Sunday, April 28, 2024

బెనారస్ యూనివ‌ర్శిటీ వ్యవస్థాపకుడు మాలవ్య

భారతదేశ వాసులచే `మహాత్ముని’గా  గౌరవించ బడిన మహా మనీషి జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అలాంటి గాంధీ చేతే `మహామాన` బిరుదు పొందిన నేత పండిట్ మదన్ మోహన్ మాలవ్య.
మదన్ మోహన్ మాలవ్య (1861–1946) భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన  “పండిట్ మదన్ మోహన్ మాలవీయ” గా కూడా సుపరిచితుడు. ఆయన “మహాత్మా” గా కూడా గౌర‌వింప బడ్డాడు. మాలవ్య1915 లో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం వ్యవస్థాపకుడు. వారణాసిలో ఈ విశ్వ విద్యాలయాన్ని  స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నాలుగు సార్లు పనిచేశాడు.

అసలు ఇంటిపేరు చతుర్వేది

1861, డిసెంబర్ 25 తేదిన  అలహాబాదులో మూనాదేవి,  బ్రిజ్‌నాథ్ దంపతులకు జన్మించిన మదన్ మోహన్ మాలవ్య పూర్వీకులు మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం నుండి వలస వచ్చారట. అందుకే ఆయన ఇంటి పేరు కూడా మాలవ్యగా సార్థకమైంది. ఆయన అసలు ఇంటి పేరు చతుర్వేది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటి పురోహితులుగా ఉన్నారు. ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు. మాలవ్య సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.

పాఠ‌శాలకాలం నుంచే ర‌చ‌న‌లు

పాఠశాల రోజుల నుండే మకరంద్ అనే కలంపేరుతో కవిత్వం రాయడం ప్రారంభించాడు మాలవ్య. 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వ విద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. లో పట్టభద్రులైనాడు. సంస్కృతం లో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. తర్వాత ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు. అంతకు ముందే ఆయన ‘ది ఇండియన్ ఒపీనియన్’ అనే పత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. అలాగే న్యాయ శాస్త్రంలో కూడా పట్టా పొందాడు.

అభ్యుద‌య వార్తా ప‌త్రిక స్థాప‌న‌

1907లో మాలవ్య స్వయంగా ‘అభ్యుదయ’ అనే వార్తాపత్రిక ప్రారంభించాడు. 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక ‘లీడర్ ‘ పత్రికను స్థాపించాడు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ కు చైర్మన్ గా ఉన్నాడు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగ పడ్డాయి. 1908లో బ్రిటీష్ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధించినప్పుడు వాటికి వ్యతిరేకంగా అలహాబాద్‌‌లో అఖిలభారత కాన్ఫరెన్సును నిర్వహించాడు. 1922లో హిందు మహాసభ అధ్యక్షుడుగా పనిచేశాడు. “సత్యమేవ జయతే” అనే నినాదాన్ని తొలినాళ్లలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాలవ్యనే.

నాలుగు సార్లు జాతీయ కాంగ్రెస్‌కు సార‌థ్యం

మాలవ్య భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పని చేశాడు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టాడు. హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922 లో చౌరీ చౌరా దాడుల ఘటనలో మరణశిక్ష పడిన 225 మంది స్వాతంత్ర్య సమరయోధులు, సాధారణ ప్రజానీకం తరపున వాదించి, వారిలో 153 మందికి ఆ శిక్ష పడకుండా కాపాడ గలిగాడు.

గంగా న‌ది ప‌రిర‌క్ష‌ణ‌కు ఉద్య‌మం

గంగా నది పరిరక్షణ కోసం ‘గంగా మహాసభ’ పేరుతో ఉద్యమాన్ని కూడా లేవదీశాడు మాలవ్య.
భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు వ్యవస్థాపకులలో మాలవ్య ఒకడు. బ్రిటీష్ నియంతల రాజ్యానికి ఊతమిచ్చేందుకు ప్రారంభించిన సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా గళం విప్పాడు. బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమర యోధులతో కలిశాడు.

“సత్యమేవ జయతే” అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. ఆయన గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను అనుక్షణం అనుసరించడానికి ఇష్టపడే వాడు. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.

ఎరవాడలో గాంధీ నిరశనదీక్ష
 
రెండవ రౌండు టేబులు సమావేశం తరువాత రామ్సే మెక్డొనాల్డ్ ప్రధాన మంత్రిగా ఉన్న బ్రిటిషు ప్రభుత్వం, బి.ఆర్.అంబేద్కర్ ప్రతిపాదన మేరకు  బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును తీసుకొచ్చింది. అల్ప సంఖ్యాక మతస్తులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ఈ అవార్డు లక్ష్యం. అయితే ముస్లిములు, సిక్కులతో పాటు, దళితులను కూడా అల్ప సంఖ్యాక మతస్తులుగా ఈ అవార్డు ప్రకటించింది. అయితే మహాత్మా గాంధీ దీన్ని వ్యతిరేకించాడు. దళితులను విడదీస్తే హిందూ మతం విచ్ఛిన్నం అవుతుందని భావించి, అందుకు నిరసనగా గాంధీ పుణెలోని ఎరవాడ జైల్లో నిరాహారదీక్ష చేపట్టాడు. కాంగ్రెసు నాయకులు గాంధీ వాదనకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో అంబేద్కరు ఎరవాడ జైల్లో గాంధీతో చర్చించారు.

ఫుణ్ ఒప్పందంపై సంతకాలు

వారి చర్చల ఫలితంగా వెలువడిందే పూణె ఒప్పందం. 1932లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన పూనా పాక్ట్ అగ్రిమెంట్ పై ఆయనతో కలిసి మాలవ్య సంతకం చేశాడు. మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. వారణాసిలో ఈ విశ్వ విద్యాలయాన్ని  స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వ విద్యాలయం,  ప్రపంచంలోనే పెద్ద విశ్వ విద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు, విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్య ఆ విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశాడు.

ఆజన్మబ్రహ్మచారి

జీవితకాలం మొత్తం బ్రహ్మచారిగానే గడిపిన మాలవ్య 1946 నవంబరు 12 (వయసు 84)న బనారస్ మరణించాడు. డిసెంబర్ 24,2014 న మదన్ మోహన్ మాలవ్యను ఆయన మరణాంతరం భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు భారతరత్నకు వరించింది.

(నవంబర్ 12, మదన మోహన మాలవ్య వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles