Sunday, April 28, 2024

జూరాల ఆర్గానికి ఫార్మ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి:హెచ్ ఆర్ఎఫ్

మానవ హక్కుల వేదిక, తెలంగాణ కమిటీ పత్రిక ప్రకటన చేసింది:

నారాయణ పేట్ జిల్లా,మర్రికల్ మండలం, చిత్తనూరు గ్రామంలో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఒక ఇథనాల్ తయారు చేసే కార్మగరం నెలకొల్పింది. గత 8 నెలలుగా ఈ ఫ్యాక్టరీ మూసీ వేయాలని 10 గ్రామాల రైతులు,ప్రజలు నిరవదిక ఆందోళన చేస్తున్నారు .

ఈ ఫ్యాక్టరీ రోజుకి 1 x 400 కిలో లీటరు + 1 x 200 కిలో లీటరు వెరసి రోజుకి 6 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కర్మాగారం ఏర్పాటు కు సంబందించిన అనుమతులు, కాలుష్య కారకాల అంశాలు ప్రారంభం నుండి వివాదాస్పదంగా ఉన్నాయి.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సవరించిన విధానాల కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ జరప కుండా కంపెనీకి పర్యావరణ అనుమతులివ్వడం, స్థానిక ప్రజలకు కనీస  సమాచారం లేక పోవడం, రోడ్డు కోసమని అధికారుల అండ దండలతో దళితుల భూములు బలవంతంగా లాగేసుకోవడం, దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న సాగు నీటిలో కొంత కంపెనీకి ఇవ్వడం ప్రజలలో అందోళన కలిగించాయి.

ప్రజలు లేవనెత్తిన సమస్యలకు సరైన సమాధానాలకు బదులు, అబద్ధాలతో ప్రశ్నిస్తున్న ప్రజలపై దాడికి దిగారు. ఒక రాజకీయ పార్టీ ఐటి సెల్ ని ప్రశ్నిస్తున్న వారిపై ప్రయోగించారు. తిండి గింజల నుండి ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమ తెలంగాణా ప్రజలకు కొత్త కాదు. దాని దుష్ఫలితాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో, తెలంగాణలో అనుభవమైనవే. కరీంనగర్ దగ్గర పర్లపల్లి లోని ప్లాంటుతో భరించ లేని దుర్వాసన బాధితులైన ప్రజలు, నిరసన తెలిపితే వారిపై స్పెషల్ పోలీసులతో దాడి చేసి విచక్షణా రహితంగా ఆడ, మగా, వృద్ధులూ అందరినీ బాది, ఊరి పూజారితో సహా ఎందరినో కటకటాల పాలు చేసిన సంఘటన ప్రజలు ఇంకా మరవ లేదు. ఆ ప్లాంటు యజమాని మాదే అధికారం అంటున్న రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడు. జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ లో అధికారానికి పోటీలో వున్న ప్రధాన పక్షాల నాయకులున్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల కోలాహలంలో ఉండి సమస్య ను పట్టించుకోవడం లేదు.

గత వంద రోజులకు పైగా నిరసన తెలుపుతున్న గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాని ప్రజలు ధైర్యం సడలిపోక నిరసన కొనసాగిస్తూ, కంపెనీపై నిఘా వుంచారు. ప్లాంటు ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించింది. నియమాల ప్రకారం ఉత్పత్తి మొదలెట్టే ముందుగా కాలుష్య నియంత్రణ మండలి నుండి ప్లాంటు నడిపేందుకు (CFO) తీసుకోవాలి. అదిచ్చేముందు, కాలుష్య నియంత్రణ అధికారులు ప్లాంటు పర్యావరణ అనుమతి పత్రంలో విధించిన షరతుల అమలు పరచారో లేదో పరిశీలించాలి. ఈ ప్లాంటు విషయంలో అనుమతి పత్రం షరతు ప్రకారం ఒక చుక్క వ్యర్ధ జలం కూడా బయటకు విడువ రాదు. ఉత్పత్తి క్రమంలో విడుదలైన మొత్తం కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసి పునరుపయోగించాలి.

2. “The proponent shall obtain Consent for Operation (SFO) from TSPCB, as required Under Sec.25/26 of the Water (Prevention and Control of Pollution) Act, 1974 and under Sec. 21/22 of the Air (Prevention and Control of Pollution) Act, 1981, before commencement of the activity.”

7. “The industry shall treat and reuse the treated water within the factory and no waste or treated water shall be discharged outside the premises.”

కంపెనీ పై రెండు షరతులూ అమలు చేయలేదన్నది స్పష్టం. CFO తీసుకుని వుంటే వ్యర్ధ జలాలు మన్నె వాగులోకి విడువ వలసిన అవసరం రాకూడదు. క్రింది రెండిట్లో ఏదైనా జరిగి వుండాలి.

కాలుష్య నియంత్రణ మండలి నిర్మాణం పూర్తి కాకుండానే CFO యిచ్చి వుండాలి లేదా,

ప్లాంటు యాజమాన్యం CFO లేకుండానే ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభించి వుండాలి.

కాలుష్య నియంత్రణ మండలి కుమ్మక్కుతోనే ఇదంతా జరుగుతూ వుండాలి.

మన్నె వాగులో వదలడం బయట పడింది గనుక దిక్కు లేని స్థితిలో టాంకర్ లతో బయట పారబోయించే యత్నంలో రెండు సార్లు దొరికారు. ప్రజలకు తప్పు జరుగుతోందని తెలుసుగాని ఇది కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని విషయమని తెలియక పోలీసులను ఆశ్రయించారు. ఆ టాంకర్ బయటకు పంపే టపుడు కంపెనీ వ్యర్ధ జలాలు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు, అందుకు అనుమతి వివరాలున్న మానిఫెస్ట్ కాపీలు డ్రైవర్ కి యివ్వాలి. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసినపుడు వారు వ్యర్ధాలు తరలించేందుకు అనుమతి ఉన్నదో లేదో చూడాలి. అనుమతి లేకుండా తరలిస్తుంటే కేసు పెట్టాలి. నిరంతర నిఘాతో జరుగుతున్న నేరాన్ని నిరూపణ చేసిన ప్రజలపై లాఠీ ప్రయోగించడం గర్హనీయం. ప్రభుత్వాధికారులు ప్రజల కోసం కాదు, సంపన్నుల సేవకులని మరో సారి నిరూపించారు.

పర్యావరణ నేరాలకి పాల్పడుతున్న జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ ని వదిలి వారి నేరాలను చూపిన ప్రజలపై పోలీసు దాడులను ఖండిస్తున్నాము.

ప్రభుత్వం వెంటనే ప్రజలు లేవ నెత్తుతున్న అంశాల గురించి పట్టించుకోవాలి.

ఫ్యాక్టరీ నీ తాత్కాలికంగానైనా నిలిపివేసి, నిపుణుల కమిటీ వేసి అన్ని అంశాలు పరిశీలించాలని మా సంస్థ డిమాండ్ చేస్తుంది.

డాక్టర్ తిరుపతయ్య

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

డాక్టర్ కె. బాబురావు,

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.

S. జీవన్ కుమార్

ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు.

Dt.24.10.2023

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles