Tuesday, April 30, 2024

గ్రామాలలో పిల్లలు భావి భారత పౌరులవ్వాలిగా…

ఫొటో రైటప్: పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న మండలి బుద్ధప్రసాద్

అంటూ పుస్తకం రచించి ఈ ఆగస్ట్ లోనే ముద్రించి ఇవాళ ఉదయం మాయింటికి వచ్చి అందజేశారు డా. నాగులపల్లి భాస్కరరావు గారు. అయన స్వగ్రామం ముదునూరు లో ‘చరిత్ర పుస్తకాల గ్రంథాలయం’  నెలకొల్పి భావి భారత పౌరుల్ని మహిళా మణులను ఉత్తేజితం చేస్తున్నారు పలుకార్యక్రమాలు నిర్వహిస్తూ. మనం బాలల దినోత్సవం నాడో లేక స్కూల్ వార్షికోత్సవం నాడో ‘’నేటి బాలలే రేపటి పౌరులు‘’అంటూ ఒక వాక్యం చెప్పి మన పని అయిపోయిందని భావిస్తాం. ఆపైన మనం అన్నమాట మనకీ, వాళ్ళకీ గుర్తుండదు. ఇదిగమనించిన రావుగారు ఫాలో అప్ యాక్షన్ ఉండకపోతే ఆ సూక్తి నిరర్ధకమని భావించి అందంగా ఆకర్షణీయంగా విషయ వివరంగా ఈ పుస్తకం రాశారు. అందుకు వారిని ప్రత్యేకించి అభినందించాలి. అందులోని శీర్షికల పేర్లు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వాటిలో సరైన  నిండైన సమాచారమూ ఉండి ప్రేరణాత్మకంగా ఉంది. మాటలు కావు చేతలు ముఖ్యం అని ఈ వయసులోనూ తపన పడుతున్నసమాజ హితైషి డా. రావు.

డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు రచించిన పుస్తకం

 తలిదండ్రులు పిల్లలను ఎలా ప్రోత్సహించాలి, వారి అభిరుచులను ఎలాగ్రహించి వారికి మార్గదర్శనం చేయాలి, ఎక్కడ వారు తప్పటడుగులు వేస్తున్నారు, ఎలా వారిని సరైనదారిలో పెట్టాలి అనే అనేక విషయాలు ఇందులో చర్చించారు. సవివరం గా  గణాత్మకంగా, గుణాత్మకంగా అంద జేశారు. ప్రతి తల్లీ తండ్రీ ఈ పుస్తకాన్ని చదవాలి పిల్లలను తీర్చి దిద్దాలి. ‘‘ఇవాళ దేశం చాలా పక్కదారిలో నడుస్తోంది. పట్టించుకొనే వారే లేరు. ఇలా కొంతకాలం గడిస్తే సరిదిద్దలేని అధోగతి పాలౌతాం’’ అని ఆవేదన చెంది రాశారు రావుజీ. గ్రామాల స్కూళ్ళ స్థితి, వంటపట్టని వీడియోచదువులు, ఉచితంలో ఉన్న దగా కళ్ళకు కట్టించారు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి. కష్టపడికాదు ఇష్టపడి చదవాలి. ఆహారపు రుచిలాగానే వ్యక్తిత్వానికీ రుచి ఉంటుంది మనకిష్టమైన రుచి ఎంచుకొని తిన్నట్లే మనకిష్టమైన వ్యక్తిత్వాన్ని ఎంచుకొని సాధించాలి. ఇందులో పెద్దల సహకారం, మహనీయుల జీవిత చరిత్రలు బాగా తోడ్పడతాయి. వినోదం విద్యలో భాగంగా ఉంటేనే విద్య విలువైనది గా రాణిస్తుంది. చదువు అంటే ఒక తరగతి తర్వాత ఒకటి పాసైపోవటం కాదు. విజ్ఞత, వినయ దేశభక్తి, పరస్పర సహకారంచ ఐక్యత ,ప్రేమ దయ సానుభూతి  అనేవి ఏర్పడటమే. ఇవి లేని, రాని విద్య అనవసరం తనకి కుటుంబానికి సంఘానికి దేశానికి కూడా.  తను బాగుపడి సమాజాన్ని బాగు చేస్తూ దేశానికి ఉపయోగకరంగా జీవించాలి. ఉద్యోగం, డాలర్లు జీవితంకాదు. బాధ్యతలు బంధాలు మరవకుండా ఉండటం. ఉత్తమ వ్యక్తిత్వ సాధనే  విద్య. ఉన్నత ఆలోచనా ప్రవాహమే విద్య.

ఇలాంటి ‘’సువర్ణ ‘’ప్రవాహంగా ఈ పుస్తకాక్షరాలు  సాగాయి. అందమైన ముఖ చిత్రం మరింత అందమైన చిత్రాలు పుస్తకాన్ని అందరికీ ఆకర్షణ కలిగించాయి. పుస్తకంలో ఆడియో సౌకర్య౦ కూడా కల్పించి కొత్త వరవడికి దారి తీశారు శ్రీ భాస్కరరావు. పుస్తకం వెల వందరూపాయలు మాత్రమే ..ఈ పుస్తకం అందరి హస్తభూషణం కావాలి. మస్తకానికి పని చెప్పాలి. ఆసక్తి ఉన్నవారు రావుగారి 9811159588 వాట్సాప్ నంబర్ కి ఫోన్ చేయవచ్చు.

-గబ్బిట దుర్గాప్రసాద్-17-8-23-ఉయ్యూరు

దుర్గాప్రసాద్ గబ్బిట
దుర్గాప్రసాద్ గబ్బిట
గబ్బిట దుర్గాప్రసాద్ తెలుగు రచయిత, ఉపాధ్యాయుడు. 27-6-1940 న కృష్ణా జిల్లా ఉయ్యూరులో గబ్బిట భవానమ్మ, మృత్యుంజయ శాస్త్రి దంపతులకు జన్మించాడు. ఎం ఏ (తెలుగు), బి.ఎస్ సి. బి.ఎడ్ చదివాడు .కృష్ణా జిల్లాపరిషత్తులో 1963 నుండి 1998 వరకు ఫిజికల్ సైన్స్ టీచరుగా, పదానోపాధ్యాయుడుగా పనిచేసాడు. పదవీవిరమణ అనంతరం సరసభారతి సంస్థను స్థాపించాడు. భార్య ప్రభావతి. అతనికి నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles