Friday, March 29, 2024

విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే

కొణతాల రామక్రిష్ణ

దేశంలోని ప్రతిష్టాకరమైన తొమ్మిది నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రఖ్యాతి గాంచింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన సంస్థను నేడు  నడపలేమనే సాకుతో అమ్మివేయాలని నిర్ణయించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసమర్ధతకు, దుర్బుద్ధికి నిదర్శనం.

‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదమే ఏకైక లక్ష్యంగా స్వాతంత్ర సమరయోధుడు  తెన్నేటి విశ్వనాథం సారథ్యంలో జరిగిన ధీర్ఘకాలిక పోరాట ఫలితంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ, రాయలసీమ సహా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా ప్రాంతాలకు అతీతంగా ఉవ్వెత్తున ఉద్యమించి సాగించిన వీరోచిత పోరాటాల ఫలితంగా విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరుతో  ఉక్కు కర్మాగారం ఏర్పడింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీ కరణ చేయాలనే ఆలోచన అత్యంత దురదృష్టకరం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకే కాకుండా మొత్తం దేశ ప్రజలకు గర్వకారణమైన ప్రాజెక్ట్. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం 32 మంది ఆత్మ బలిదానం చేశారు. నేటి రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఒక దళిత యువకుడు అమృతరావు నాటి ఉద్యమంలో విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం, నాటి ఉమ్మడి రాష్టంలో ప్రజా ఉద్యమం విజృభించడంతో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ప్రజా ఉద్యమానికి తలొగ్గి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

Also Read : ఉద్యమాలకు ఊతం ఇచ్చే నిర్ణయాలు

అవిభక్త రాష్ట్రంలో ఒకే ఒక భారీ ప్రాజెక్టు

అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక భారీ ప్రాజెక్టు ఇది. దీనిని కూడా ఇప్పుడు అమ్మివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూడడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల వివక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 23 వేల మంది రైతులు 22 వేల ఎకరాల భూములను అందించారు. ఈ సంస్థ వల్ల 30 వేల మందికి ప్రత్యక్షంగా,  మరో 70 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతోంది. 22 వేల ఎకరాల్లో విస్తరించిన విశాఖ స్టీల్ ప్లాంట్  భూమి విలువే నేడు రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుంది. దీనిని ఇప్పుడు కారు చౌకగా అమ్మివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామిక ప్రగతికి మరణ శాసనం కాగలదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల ఉసురు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు తగలక మానదు.

అత్యుత్తమమైన కర్మాగారం

ప్రతి ఏటా దేశం మొత్తం మీద నాణ్యమైన 73 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకన్నా అత్యున్నతమైనది. దేశంలో అత్యంత అధునాతనమైన, సముద్ర తీరంలో వున్న ఏకైక సమగ్ర ఉక్కు కర్మాగారామిది. వెనుకబడిన ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును అడ్డుకోవాలని మొదటి నుండి పొరుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోని కొంతమంది పెద్దలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. దీనివల్లే  ముందుగా ప్రకటించిన ప్లాంట్ ను మూడు విభాగాలుగా చేసి ఒక దానిని కర్ణాటకలో, మరొక దానిని ఒడిశాలో నిర్మించి మొదట్లోనే ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. అనేక మంది కుట్రల కారణంగా నిర్మాణం పూర్తి కావడానికి రెండు దశాబ్దాల కాలం తీసుకోవడంతో రూ.3 వేల కోట్లతో పూర్తయ్యే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యయం రెట్టింపై రూ. 8 వేల కోట్లకు చేరుకొంది.

Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి: ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ

వైఎస్ చొరవ

2005 సంవత్సరంలో దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ, ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్ధిక సహకారం లేకుండానే పూర్తిగా తమ సొంత నిధులు, బ్యాంకు రుణాల ద్వారా రూ.17,500 కోట్లు సమకూర్చుకోవడం జరిగింది. ప్లాంట్ విస్తరణ, ఆధునికీకరణవల్ల 33 లక్షల టన్నుల సామర్థ్యమున్న స్టీల్ ప్లాంట్ ను 70 లక్షల టన్నుల ఉత్పత్తి పెంపుకు చేరుకుంది. ఈ విషయంలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సహాయం మరువలేనిది.

వాస్తవానికి 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలోనే ఎస్సార్ గుజరాత్, ఇతర కార్పొరేట్ సంస్థలకు రూ.11,500 కోట్లకు దీనిని అమ్మే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులు, ప్రజా, కార్మిక సంఘాలు చేసిన ఒత్తిడి కారణంగా దానిని నివారించగలిగాం. 1992లో ప్రధాని పివి.నరసింహారావు ఈ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ, రాజ్యసభ సభ్యులంతా పార్టీలకు అతీతంగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు దృష్టికి తీసుకెళ్లి, తెలుగు వారు పోరాడి తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడమని కోరడంతోపాటు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకోగలిగాం.

Also Read : విశాఖ ఉక్కు : ఉపాధి కోసమే కాదు….`ఆత్మాభిమానం`

పీవీ ప్రమేయం, సహాయం

ఈ ప్రాంత ప్రజల మనోభావాలను, అప్పటి లోక్ సభ, రాజ్యసభ చేసిన వినతిని పరిగణలోకి తీసుకుని నాటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆనాటి ప్రధాని పీవీ నర్సింహారావు బుట్టదాఖలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను గాడిలో పెట్టడానికి, ప్రైవేటీకరణ కాకుండా ఈ సంస్థను కాపాడటానికి పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ రుణాలకు సంబంధించి రూ.2639 కోట్లను ఈక్విటీ గా మార్చారు. రుణాలపై వడ్డీ సుమారు రూ.15 వందల కోట్లు రద్దు చేసి స్టీల్ ప్లాంట్ కు ప్రాణం పోశారు. ఈ విషయంలో శ్రీ పివి నర్సింహారావు, అప్పటి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.

పెట్టుబడులను పునర్వ్యవస్థీకరించి, రుణాలను రద్దు చేయడం ద్వారా తిరిగి ప్లాంట్ ను లాభాల బాట పట్టేలా పీవీ నర్సింహారావు చేయగలిగారు. వారు తీసుకున్న నిర్ణయం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలలోకి వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే సుమారు రూ.2 వేల కోట్ల లాభాలు నమోదు చేసింది. దీంతో అంతకు ముందున్న భారీ నష్టాల శకం ముగిసింది.

Also Read : మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

2015 వరకూ లాభాల్లోనే

ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో సహితం 2000 సంవత్సరంలో సుమారు రూ.13 వందల కోట్ల మేరకు వడ్డీ మాఫీ చేయడం ద్వారా బీఐఎఫ్ఆర్ బారిన పడకుండా ఈ కర్మాగారాన్ని ఆదుకున్నారు. అయితే 2000 సంవత్సరం తర్వాత దేశంలో ముడి ఇనుము ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పటికీ 2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే కొనసాగింది. తదుపరి ఉత్పత్తి వ్యయం, ముడి సరుకు విపరీతంగా పెరగడం, పెట్టుబడిపై రుణాలు, నష్టాలు కలిపి రూ.22 వేల కోట్లపై వడ్డీలు చెల్లించాల్సి వస్తోది. తద్వారా రూ. 4నుండి 5 వేల కోట్ల మేరకు నష్టాలు వస్తున్నాయి. దీనికితోడు అంతకుముందే గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా కూడా ఉక్కు పరిశ్రమ తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఎన్డీఏ -1 హయాంలోనే 5 నుండి 10 శాతం  డిజిన్వెస్ట్ మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనినిబట్టే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొదటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నట్లు అర్ధమవుతోంది. అందులో భాగంగానే 2019-20 సంవత్సరంలో పోస్కోకు 2 వేల ఎకరాలు కేటాయించడానికి యత్నించింది. కార్మికుల పోరాటంతో ఈ ప్రయత్నాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగారు.

80 శాతం ముడి ఇనుము చైనాకు ఎగుమతి 

నిత్యం చైనాను దుమ్మెత్తిపోసే మోదీ ప్రభుత్వం దేశంలోని ముడి  ఇనుములో  80 శాతం  చైనాకు  ఎగుమతి చేస్తోంది.  దీంతో విశాఖ స్టీల్ ముడి ఇనుమును  బహిరంగ మార్కెట్ లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసి,  నష్టాలకు  గురికావలసి  వస్తున్నది.  చైనా ప్రభుత్వం తమ దేశంలోని  గనుల్లో ఉన్న ఖనిజాన్ని మైనింగ్‌ కూడా చేయనవసరం లేకుండా మనం అమ్ముతుంటే కొంటున్నారు. భారత ప్రభుత్వం మాత్రం మన కంపెనీలకు ధరలు పెంచి, చైనా వారి కడుపు నింపే పని చేస్తున్నారు. అంటే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు మూల కారణం కేంద్రమే అని స్పష్టం అవుతుంది. ఈ నష్టాలకు కారణంగా కేంద్ర ప్రభుత్వాన్ని బోనులో నిలపాలి. కొందరు మైనింగ్‌ మాఫియా వాళ్లు చైనాకు, జపాన్ కు ఇనుప ఖనిజం అమ్ముకోవడానికి అనుమతిస్తున్న ప్రభుత్వం  ప్రభుత్వ రంగ కంపెనీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా విద్రోహ చర్యలకు పాల్పడుతున్నది.

Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

సొంత గనులు లేకపోవడమే శాపం

విశాఖ ఉక్కు ప్లాంట్ నేడు నష్టాల్లో కొనసాగడానికి ప్రధాన కారణం సొంతంగా గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించక పోవడమే. గనుల కేటాయింపు కోసం గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు,  ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా, అనేక రూపాల్లో ఉద్యమిస్తున్నా కేంద్ర పెద్దలు ఆలకించడం లేదు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లతో సహా దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్ లకు సొంతంగా గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాకరమైన ప్లాంట్ కు కేటాయించకుండా నష్ఠాల ఊబిలోకి త్రోసివేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా అమ్మాలని చూడటం ఈ ప్రాంత ప్రజలను వంచించడమే. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ కోలుకొంటున్న సమయమిది.  ఉక్కుకు మార్కెట్ డిమాండ్ పెరుగుతున్న పరిస్థితుల్లో  ఇటువంటి ప్లాంట్ ను ప్రైవేట్  పరం చేయాలను కోవడం ఏ విధంగా చూసినా సముచితం కాబోదు.

ఒడిశా మినరల్ కార్పొరేషన్ లో పెట్టుబడి

విశాఖ స్టీల్ ప్లాంట్  సొంత గనుల కోసం ఒడిశా మినరల్ కార్పొరేషన్ లో ఐరన్ ఓర్ కోసం రూ. 361 కోట్లను  పెట్టుబడిగా  పెట్టింది. అయితే  ఎన్డీయే  ప్రభుత్వం లైసెన్స్ ను పునరుద్దరించక  పోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సొంత గనులు ఉంటే టన్ను రూ.1000 నుండి రూ.1500 లకే లభించే ముడి ఇనుము కోసం ఇప్పుడు రూ. 5 వేల నుండి రూ.7 వేల లోపు పైగా ఖర్చు  చేయాల్సి వస్తోంది. అంటే ఉత్పత్తి వ్యయంలో ఏకంగా 55 శాతం (అదనంగా రూ. 3 వేల కోట్లు) ముడి ఇనుము కోసం అదనంగా ఖర్చవుతోంది. సొంత గనులు ఏర్పాటు చేసుకొంటే ఈ రూ. 3 వేల కోట్లు ఆదా అయ్యేది.

Also Read : విశాఖ ఉక్కు ప్రజల హక్కు కాదా?

భారత ప్రభుత్వం దీనిపై పెట్టిన పెట్టుబడి వ్యయం సుమారు రూ.5వేల కోట్లు మాత్రమే.  అయితే  స్టీల్‌ ప్లాంటు పన్నులు, డివిడెండ్‌ రూపంలో సర్కారుకు రూ.33,092 కోట్లు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికీ రూ.7,977 కోట్లు పన్నులుగా వచ్చాయి. స్టీల్ ప్లాంట్ ను విక్రయించడం ద్వారా బంగారు గుడ్లు పెట్టే బాతు గొంతు కోసి కార్పొరేట్లకు విందు చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. 

జాయింట్ వెంచర్ ఏర్పాటు

విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించలేని పక్షంలో  ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), ఆర్ఐఎన్ఎల్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలి. వాళ్ల దగ్గర 200 ఏళ్లకు సరిపడా ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ఇనుప ఖనిజం ఉంది. దీనిద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుంది. ప్రభుత్వ రంగంలోని ఎన్ఎండీసీ నుండి స్టీల్ ప్లాంట్ అవసరాల మేరకు ముడి సరుకు కొంటున్నారు. అలా కాకుండా ఎన్ఎండీసీ ని ఆర్ఐఎన్ఎల్ లో విలీనం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుండి గట్టెక్కించవచ్చు. ప్రస్తుతం దేశంలో అనేక బ్యాంకులను విలీనం చేస్తున్నారు. అదే పద్దతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థయిన ఎన్ఎండీసీ లో విలీనం చేసి ఈ సంస్థను ఆదుకోవచ్చు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి పి.వి.నర్సింహారావు హయాంలో  అవలంబించిన విధంగా కేంద్ర ప్రభుత్వమే పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ చేపట్టి రుణాలను కేంద్ర ప్రభుత్వం వాటాగా మార్చి, మళ్లీ వడ్డీలను మాఫీ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బారిన పడకుండా ఆదుకోవాలి.

ఇప్పటికే 2014 ఎన్నికల ప్రణాళికలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట తప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాగితాలకే పరిమితం చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు నిధుల కేటాయింపులో వివక్ష చూపి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆగమ్య గోచరంగా మార్చారు. పునర్విభజన చట్టంలోని అంశాలను బుట్ట దాఖలు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తెలుగు ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇప్పుడు తిరిగి వారి భావోద్వేగాలకు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే రాజకీయంగా కూడా భారీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రంలోని పెద్దలు గుర్తించాలి.

చారిత్రక పోరాటం అనివార్యం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా మరో చారిత్రక పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రుల హక్కయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా జేఏసీలుగా ఏర్పడి దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ పోరాటాలకు ఉత్తరాంధ్రలోని యువతీ, యువకులు నడుం బిగించాలి. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు జేఏసీలుగా ఏర్పాటి దీర్ఘకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి. ఈ పోరాటంలో ఉత్తరాంధ్ర యువతీ యువకులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలంతా ఒకే తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారానికి నడుం బిగించాలి. లేనిపక్షంలో చరిత్ర ఎన్నటికీ మనల్ని క్షమించదు.

(రచయిత పార్లమెంటు మాజీ సభ్యుడు, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మెయిల్ ఐడి: [email protected])

Ramakrishna Konathala
Ramakrishna Konathala
రచయిత పార్లమెంటు మాజీ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles