Friday, April 19, 2024

భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?

Making of the Indian Constitution: a simplified brief
రాజ్యాంగ ముసాయిదాపై సంతకం చేస్తున్న నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ

26 జనవరి 1950లో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా. బి.ఆర్.అంబేడ్కర్ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395 ఆర్టికిల్స్ (అధికరణాలు), 22 పార్ట్స్, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి, 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారతదేవ సామాజిక వ్యవస్థను ఒకసారి నిశితంగా గమనించినట్లయితే – మనకు కనిపించేది ఏమిటీ? రాజ్యాంగంలో రాసుకున్న దానికి బయట కనబడుతున్నదానికి పోలికే లేదు. పూర్తి భిన్నంగా కనబడుతూ ఉంది. అందుకు కారకులెవరూ? కేవలం పరిపాలకులు..రాజకీయ నాయకులు మాత్రమే దోషులు కాదు. కొంతలో కొంత సామాన్య ప్రజలు కూడా బాధ్యులే.

Also read: పారా సైకాలజీ – సూడో సైన్స్ అని తేల్చిన శాస్త్రజ్ఞులు

Introduction to the Constitution of India - Cultural Samvaad| Indian  Culture and Heritage

రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారతదేశంలో అక్షరాస్యత కేవలం 8-10 శాతం మాత్రమే ఉండేది. నిరక్షరాస్యులైన నాటి భారత దేశ పౌరులు రాజ్యాంగం గూర్చి, చట్టాల గూర్తి తెలియక వాటిపై అవగాహన లేక అజ్ఞానంతో, అంధవిశ్వాసాలతో మతాన్ని, కులాల్ని, అంటరానితనాన్ని పాటించేవారు. అసమానత్వమే సరైన విధానమని భావించేవారు. మరి ఈ రోజు 85 అక్షరాస్యతను సాధించిన బారతీయ సమాజం రాజ్యాంగాన్ని చట్టాల్ని దుర్వినియోగ పరుస్తూ ఉంది. విద్యావంతులైన నేటి నాయకులు, ధనవంతులు, పెత్తందార్లూ తమ బాధ్యతల్ని మరిచి రాజ్యాంగంపై గౌరవం లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ఒక అవినీతి సమాజం, నేరప్రవృత్తి గల సమాజం, లంచగొండి సమాజం ఏర్పడింది. నిస్సహాయులైన సామాన్య పౌరులు ఈ పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు.

Also read: మకరజ్యోతి మనిషి మహత్మ్యం

ఉదాహరణకు మతం పేరిట జరుగుతున్న మారణహోమాలు, కులాల వివక్ష, అత్యాచారాలు, దొపిళ్ళు, ఆకలి చావులు, భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు, గృహహింసలు, ఎన్నో ఎన్నెన్నో – సమాజం భ్రష్టపట్టి పోవడానికి కారణాలు ఎన్నో – మనసు ఉన్న మనుషులకు, మంచితనమున్నవారికి, అసహాయులకు ఇది భద్రత కల్పించలేకపోతోంది. అందుకు కారణం రాజ్యాంగ వైఫల్యమని కొందరు చెపితే, పాలకుల తప్పిదం అని మరికొందరు చెపుతున్నారు. కారణం ఏదైనా, జరిగే నష్టం ఏ ఒక్కరికో కాదు. ఇది మొత్తం భారతజాతికి జరుగుతున్న నష్టం. ఈ విషయం ప్రతి భారతీయ పౌరుడు గ్రహించాలి. మతానికీ, ప్రాంతానికీ, కులానికీ, లింగభేదానికీ అతీతంగా ఆలోచించగలగాలి. ప్రతి విషయాన్ని రాజ్యాంగానికి లోబడి ఆచరిస్తూ ఉండాలి!

Also read: ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు కొన్ని సౌలభ్యాలు కలిగించింది. అందులో ముఖ్యమైనవి:

  • సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
  • ఆలోచనా స్వేచ్ఛ – భావ ప్రకటనా స్వేచ్ఛ
  •  స్థాయిలోను, అవకాశాల్లోనూ సమానత్వం
  • ప్రజలందరిలో అఖండతా భావాన్ని, దేశీయ సమైక్యతను, వ్యక్తి గౌరవాన్ని నిలుపుకోవడం, పెంపొందించగలగడం.
File:Dr. B. R. Ambedkar, Chairperson, Drafting Committee of Indian  Constitution after presenting the constitution to the first President Dr.  Rajendra Prasad.jpg - Wikimedia Commons
రాజ్యాంగాన్ని సమర్పించిన తర్వాత నాటి రాష్టపతి బాబూ రాజేంద్రప్రసాద్ కు ధన్యవాదాలు చెబుతున్న రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్

రాజ్యాంగంలోని పేఠికలోనే ఇంత గొప్ప లాక్ష్యాలు నిర్దేశించుకున్నప్పటికీ మరి ఈ దేశాన్ని ఏ చీడపురుగులుప ట్టి పీడిస్తున్నాయీ? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గూర్చి చెప్పిన వాటిని అమలు కాకుండా అడ్డుకుంటున్న దుర్మార్గులు ఎవరు? – ప్రతి పౌరడూ ఆలోచించాలి. జరుగుతున్న సంఘటనల్ని విశ్లేషించుకోవాలి.

సమానత్వాన్ని సాధించడానికి భారత రాజ్యాంగంలో కొన్ని అధికరణలు ఉన్నాయి.

అధికరణం 14 : చట్టం ముందు అందరూ సమానులే.

అధికరణం 15: కుల,మత, లింగ వివక్షతకు తావులేదు.

అధికరణం 16: ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు

అధికరణం 17: అంటరానితనం నిషేధం

అధికరణం 18: బిరుదుల నిషేధం

భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి ఇలా కొన్ని అధికరణలు ఉన్నప్పటికీ మరి ఎందుకు సమానత్వం సాధించలేకపోతున్నాం? అడ్డుపడుతున్నదెవరూ? దేశ ప్రజలు జాగరూకులై నిశితంగా గమనిస్తూ ఉండాలికదా? ఎదుర్కొంటూ ఉండాలి కూడా!

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

స్వేచ్ఛను సాధించడానికి భారత రాజ్యాంగం కొన్ని అధికరణల్ని కేటాయించింది.

ధికరణం 19: భావ ప్రకటనా స్వేచ్ఛ

అధికరణం 20: ఒక నేరానికి ఒకేసారే శిక్ష

అధికరణం 21: వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు

అధికరణం 21 A: విద్యాహక్కు

అధికరణం 22: నిర్బంధాలు  – పరిమితులు

దోపిడి నుంచి రక్షణ పొందడానికి మరికొన్ని అధికరణలు ఇలా ఉన్నాయి:

అధికరణం 23: శ్రమశక్తిని దోపిడి చేయరాదు

అధికరణం 24: బాలకార్మికుల నిషేధం

1949 నవంబర్ 26న లోక్ సభలో రాజ్యాంగాన్ని సమర్పిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత ఇలా అన్నారు –

‘‘ఈ రాజ్యాంగం ఎంత గొప్పదయినా, దాన్ని అమలు పరిచేవారు దుర్మార్గులైతే ఆ రాజ్యాంగం తన లక్ష్యాన్ని చేరుకోదు’’- అని.

ఆయన దార్శనికుడు కాబట్టి, భవిష్యత్తులో జరగబోయేది ముందే ఊహించి చెప్పినట్టున్నారు. ఈ రోజు మన దేశంలో జరుగుతున్నది అదే – దాన్ని అరికట్టడం భారతీయులందరి బాధ్యత. నేరస్థుల్ని చట్టసభలకు పంపకుండా వివేకవంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే బాధ్యత ఓటు హక్కు గల దేశ పౌరులందరిదీ –

ఆచరణకు మూలం ఆలోచనే కదా? అందుకే, ఆలోచించడం ప్రారంభించాలి!

73వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుకోవడానికి కంకణబద్ధులు కావాలి.

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles