకాలం అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919 లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలం గాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాల్సి ఉండెను. దీని ప్రకారం 15 సంవత్సరాల కనీస నివాస యోగ్యతగా స్థానికత్వ నిర్ధారణ జరగాల్సి ఉండెడిది. అంతే కాక ఉద్యోగ విమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షర్తులు విధించ బడినాయి.

జోన్లుగా విభజన

తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12సంవతరాలు ఉండాలని నిర్ణయించ బడింది. 1973 సెప్టెంబర్ 28న జారీ అయిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా 1975 అక్టో బర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు 674 (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ అయి, రాష్ట్రాన్ని 1,2,3 కోస్తాంధ్ర, రాయలసీమ జోన్లుగానూ, 5,6 తెలంగాణ జోన్లుగా విభజించారు. ఈ ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్ల పరిధినుండి తప్పించడం జరిగింది. హైదరాబాద్ లోని, మినహాయించిన ఆఫీసులకు కాకుండా, మిగిలిన అన్ని ప్రభుత్వ ఆఫీసులలో లోకల్ రిజర్వేషన్ పాటించాల్సిందని పేరా 20 సూచించింది. అలాగే పేరా 9 ప్రకారం 10వ తరగతి నుండి కింది స్థాయి 4 వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధిగా, ఆ జిల్లాలో 4సంవత్సరాలు చదువును స్థానికంగా వివరించారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80%, జోనల్ స్థాయిలో 60% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వు చేయ బడినాయి. రిజర్వు చేయ బడినవి పోగా మిగిలినవి ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. 1918 నుండి అమలులో ఉండిననివాస యోగ్యతను 15 నుండి 12కు (1956లో) అనంతరం 1975లో 4సంవత్సరాలకు తగ్గించిన కారణంగా  వివక్షత కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జోనల్ వారీ విధానాన్ని సైతం తుంగలో తొక్కి, స్వార్ధమే పరమార్ధంగా పాలన కొనసాగించడం జరిగింది. నాటి ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు నియమించిన జయభారత్ రెడ్డి, కమలనాథన్, ఉమాపతిలతో కూడిన  సీనియర్ ఐఎఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ, 1975 నుండి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి 30 జూన్ 1985న 36 పేజీల నివేదిక సమర్పించింది.

ఎన్ టీఆర్ దిద్దుబాటు చర్య

జోన్ల రిజర్వేషన్లకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1,2,3 జోన్లకు చెందిన వారు తెలంగాణకు చెందిన 5.6 జోన్లలో 58,986మంది నిబంధనలకు విరుద్ధంగా నియమింప బడినట్లు పేర్కొనడం జరిగింది. ఈ నివేదికను పరిశీలించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 30న 610 జీవోను జారీ చేశారు. గత పాలకులు చేసిన తప్పులను దిద్దుకునే క్రమంలో 1986 మార్చి 30కల్లా 610 జీవోను అమలు పరిచి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ ను గద్దెదింపి, ముఖ్య మంత్రి అయిన చంద్రబాబు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గిర్ గ్లానీ ఏకసభ్య కమిషన్ ను పునఃపరిశీలనకై నియమించగా, నివేదిక సమర్పించిన గిర్గ్లానీ స్థానికేతరులను నిర్ధారించ గల సంపూర్ణ సమాచారం పొందకుండానే నివేదిక సమర్పించారు.

గిర్ గ్లానీ నివేదిక

రాష్ట్రపతి ఉత్తర్వులను 126 పద్దతులలో ఉల్లంఘించడం జరిగిందని వివరించి, వాటిని 18రకాలుగా వర్గీకరించి, 35 పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఉద్యోగ నియామకాలన్నీ జోనల్ నిబంధనలను అనుసరించి జరగాల్సి ఉండగా, జోనల్ ఆఫీసులను రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈ బదిలీలు తప్పని కమిషన్ అభి ప్రాయపడ్డది. గిర్గ్లానీ నివేదిక ప్రకారం సగంమంది స్థాని కేతరులు ఉన్నారని స్పష్టం అయింది.

కడియం శ్రీహరి సుదీర్ఘ చర్చలు

ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగాక,  సదరు అన్యాయానికి ఇకనైనా అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసి నేతలు కారెం రవీందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై, పలు అంశాలను ప్రతిపాదించారు. నాటి ఉపముఖ్యమంత్రి కడియం పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణలోని జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్ల 3లక్షల పోస్టుల వివరాలను పేర్కొంటూ, జూనియర్ అసిస్టెంట్, క్రింది స్థాయి జిల్లా స్థాయికి, ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్లు జిల్లా స్థాయిలో, గజి టెడ్ హెచ్ఎంలు, ఎంఇఓలు జోనల్లో, ఉప విద్యాధికారులు బహుళ జోన్లో, అపైన రాష్ట్ర స్థాయిలో ఉండాలని సూచించారు. సదరు తీర్మానాల అంశాలను నాటి చీఫ్ సెక్రటరీ సిఎస్ జోషికి సమర్పించారు.

సీఎం పర్యవేక్షణ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగింది సదరు వివక్షత కారణం ప్రధానం కాగా, అట్టి వివక్షత రూపు మాపేందుకు, సిఎం కేసిఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించి, 7జోన్లు, 2 మల్టీ జోన్లను 31 జిల్లాలను కలిపి ఖరారు చేశారు. ప్రధాన కార్యదర్శి ద్వారా నోట్ ప్రభుత్వానికి సమర్పించ బడి, కేబినెట్ సమావేశం నిర్వహించి, ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి సమర్పించి, మొత్తం వ్యవహారాన్ని అమలులోనికి తెచ్చేందుకు, సిఎం స్వయంగా పర్య వేక్షించారు. ప్రధానిని ఒప్పించి, మెప్పించిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది.

జోనల్ వ్యవస్థలో సవరణలు

భారత ప్రభుత్వ గజెట్ పార్ట్-2 సెక్షన్ -3, సబ్ సెక్షన్ (1)…సంఖ్య 604, 20 ఆగస్టు 2018 ద్వారా హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఎస్.కే.షాహి సంతకంతో రాష్ట్రపతి పేరున గజిట్ లో ప్రచురితమైంది. ప్రచురిత అంశాల ద్వారా స్థానికులకు 95 శాతం, ఓపెన్ కోటాలో 5 శాతం ఉద్యోగాల నియామకాలు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పద్ధతులలో, రాష్ట్రస్థాయిలో పదోన్నతులు జరగాల్సి ఉన్నాయి. ఇదిలా ఉండగా, గత సాధారణ ఎన్నికల సమయంలో, ములుగు, నారాయణ పేట జిల్లాలను ఏర్పాటు చేయాలని,  ప్రజలతో పాటు, టీఆర్ఎస్ కేడర్ కూడా  ఉద్యమ బాట పట్టడం జరిగింది… అలాగే వికారాబాద్ జిల్లాను గద్వాల జోన్ నుంచి తొలగించి చార్మినార్ జోన్ లో కలపాలని,  జనగామ జిల్లాలో కలిపిన గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని ఆందోళనలు జరిగాయి.తదనుగుణంగా కెసీఆర్ ములుగు, నారాయణ పేట జిల్లాలను ఎర్పాటు చేయడం జరిగింది. అలాగే జోనల్ వ్యవస్థ కూడా సవరించే చర్యలు గైకొన్నారు.కేంద్ర హోంశాఖకు తిరిగి సమర్పించారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు, ఇతర అంశాలపై హోం శాఖకు స్పష్టత రాని కారణంగా, ఇంకా ఆమోదం పొందలేదు. సవరించిన జోన్ల ఆమోదం పొందక పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే న్యాయ పర చిక్కులకు అవకాశం ఉండగలదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles