Friday, April 19, 2024

సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఏచూరి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక

  • పొలిట్‌బ్యురోలోకి తొలి దళితుడు రామచంద్రడోం : చరిత్ర సృష్టించిన సిపిఎం
  • కేంద్ర కమిటీలో 85 మందికిచోటు 17 మంది యువకులకు స్థానం
  • తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉద్యమం – తగ్గిన కేంద్ర కమిటీ ప్రాతినిధ్యం
తొలి దళిత పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ రామచంద్ర దోం

సీపీఐ(ఎం) 23వ పార్టీ మహాసభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేర‌ళ‌  లోని కన్నూర్‌  లో  23వ పార్టీ మహాసభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో సీతారాం ఏచూరి జన్మించాడు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. సీతారాం ఏచూరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు. ఈయన తల్లి కల్పకం మోహన్ కందా సోదరి, ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ శిష్యురాలు. సీతారాం విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీ.హెచ్.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు

తగ్గిన తెలుగువారి ప్రాతినిథ్యం

కేరళలోని కన్నురులో జరుగుతున్న సిపిఎం మహాసభలు ఈ రోజుతో ఆదివారం తో ముగిశాయి. ఎప్రిల్ 6 నుండి 10 వ తేదివరకు అరు రోజులపాటు జరిగిన ఈ  మహసభల  సందర్బంగా కొత్త కేంద్ర కమిటీని వివిధ రాష్ట్రాల నుండి హాజరైనటువంటి ప్రతినిధులు కేంద్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలహీనపడటంతో ప్రాతినిధ్యం తగ్గింది. సీపీఎం కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి తమ్మినేని వీరభద్రం, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, ఆంధ్ర కమిటి నుండి వి. శ్రీనివాసరావు, గఫూర్ లు ఎంపికయ్యారు. తెలంగాణ నుండి గతంలో కేంద్ర కమిటీలో వున్న వీరయ్యను, ఆంధ్ర నుండి వున్న మధును తగ్గించారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆవిర్భావానికి పునాదులేసిన తెలుగు రాష్ట్రాల నుండి తొలిసారి సాపేక్షంగా కేంద్ర కమిటీలో ప్రాతినిధ్యం తగ్గింది. 2018లో జరిగిన మహాసభల్లో 94మందితో కూడిన కేంద్ర కమిటీని ఎన్నుకుంటే ప్రస్తుత మహాసభల్లో కేంద్ర కమిటీ సంఖ్య 85 కి తగ్గించారు. ఇందులో ఒక స్థానాన్ని ఖాళీగా పెట్టారు. 84 మందిని మహాసభ ఎన్నుకుంది. తెలుగు రాష్ట్రాల నుండి ఒకప్పుడు ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య ఐదుకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ నుండి కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగిన పి మధు కమిటీ నుండి వయసు రీత్యా తగ్గించారు. కానీ ఆ స్థానంలో మరో సభ్యుడిని తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సభ్యత్వం గణనీయంగా పడిపోయిందన్న కారణంగా మొత్తం రాష్ట్ర కమిటీ పరిమాణాన్నే గత మహాసభల్లో కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నుండి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనిసవాసరావు, ఎంఎ గఫూం కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

సభాస్థలి ఇకె నారాయణ్ నగర్

నలుగురు కేంద్రకమిటీ సభ్యులున్న తెలంగాణ నుండి ఈసారి ముగ్గురు మాత్రమే ఎన్నికయ్యారు. నవతెలంగాణ పత్రిక సంపాదకుడుగా పని చేసిన ఎస్‌ వీరయ్యను కేంద్ర కమిటీ నుండి తగ్గించి కేంద్ర కంట్రోల్‌ కమిటీ సభ్యునిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుండి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు మాత్రమే కేంద్ర కమిటీలో తిరిగి కొనసాగుతారు. అదనంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న బి వెంకట్‌కు కేంద్రకమిటీలో స్థానం దక్కింది. ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో వెంకట్‌ను రాష్ట్ర కమిటీలో కొనసాగించాలా లేదా అన్న చర్చ జరిగింది. అఖిల భారత మహాసభల వరకూ అవకాశం ఇవ్వాలని కేంద్రం నుండి పరిశీలకులుగా వచ్చిన ప్రకాష్‌ కరత్‌ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం వెంకట్‌ కేంద్ర కమిటీకి ఎన్నిక కావటంతో రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఆ స్థానం ఖాళీ కానుంది.

యువతరానికి ప్రాధాన్యత

పార్టీ యువతరానికి అవకాశం ఇవ్వటానికి కమిటీలో ఎన్నికయ్యే వారికి వయో నిబంధనలు విధించింది. దాంతో ఇప్పటి వరకూ పొలిట్‌ బ్యురోలో మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న రామచంద్రన్‌ పిళ్లై, బిమన్‌ బసు, హన్నన్‌ మొల్లాలు బాధ్యతల నుండి వైదొలగారు. కేంద్ర కమిటీలో సిపిఎం అనుబంధ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహించే మరో ముగ్గురిని కొత్తగా తీసుకున్నారు.

కేరళ నుండి ఎన్నికైన 13మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో నలుగురు కొత్తవారే కావటం విశేషం. త్రిపుర నుండి ఎన్నికైన ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఇద్దరు కొత్త వాళ్లు. మహారాష్ట్ర నుండి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఒకరు తొలిసారి ఎన్నికయ్యారు.

ఎట్టకేలకు పొలిట్‌బ్యురోకు అశోక్‌ ధావలే

అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలే ఈ సారి పొలిట్‌బ్యురోలో స్థానం సంపాదించుకున్నారు. గత మహాసభల్లోనే అశోక్‌ ధావలే పొలిట్‌బ్యురోలో స్థానం సంపాదించగలరని భావించినా అప్పటికున్న నాయకత్వ పొందిక కారణంగా సాధ్యం కాలేదు. తర్వాతి కాలంలో గత నాలుగేళ్లుగా దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన రైతు ఉద్యమాల నిర్మాణంలో అశోక్‌ ధావలే భాగస్వామి. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర ఆదివాసీ రైతుల పాదయాత్ర రూపశిల్పిగా అశోక్‌ ధావలేకు జాతీయ రైతు ఉద్యమ చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. సిపిఎం ఏర్పడిన తర్వాత దీర్గకాలం పొలిట్‌బ్యురో సభ్యులుగా కొనసాగిన బిటి రణదివె తర్వాత మహారాష్ట్ర నుండి పొలిట్‌బ్యురో స్థానం దక్కించుకున్న రెండో వ్యక్తిగా కూడా అశోక్‌ ధావలే గుర్తింపు పొందారు.

 పొలిట్‌బ్యురోలో తొలి దళితుడు

సిపిఎం ఏర్పాటయ్యాక అత్యున్నత వేదికైన పొలిట్‌బ్యురోలో స్థానం సంపాదించుకున్న తొలి దళిత కమ్యూనిస్టుగా రామచంద్రడోం చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ పొలిట్‌బ్యురోలో దళితులకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని విమర్శిస్తున్న వాళ్లు ఇకపై సిపిఎంపై దాడి చేయటానికి కొత్త కారణాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. సిపిఎం పోలీట్ బ్యూరో కి తొలి సారిగా ద‌ళిత నేతకు చోటు ల‌భించింది.ప‌శ్చిమ బెంగాల్ కు చేందిన డాక్ట‌ర్. రామ్ చంద్ర‌ డొం ను పోలీట్ బ్యూరోకి తీసుకుంటూ కేర‌ళ‌లోని క‌న్నూర్ లో జ‌రిగిన  23 వ జాతీయ మ‌హ‌స‌భ‌ల సంద‌ర్బంగా పార్టీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. డాక్ట‌ర్ డొం క‌ల‌క‌త్తా ఎన్.ఆర్.ఎ మెడిక‌ల్ కాలేజ్ నుండి ఎం.బి.బి.య‌స్  పూర్తి చేశారు. వైద్య‌వృత్తిని నిర్వ‌హిస్తూ సిపిఎం పార్టీలో చురుగ్గా అనేక పోరాటల్లో పాల్గోన్నారు..డాక్ట‌ర్. రామ్ చంద్ర డొం బెంగాల్ లొని బోల్ పూర్ ఎస్సీ రిజర్వ‌డ్డ్ నియోజ‌క‌వ‌ర్గం నుండి తొలి సారిగా 1989 లో తొమ్మిద‌వ  లోక్ స‌భకు ఎన్నికైయ్యారు. మొత్తంగా ఎడుసార్లు, 1991, 1996, 1998, 1999, 2004, 2009  లోక్ స‌భకు అక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. పార్ల‌మెంట్ లో సిపిఎం పార్టీ నుండి చీఫ్ విప్ గా ప‌నిచేశారు.ఎడు ద‌శాబ్దాల  సిపిఎం పార్టీ చ‌రిత్రలో తొలిసారిగా ద‌ళితనేత డాక్ట‌ర్.  రామ్ చంద్ర‌ డొం  పోలీట్ బ్యూరో కి తీసుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అణ‌గారిన వ‌ర్గాలకు ప్రాతినిధ్యం వ‌హిస్తామ‌ని చేప్పుకునే సిపిఎం పార్టీ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే పోలీట్ బ్యూరోకి ఇంత వ‌ర‌కు ద‌ళితుల‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంపై ద‌ళిత సంస్థలు, సంఘాలు ప‌దేప‌దే విమ‌ర్శించేవి. తెలంగాణ‌లో బి.ఎల్.ఎఫ్  ఎర్పాటు నేప‌థ్యంలో ఈ అంశం మ‌రింత చ‌ర్చకుదారితీసింది. మారుతున్న జాతీయ రాజ‌కీయాల నేప‌థ్యం, పార్టీలో స‌భ్య‌త్వ పొందిక‌కు అనుగుణంగా నాయ‌క‌త్వ క‌మీటిల్లో పొందిక మార్చుకోవ‌డానికి సిపిఎం సిద్ద‌మైంద‌ని ఈ మార్పులు తెలియ‌చేస్తూన్నాయి. ఏడు సార్లు లోక్ స‌భ‌కు ఎన్నిక‌లైన డోమ్ ను పార్టీ ఎందుకు గుర్తించ‌లేద‌ని పార్టీ వ‌ర్గాలే అంటున్నాయి. బెంగాల్ లో మూడున్న‌ర ద‌శ‌బ్దాల పాటు అధికారంలో ఉన్నా సిపిఎం, నేడు అసెంబ్లీలో క‌నీస ప్రాతినిధ్యానికి నోచుకొలేదు. పార్టీ నుండి ప‌లు సామాజీక త‌ర‌గ‌తులు దూరం అయ్యాయ‌న్న విమ‌ర్శ‌లు నేప‌థ్యంలో తాజాగా ఎన్నికైన కేంద్ర క‌మీటి ప‌లు విమ‌ర్శ‌ల‌కు  స‌మాధానం చేప్పేదిగా ఉండ‌టం ప‌ట్లా వామ‌ప‌క్ష‌శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూన్నాయి. ఈ మార్పులు పార్టీని తిరిగి ప్ర‌జా పంథాలో న‌డిపించే దిశ‌గా దొహ‌దం చేస్తాయ‌ని అశిస్తూన్నారు

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles