Tuesday, April 30, 2024

ఖర,దూషణాదులను యమపురికి పంపిన రాముడు

రామాయణమ్68

ఆ రాక్షసులంతా వస్తూ వస్తూనే వేలకొలదిగా ఆయుధాలు రాముడి మీద ప్రయోగిస్తూ వస్తున్నారు.

శూలములు, ముద్గరములు, ఖడ్గములు, గండ్రగోడ్డళ్ళు, ప్రాసలు మొదలైన ఆయుధాలు ఆయన మీదికి దూసుకుంటూ వస్తున్నాయి.

ఒక్కడు రాముడు. వేలకొలదిగా రాక్షసులు.

Also read: పెద్ద సేనతో రాముడిపై యుద్ధానికి బయలుదేరిన ఖరుడు

చూసే సిద్ధ, గంధర్వ, మహర్షి గణాల వదనాలలో అయ్యో అనెడి జాలి చెలరేగింది హృదయాలలో విషాదము నిండింది.

రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు రాముడి శరీరానికి తగిలి ఆయన శరీరము పూచిన మోదుగ అయ్యింది.  నీలాకాశంలో ప్రజ్వరిల్లే అగ్ని అయ్యింది.  సహజ శాంత చిత్తుడు క్రోధమనస్కుడైనాడు. చేతిలోని కోదండము ఒక ఆట బొమ్మ అయ్యింది. దానిని ఎప్పుడు వంచుతున్నాడో, ఎప్పుడు గిరగిర తిప్పుతున్నాడో ఎవరికీ తెలియటంలేదు.

ఎవరికీ రాముడు కనపడటంలేదు రివ్వున గుండ్రముగా తిరుగుతున్న ఒకతేజఃపుంజముగా భాసిల్లుతున్నాడాయన.

ఆయన వింటి నుండి వెలువడ్డ బాణాలు రాక్షసుల గుండెలనుండి దూసుకుంటూ వెళుతున్నాయి. వారి శరీరాలను రాసుకుంటూ వెళుతున్నాయి. వారి అవయవాలను  కోసుకుంటూ వెళుతున్నాయి.

ప్రయోగించేది ఒక్కడే! కానీ ఏ బాణము ఎటునుండి వస్తున్నదో అర్ధము కాలేదేవరికీ.

ఆకసమంతా రామధనుర్విముక్త శరాలే.

Also read: శూర్పణఖ ముక్కుచెవులు కోసిన లక్ష్మణుడు

ఆ బాణాలు రాక్షస సైన్యము నిలుచున్న ప్రదేశాన్నంతా కప్పివేశాయి.

శిరస్సులు బంతుల్లాగా గాలిలో తేలుతున్నాయి. కవచాలు బద్దలవుతున్నాయి.

గుండెలు పగులుతున్నాయి. ఎటుచూసినా భయంగా, దీనంగా రోదించే రాక్షసులే కనపడ్డారు. దెబ్బలకు తాళలేక పరుగెడుతుంటే వారిని ఉరికించి ఉరికించి మరీ కొడుతున్నాడు రాఘవుడు.  దెబ్బలకు ఓర్వలేని సైన్యానికి ధైర్యము చెప్పి దూషణుడు వచ్చాడు రాముడి మీదకు.

దూషణుడు ఉన్నాడన్న ధైర్యముతో చావగా మిగిలిన వారంతా రాముణ్ణి మరల చుట్టుముట్టారు.

ధనుస్సు ఎక్కుపెట్టినది, నారిసారించినది, బాణము తొడిగినది, విడిచినదీ  ఏదీ కనపడటము లేదు ఎవరికీ. కేవలము తమ తోటి వారు బాణపు దెబ్బకు కూలి నేలరాలటము మాత్రమే చూస్తున్నారు. బాణము వదిలే శబ్దము ఉరుములాగా ఉన్నది. అది లక్ష్యాన్ని ఛేదించి భూమిలో దిగబడుతున్నప్పుడు పిడుగులాగా ధ్వనిస్తున్నది. ఇవి మాత్రమే ఏ కొంచెము కూడా విరామము లేకుండా వినపడుతున్నాయి. క్రమంగారాక్షసులసంఖ్యాబలముతగ్గిపోయింది. దూషణుడు, త్రిశిరుడు, ఖరుడు మాత్రమే మిగిలారు.

Also read: శ్రీరామచంద్రుడిపై మనసు పారేసుకున్న శూర్పణఖ

దూషణుడు…వీడు ఖరుడి సేనాపతి. తనఎదురుగా సేన మొత్తము నాశనము అవ్వటాన్ని చూసి వాడిలో పట్టరాని ఆవేశము  పుట్టింది. వజ్రాయుధాల వంటి బాణాలతో ఒక్కసారిగా రాముణ్ణి కప్పివేసాడు. వాడి ఆక్రమణను చూసి రాముడికి కోపము హెచ్చి ఒక అర్ధ చంద్రాకారపు బాణముతో వాడి ధనుస్సు త్రుంచి ఇంకొక నాలుగు బాణములతో వాడి రధానికి పూన్చిన  గుర్రాలను చంపి వేసాడు. ఇంకొక బాణముతో సారధిని నేలకూల్చాడు. ఈ పనులన్నీ ఒకదానివెంట మరొకటి రెప్పపాటుకాలములో పూర్తిచేశాడు రాముడు.

దూషణుడు ఇంకా రెచ్చిపోయాడు. రధము మీదున్న బంగారపు పట్టీలు, ఇనుపమేకులతో కూడి ఉన్న పరిఘను బయటకు తీశాడు. దానికి శత్రుసైనికుల శరీరాలను మర్దించినప్పుడు కారిన వస దట్టముగా అంటిఉన్నది.

తన మీదకు ఆయుధాన్ని పట్టుకొని దూకుడుగా వస్తున్న వాడి బాహువులను రెండింటినీ ఖండించి వేసాడు రామచంద్రుడు. రెండుచేతులూ నేలపై రాలగా వాడు నిలువలేక నేలపై దబ్బున పడిపోయాడు.

ఎటు చూసినా రాక్షస కళేబరాలే. వారి రక్తము ఏరులై ప్రవహిస్తూ నేలను బురదబురదగా చేసింది. సుందరమైన ఆ ప్రాంతమిప్పుడు నరకాన్ని తలపిస్తున్నది.

Also read: పంచవటిలో పకడ్బందీగా, సుందరంగా పర్ణశాల నిర్మాణం

తన సేన మొత్తము ఆవిధముగా నాశనము అవ్వటము చూసిన ఖరుడు  కోపము పట్టలేక రాముడి మీదికి దూసుకుంటూ వస్తున్నాడు.  వాడి మార్గానికి అడ్డముగా త్రిశిరుడు అనే సేనాపతి వచ్చి నిలిచి, ‘‘ప్రభూ! నీకెందుకు శ్రమ నేనున్నానుగా’’ అంటూ  వాడిని త్రిప్పి పంపి, ముందుగా మృత్యువును తానె కౌగాలించుకోవాలన్నట్లుగా రాముడి తో యుద్ధానికి బయలు దేరాడు.

ఇద్దరి మధ్యా ఘోరమైన యుద్ధము జరిగింది. ఒక సింహానికి ఒక ఏనుగుకు మధ్య జరిగినట్లుగా ఉన్నదది.

త్రిశిరుడు ప్రయోగించిన మూడు బాణాలు రాముని నుదురుకు తగిలి బాధించాయి. వాడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే, ‘‘రా! ఇదిగో నా బాణాలు కూడా స్వీకరించు నీవు!’’  అంటూ వాడి వక్షస్థలం మీద బలంగా పద్నాలుగు బాణాలతో కొట్టాడు. వాడు తేరుకోకముందే వాడి సారధిని, గుర్రాలను ఒక్క వేటున నేలకూల్చాడు. అదిగమనించిన త్రిశిరుడు గాలిలోకి ఎగురబోగా వాడిగల శరములతో వాడి వక్షస్థలం బద్దలుకొట్టాడు. ఇంకొక బాణముతో వాడి శిరస్సు ఖండించి వేశాడు.

ఖరుడికి ఒక్కసారిగా గుండె జలదరించింది. ‘‘ఈ మానవుడేమిటి? ఇలా ఒంటరిగా ఇన్ని వేలమంది వీరాధివీరుల తలకాయలు ఎగురగొట్టడమేమిటి?’’ అని వాడిలో ఒక రకమైన జంకు కలిగింది. అయినా మూర్ఖముగా  కోపించి ధనుస్సు ఎత్తిపట్టుకొని నారి సారిస్తూ రాముడి మీదకు వెళ్లి అస్త్రాలతో రకరకాల విన్యాసాలు చేశాడు.

ఇద్దరి ధనుస్సులనుండి బయల్వెడలిన బాణాలు ఆకాశాన్నంతా కప్పివేసి సూర్యకిరణాలు జొరబడటానికి కూడా అవకాశము లేకుండా చేసివేసాయి.

Also read: పంచవటి సందర్శన

దెబ్బతిన్న పులిలాగా, తోకతొక్కిన త్రాచులాగా, రేచుకుక్కలాగా ఖరుడు మీదమీదకు వస్తున్నాడు. రాముడిని తీవ్రమైన బాణాలతో వేధిస్తున్నాడు వాడు.

రాముడు అంతమందినీ ఎదుర్కొని ఉన్నాడు కాబట్టి అలసి పోయి ఉన్నాడనుకొన్నాడు. కానీ యుద్ధము జరుగుతున్నకొద్దీ అవక్రపరాక్రముడైన రాముని రణోత్సాహము ద్విగుణీకృతం అయ్యింది.  ఒక సింహాన్ని మరొక సింహము ఎదుర్కొన్నట్లుగా ఉన్నది. కొంతసేపటికి ఖరుడు రాముని చేతిలోని ధనస్సును ఒడుపుగా విరగగొట్టాడు. వెంటనే రాముడి కవచాన్ని కొట్టాడు. ఖరుడి దెబ్బకు స్వర్ణకాంతులీనే రాముని కవచము నేలమీద పడిపోయింది.వెంటవెంటనే ఎన్నో నిశిత శరాలతో రాముడిని పీడించాడు ఆ దానవుడు..

రాముడు కృద్ధుడైనాడు. కాలరుద్రుడైనాడు. పొగలేకుండా భగ్గున పైకిలేచిన అగ్ని జ్వాల అయినాడు. అగస్త్య ముని ఇచ్చిన వైష్ణవ ధనువు చేతబూనాడు. ఒక బాణముతో రధము కాడిని, నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను, ఆరవ బాణముతో సారధిశిరస్సును, మూడు బాణాలతో రధము ముందు భాగాన్నీ, రెండుబాణాలతో రధపు ఇరుసును, ఇంకొక బాణముతో ఖరుడి ధనుస్సును, పదమూడవ బాణముతో ఖరుడిని తీవ్రముగా కొట్టాడు.

ఒక శ్రేణిలో ప్రయోగించబడిన బాణాల దెబ్బకు దిమ్మరపోయిన ఖరుడు  అన్నీ కోల్పోయిన వాడై చేతిలో గద ధరించి రధమునుండి నేలమీదికి దూకాడు.

అలా నిలుచున్న వాడిని చూసి, ‘‘ఎందుకురా మీరు ఆకారణముగా  శాంత స్వభావులైన మునులను హింసిస్తారు! మీరు పూర్వము హింసించి చంపిన మునులందరూ ఇదిగో మీ చావును పైనుండి కళ్ళారా చూడబోతున్నారు .ఇదుగో నీ తల తాటిపండు రాలినట్లు నేలరాలుతుంది. చూడు’’ అంటూ తన మీదికి వాడు విసిరిన గదను చూర్ణము కావించాడు.

ఇద్దరి మధ్యా నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన యుద్ధములో రాముడు పైచేయి సాధించి ఒక బాణముతో వాడి రొమ్ముమీద కొట్టగా అది పిడుగులాగా వాడిని తగిలి వాడి ప్రాణాలు తీసి భూమిలో కూరుకుపోయింది,.

జనస్థానములో రాక్షసుల ఆటలిక చెల్లవన్నట్లుగా సింహములాగా నిలుచున్నాడు రాముడు. ఇంతమంది రాక్షసులను కేవలము ఒక గంటాపన్నెండు నిముషాలలో రామసింహము వేటాడింది. సహజనీల వర్ణుడు రాముడు, ఆయన శరీరము నీలాకాశములో నిప్పుల ప్రవాహము కనపడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది. నీలపు శరీరము మీద ఎర్రని రక్తపుచారికలు. అలా కనిపిస్తున్న రణకోవిదుడు రాముడిమీద ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు దేవతలు.

‘‘రండిరా ఎవడొస్తాడో చూస్తాను!’’

ఇప్పుడే వేట మొదలయ్యిది అన్నట్లుగా నిలుచున్నాడు ధనుస్సు చేతబూని శ్రీరామచంద్రుడు.

Also read: అగస్త్య ముని చెంతకు సీతారామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles