Thursday, April 25, 2024

ఓటుకు నోటు కేసు : స్టీవెన్సన్ కి మొత్తం 3 కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు: మత్తయ్య

  • చంద్రబాబునాయుడు సమక్షంలోనే రేవంత్ రెడ్డి ఈ పథకం చర్చించారు
  • ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు
  • విజయవాడ వెళ్ళవలసిందిగా సలహా ఇచ్చారు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంఎల్ఏ స్టీవెన్సన్ కి మొత్తం రూ. 3 కోట్లు ఇస్తామనీ, ముందు అడ్వాన్స్ గా రూ. 50 లక్షలు ఇస్తామని ముందుగానే తనతో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారని మత్తయ్య వెల్లడించారు. మాజీ టీడీపీ నాయకుడూ, ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి నోట్ల కట్టలు స్టీవెన్స్ న్ కు ఇస్తూ కనిపించిన వీడియోనూ, ఇతర ఆడియో సక్ష్యాలనూ ఈడీ ధ్రువీకరించింది. తనకు నష్టం జరగకుండా ఏసీబీ అధికారులను తాను మేనేజ్ చేస్తానంటూ టీడీపీ నాయకుడు లోకేష్ హామీ ఇచ్చారని కూడా మత్తయ్య తెలిపారు.

చంద్రబాబునాయుడు బాగా తెలుసు : మత్తయ్య

‘‘నేను చంద్రబాబునాయుడికి చాలాకాలంగా తెలుసు. టీడీపీకి అనుకూలంగా పని చేశాను. పలు సందర్భాలలో చంద్రబాబునాయుడిని కలుసుకున్నాను. 2015లో మహానాడు జరిగినప్పుడు చంద్రబాబునాయుడూ, రేవంత్ రెడ్డి నన్ను కలుసుకోవాలని కోరుతున్నట్టు జిమ్మీబాబు నాకు చెప్పారు. హిమాయత్ సాగర్ లో జరుగుతున్న మహానాడు వేడుకల దగ్గరికి నేను వెళ్ళాను. చంద్రబాబునాయుడు సమక్షంలోనే రేవంత్ రెడ్డి ఈ లావాదేవీ గురించి మాట్లాడారు. కౌన్సిల్ ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా స్టీవెన్సన్ ని ఒప్పించే బాధ్యత నాకు అప్పగించారు.  నన్ను వెళ్ళి స్టీవెన్సన్ తో మాట్లాడమని చెప్పారు. నేను స్టీవెన్సన్ తో విషయం చెప్పాను. తాను రేవంత్ రెడ్డిని నేరుగా కలుస్తానని స్టీవెన్సన్ చెప్పారు. ఈ విషయం సెబాస్టియన్ ద్వారా రేవంత్ రెడ్డికి కబురుపెట్టాను.

డబ్బు ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి:

‘‘చంద్రబాబునాయుడు ఆదేశాలతో రేవంత్ రెడ్డి డబ్బు తీసుకొని స్టీవెన్సన్ దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి డబ్బు నగదు ఇస్తుండగా  రెడ్ హాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని రాష్ట్రంలో టీవీ చానళ్ళు అనేక విడతల చూపించాయి. ఇప్పటికీ ఈ కేసు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ రేవంత్ వీడియో విధిగా చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టయిన మరునాడు నేను రహస్యంగా బంజారాహిల్స్ లోని టీడీపీ కార్యాలయానికి వెళ్ళాను. నారా లోకేష్ ను కలుసుకున్నాను. నాకేమీ కాదనీ, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తాననీ ఆయన చెప్పారు. విజయవాడ వెళ్ళిపోవలసిందిగా నాకు చెప్పారు,’’ అంటూ మత్తయ్య తన వాగ్మూలంలో వివరించారు.

ఇది చదవండి: పార్టీ బలోపేతానికి చంద్రబాబు కసరత్తు

విజయసింహ అరెస్టు:

రేవంత్ రెడ్డి 2015లో శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు స్టీఫెన్సన్ ను ప్రలోభపెట్టి, ముందస్తుగా రూ. 50 లక్షలు చెల్లించడానికి స్టీవెన్సన్ ఇంటికి రేవంత్ రడ్డి వెళ్ళినట్టు ఆరోపణ. మూడవ నిందితుడుగా ఉన్న విజయసింహను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. విచారణకు హాజరు కాని కారణంగా అతనిపైన ఏసీబీ ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది. ఎంఎల్ సీ సండ్ర వెంకటవీరయ్య, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరైనారు. తనపైన వచ్చిన అభియోగాలను వెంకటవీరయ్య తిరస్కరించారు. సండ్రపైన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120 బి, రెండ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదు చేసింది. అదే విధంగా సండ్ర, ఉదయసింహల డిస్టార్జి పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.  ఈ కేసులో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్ లో 37 పర్యాయాలు చంద్రబాబునాయుడు పేరును ప్రస్తావించారు. చంద్రబాబునాయుడిని ఏసీబీ ఈ కేసులో ముద్దాయిగా చేర్చలేదు.

ప్రశాంత్ భూషన్ వాదన:

చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్  న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వచ్చే సంవత్సరం జులై 14వ తేదీన ఈ కేసును విచారిస్తామంటూ బాబ్డే వాయిదా వేశారు.

ఇది చదవండి: చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏమిటి?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles