Monday, April 29, 2024

చంద్రోదయం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

జీవితం అంతా జీతం కోసం తాపత్రయం
విత్తమే విలువలకు పరాకాష్ట అయిన జీవితం
ఎందుకు బ్రతకాలో తెలియని అయోమయం
ఇదంతా నీకు నేను, నాకు నువ్వు లేని నిరామయం.

మనకు ఎన్ని ఆశలున్నా
ఒకరికొకరం పంచ ప్రాణాలైనా
సమాజానికి వెరచే తల్లిదండ్రుల అధీరత్వం
వారి మాటలను కాదనలేని నిస్వార్ధం
స్వసంతోషాన్ని త్యాగం చేసిన నిస్సంగత్వం.

రాగం విరాగంగా మారిన వేళ
పెనవేసుకున్న ఆత్మజ బంధం దూరమైన వేళ
అడ్డాలనాటి బిడ్డలు చేయి వదలి
రెక్కలొచ్చి ఎగిరిపోయిన వేళ
ఉన్న తోడు స్వాంతన ఇవ్వలేని వేళ
విశాలమైన గుండె మొరాయించగా
నీలో సగ భాగం అచేతనమైన వేళ
బిడ్డ మీద కినిసి, బ్రతుకు మీద రోసి
శంకర మఠానికి వెళదామంటూ
శంకరుడి చెంతకే వెళ్లిపోయావు
నీలోని నాతో సహా.

ఈ బంధం జన్మ జన్మల బంధమేనా
కనుమూసి గగనాన కలిసేదేనా
ఏవరికి తెలుసు, ఎవరూ చెబుతారు
చకోర పక్షులమై ఎదురు చూడవలసిందే
ఏనాటికైనా, ఎన్ని యుగాలైనా
మనం కలవక తప్పదుగా
అనంత కాల వాహినిలో
కాసారంలో కలువలం అవక తప్పదుగా.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles