Saturday, April 27, 2024

ఉక్కుమనిషి ‘సర్దార్’

  • నవభారత నిర్మాణంలో నిర్ణాయక పాత్ర
  • మొదటి నుంచీ తిరుగుబాటు స్వభావం
  • బర్డోలీ ఉద్యమంతో జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలు
  • నిజాం చేత సలాం చేయించుకున్న ఉపప్రధాని

సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరు వినగానే- దేశ స్వాతంత్ర్యం అనంతరం స్వదేశీ సంస్థానాల విలీనం అంశం ఎవరికైనా గురుకొస్తుంది. 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ నిజాం పైకి భారత సైన్యంతో దాడి చేయించి, రజాకార్లను పారద్రోలి, ఆ సంస్థానాన్ని ఇండియన్ యూనియ లో విలీనం చేసిన పటేల్ ఘనత అందరికీ స్ఫురణకు వస్తుంది. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగించి, మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ను లొంగ దీసుకున్న మహా సాహసి మన ‘సర్దార్’. ‘ఉక్కుమనిషి’గా దేశ ప్రజలంతా కీర్తించిన ఆయన 1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నడియాలో పటేల్ జవేరి భాయ్, లాడ్ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు. ఇంట్లో అన్నలు తనపై అధికారం చెలాయించిన క్రమంలో ఆయన తరుచూ ఎదురు తిరిగేవాడు. ఆ మనస్తత్వ ప్రభావమే పెద్దయ్యాక ఆయనలో స్పష్టంగా కనిపించింది. బాల్యంలో ఆకతాయిగా తిరుగుతూ చదువుపై అంతగా ధ్యాస పెట్టని పటేల్ చిన్న వయసులోనే ఆంగ్లభాషపై మమకారం పెంచుకున్నాడు. నాలు గేళ్లు కష్టించి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక, జిల్లా ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాద వృత్తిని చేపట్టారు. లండన్ వెళ్లి ‘బారిస్టర్’ చదవనిదే తనకు గౌరవం దక్కదని భావించి, మూడేళ్ళు శ్రమించి తగిన ధనం సంపాదించారు.

లండన్ లో బారిస్టర్ చదువు

సోదరుడు విఠల్ భాయ్ పటేల్ కోరికపై తాను సంపాదించిన డబ్బుతో అతడిని బారిస్టర్ చదివించారు. అన్న తిరిగి వచ్చాక, మళ్లీ సంపాదించిన డబ్బుతో లండన్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేశారు. తాను చదివిన విద్యాసంస్థలో ఉత్తమ విద్యార్థిగా 57 పౌనుల బహుమానాన్ని పొందారు. స్వదేశం వచ్చాక సూటు,బూటు,హ్యాటు ధరించి అహమ్మదాబాద్ లో గొప్ప క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచారు. లో ఒకరోజు స్నేహితులతో కలిసి క్లబ్లో పేకాడుతున్న సమయంలో గాంధీజీ అక్కడికి వచ్చి, జాతీయ పాఠశాలను నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. అపుడు గాంధీజీ వైపు పటేల్ కన్నెత్తైనా చూడలేదు. అయితే, అదే ఏడాది గాంధీజీ అధ్యక్షత వహించిన ‘గుజరాత్ కాంగ్రెస్ సభకు పటేల్ కార్యదర్శిత్వం వహించాల్సి వచ్చింది. అపుడు మహాత్ముని ప్రభావంతో పటేల్ జీవితం దేశానికి అంకితమైంది. 1918లో కైరా జిల్లాలో కరవు కారణంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని రైతులు చేసిన విజ్ఞప్తిని బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కైరా సత్యాగ్రహాన్ని పటేల్ విజయవంతంగా పూర్తి చేయగా, తనకు సరైన అనుచరుడు, కార్యదీక్షాపరుడు లభించాడని గాంధీ ప్రశంసించారు. ఆ తర్వాత అహమ్మదాబాద్ మున్సిపల్ చైర్మన్ గా 1928లో బార్డోలీ సత్యాగ్రహ సారథిగా, 1931లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకుడుగా  పటేల్ చురుకైన పాత్ర నిర్వహించారు. దేశ విభజన సమయంలో, భారత రాజ్యాంగ నిర్మాణంలో, సంస్థానాల విలీనంలో పటేల్ నాయకత్వ పటిమ ఉప యోగపడింది.

దేశ విభజన జరిగితేనే మంచిదని వాదించిన ఘనుడు

గాంధీజీ సహచరుడిగా, జైలులో ఆయనకు సంరక్షకునిగా వ్యవహరించిన పటేల్ వాస్తవ దృక్పథంతో ఆలో చిస్తూ, అరుదైన వ్యక్తిత్వంతో దేశానికి సేవలందించారు. ఒకసారి కోర్టులో వాదిస్తున్న సమయంలో ఆయనకు టెలిగ్రాం రాగా, దానిని చదువుకుని కొద్దిసేపు కళ్లు మూసుకొని, ఏమీ కానట్లు తన వాదనను కొనసాగిం చారు. ఆ తర్వాత అందరికీ తెలిసింది- ఆయన భార్య మరణించినట్లు టెలిగ్రాంలో వర్తమానం ఉందని. దేశ విభజన వేళ- ‘కుళ్లిన అవ యవాన్ని ఖండించి, మిగిలిన శరీరాన్ని కాపాడడమే మన కర్తవ్యం. దేశ విభజ నకు ఒప్పుకోకుంటే స్వాతంత్ర్యం వచ్చే అవకాశమే ఉండదు. మొత్తాన్ని కోల్పో వడం కంటే కొంత వదులుకోవడానికే నేను ఇష్టపడతాను’ అని ఆయన చెప్పేవారు. బార్డోలి సత్యాగ్రహం సందర్భంగా- ‘తక్కువ మాట్లాడండి, ఎక్కువ సాధించండి, విప్లవం.. అని కేకలు వేయకండి, అలా కేకలు వేసే నాయకులకు కొదవ లేదు. క్రమశిక్షణాశీలురైన అనుచరులు లేనిదే పోరాటం విజయవంతం కాదు. మంచి సైనికులుగా తయారుకండి’ అని పటేల్ పిలుపునిచ్చారు. కాగా, జాతీయోద్యమ సమయాన పటేల్ నెహ్రూతో విభేదించారు. 1938 నాటి కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని పటేల్ వ్యతిరేకించారు. సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకతను కాదని, సైనిక చర్యలు చేపట్టి సర్దార్ విజయం సాధించారు. పాకిస్తాన్ కు పరిహారం కింద 55 కోట్ల రూపా యలు ఇవ్వరాదని నెహ్రూతో వాదించారు.

రాజేంద్రప్రసాద్, పురుషోత్తమ్ దాస్ టాండన్ ల విజయం పటేల్ విజయమే

తొలి రాష్ట్రపతి ఎన్నికలలో నెహ్రూ రాజగోపాలాచారిని సమర్ధించగా, పటేల్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి తన అభ్యర్థిని గెలిపించుకోవడంలో సఫలీకృతులైనారు. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షునిగా అంబే ద్కర్‌ను నియమించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. 1950లోకాంగ్రెస్ అధ్యక్షునిగా నెహ్రూ కృపలానీని సమర్ధించగా, పటేల్ పురుషోత్తమ్ దాస్ టాండన్ ను గెలిపించారు. కేంద్ర హోం మంత్రిగా, ఉప ప్రధానిగా 1947 నుండి 1950 డిసెంబర్ 15న మరణించే వరకు పదవిలో ఉన్నారు. పటేల్ సేవలకు గుర్తింపుగా 1991లో ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం పటేల్ కు చాలా ఆలస్యంగా అందింది. తొలి కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఆయనకు సరైన గుర్తింపు రాలేదని బీజేపీ నాయకులు తరచుగా విమర్శిస్తుంటారు. బీజేపీ ప్రాభవం పెరిగిన తర్వాత సర్దార్ సరోవర్ లో పటేల్ అత్యంత ఎత్తయిన విగ్రహం చరిత్రకు సాక్షీభూతంగా నిలబడి ఉంది.

(అక్టోబర్ 31 పటేల్ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles